సుప్రీంలో కర్నాటకకు చుక్కెదురు.. ఏ విషయంలోనంటే?
Publish Date:Jul 27, 2026
Advertisement
కర్నాటక ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. కృష్ణ నదీ జలాల పంపిణీ విషయంలో.. సుప్రీం ను ఆశ్రయించిన కర్నాటక ప్రభుత్వానికి అక్కడ ఊరట లభించలేదు. కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-2 తీర్పును అధికారిక గెజిట్లో ప్రచురించాలన్న కర్ణాటక విజ్ఞప్తిని దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. స్టేటస్ కో కొనసాగించాలని విస్పష్టంగా పేర్కొంది. కర్నాటక పిటిషన్ విచారణ సందర్భంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ వాదనల మేరకు ట్రైబ్యునల్ తీర్పు ప్రకారం తమకు 173 టీఎంసీల నీటి వాటా దక్కాల్సి ఉందని, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు స్టేజ్3 కోసం 29 వేల కోట్లరూపాయలు వెచ్చించి నిర్మించిన కాలువలు నిరుపయోగంగా మారాయనీ పేర్కొంది. రాయచూర్, యాదగిరి వంటి కరువు ప్రాంతాలకు సాగునీటి అవసరాల దష్ఠ్యా 2011 నాటి మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరింది. అయితే సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. అంతర్రాష్ట్ర జల వివాదంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అప్పీళ్లు, అభ్యంతరాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఆ కారణంగా మధ్యంతర ఉత్తర్వులను సవరించడం సాధ్యం కాదని తేల్చి చెప్పిన సుప్రీం ధర్మాసనం స్టేటస్ కో కొనసాగించాలని పేర్కొంది. తన పదవీ విరమణ లోపుగానే ఈ కేసులో తీర్పు వెలువరిస్తామని పేర్కొన్న సీజేఐ జస్టిస్ సూర్యకాంత్.. తదుపరి వాచారణను సెప్టెంబర్ మొదటి వారానికి వాయిదా వేశారు. No respite to Karnataka, Supreme Court, Krishna, Water, Dispute
http://www.teluguone.com/news/content/no-respite-to-karnataka-36-227291.html





