political-news-img

గుంటూరు పార్లమెంట్ నేతలతో లోకేష్ ఆత్మీయ విందు

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నివాసంలో గుంటూరు పార్లమెంట్ కు చెందిన ప్రజాప్రతినిధుల ఆత్మీయ విందు సమావేశం జరిగింది. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలోని పెమ్మసాని నివాసంలో జరిగిన ఈ విందు భేటీకి విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలతో పాటు గుంటూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై నేతలు చర్చించారు. ప్రజాప్రభుత్వం 22 నెలల పాలనలోనే రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వచ్చాయని, తద్వారా యువతకు పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. జిల్లాలో పార్టీ బలోపేతంపైనా నేతలు సమాలోచనలు జరిపారు. ఈ సమావేశంలో గుంటూరు ఎంపీ, కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు మహ్మద్ నసీర్, బూర్ల రామాంజనేయులు, తెనాలి శ్రావణ్ కుమార్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Publish Date: May 1, 2026 10:59PM

political-news-img

ఉపాధి పని ప్రదేశాల్లో జాగ్రత్తలు పాటించాలి : మంత్రి సీతక్క

ఉపాధి హమీ పనులపై మంత్రి సీతక్క సమీక్ష.. కూలీల ఆరోగ్యం పట్ల అధికారులు జాగ్రత్తలు పాటించాలి.. మే మాసంలో మూడున్నర కోట్ల పనిదినాలు పూర్తి చేయాలి.. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తృతంగా కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి డా. దనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో డీఆర్డీఓలు, ఎంపీడీవోలు మరియు సంబంధిత అధికారులతో ములుగు నుంచి మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ సీఎస్ దాన కిషోర్, కమిషనర్ దివ్యా దేవరాజన్ తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ మే మాసం ఉపాధి హామీ పథకం అమలులో అత్యంత కీలకమని పేర్కొన్నారు. ఉపాధి కోరిన ప్రతి కుటుంబానికి పనిని కల్పించడం ప్రధాన లక్ష్యంగా సిబ్బంది కృషి చేయాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి పనులపై డిమాండ్ అధికంగా ఉన్నందున, సాంకేతిక, ఇతర సమస్యలను అధిగమించి ప్రతి కూలీకి పని అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. మే మాసంలో కనీసం మూడున్నర కోట్ల పనిదినాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఏప్రిల్ మాసంలో అధికారులు యజ్ఞంలా పనిచేసి కోటిన్నర పనిదినాలను పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం పంట కోతలు ముగియడంతో ఉపాధి కూలీ పనులకు డిమాండ్ మరింత పెరుగుతుందని, అర్హులైన అన్ని కుటుంబాలకు ఉపాధి కల్పించాలని స్పష్టం చేశారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో పని ప్రాంతాల్లో కూలీలకు తాగునీరు, నీడ, ఫస్ట్ ఎయిడ్ వంటి మౌలిక సదుపాయాలను తప్పనిసరిగా కల్పించాలని ఆదేశించారు. కూలీల ఆరోగ్యాన్ని కాపాడుతూ ఉపాధి పనులు నిరంతరాయంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అదేవిధంగా, తీవ్ర ఎండలను దృష్టిలో ఉంచుకుని ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు నిర్వహించేలా ప్లాన్ చేయాలని సూచించారు. అలాగే తక్కువగా ఉపాధి పనులు జరుగుతున్న మండలాలు, గ్రామ పంచాయతీలను స్వయంగా పర్యవేక్షించాలని, పనిదినాల లక్ష్య సాధనకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ప్రతి హాబిటేషన్‌లో పనులు ప్రారంభించడం, ప్రతి ఉపాధి కోరుకునే వ్యక్తికి పని కల్పించడం, ప్రతి పని ప్రదేశంలో తగిన సౌకర్యాలు ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 20 ఉపాధి పనులను అందుబాటులో ఉంచడం, ప్రతి 40 మంది కూలీలకు ఒక మేట్‌ను నియమించడం, ప్రత్యేక అధికారులను నియమించి పనుల పురోగతిని మెరుగుపరచడం వంటి చర్యలను ఖచ్చితంగా అమలు చేయాలని మంత్రి సీతక్క సూచించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్‌లతో కలిసి ఉపాధి కోరే కూలీలతో సమావేశాలు నిర్వహించి అవగాహన పెంచాలని, ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సమర్థవంతంగా సాధించాలని మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు.

Publish Date: May 1, 2026 10:48PM

political-news-img

బెంగాల్‌లో 15 కేంద్రాల్లో రీపోలింగ్...ఈసీ ఆదేశాలు

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. గత విడతలో జరిగిన పోలింగ్ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో మే 2వ తేదీన (శనివారం) రీ-పోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాలపై ఈ ప్రభావం పడింది. మగ్రాహట్ పశ్చిమ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, అలాగే అత్యంత ప్రాధాన్యత కలిగిన డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని 4 కేంద్రాల్లోనూ తిరిగి ఓటింగ్ జరగనుంది. ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ప్రధాన ఎన్నికల అధికారికి కేంద్ర ఎన్నికల సంఘం అధికారిక లేఖ రాసింది. గత నెల 29న జరిగిన రెండో దశ ఎన్నికల సమయంలో పలు చోట్ల ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందని, ఓటర్లను అడ్డుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ముఖ్యంగా డైమండ్ హార్బర్ పరిధిలోని కొన్ని బూత్‌లలో బీజేపీ గుర్తుపై టేపులు అంటించి, ఓటర్లు ఆ పార్టీకి ఓటు వేయకుండా అడ్డుకున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శలు గుప్పించారు. దీనిని 'డైమండ్ హార్బర్ మోడల్' అక్రమంగా ఆయన అభివర్ణించారు. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఎన్నికల పరిశీలకులు, రిటర్నింగ్ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఈ రీ-పోలింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఈసీ వెల్లడించింది. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. బెంగాల్ ఎన్నికలు ఎప్పుడూ హింసాత్మక ఘటనలకు వేదికవుతుంటాయి. గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ భారీగా ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం రీ-పోలింగ్ జరుగుతున్న కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక ప్రజలకు చాటింపు ద్వారా ఓటింగ్ గురించి అవగాహన కల్పించాలని కూడా ఈసీ సూచించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న డైమండ్ హార్బర్ పరిధిలో ఈ అక్రమాల ఆరోపణలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) మరియు బీజేపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేలా చూడటమే తమ బాధ్యతని ఎన్నికల యంత్రాంగం పేర్కొంటోంది. మే 4వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ లోపు ఈ 15 కేంద్రాల్లో జరిగే రీ-పోలింగ్ ఫలితాల సరళిని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల తుది ఫలితం బెంగాల్ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. మరి ఈ రీ-పోలింగ్ ప్రక్రియ ఎంతవరకు ప్రశాంతంగా ముగుస్తుందో వేచి చూడాలి.

Publish Date: May 1, 2026 10:36PM

political-news-img

తలసీమియా బాధిత బాలుడికి సీఎం చంద్రబాబు ఆర్థిక సాయం

పమిడిముక్కలలో లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు పింఛన్లు పంపిణీ.. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం.. పింఛన్ల పంపిణీతో పాటు సంక్షేమంపై దృష్టి... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గంలోని పమిడిముక్కలలో పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ కాలనీలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి స్వయంగా పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తలసీమియాతో బాధపడుతున్న 13 ఏళ్ల బాలుడు చాగంటిపాటి వివేక్‌కు రూ.10 వేల పింఛన్ అందించారు. అతని ఆరోగ్య పరిస్థితిని కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వివేక్‌కు తలసీమియా కారణంగా నెలకు మూడు నుంచి నాలుగు సార్లు రక్త మార్పిడి చేయాల్సి వస్తోందని, ఇందుకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఖర్చవుతోందని కుటుంబ సభ్యులు సీఎంకు వివరించారు. చదువులోనూ వివేక్ చురుకుగా ఉంటాడని, చికిత్సకు సహాయం చేయాలని వారు కోరారు. దీనిపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. అనంతరం ముఖ్యమంత్రి పమిడిముక్కల గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించారు. పింఛన్ల పంపిణీ అనంతరం మరో కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో అంగన్వాడీ కేంద్రం కనిపించడంతో అక్కడ ఆగారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో ముచ్చటించిన సీఎం, వారు పాడిన రైమ్స్‌ను ఆసక్తిగా విన్నారు. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం గురించి టీచర్లు, ఆయాలను అడిగి తెలుసుకున్నారు.

Publish Date: May 1, 2026 10:26PM

political-news-img

చలాన్ల పేరుతో వాహనాల సీజ్‌పై హైకోర్టు సీరియస్

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేయొద్దన్న కోర్టు ఆదేశాల అమలుపై తీవ్రంగా స్పందించిన తెలంగాణ హైకోర్టు కీలక అధికారులకు నోటీసులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసు, రవాణా శాఖల అధికారులపై వివరణ కోరింది. ఈ కేసులో ప్రతివాదులుగా సీవీ ఆనంద్, శివధర్ రెడ్డి, జోయల్ డేవిస్, లింబాద్రిలతో పాటు హోంశాఖ సెక్రటరీ, డీజీపీ, ట్రాఫిక్ అదనపు సీపీ, రవాణా శాఖ కమిషనర్‌లను పిటిషనర్ చేర్చారు. పెండింగ్ చలాన్లు ఉన్నాయని కారణంగా వాహనాలను సీజ్ చేయొద్దని ఈ ఏడాది జనవరి 20న హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చట్టపరమైన విధానాలు పాటించాలని కూడా కోర్టు అప్పట్లో సూచించింది. అయితే ఆదేశాలు ఉన్నప్పటికీ, ఏప్రిల్ 9న మల్లికార్జున అనే వ్యక్తి బైక్‌ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిని కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘనగా పేర్కొంటూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ తరఫున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ ట్రాఫిక్ పోలీసులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదని,M-Walletలో RC చూపించినా అంగీకరించడం లేదని, చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయనే కారణంతో వాహనాలు సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేసిన హైకోర్టు, తమ కౌంటర్ అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. కేసు తదుపరి విచారణను వచ్చే నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా ట్రాఫిక్ చలాన్లు, వాహనాల సీజ్ వ్యవహారంపై కీలక ప్రభావం చూపే అవకాశముందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి

Publish Date: May 1, 2026 10:10PM

political-news-img

ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. తమ సమస్యల పరిష్కారం కోసం సీఎం చొరవ చూపినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీలు వేమ నరేందర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ముఖ్య కార్యదర్శి శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, ఎమ్మెల్యేలు మక్కన్ సింగ్ ఠాగూర్, కుంభం అనిల్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో పలు ఆర్టీసీ కార్మిక సంఘాలు పాల్గొన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు: ఆర్టీసీ సంస్థ అభివృద్ధి, మనుగడ, గౌరవాన్ని పెంపొందిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ముందుకు వచ్చినందుకు కార్మిక సంఘాలను సీఎం అభినందించారు.“నేను వేరు – మీరు వేరు అనే భావన నాకు లేదు. అందరం కలిసే ప్రభుత్వం,” అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఆర్టీసీ కార్మికులు కోరుకున్నారని, వారి పోరాటాల్లో తాము ఎప్పుడూ తోడుగా ఉన్నామని అన్నారు. ఆర్టీసీలో బస్సులు, నియామకాలు, ఆదాయం పెరిగాయని తెలిపారు. కార్మికుల కృషి వల్లే ఆర్టీసీ దేశంలో ప్రముఖ సంస్థగా నిలిచిందని కొనియాడారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి బస్ టర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. వెయ్యి ఈవీ బస్సులను కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేస్తున్నామని, మినీ బస్సులు కూడా ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని చెప్పారు. ప్రతి సంవత్సరం డీజిల్‌పై సుమారు రూ. 2000 కోట్లు ఖర్చవుతున్నాయని, ఆ భారాన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులపై దృష్టి పెట్టామని వివరించారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమని పేర్కొన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ ప్రభుత్వ కాలానికి చెందినవి కాకపోయినా, వాటిని తీర్చేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను చేపట్టామని చెప్పారు. ఆర్టీసీ సమస్యలు తన దృష్టికి వస్తే వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పీఆర్‌సీ వంటి అంశాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. రాజకీయ ప్రభావాలకు లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు. ఆర్టీసీ అప్పులపై వడ్డీ భారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని కోరారు. ఒక డ్రైవర్‌ను కూడా తగ్గించబోమని స్పష్టం చేశారు. మహాలక్ష్మీ పథకం ద్వారా రూ. 8 వేల కోట్లు ఆర్టీసీకి అందించామని తెలిపారు. సంస్థ అభివృద్ధి కార్మికుల చేతుల్లోనే ఉందని, డిపో మేనేజర్లతో స్నేహపూర్వక వాతావరణం ఉండాలని అధికారులకు సూచించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కృషి చేస్తున్నామని, ఈసారి రూ. 1000 కోట్ల బకాయిలు విడుదల చేశామని తెలిపారు. ఆర్టీసీ సమస్యలను శాతం 100 పరిష్కరిస్తామని హామీ ఇస్తూ, కార్మికుల వెంట ప్రభుత్వం ఉంటుందని చెప్పారు.“సంస్థ ఆగిపోతే అది ఊపిరి ఆగినట్లే. సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేయొద్దు,” అని సూచించారు.ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల హక్కులను కాపాడుతుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల మూడు రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలనీ, సమ్మె సమయంలో నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలనీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కార్మిక సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మూడు రోజుల వేతనాల చెల్లింపు, కేసుల ఎత్తివేతకు ముఖ్యమంత్రి అంగీకారం తెలిపారు. సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, కేసులను వెంటనే ఎత్తివేయడం కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో పాటు సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

Publish Date: May 1, 2026 9:19PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img