ఫిలిప్పైన్స్ ను కుదిపేసిన భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Publish Date:Jun 8, 2026
Advertisement
ఫిలిప్పీన్స్ లో భారీ భూకంపం సంభవించింది. దక్షిణ ఫిలిప్పీన్స్ పరిధిలోని సముద్ర గర్భంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రత నమోదైన ఈ భూకంపం సోమవారం (జూన్8) ఉదయం 7:37 గంటలకు సంభవించింది. ఒక్క సారిగా భూమి తీవ్రంగా కంపించడంతో జనం భయంతో ఇళ్ల నుంచి రోడ్లపైకి పరుగులు తీశారు. సముద్ర గర్భంలో సంభవించిన భూకంపం కావడంతో అధికారులు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. దీంతో తీరప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఫిలిప్పీన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సీస్మాలజీ నివేదికల ప్రకారం, దేశంలోనే రెండవ అతిపెద్ద ద్వీపంగా గుర్తింపు పొందిన మిండనావోలోని సారంగాని ప్రావిన్స్లో ఈ భూప్రకంపనల తీవ్రతఎక్కువగా ఉంది. ఈ ప్రావిన్స్లోని మాసిమ్ పట్టణానికి నైరుతి దిశగా సుమారు 32 కిలోమీటర్ల దూరంలో, సముద్ర ఉపరితలం నుంచి 33 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇంత భారీ స్థాయిలో సముద్ర గర్భంలో పలకల కదలికలు సంభవించడంతో, సముద్ర అలలు భారీ ఎత్తున ఎగసిపడే ప్రమాదం ఉందని విశ్లేషించారు. ఫిలిప్పీన్స్లోని 9 కీలకమైన తీరప్రాంత ప్రావిన్సులకు రెడ్ అలర్ట్ తరహా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. తీరప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలు వెంటనే ఇళ్లను ఖాళీ చేసి, ఎత్తైన సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని విపత్తు నిర్వహణ ఆదేశాలు జారీ చేసింది. భూకంపం ధాటికి మిండనావో ప్రాంతంలో పలు వాణిజ్య, నివాస భవనాలుదెబ్బతిన్నాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
http://www.teluguone.com/news/content/massive-earthquake-rocks-the-philippines-36-222193.html





