ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై హరీశ్ రావు ఆగ్రహం
Publish Date:Apr 16, 2026
Advertisement
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీశ్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది దశాబ్దాల పాటు సాగిన పోరాట ఫలితమని గుర్తు చేశారు. వేలాది మంది విద్యార్థులు, యువత, ఉద్యోగులు, సాధారణ ప్రజలు చేసిన త్యాగాల పునాది మీదే ఈ రాష్ట్రం ఏర్పడిందన్నారు. అలాంటి గొప్ప ఉద్యమాన్ని విద్వేషపూరిత విభజనతో పోల్చడం చరిత్రను అవమానించడమే కాకుండా అమరుల త్యాగాలను తక్కువ చేసి చూపడమేనని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని, దీనిని జీర్ణించుకోలేకపోవడమే బీజేపీ నేతల వ్యాఖ్యల్లో ప్రతిఫలిస్తోందని హరీశ్ రావు విమర్శించారు. బీజేపీ అధిష్టానం వెంటనే ఈ వ్యాఖ్యలను ఖండించి తమ అధికారిక వైఖరిని స్పష్టం చేయాలని, లేకపోతే ఇది పార్టీ ధోరణిగానే ప్రజలు భావిస్తారని హెచ్చరించారు.
http://www.teluguone.com/news/content/mp-tejasvi-surya-comments-36-217518.html





