Top Stories

dummy

political-news-img

జూనియర్ ధోనీ ముకుల్ కుటుంబ నేపథ్యం తెలుసా?

ఐపీఎల్ వేదికగా అనామక క్రికెటర్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారడం మనం చూస్తుంటాం. కానీ ఆ మెరుపుల వెనుక ఉండే చీకటి గాథలు, కుటుంబాల త్యాగాలు వర్ణనాతీతం. తాజా ఐపీఎల్ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్ తరపున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన 21 ఏళ్ల ముకుల్ చౌదరి పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. తన ఆటతీరుతో జట్టును ఆదుకోవడమే కాకుండా, తన తండ్రి పడిన కష్టాలకు ఒక సార్థకతను చేకూర్చాడీ యువ సంచలనం. ముకుల్ ఈ స్థాయికి చేరడం వెనుక అతని తండ్రి దలీప్ చౌదరి అలుపెరుగని పోరాటం ఉంది. రాజస్థాన్‌లోని ఝున్‌ఝును జిల్లాకు చెందిన దలీప్, తన కొడుకును ఎలాగైనా క్రికెటర్‌గా చూడాలని పెళ్లికి ముందే నిశ్చయించుకున్నారు. ఇందుకోసం ఆయన ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తనకున్న ఒకే ఒక్క ఇంటిని కూడా అమ్మేసి ముకుల్‌ను శిక్షణలో చేర్పించారు. రియల్ ఎస్టేట్, హోటల్ వంటి వ్యాపారాల్లో నష్టాలు రావడంతో బ్యాంకు అప్పులు తీర్చలేక ముకుల్ చౌదరి తండ్రి దలీప్ చౌదరి కొంతకాలం జైలు శిక్ష కూడా అనుభవించాల్సి వచ్చింది. తండ్రి పడుతున్న బాధను కళ్ళారా చూసిన ముకుల్, తన లక్ష్యంపై దృష్టి సారించి అద్భుతమైన క్రీడాకారుడిగా ఎదిగాడు. వేలంలో లఖ్‌నవూ ఫ్రాంచైజీ ఇతని కోసం ఏకంగా రూ. 2.6 కోట్లు వెచ్చించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. కానీ.. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడి, తన విలువ నిరూపించుకున్నాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ముకుల్, తన ఆరాధ్య దైవం ధోనీ తరహాలోనే హెలికాప్టర్ షాట్లతో మైదానాన్ని హోరెత్తించాడు. లఖ్‌నవూ జట్టు ఆల్‌రౌండర్ అర్జున్ టెండూల్కర్ ముందే చెప్పినట్లుగా, మైదానం నలుమూలలా షాట్లు ఆడగల సామర్థ్యం ముకుల్ సొంతం. ఈ విజయంతో ముకుల్ తండ్రి ఎంతో ఉద్వేగానికి గురయ్యారు. కుమారుడికి వచ్చిన మొత్తంతో తన బ్యాంకు రుణాలను తీర్చేస్తానని ఆయన గర్వంగా చెబుతున్నారు. ముకుల్ రాబోయే మ్యాచుల్లోనూ ఇదే ప్రదర్శనను కొనసాగిస్తే, భారత క్రికెట్‌లో మరో ఫినిషర్ దొరికినట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే ముకుల్ చౌదరిని అందరూ జూనియర్ ధోనీ అంటే పిలుస్తున్నారు. ఈ యువ ఆటగాడు నిలకడైన ప్రదర్శనతో టీమ్ ఇండియాలోకి అడుగుపెడతాడని ఆశిస్తున్నారు. అడుగుపెట్టాలని ఆకాంక్షిస్తున్నారు.

Publish Date: Apr 11, 2026 3:16PM

political-news-img

చంద్రబాబు లెటర్ ప్యాడ్ లో అమరావతి అని ఎందుకు లేదు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజధాని అంశం ఎప్పుడూ ఒక మండుతున్న నిప్పుకణమే. గత పదేళ్లుగా ఈ పేరు మారుతూ, రూపు మారుతూ ప్రజలను అయోమయంలో నెట్టేస్తోంది. తాజాగా అమరావతికి చట్టబద్ధత లభించింది. అయితే వైసీపీ అధినేత రాజధానిగా ప్లాన్ బి అంటూ చేసిన మావిగన్ ప్రతిపాదన సంచలనంగా మారింది. దానిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది కూడా. ఈ నేపథ్యంలోనే తెలుగువన్ వాస్తవ వేదిక లో జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్ రాజధాని భవిష్యత్ పై సమగ్రంగా చర్చించారు. ఈ చర్చలో డోలేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. అసలు ఏపీకి రాజధాని ఏది? అమరావతి శాశ్వతమా లేక మావిగాన్' అంటూ జగన్ చేసిన ప్రతిపాదనతో మళ్లీ రాజధానిపై జనంలో అనుమానాలు మొదలయ్యాయా? అన్న చర్చ మొదలైంది. ఏపీ రాజధాని విషయంలో మరో ప్రయోగం మొదలుకాబోతోందా? అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని వ్యవహారంపై డోలేంద్ర ప్రసాద్ తెలుగువన్ వాస్తవ వేదికలో కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. ప్రభుత్వ విధానాల్లో ఉన్న అస్పష్టతను, రాజకీయ నాయకుల ద్వంద్వ విధానాలనూ ఎండగట్టారు. ముఖ్యంగా జగన్ మావిగాన్' కాన్సెప్ట్, ప్రస్తుత అమరావతి అభివృద్ధిపై ఆయన నిష్కర్షగా తన అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని అనేది కేవలం భవనాల సముదాయం కాదని, అది ఒక జీవకళతో ఉట్టిపడే నగరం కావాలన్నారు. 2014లో విభజన తర్వాత అమరావతిని రాజధానిగా ప్రకటించిన చంద్రబాబు ప్రభుత్వం, అక్కడ భారీ స్థాయిలో భూసేకరణ చేపట్టింది. అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం మూడు రాజధానులంటూ అమరావతిని శాసన రాజధానిగా, విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా ప్రకటించి పాలన వికేంద్రీకరణ అంది. అయితే అది మాటలకే పరిమితమైంది. ఇప్పుడు అమరావతి ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందిన తరువాత జగన్ అమరావతిపై తన వ్యతిరేకతను స్పష్టంగా చాటుతూ.. విజయవాడ-గుంటూరు ప్రాంతాన్ని కలిపి మావిగాన్ అంటూ చేసిన కొత్త ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే వాస్తవ వేదికలో డోలేంద్ర ప్రసాద్ కొన్ని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. అమరావతి పేరు ముఖ్యమంత్రి లెటర్ హెడ్ మీద ఉందా అని ప్రశ్నించారు. అమరావతి పేరు సీఎం లెటర్ హెడ్ మీదే లేకుంటేఇన్వెస్టర్లకు నమ్మకం ఎలా కలుగుతుందని నిలదీశారు. అమరావతి-విజయవాడ ప్రాంతానికి వాస్తు దోషం ఉందంటూ వస్తున్న ప్రచారాన్ని పాలకులు ఎలా విస్మరిస్తారన్నారు. రాజధానిలో కేవలం మాల్స్ కడితే సరిపోదని, అక్కడ జనం రాకపోకలు ఉండాలని, అప్పుడే వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయన్నారు. పేద, మధ్యతరగతి ప్రజల జీవనోపాధికి అక్కడ చోటు ఉండాలన్నారు. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో రాజకీయ నాయకుల మధ్య సంకుచిత మనస్తత్వం ఎక్కువైందని, ఒక ప్రభుత్వం మొదలుపెట్టిన పనిని మరొక ప్రభుత్వం నాశనం చేయడం రాష్ట్ర దౌర్భాగ్యమన్నారు. రాజధాని ఒక డెడ్ సిటీలా మారకుండా ఉండాలంటే తక్షణమే అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే అక్కడ విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ఉపాధి అవకాశాలు మెండుగా ఉండాలని చెప్పారు. చంద్రబాబు అమరావతి నిర్మాణం విషయంలో ఇసుమంతైనా జాప్యం లేకుండా మళ్లీ ఎన్నికలు వెళ్లేలోగానే పూర్తి చేయాలన్నారు. వచ్చే రెండు మూడేళ్లలో అమరావతికి ఒక స్పష్టమైన రూపురేఖలు వస్తాయని, ఆ తర్వాత ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని కాదనలేని విధంగా అభివృద్ధి జరగాలన్నారు. జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్, తెలుగువన్ ఎండీ కంఠంనేనిల చర్చను తెలుగువన్ వాస్తవ వేదికలో వీక్షించండి

Publish Date: Apr 11, 2026 2:21PM

political-news-img

మైక్రో ఫైనాన్స్ పేరుతో రూ.10 కోట్ల మోసం కేసు… సింగర్ మంగ్లీ సహా ఐదుగురిపై కేసు నమోదు

ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీతో పాటు ఆమె సోదరుడు, మరో ముగ్గురిపై హైదరాబాద్‌లో మోసం, బెదిరింపుల కేసు నమోదైంది. న్యాయవాది సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు మేరకు, మైక్రో ఫైనాన్స్ వ్యాపారం పేరుతో రూ.10 కోట్ల మేర మోసం జరిగింది. పెట్టుబడులు పెట్టిస్తామని నమ్మబలికి భారీ ఎత్తున మొత్తాన్ని వసూలు చేసి తిరిగి చెల్లించలేదని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ డబ్బు గురించి అడగడంతో ఒత్తిడి, బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆక్సిడెంట్ చేసి చంపిస్తాం అంటూ మంగ్లీ అనుచరులు బెదిరించారని సుబ్బారావు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు ప్రాణహాని ఉందని చెప్పడం తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Publish Date: Apr 11, 2026 1:33PM

political-news-img

బురఖా మాటున బంగారం స్మగ్లింగ్.. ముంబై ఎయిర్ పోర్టులో లేడీ స్మగ్లర్ల అరెస్టు

ముంబైలో శనివారం (ఏప్రిల్ 11) తెల్లవారుజామున సినిమా ఫక్కీలో బంగారం స్మగ్లింగ్ కు ప్రయత్నించిన కెన్యా నుంచి వచ్చిన మహిళల బృందాన్ని డీఆర్ఐ అధికారులు అదుపులోనికి తీసుకు న్నారు. ఈ ఘటన ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానా శ్రయంలో జరిగింది. ముందుగానే విశ్వసనీయ సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు నిఘా ఏర్పాటు చేశారు.కెన్యా నుంచి వచ్చిన 24 మంది మహిళలు సాధారణ ప్రయాణికుల్లా విమానం దిగారు. కస్టమ్స్ తనిఖీలను తప్పించుకోవాలనే ఉద్దేశంతో బురఖాలు ధరించి బంగారాన్ని బ్యాగుల్లో దాచారు. అనుమానం రాకుండా నెమ్మదిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే అప్పటికే అక్కడ మాటు వేసిన డిఆర్ఐ బృందం తనిఖీలు కఠినతరం చేయడంతో ఆ మహిళల్లో కొందరు తమ బ్యాగులనే అక్కడే పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీంతో విమానాశ్రయంలో దాదాపు రెండు గంటలపాటు హైడ్రామా సాగింది. అధికారులను ముప్పతిప్పలు పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ చివరకు డిఆర్ఐ బృందం వారిని అదుపులోకి తీసుకుంది. 24 మంది మహిళల వద్ద నుంచి మొత్తం 30 కిలోల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.38 కోట్లుగా అంచనా వేశారు అధికారులు.ఈ కేసులో 24 మంది మహిళలను అరెస్ట్ చేశారు. ముంబై విమానాశ్రయంలో ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

Publish Date: Apr 11, 2026 1:17PM

political-news-img

భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఓపెనింగ్ జులై 5

ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే సమయం ఆసన్నమైంది. విజయనగరం జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. ఈ భారీ ప్రాజెక్టును జూలై 5వ తేదీన ప్రారంభించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విమానాశ్రయానికి మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన సంగతి తెలిసిందే. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి దేశ ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా జరపాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఇందుకోసం ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి అధికారిక ఆహ్వానం పంపినట్లు సమాచారం. ఉత్తరాంధ్ర ముఖచిత్రాన్ని మార్చే ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవాన్ని ఒక చారిత్రక ఘట్టంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం విమానాశ్రయ ప్రాంగణంలో నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. జీఎంఆర్ ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఈ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే, టెర్మినల్ బిల్డింగ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. తొలి విడతలో ఏడాదికి సుమారు 60 లక్షల మంది ప్రయాణికులకు సేవలందించేలా సౌకర్యాలను కల్పిస్తున్నారు. రవాణా వ్యవస్థలో ఎలాంటి ఆటంకాలు లేకుండా విశాఖ నుంచి భోగాపురం వరకు నిర్మిస్తున్న ఆరు వరుసల కోస్టల్ హైవే పనులను కూడా జూన్ నెలాఖరు కల్లా పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విమానాశ్రయం అందుబాటులోకి రావడం వల్ల కేవలం ప్రయాణ సౌకర్యాలే కాకుండా, ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటక పరంగా గణనీయంగా అభివృద్ధి చెందే అవకాశం ఉంది. విదేశీ పెట్టుబడులు రావడంతో పాటు వేలాది మంది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. విశాఖపట్నం ఐటీ హబ్‌గా ఎదగడానికి కూడా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కీలక భూమిక పోషించనుంది. ప్రస్తుతం పౌర విమానయాన శాఖ అధికారులు ఎయిర్‌పోర్ట్ భద్రత మరియు ఇతర సాంకేతిక అంశాలపై తుది తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధాని పర్యటన ఖరారు కాగానే ప్రారంభోత్సవ వేడుకపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఈ విమానాశ్రయం ప్రారంభమైతే, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో కూడిన ప్రయాణ అనుభవం ఉత్తరాంధ్ర వాసులకు సొంతం కానుంది.

Publish Date: Apr 11, 2026 12:26PM

political-news-img

శాంతి చర్చలకు ముందు ఇరాన్ భావోద్వేగ నిరసన.. యుద్ధం సృష్టించిన మహా విషాద ప్రదర్శన

అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కీలకమైన శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఉద్విగ్న పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది. ఇరాన్ ప్రతినిథి బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వం వహించారు. ఆయన తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన విమానంలో అత్యంత విషాదకరమైన దృశ్యాలు కనిపించాయి. విమానంలోని ముందు వరుస సీట్లలో ఈ వస్తువులను ఉంచి, యుద్ధం కారణంగా బలియైన పసిప్రాణాలకు నివాళి అర్పించారు. గత ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో జరిగిన దాడుల్లో సుమారు 168 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. ఈ దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమే కారణమని ఇరాన్ అంటోంది. ఆ మరణించిన చిన్నారుల జ్ఞాపకార్థం తమ ప్రతినిధి బృందానికి మినాబ్ 168 అని పేరు పెట్టిన ఘలీబాఫ్, ఈ ప్రయాణంలో నా సహచరులు వీరే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అందరినీ కలిచివేస్తున్నది. నెటిజనులు కళ్లు చెమర్చాయి అంటూ స్పందిస్తున్నారు. ఈ చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. 2011 తర్వాత ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడంతో పాటు, టెహ్రాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. యుద్ధ క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల వస్తువులను చర్చల వేదిక వరకు తీసుకురావడం ద్వారా, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని అమెరికాకు సూటిగా చెప్పాలన్నది తమ ఉద్దేశమని ఇరాన్ పేర్కొంది. అదలా ఉంటే.. ఈ భేటీలో కుదిరే ఒప్పందాలు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఏ మేరకు దోహదపడతాయన్నదానిపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరాన్ని పక్కన పెట్టి, కాల్పుల విరమణ దిశగా అడుగులు పడాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రదర్శించిన ఈ భావోద్వేగ నిరసన, చర్చల దిశను ఎలా మారుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Publish Date: Apr 11, 2026 12:10PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img