కేసీఆర్ తప్పటడుగులు..టీఆర్ఎస్ లో అంతర్మథనం !
Publish Date:Jul 6, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కే. చంద్రశేఖర రావు, దటీజ్ కేసీఆర్, మహా మేథావి. చాలా తెలివైన రాజకీయ నాయకుడు. అంతకంటే గొప్ప రాజకీయ వ్యూహకర్త. ఎంతటి రాజకీయ ఉద్దండులనైనా ఆయన ఇట్టే బుట్టలో వేసుకోగలరు. అంతేకాదు, ఎంతటివారినైనా అంతే తేలిగ్గా తీసి కరివేపాకులో కలిపేయనూ గలరు. ఇన్నెందుకు ఆయన ఘటనా ఘటన సమర్ధుడు. ఆయన రాజకీయ, విజ్ఞత, వివేచన మీద ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర లేదు. అవును. ఒక్క తప్పటడుగు, ఒకే ఒక్క తప్పటడుగు, అయన వ్యక్తిగత ఇమేజ్’నే కాదు, పార్టీ ఇమేజ్’ని ప్రభుత్వం ఇమేజ్’ని చివరకు రాష్ట్ర ఇమేజ్’ని కూడా డ్యామేజి చేసింది. ఒక తప్పు చేస్తే, ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు వెంట తప్పు, తప్పు మీద తప్పు చేయక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొనక తప్పుదు. కేసీఆర్ విషయంలో అదే జరిగింది. అదే జరుగుతోందని అంటున్నారు. నిజానికి, తెరాస పతనానికి 2014 లోనే తొలి బీజం పడింది. అసెంబ్లీ ఫలితాలు వచ్చిన కొద్ది గంటల్లోనే కేసీఆర్, చాలా స్పష్టమైన విధాన ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి.... తెరాస ఇక ఎంత మాత్రం ఉద్యమ పార్టీ కాదని ప్రకటించారు.అంటే తెరాస జీవనాడిని చిదిమేశారు. అయన తమ తప్పు లేకుండా ఇంకో చక్కని మాట కూడా సెలవిచ్చారు. ఇక పై తెరాస ఫక్తు పదహారణాల రాజకీయ పార్టీ అని, ఎలాంటి అనుమానాలకు ఆస్కారంలేని విధంగా ‘క్లియర్ కట్’గా కుండ బద్దలు కొట్టారు. ఇక ఆ తర్వాత ఏమి జరిగిందనేది, చరిత్ర. రాజకీయ పునరేకీకరణ పేరిట, ఒక్క బీజేపీ మినహా మిగిలిన పార్టీల ఎమ్మెల్యేలను ఎగరేసుకు పోయారు. దీంతో, రాష్ట్రంలో ఇక తెరాసకు తిరుగేలేదనే అభిప్రాయం బలపcrపోయింది. ఎనిమిదేళ్ళలో పదహారణాల రాజకీయ పార్టీ, ఇంచక్కా ఫోర్ ప్లస్ వన్ ఫ్యామిలీ పార్టీగా మారిపోయింది. ఇక ఆ తర్వాత సహజంగానే కుటుంబ పార్టీలకు అనివార్యంగా ఉండే, కుటుంబ, వారసత్వ కలహాలు, అవినీతి ఇత్యాదులన్నీ వచ్చి చేరాయి. అయినా, తెలంగాణ ప్రజలు 2018లో తెరాసకు మరో అవకాశం ఇచ్చారు. చంద్రబాబును బూచిగా చూపించి సెంటిమెంట్’ను రెచ్చగొట్టి ఆ ఎన్నికలలో విజయం సాధించారు. అదొక అధ్యాయం అనుకుంటే, 2018లో జరిగిన ముందస్తు ఎన్నికలలో కేసీఆర్ నాయకత్వంలోనే తెరాస గెలిచినా గడచిన మూడున్నర నాలుగు సంవత్సరాలలో ఇటు పార్టీ పైన అటు ప్రభుత్వం పైనా ఆయన పట్టు తప్పింది. ఇందుకు ప్రధానంగా కుటుంబ, వారసత్వ వివాదాలే కారణంగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా కుటుంబంలో ‘కేటీఆర్’ను తక్షణం ముఖ్యమంత్రిని చేయాలనే వత్తిడి పెరుగుతోందని, అందుకే ముఖ్యమంత్రి తీవ్ర వత్తిడికి గురవుతున్నారాణి, కల్వకుట్ల ఫ్యామిలీ క్లోజ్ సర్కిల్స్ మీడియా సాక్షిగా బయట పెడుతున్నారు.ఈ వత్తిడి నేపధ్యంగానే ముఖ్యమంత్రి అనూహ్యంగా తప్పదు నిర్ణయాలు తీసుకుంటున్నారని అంటున్నారు. అలాగే, 2014లో ఉద్యమ పార్టీ కాదని ప్రకటించడం వ్యూహాత్మక తప్పిదం అయితే, ఇప్పడు అందుకు కొనసాగింపుగా కుటుంబ పాలనను ఎస్టాబ్లిష్ చేసేందుకు, ఈటల రాజేదంర్’ పై వేటు వేయడంతో మొదలైన తప్పటడుగులు,ఇంకా ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఆయన ఎప్పుడు, ఎందుకు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనతో సహా ఎవరికీ తెలియదు, కానీ, ఆయన నోటి నంచి వచ్చిన మాట రాజకీయ తుపాను సృష్టిస్తుంది. అలాగే, రాష్ట్ర రాజకీయాలలో ఆయనకు సమ ఉజ్జీగా నిలిచే నాయకుడు మరొకరు లేరు. రాష్ట్ర విభజన తర్వాత ఆయన కంటే సీనియర్ నాయకులు ఉన్నా, ఉద్యమ నేతగా జనం ఆయన్ని ఎత్తు కుర్చీ ఎక్కించారు. సో.. ఆయనే టాలెస్ట్ లీడర్’గా చలామణి అవుతున్నారు. కానీ, అన్ని రోజులలో ఒకలా ఉండవు.నిజమే.నిన్నమొన్నటిదాకా, ఆయన తిరుగలేని నాయకుడే, అందులో అనుమానం లేదు, అతిశయోక్తి అసలే లేదు. ఒక సంవత్సరం క్రితం వరకు కేసీఆర్ గురించి చాలా మందికి ఉన్న అభిప్రాయం ఇదే. స్వపక్షీయులే కాదు, ప్రత్యర్ధులు కూడా అదే అనుకున్నారు. ఆయనను ఢీ’ కొనడం అయ్యే పని కాదనే నిర్ణయానికి వచ్చారు.అయితే అది నిన్నటి మాట.ఈరోజు పరిస్థితి అది కాదు. ఒక విధంగా ప్రస్తుతం అయన పరిస్థితి ఇంటా బయట ఒకేలా ఉందని అంటున్నారు. అంతేకాదు, ఆయనకు అడుగడుగునా అవరోధాలు, అవమానలే ఎదురవు తున్నాయని వాళ్ళు వీళ్ళు కాదు తెరాస నాయకులే అంటున్నారు. చెవులు కొరుక్కుంటున్నారు.
http://www.teluguone.com/news/content/kcr-wrong-steps-dissatisfaction-in-trs-39-139155.html