Top Stories

political-news-img

ఐటీఆర్ లో పెద్ద పొరపాటు జరిగినా రూ.65.21 లక్షల పన్ను మినహాయింపు ఎలా వచ్చిందో తెలుసా?

ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేసేటప్పుడు పొరపాటున ఒక రకమైన ఆదాయాన్ని మరొక విభాగంలో చూపిస్తే పన్ను నోటీసులు రావడం సర్వసాధారణం. కానీ, ఐటీఆర్‌లో చేసిన చిన్న పొరపాటు కారణంగా పన్ను పరిధిలోకి రాని నిధులను కూడా పన్ను పరిధిలోకి మార్చలేరని నిరూపించింది ఒక కీలకమైన న్యాయ పోరాటం. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్) ద్వారా వచ్చిన కోట్ల రూపాయల పరిహారాన్ని జీతంగా తప్పుగా పేర్కొన్న ఒక మాజీ ఉద్యోగికి పూణే ఆదాయ పన్ను అప్పీలేట్ ట్రిబ్యునల్ (ఐటీఏటీ) ఊరటనిస్తూ చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రూ.65.21 లక్షల మేర లభించిన వీఆర్‌ఎస్ పరిహారం పూర్తిగా పన్ను మినహాయింపు ఉన్న క్యాపిటల్ రిసీప్ట్ అని, దానిపై పన్ను విధించడం కుదరదని స్పష్టం చేసింది. ఈ వివాదం ఫైజర్ హెల్త్‌కేర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మాజీ ఉద్యోగి ప్రకాష్ సుఖ్‌దేవ్ సోనవానే కేసుకు సంబంధించినది. ఫైజర్ సంస్థకు చెందిన ఔరంగాబాద్ తయారీ యూనిట్‌ను మూసివేసిన సమయంలో కంపెనీ 'ఫైనాన్స్ స్కీమ్ ఫర్ ఎంప్లాయీస్ ఎట్ ఔరంగాబాద్ 2019' పేరుతో ఒక స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్థిక సంవత్సరం 2018-19 (FY2018-19) లో ఈ పథకం కింద సదరు ఉద్యోగి రూ.65.21 లక్షల మొత్తాన్ని అందుకున్నారు. అసెస్మెంట్ ఇయర్ 2019-20 (AY2019-20) కి గాను తన ఐటీఆర్ దాఖలు చేస్తున్న సమయంలో, ఈ మొత్తాన్ని ముందస్తు జీతం (అడ్వాన్స్ శాలరీ) గా పొరపాటున పేర్కొంటూ ఇన్కమ్ టాక్స్ యాక్ట్ సెక్షన్ 89 కింద పన్ను ఉపశమనాన్ని కోరారు. అయితే, పన్నుల శాఖ అసెసింగ్ ఆఫీసర్ ఈ సెక్షన్ 89 క్లెయిమ్‌ను తోసిపుచ్చారు. తదనంతరం, కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ (అప్పీల్స్) వద్దకు కేసు వెళ్లగా, వారు మరింత ముందుకు వెళ్లి ఈ రూ.65.21 లక్షల మొత్తాన్ని ఉద్యోగ ముగింపు సందర్భంగా లభించిన పరిహారంగా భావించి, సెక్షన్ 56(2)(xi) కింద 'ఇతర మూలాల ద్వారా వచ్చిన ఆదాయం' (ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్) గా వర్గీకరించి పన్ను విధిస్తూ ఆదేశాలు ఇచ్చారు. దీంతో పన్ను చెల్లింపుదారుడికి భారీ మొత్తంలో పన్ను భారం పడింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్యోగి పూణే ఐటీఏటీ ని ఆశ్రయించారు. ట్రిబ్యునల్ ఎదుట పన్ను చెల్లింపుదారుడు తన న్యాయపరమైన వాదనను స్పష్టం చేశారు. ఐటీఆర్‌లో సెక్షన్ 89 కింద క్లెయిమ్ చేయడం పొరపాటని, నిజానికి ఈ మొత్తం ఉద్యోగ తొలగింపు ద్వారా వచ్చింది కాదని, వీఆర్‌ఎస్ పథకం కింద అందిన క్యాపిటల్ రిసీప్ట్ కాబట్టి దీనిపై ఎలాంటి పన్ను విధించకూడదని వాదించారు. జూన్ 8, 2026 నాటి తన ఉత్తర్వుల్లో పూణే ఐటీఏటీ ట్రిబ్యునల్ ఈ వాదనలతో సంపూర్ణంగా ఏకీభవించింది. reported vrs as salary itr tax exemption,pune itat 65 lakh vrs tax case.

Publish Date: Jul 21, 2026 10:53AM

political-news-img

టోల్ ప్లాజా వద్ద లైన్ల తిప్పలు బంద్: రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో డిజిటల్ లోకల్ పాస్ చూశారా?

జాతీయ రహదారులపై రోజూ ప్రయాణించే వాహనదారులకు, టోల్ ప్లాజాల సమీపంలో నివసించే స్థానిక ప్రజలకు భారత జాతీయ రహదారుల సంస్థ (NHAI) ఒక గొప్ప ఊరట వార్తను అందించింది. టోల్ ప్లాజాల వద్ద స్థానిక పాసుల కోసం గంటల తరబడి క్యూలో నిలబడటం, పేపర్‌వర్క్ పూర్తి చేయడం ఇకపై గతం కానుంది. నేషనల్ హైవే యూజర్ల ప్రయాణ అనుభవాన్ని డిజిటల్ రూపంలో మరింత సులభతరం చేసేందుకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తన ఆధ్వర్యంలో పనిచేసే రాజ్‌మార్గ్‌యాత్ర (RajmargYatra) మొబైల్ యాప్‌లో రెండు సరికొత్త మరియు అత్యంత ప్రతిష్టాత్మక ఫీచర్లను అధికారికంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. అవే డిజిటల్ లోకల్ పాస్ (Digital Local Pass) మరియు మార్గమిత్ర (MargMitra) హెల్ప్ సెంటర్. ఈ డిజిటల్ సేవలు టోల్ నిర్వహణలో పారదర్శకతను పెంచడమే కాకుండా, ప్రయాణికులకు విలువైన సమయాన్ని ఆదా చేయడంలో ఎంతో కీలకంగా మారనున్నాయి. టోల్ ప్లాజాకు సమీపంలో నివసిస్తున్న ప్రజలు ఇకపై తమ స్థానిక పాస్ పొందేందుకు లేదా పొడిగించుకునేందుకు నేరుగా టోల్ ప్లాజాల వద్దకు వెళ్లాల్సిన అవసరమే లేకుండా రాజ్‌మార్గ్‌యాత్ర యాప్ ద్వారా నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. నియమాల ప్రకారం ఒక నిర్దిష్ట టోల్ ప్లాజాకు సరిగ్గా 20 కిలోమీటర్ల (20 km) పరిధిలో నివసించే అర్హులైన పౌరులు ఈ డిజిటల్ లోకల్ పాస్ సేవను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ లోకల్ పాస్ పొందిన వాహనదారులు సంబంధిత టోల్ ప్లాజా ద్వారా నెలకు ఎన్నిసార్లైనా (అపరిమితంగా) ప్రయాణించే వెసులుబాటు లభిస్తుంది. గతంలో ఈ ప్రక్రియ కోసం పత్రాలు పట్టుకుని ప్రత్యక్షంగా వెళ్లి అధికారులను కలవాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు కేవలం కొద్ది నిమిషాల్లోనే మీ స్మార్ట్‌ఫోన్ నుంచే దరఖాస్తు పూరించవచ్చు. ఈ వినూత్న సేవను ఎన్‌హెచ్‌ఏఐ ప్రయోగాత్మకంగా ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-II (UER-II) మార్గంలో ఉన్న ముండ్కా-బక్కర్‌వాలా టోల్ ప్లాజా వద్ద విజయవంతంగా ప్రారంభించింది. అక్కడ వచ్చిన స్పందన ఆధారంగా, వచ్చే కొన్ని నెలల్లో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్‌హెచ్‌ఏఐ టోల్ ప్లాజాలకు ఈ ఆన్‌లైన్ డిజిటల్ లోకల్ పాస్ సౌకర్యాన్ని దశలవారీగా విస్తరించడానికి పక్కా ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది స్థానిక వాహనదారులకు టోల్ రుసుముల భారం తగ్గడమే కాకుండా, పదే పదే లైన్లలో వేచి ఉండే శ్రమ తప్పనుంది. ఈ ఆన్‌లైన్ ప్రక్రియలో ఎటువంటి నకిలీ వివరాలకు తావులేకుండా ఎన్‌హెచ్‌ఏఐ అత్యంత సురక్షితమైన ప్రభుత్వ డిజిటల్ వేదికలను అనుసంధానించింది. స్థానిక చిరునామా ధృవీకరణ కోసం డిజిలాకర్ (DigiLocker), వాహన రిజిస్ట్రేషన్ వివరాల కోసం కేంద్ర ప్రభుత్వ వాహన్ (VAHAN) డేటాబేస్, దానికి అనుసంధానమైన ఫాస్టాగ్ (FASTag) ఖాతాలు మరియు దరఖాస్తుదారుడు నిజంగానే 20 కిలోమీటర్ల పరిధిలో నివసిస్తున్నారో లేదో ఖచ్చితంగా తెలుసుకోవడానికి జీఐఎస్ (GIS-based verification) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. వినియోగదారుడి ముందస్తు అనుమతితోనే ఈ సమాచారాన్ని సేకరించి, అత్యంత వేగంగా డిజిటల్ లోకల్ పాస్‌ను మంజూరు చేస్తున్నారు. అంతేకాకుండా, రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో చేర్చబడిన మరో అద్భుతమైన ఫీచర్ 'మార్గమిత్ర హెల్ప్ సెంటర్'. ఇది జాతీయ రహదారులపై ప్రయాణించే ప్రయాణికుల సేవ కోసం రూపొందించిన సింగిల్ విండో డిజిటల్ అసిస్టెన్స్ ప్లాట్‌ఫారమ్. మార్గమిత్ర ప్రత్యేకత ఏమిటంటే, భారతీయ వినియోగదారుల సౌకర్యార్థం తెలుగుతో సహా ఏకంగా 22 అధికారిక భారతీయ భాషలలో (22 Indian languages) ఇది సేవలను అందిస్తుంది. ప్రయాణికులు తమ సందేహాలను టైప్ చేయడం ద్వారా లేదా నేరుగా మాట్లాడటం (వాయిస్ కమాండ్) ద్వారా కూడా తమ ఫిర్యాదులు మరియు ప్రశ్నలకు తక్షణ సమాధానాలు పొందే సౌలభ్యం దీనిలో ఉంది. how to apply online toll local pass nhai,rajmargyatra margmitra help centre features.

Publish Date: Jul 21, 2026 10:50AM

political-news-img

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి వ్యవహారంలో కొత్త ట్విస్ట్...!

ఆమెతో ఏడాది నుంచి రిలేషన్‌లో ఉన్న..సూసైడ్‌ నోట్‌లో ఉదయ్ కృష్ణారెడ్డి..! ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి ఆత్మహత్యాయత్నం చేశారనే ప్రచారంలో కీలక పరిణామాలు చోటుచేసు కున్నాయి. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులకు ఇప్పటివరకు లభించిన ఆధారాల ప్రకారం ఉదయ్ అసలు ఆత్మహత్యాయత్నమే చేయలేదని నిర్ధారణకు వచ్చినట్లు పోలీస్ వర్గాలు వెల్లడించాయి. ప్రారంభంలో విషపూరిత ద్రవపదార్థం సేవించి ఆత్మహత్యకు యత్నించారనే వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో అలాంటి ఆధారాలు ఏవీ లభించలేదని సమాచారం. వైద్య పరీక్షల నివేదికల్లో ఆయన శరీరంలో విషపూరిత రసాయనాలు లేదా ఆత్మహత్యకు ఉపయోగించే పదార్థాల ఆనవాళ్లు కనిపించలేదని అధికారులు చెబుతున్నారు. దర్యాప్తులో మరో కీలక విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఉదయ్ కృష్ణా రెడ్డి అతిగా మద్యం సేవించడం వల్లే అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలుస్తోంది. అదే కారణంగా ఆయనకు అస్వస్థత ఏర్పడగా, వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, ఈ ఘటనకు సంబంధించి వెలుగులోకి వచ్చిన సూసైడ్ నోట్‌పై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆ నోట్ నిజంగా ఉదయ్ కృష్ణా రెడ్డి రాసిందా? లేక మరెవరైనా సృష్టించారా? అది ఎప్పుడు రాయబడింది? అనే అంశాలను ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అవసరమైతే చేతిరాత నిపుణులతో కూడా పరీక్షలు నిర్వహించే అవకాశమున్నట్లు సమాచారం. పోలీస్ వర్గాల ప్రకారం, ఆత్మహత్యాయత్నం జరిగిందనే ప్రచారం వాస్తవాలకు భిన్నంగా ఉండొచ్చని అనుమానిస్తు న్నారు. సానుభూతి పొందేందుకు లేదా ఇతర కారణాలతో ఈ ప్రచారం జరిగి ఉండొచ్చనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, ఆ సమయంలో ఆయనతో సంబంధం ఉన్న వ్యక్తులు, ఫోన్ కాల్స్, డిజిటల్ ఆధారాలు, ఇతర పరిస్థి తులన్నింటినీ అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ వ్యవహారంపై తుది నిర్ధారణకు రావాలంటే ఫోరెన్సిక్ నివేదికలు, సూసైడ్ నోట్‌పై విశ్లేషణ, ఇతర సాంకేతిక ఆధారాలన్నీ అందాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. పూర్తి స్థాయి దర్యాప్తు అనంతరం మాత్రమే ఈ ఘటనకు సంబంధించిన వాస్తవాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని పోలీస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయ్ కృష్ణారెడ్డి సూసైడ్ లేఖలో పలు కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా బయటకు వచ్చిన లేఖలో, తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణితో తాను ఏడాది పాటు రిలేషన్‌లో ఉన్నానని ఉదయ్ కృష్ణారెడ్డి పేర్కొన్నాడు. ఆమె మరో వ్యక్తిని వివాహం చేసుకున్న తర్వాత కూడా తిరిగి తన వద్దకు వచ్చిందని, అనంతరం తమ మధ్య మళ్లీ సంబంధం కొనసాగిందని లేఖలో రాశాడు. ఈ విషయాలకు సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద ఉన్నాయని పేర్కొన్నాడు. అలాగే, తన మరణానికి నలుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్‌లో ఆరోపించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఫిర్యాదులో ఏముంది? తనతో పాటు శిక్షణ పొందుతున్న ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డి ఈ ఏడాది జూన్ 23 నుంచి తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వాట్సాప్ ద్వారా అసభ్యకర సందేశాలు పంపుతూ దూషిస్తున్నాడని, రహస్యంగా తన వ్యక్తిగత ప్రైవేట్ వీడియోలను చిత్రీకరించి వాటితో బెదిరిస్తున్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాకుండా, ఆ వీడియోలను తన భర్తకు పంపి మానసికంగా వేధించడంతో పాటు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేశాడని ఆరోపించింది. Trainee IPS Uday Krishna Reddy, Suicide note, Attapur Police Station, National Police Academy Hyderabad, Trainee IPS Suicide Attempt Drama, Hyderabad Police Investigation

Publish Date: Jul 21, 2026 10:49AM

political-news-img

ఏపీలో కరోనా కొత్త వేరియంట్..మళ్లీ క్వారంటైన్ లు, ఐసోలేషన్ లు తప్పవా?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కలకలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ మరో సారి కరోనా ఇసోలేషన్ లు, క్వారంటైన్ ల భయాన్ని తీసుకువస్తున్నది. ఇప్పుడు ఏపీలో వ్యాప్తి చెందుతున్న మహమ్మారి కరోనా కొత్త వేరియంట్ గా నిర్థారించారు. ఇటీవల కడప జిల్లాతో పాటు గుంటూరు పరిసర ప్రాంతాల్లో కోవిడ్ సోకిన బాధితుల నుంచి సేకరించిన బాధితుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ, ఎన్ఐవీ పరిశోధన కేంద్రంలో నిర్వహించిన అధునాతన జీనోమ్ సీక్వెన్సింగ్ విశ్లేషణలో బాధితులకు ఒమిక్రాన్ ఆర్‌ఎఫ్.5 అనే నూతన వేరియంట్ సోకినట్లు శాస్త్రీయంగా నిర్ధారణ అయింది. గతంలో కరోనా మహమ్మారి సృష్టించిన వినాశనం, తీవ్ర భయాందోళనలు ప్రజల మనస్సుల్లో ఇంకా సజీవంగానే ఉండటంతో ఇప్పుడు కరోనా కొత్త వేరియంట్ వ్యాపతి తీవ్ర ఆందోళనకు కరాణమౌతోంది. అయితే రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ కొత్త కరోనా వేరియంట్ పెద్ద ప్రమాదకరమనది కాదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొత్త వేరియంట్ ఉనికి అధికారికంగా వెలుగుచూసిన వెంటనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. బాధితుల నమూనాల ఫలితాల నివేదిక అందగానే రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. వర్చువల్ సమావేశాల ద్వారా వైద్యాధికారులతో మాట్లాడిన మంత్రి, రాష్ట్రవ్యాప్తంగా ఇన్ఫెక్షన్ల నమోదు వేగం, ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు, ఆక్సిజన్ నిల్వలు, ముందస్తు జాగ్రత్త చర్యలపై సమగ్ర నివేదిక తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వెలుగు చూసిన ఆర్‌ఎఫ్.5 వేరియంట్ ప్రమాదకరమైనది కాదని వైద్యులు చెబుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. ఇది సాధారణ సీజనల్ కొవిడ్ ఇన్ఫెక్షన్ తెచ్చే వేరియంట్‌ అని చెబుతున్నారు. కోవిడ్ సోకిన వారిలో తీవ్రమైన గొంతు నొప్పి, పొడి దగ్గు, జ్వరం, తలనొప్పి, జలుబు, అలసట ఉంటాయనీ, అలాగే.. కండరాల నొప్పులు కూడా ఉంటాయని వైద్యులు తెలిపారు. Covid New Variant RF5, Omicron Sub Variant AP, Kadapa Covid Samples, Pune NIV, Health Minister Satya Kumar Yadav Review

Publish Date: Jul 21, 2026 10:49AM

political-news-img

నెట్ లేకున్నా యూపీఐ పేమెంట్: NPCI తెస్తున్న కొత్త ఆఫ్‌లైన్ టెక్నాలజీ!

నేటి డిజిటల్ యుగంలో మన దైనందిన జీవితంలో యూపీఐ పేమెంట్లు భాగమైపోయాయి. టీ కొట్టు వద్ద చెల్లించే రూ. 5 నుంచి పెద్ద వ్యాపార లావాదేవీలకు ఉపయోగించే రూ. 1 లక్ష వరకు ప్రతీదానికీ స్మార్ట్‌ఫోన్ ఆధారిత యూపీఐ చెల్లింపులపైనే ఆధారపడుతున్నాం. అయితే, షాపింగ్ మాల్స్‌లోని బేస్‌మెంట్లు, భూగర్భ మెట్రో స్టేషన్లు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు నెట్‌వర్క్ సిగ్నల్స్ నిలిచిపోయి పేమెంట్ స్టక్ అవ్వడం మనం తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఇబ్బందులకు శాశ్వత పరిష్కారం చూపేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఒక అద్భుతమైన సాంకేతికతను అందుబాటులోకి తెస్తోంది. ఇకపై మీ మొబైల్ ఫోన్‌లో ఎలాంటి ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, వ్యాపారి వద్ద ఉన్న పాయింట్ ఆఫ్ సేల్ (పిఓఎస్) టెర్మినల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నప్పటికీ చాలా సులభంగా డిజిటల్ చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ వినూత్న వ్యవస్థ నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్ లేదా ఎన్ఎఫ్సీ (NFC) సాంకేతికత ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో వినియోగదారులు తమ ఎన్ఎఫ్సీ సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్‌ను వ్యాపారి యొక్క ధృవీకరించబడిన పిఓఎస్ టెర్మినల్ దగ్గర ట్యాప్ చేయడం ద్వారా క్షణాల్లో చెల్లింపులు పూర్తి చేయవచ్చు. ఈ కొత్త ఆఫ్‌లైన్ విధానంలో గరిష్టంగా రూ. 2,000 వరకు లావాదేవీలు జరిపే వెసులుబాటును ఎన్‌పీసీఐ కల్పిస్తోంది. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూపొందించిన డిజిటల్ ఆఫ్‌లైన్ చెల్లింపుల ఫ్రేమ్‌వర్క్ పరిమితి రూ. 500గా ఉన్నప్పటికీ, వినియోగదారుల సౌకర్యార్థం ఎన్‌పీసీఐ ఈ గరిష్ట పరిమితిని రూ. 2,000 వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫ్‌లైన్ చెల్లింపుల విధానం పనిచేసే తీరు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట వినియోగదారులు ఇంటర్నెట్ సదుపాయం ఉన్న సమయంలో తమ పరికరంలోని యూపీఐ లైట్ (UPI Lite) వాలెట్‌లోకి నిధులను లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆఫ్‌లైన్ వాతావరణంలో చెల్లింపు చేసేటప్పుడు ఎలాంటి యూపీఐ పిన్ (UPI PIN) నమోదు చేయాల్సిన అవసరం లేకుండానే, వాలెట్ బ్యాలెన్స్ నుండి నగదు నేరుగా వ్యాపారి టెర్మినల్‌కు బదిలీ అవుతుంది. సిగ్నల్స్ అస్సలు అందని విమాన క్యాబిన్లు, భూగర్భ రైలు మార్గాలు, సుదూర కొండ ప్రాంతాలు మరియు రద్దీగా ఉండే వ్యాపార సముదాయాల్లో ఈ ఫీచర్ ఒక వరప్రసాదంగా మారనుంది. ఎన్‌పీసీఐ ప్రణాళికల ప్రకారం, ప్రముఖ పిఓఎస్ టెర్మినల్ తయారీదారుల పరికరాలకు 2026 సంవత్సరంలోనే అధికారిక ధృవీకరణ (Certification) ప్రక్రియను ప్రారంభించనుంది. ఎన్‌పీసీఐ నుండి ఆమోదం పొందిన తర్వాత పిఓఎస్ కంపెనీలు ప్రత్యేకమైన అప్లికేషన్‌ను రూపొందించి ఆఫ్‌లైన్ లావాదేవీలను స్వీకరించడానికి సిద్ధం చేస్తాయి. డెబిట్, క్రెడిట్ కార్డులు మరియు వాలెట్ చెల్లింపులకే పరిమితమైన సాధారణ పిఓఎస్ మిషన్లు ఇకపై నెట్ లేకపోయినా యూపీఐ సొమ్మును స్వీకరించేలా ఆధునీకరించబడతాయి. offline upi nfc payment technology,upi lite offline payment limit.

Publish Date: Jul 21, 2026 10:47AM

political-news-img

రోహిత్ శర్మ రిటైర్మెంట్‌పై పాక్ మాజీ స్టార్ సంచలన వ్యాఖ్యలు!

భారత క్రికెట్ జట్టులో అనుభవజ్ఞుడైన సీనియర్ ఓపెనర్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై గత కొన్ని రోజులుగా క్రీడా వర్గాల్లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలు, అలాగే రాబోయే 2027 వన్డే ప్రపంచ కప్ ప్రణాళికల్లో అతనికి చోటు దక్కకపోవచ్చనే ప్రచారం విమర్శకుల నుంచి జోరుగా సాగింది. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో లార్డ్స్ మైదానం వేదికగా రోహిత్ శర్మ ఆడిన అద్భుతమైన ఇన్నింగ్స్ ఆ విమర్శలన్నింటికీ సముచిత సమాధానం చెప్పింది. లార్డ్స్ వంటి చారిత్రాత్మక వేదికపై ఒత్తిడిని అధిగమించి ఏకంగా 138 పరుగుల భారీ సెంచరీతో విరుచుకుపడిన హిట్‌మ్యాన్, తన బ్యాట్‌తోనే అందరి నోళ్లు మూయించాడు. మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలై, ఇంగ్లండ్ ఈ వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్నప్పటికీ, లార్డ్స్ వన్డేలో రోహిత్ శర్మ సాధించిన ఈ సెంచరీనే సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్‌గా నిలిచింది. ప్రపంచంలోనే అత్యుత్తమ వన్డే బ్యాటర్లలో తాను ఇప్పటికీ అగ్రస్థానంలో ఉన్నానని రోహిత్ శర్మ ఈ మ్యాచ్ ద్వారా మరోసారి స్పష్టంగా నిరూపించుకున్నాడు. హిట్‌మ్యాన్ ఆడిన ఈ అద్భుత ఇన్నింగ్స్‌పై పాకిస్థాన్ మాజీ వికెట్ కీపర్, ప్రముఖ వ్యాఖ్యాత కమ్రాన్ అక్మల్ ప్రశంసల వర్షం కురిపించారు. 'ది గేమ్ ప్లాన్' పాడ్‌కాస్ట్‌లో కమ్రాన్ అక్మల్ మాట్లాడుతూ, రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి, అతని రిటైర్మెంట్‌పై విమర్శలు చేస్తున్న వారికి తీవ్ర హెచ్చరిక చేశారు. రోహిత్‌కు ఎప్పుడు తప్పుకోవాలో, ఎప్పుడు ఆట నుంచి వైదొలగాలో చాలా బాగా తెలుసని, విమర్శకులు అనవసరమైన కామెంట్లు చేయకుండా నోళ్లు మూసుకుంటేనే బెటర్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజ ఆటగాళ్లను ఎవరూ బలవంతంగా జట్టు నుంచి సాగనంపలేరని, వారు భారత క్రికెట్ కోసం ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. జట్టు ప్రయోజనాల కోసమే వారు విశ్రాంతి తీసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని, అలాంటి దిగ్గజాల రిటైర్మెంట్ నిర్ణయాలను వారికే వదిలేయాలని స్పష్టం చేశారు. ఈ సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ విభాగం రాణించినప్పటికీ, బౌలింగ్ విభాగం ఘోరంగా విఫలం కావడం వల్లే టీమిండియా ఓటమి పాలైందని కమ్రాన్ అక్మల్ విశ్లేషించారు. భారత యంగ్ బౌలర్లు ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్‌దీప్ సింగ్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా, గుర్నూర్‌ బ్రార్ ఏకంగా 97 పరుగులు ఇవ్వడం ఇంగ్లండ్‌ భారీ స్కోరు సాధించడానికి దోహదపడింది. ప్రధాన బౌలర్లు ఒక్కొక్కరు 70 నుండి 100 పరుగుల దాకా సమర్పించుకుంటే ప్రత్యర్థి జట్టును కట్టడి చేయడం ఎవరికైనా అసాధ్యమని చెప్పారు. అంతేకాకుండా, జట్టులో ప్రధాన వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ లేకపోవడం భారత్‌కు తీరని లోటైందని, అక్షర్ పటేల్ ఒక్కడే స్పిన్ బాధ్యతలు మోయడంతో బౌలింగ్‌లో వైవిధ్యం కరువైందని పేర్కొన్నారు. మ్యాచ్ చివరి 5 ఓవర్లలో ఏకంగా 80కి పైగా పరుగులు ఇచ్చేయడంతోనే విజయం భారత్ చేతి నుంచి ఇంగ్లండ్ వైపు మొగ్గిందని, బౌలింగ్ విభాగంలో అనుభవలేమి స్పష్టంగా కనిపించిందని అక్మల్ వివరించారు. ఏది ఏమైనా, తన శ్రేష్ఠమైన ఫామ్‌తో 138 పరుగులు చేసి క్రీడా ప్రపంచాన్ని అలరించిన రోహిత్ శర్మపై అనుమానాలు వ్యక్తం చేసేవారికి లార్డ్స్ సెంచరీ ఒక బలమైన సందేశంగా నిలిచింది. rohit sharma retirement rumors akmal backs hitman,kamran akmal supports rohit sharma after century.

Publish Date: Jul 21, 2026 10:44AM

MOVIE NEWS