ట్రంప్ టారిఫ్ వార్.. అమెరికాకు చుక్కలు చూపేలా మోడీ వ్యూహం!?
Publish Date:Aug 7, 2025
Advertisement
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పై సుంకాలతో విరుచుకుపడితే.. ప్రతిగా భారత్ పక్కా వ్యూహంతో ఆయన మెడలు వంచి దారికి తీసుకురావడానికి వ్యూహాలు రచిస్తోందా? అంటే మోడీ చైనా పర్యటన, అదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనలు చూస్తుంటే ఔననే సమాధానమే వస్తున్నది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లు నిలిపివేయకుంటే పన్నుల కొరడా ఝుళిపిస్తానంటూ భారత్ ను హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను కేవలం హచ్చరికలతో ఊరుకునే రకాన్ని కాననీ, చేసి చూసుతాననీ అదనంగా పాతిక శాతం సుంకాల విధింపు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేసి చూపించారు. దీంతో అప్రమత్తమైన ఇండియా.. ప్రతి వ్యూహాలతో సిద్ధమైంది. అమెరికాతో లక్ష కోట్లు విలువగల ఎఫ్-35 యుద్ధ విమానాలు కొనుగోలు ఒప్పందం నుంచి తప్పుకుంటామని ఇప్పటికే కౌంటర్ అటాక్ ఇచ్చింది. అక్కడితో ఆగకుండా అమెరికాకు వ్యతిరేకంగా మద్దతు కూడగట్టే పనిలో పడింది. ఇందులో భాగంగానే జాతీయ భద్రతా సలహాదారును రష్యా పర్యటనకు పంపింది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ ఈ నెల 31న రెండు రోజుల పర్యటన కోసం చైనా బయలుదేరుతున్నారు. పేరుకు అక్కడ జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనేందుకు అని చెబుతున్నా.. ఈ పర్యటనలో చైనా అధ్యక్షుడు జన్ పింగ్ తో భేటీకే అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. డోనాల్డ్ ట్రంప్ భారత్, రష్యా, చైనాలకు వ్యతిరేకంగా చేస్తున్న ట్రేడ్ వార్ కు దీటైన సమాధానం ఇచ్చే విషయంలో ఈ మూడు దేశాలూ ఉమ్మడిగా ముందుకు సాగడానికి నిర్ణయించుకున్నాయనడానికి అజిత్ దోవల్ రష్యా పర్యటన, మోడీ చైనా పర్యటనలు తార్కానమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ మూడు దేశాలూ చేతులు కలిపి ట్రంప్ ట్రేడ్ వార్ కు వ్యతిరేకంగా గట్టిగా నిలబడితే.. అమెరికాకు చుక్కలు కనిపించడం ఖాయమంటున్నారు. ఇదే వ్యూహంతో ప్రధాని మోడీ ట్రంప్పై ఒత్తిడి పెంచి సత్తా చాటేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/modi-with--strong-strtegy-against-trump--trade-war-39-203714.html





