వ్యూహం మార్చిన కేసీఆర్.. జాతీయ మీడియాలో పబ్లిసిటీతో హంగామా!
Publish Date:May 13, 2022
Advertisement
ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది నానుడి. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంట గెలిచేశానని భావించి ఇప్పుడు రచ్చ గెలవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు. జాతీయ మీడియాలో ప్రకటనల ద్వారా తెలంగాణ అభివృద్ధి అమోఘమని ఊదరగొట్టేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు జాతీయ రాజకీయాలపై మక్కువ రోజు రోజుకూ పెరుగుతోందే కానీ తగ్గడం లేదు. ఒక ప్రాంతీయ పార్టీ నేతగా జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పడం అంత సులువేం కాదు. కేంద్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలి. జాతీయ పార్టీల కంటే ఆ కూటమిలో ప్రాంతీయ పార్టీలకే ఎక్కువ మంది ఎంపీలుండాలి. అప్పుడు అలా ఎక్కువ మంది ఎంపీలున్న ప్రాంతీయ పార్టీ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్ప గలుగుతుంది. గతంలో తెలుగుదేశం అలాగే తిప్ప గలిగింది. అప్పట్లో పార్లమెంటులో అత్యధిక సభ్యులున్న పార్టీగా తెలుగుదేశం అవతరించడంతోనే వాజ్ పేయ్ హయాంలో జాతీయ రాజకీయాలలో చంద్రబాబు చక్రం తిప్ప గలిగారు. అంతకు ముందు కూడా తెలుగుదేశం నేషనల్ ఫ్రంట్ లో కీలక పాత్ర పోషించగలిగింది. నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ గా చంద్రబాబు ప్రధాన మంత్రులను నిర్ణయించగలిగారు. మరి వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేసీఆర్ కు అటువంటి అవకాశం వస్తుందా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఎందుకంటే.. జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెసేతర కూటమి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో కొంత కాలం మౌనంగా ఉన్న ఆయన జాతీయ అజెండా అంటూ మరో ప్రతిపాదనతో ముందుకు వచ్చినా అది కూడా ముందుకు కదల లేదు. ఆ తరువాత మౌనంగా ఉండిపోయిన కేసీఆర్ జాతీయ రాజకీయాలలో తన ముద్ర వేయడం కోసం కొత్త వ్యూహం రూపొందించారని పరిశీలకులు అంటున్నారు. దేశ వ్యాప్తంగా తెలంగాణ అభివృద్ధిని నమూనాగా ప్రజంట్ చేయడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు పొందేందుకు ఆయన పథక రచన చేశారంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు..జాతీయ మీడియాలో తెలంగాణ అభివృద్ధిపై పెద్ద ఎత్తున తెలంగాణ సాధించిన ప్రగతిపై డాక్యుమెంటరీల ప్రసారం. ఇందు కోసం భారీ వ్యయంతో స్లాట్ లు కొని మరీ ప్రసారం చేయిస్తున్నారు. ఆ డాక్యుమెంటరీలలో తెలంగాణ అభివృద్ధి కర్త, క్రియ, కర్మ అన్నీ కేసీఆర్ అన్న బిల్డప్ ఇస్తున్నారు. ఆ డాక్యుమెంటరీలలో ఆవిర్భవించిన ఎనిమిదేళ్లలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంలో తెలంగాణ ఎదుగుదలకు కేసీఆర్ దక్షత, సామర్థ్యం, దార్శనికతే కారణమని, ఈ స్థాయిలో దేశం ప్రగతి సాధించలేకపోవడానికి కారణం అటువంటి దక్షత, సమర్ధత, దార్శనికత ఉన్న నాయకత్వం లేకపోవడమేనని చెప్పకనే చెబుతున్నారు. జాతీయ మీడియాలో భారీ స్థాయిలో ఈ డాక్యుమెంటరీల ప్రసారంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఖజానాను తన సొంత ప్రయోజనాల కోసం కేసీఆర్ ఖాళీ చేస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్ లు విమర్శలు గుప్పిస్తున్నాయి. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఈ డాక్యుమెంటరీలపై చర్చ ప్రారంభమైంది. తెలంగాణ అభివృద్ధిపై జాతీయ స్థాయిలో ఈ పబ్లిసిటీ ఏమిటన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. తన సారథ్యంలో తెలంగాణ దేశానికే దిక్సూచి అనదగ్గ అభివృద్ధి సాధించిందని చాటుకోవడమే కేసీఆర్ చేసుకుంటున్న ఈ పబ్లిసిటీ ఉద్దేశమనీ, ఆ తరువాత తాను జాతీయ స్థాయి రాజకీయాలలోనికి సక్సెస్ ఫుల్ గా ఎంట్రీ ఇచ్చుందుకు మార్గం సుగమమౌతుందన్నది కేసీఆర్ భావనగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇటీవలి తెరాస ప్లీనరీలో జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపేందుకు అవసరమైన నిధులను సమీకరించినట్లు కేసీఆర్ ప్రకటించడాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు.అంతే కాకుండా ఇటీవల కేసీఆర్ పలు రాష్ట్రాల పర్యటన సందర్భంగా ఆయా రాష్ట్రాలలో దేశ్ కీ నేతా కేసీఆర్ అన్న హోర్డింగ్ లు దర్శనమివ్వడం వెనుక కూడా ఇదే వ్యూహం ఉందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్ కూటమి, ఫ్రంట్ అంటే చేసిన ప్రయత్నాలకు ఇతర రాష్ట్రాలలోని బీజేపీయేతర, కాంగ్రెసేతర పార్టీల నుంచి పెద్దగా స్పందన రాకపోవడాన్ని బట్టి చూస్తే ఈ పబ్లిసిటీ వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా జాతీయ స్థాయిలో విపరీతంగా చేసుకుంటున్న పబ్లిసిటీ వల్ల రాష్ట్రంలో ప్రతికూలత పెరిగే అవకాశం కూడా ఉంటుందని తెరాస వర్గాలలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా, ఎవరు ఔనన్నా కాదన్నా.. జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పటమే లక్ష్యంగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో తాను ఏం చేశానో చెప్పిన తర్వాత కేసీఆర్ నార్త్ లో అడుగు పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు. ఇటీవల ప్లీనరీలో జాతీయ రాజకీయానికి కావాల్సినంత డబ్బులు కూడా సమీకరించానని ప్రకటించారు. అందుకే ప్రకటనలు పెద్ద ఎత్తున ఇస్తున్నారని అంటున్నారు. అయితే ఇలాంటి ప్రచారంతోనే కేసీఆర్ ఉత్తారదికి నాయకుడిగా వెళ్లగలరా అన్నది డౌటే. ఇటీవల కేసీఆర్ చాలా రాష్ట్రాలకు వెళ్లారు. వెళ్లిన చోటల్లా.. దేశ్ కీ నేత అనే ప్రచారం చేసుకున్నారు. ఆయన ప్రయత్నం ఈ ప్రచార వ్యూహంతో అయినా ఫలిస్తుందో లేదో.. రెండు, మూడు నెలల్లో తేలిపోయే అవకాశం ఉంది
http://www.teluguone.com/news/content/kcr-changes-stratagy-with-publicity-in-national-media-39-135818.html





