వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్
Publish Date:Jun 1, 2022
Advertisement
ఏపీ సీఎం జగన్ సొంత బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఊహించని మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో ఏ 5 గా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ పులివెందుల కోర్టులో వేసిన ప్రైవేట్ కేసుపై మంగళవారం కోర్టులో విచారణ జరిగింది. వివేకా హత్య కేసుకు సంబంధించి మరి కొందర్ని కూడా సీబీఐ విచారించాలని ఆ పిటిషన్ లో తులశమ్మ కోరారు. వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీతారెడ్డిని, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డిని, వివేకానందరెడ్డి బావమరిది శివప్రకాష్, బీటెక్ రవి, కొమ్మా పరమేశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, నీరుగట్టు ప్రసాద్ ను సీబీఐ ప్రశ్నించేలా ఆదేశించాలని కోర్టును తులశమ్మ కోరారు. దీనిపై పిటిషనర్ తులశమ్మ తరఫున హైకోర్టు లాయర్లు వాదనలు వినిపించారు. పూర్తి వివరాలతో తులశమ్మ వాంగ్మూలం నమోదు చేయాలని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఆగస్టు 30కి కోర్టు వాయిదా వేసింది. వివేకా హత్య కేసుకు సంబంధించి శివశంకర్ రెడ్డి రిమాండ్ ఖైదీగా జైల్లో ఉన్నారు. బెయిల్ కోసం ఆయన పిటిషన్ వేస్తే కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే. అయితే.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో కీలక పరిణామం చోటు చేసుకొంది. బెయిల్ పిటిషన్ విచారణ జరిగేటప్పుడు తనను ప్రతివాదిగా చేర్చుకొని తన వాదనలు వినాలని.. ఈ విషయమై సమగ్ర వివరాలతో పిటిషన్ దాఖలు చేస్తామని సునీతారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు మే 2న ఏపీ హైకోర్టులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి వ్యాజ్యంలో తనను ప్రతివాదిగా చేర్చాలని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే.. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ వైఎస్ సునీత సహా మరో ముగ్గురిపై కేసు దాఖలు చేయడం మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శంకర్ రెడ్డిని గత ఏడాది నవంబర్ 17న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దేవిరెడ్డి శంకర్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన వద్ద డ్రైవర్ గా పనిచేసిన దస్తగిరి సీబీఐకి అఫ్రూవర్ గా మారి కీలక సమాచారం ఇచ్చాడు. ఈ వాంగ్మూలాన్ని సీబీఐ అధికారులు కోర్టుకు సమర్పించారు. 2019 మార్చి 14న వివేకానందరెడ్డిని ఆయన ఇంట్లోనే హత్యకు గురయ్యారు. ఈ హత్యకు ఆర్ధిక లావాదేవీలే కారణమని దస్తగిరి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్టు 30న దస్తగిరి స్టేట్ మెంట్ ఇచ్చాడు. కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించాడు. సీఆర్ పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్ మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్ మెంట్ లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్ రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నాడు. బెంగళూరు ల్యాండ్ వివాదంలో వాటా ఇవ్వకపోవడంపై ఆగ్రహంతో ఎర్ర గంగిరెడ్డి పగ పెంచుకున్నాడని దస్తగిరి చెప్పాడు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందే వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగింది. హత్య సమయంలో సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేసింది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలంటూ వివేకానందరెడ్డి కుమార్తె సునీతా రెడ్డి, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది.ఈ ఏడాది మార్చిలో సీబీఐ ఉన్నతాధికారులను కలిసి వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను గుర్తించాలని వివేకా కుమార్తె సునీత కోరారు. సునీత ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసి వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ మరింత వేగం పుంజుకుంది.కడప కేంద్రంగా సీబీఐ అధికారులు విచారణ కొనసాగించారు. అయితే.. ట్విస్టుల మీద ట్విస్టులు తీసుకుంటున్న వైఎస్ వివేకా హత్య కేసులో నిజాలు ఎప్పటికి బయటకు వస్తాయో.. హత్యకు కుట్ర చేసిన పెద్ద తలకాయల బండారం ఎప్పటికి బయటపడుతుంది? ఇంకా ఎన్నాళ్లకు, ఎన్నేళ్లకు వివేకా హత్య కేసు పూర్తవుతుందనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
http://www.teluguone.com/news/content/new-twist-in-viveka-murder-case-25-136802.html





