Top Stories

dummy

political-news-img

పాక్ బరితెగింపు... కోల్‌కతా వరకు వస్తామంటూ హెచ్చరిక!

పొరుగు దేశం పాకిస్థాన్ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి కనీసం తిండికి గతిలేని స్థితిలో ఉన్నప్పటికీ, భారత్‌పై విషం కక్కడంలో మాత్రం ఆ దేశ నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. భారత్ ఏదైనా 'ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్'కు (కృత్రిమంగా సృష్టించిన దాడి) పాల్పడితే, తాము ఏకంగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా వరకు వచ్చి ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ అత్యుత్సాహంతో వ్యాఖ్యానించారు. సియాల్‌కోట్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడుతూ భారత్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెంచేలా ఎటువంటి ఆధారాలు లేకుండానే ఢిల్లీపై నిందలు వేశారు. భారత్ తన ఏజెంట్లతో ఏదైనా నాటకీయ దాడిని సృష్టించి, దాన్ని పాకిస్థాన్‌పై నెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ఒకవేళ భారత్ ఏదైనా దుశ్చర్యకు ప్రయత్నిస్తే, దేవుడి దయతో తాము కోల్‌కతా వరకు వెళ్తామంటూ బీరాలు పలికారు. గతంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదులకు ఇచ్చిన హెచ్చరికలకు స్పందనగా పాక్ రక్షణ మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. పాకిస్థాన్ స్పందన చాలా వేగంగా, నిర్ణయాత్మకంగా ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే పాక్ నేతలు ఇలాంటి ప్రగల్భాలు పలకడం ఇదేం మొదటిసారి కాదు. గత ఏడాది ఆగస్టులో కూడా పాక్ సైన్యం భారత్‌లోకి లోతుగా చొచ్చుకొస్తామని ఇలాంటి వ్యాఖ్యలే చేసింది. మరోవైపు, పాక్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సైతం భారత్‌పై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అమెరికా ఒకవేళ పాకిస్థాన్ అణు ఆయుధాలను లక్ష్యంగా చేసుకుంటే, తాము భారత్‌లోని ముంబై, న్యూఢిల్లీ వంటి ప్రధాన నగరాలపై దాడులు చేయాలని ఆయన సూచించారు. ఎవరైనా తమపై కన్నెత్తి చూస్తే సంకోచం లేకుండా భారత నగరాలపై విరుచుకుపడతామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పాక్ నాయకత్వంలోని వికృత ఆలోచనలకు అద్దం పడుతున్నాయి. వాస్తవానికి గత ఏడాది పహల్‌గామ్‌లో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పర్యాటకులపై జరిపిన దాడితో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. దీనికి ప్రతిగా భారత్ 'ఆపరేషన్ సింధూర్'ను చేపట్టి ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. అప్పట్లో భారత సైన్యం ధాటికి తట్టుకోలేక కాల్పుల విరమణ కోరుతూ ఇస్లామాబాద్ మోకాళ్లపైకి వచ్చింది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ శాంతిని కోరుకుంటున్నట్లు నటించడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి చేసిన ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. భారత్ ఇప్పటికే పలుమార్లు హెచ్చరించినట్లుగా, సరిహద్దుల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా దానికి పాక్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని విశ్లేషకులు భావిస్తున్నారు. మున్ముందు ఈ వ్యాఖ్యలపై భారత విదేశాంగ శాఖ గట్టిగా స్పందించే అవకాశం ఉంది. పొరుగు దేశపు నేతల ఇటువంటి బాధ్యతారహితమైన ప్రకటనలు ఉగ్రవాద మూలాలను మరింత పెంచేలా ఉన్నాయని భారత్ భావిస్తోంది. అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌ను మరోసారి ఏకాకిని చేసే దిశగా భారత్ అడుగులు వేసే అవకాశం కనిపిస్తోంది.

Publish Date: Apr 6, 2026 11:04PM

political-news-img

రైతులతో నేరుగా మాట్లాడిన చంద్రబాబు…ఆధునిక వ్యవసాయంపై ఆరా

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికి సమీపంలో ఉన్న పెండేకల్ రిజర్వాయర్ వద్ద క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులతో నేరుగా మాట్లాడారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు, వ్యవసాయ కూలీలతో ముఖాముఖి నిర్వహించి, బిందు సేద్యం, ప్రకృతి వ్యవసాయం, పీఎండీఎస్, ఉపాధి హామీ వంటి పలు అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. రిజర్వాయర్ పరిధిలో సాగునీటి అవసరాలు, అనుసరిస్తున్న సాగు విధానాలపై రైతులు నీలం శ్రీనివాసరెడ్డి, లక్కు శ్యామలతో సీఎం చర్చించారు. బిందు సేద్యం (డ్రిప్ ఇరిగేషన్) ద్వారా కలుగుతున్న ప్రయోజనాల గురించి పరిమి చరణ్ కుమార్, పాపసాని ముని యుగంధర్ వివరించారు. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై అందిస్తున్నట్లు వారు సీఎంకు తెలిపారు. ‘ప్రీమాన్ సూన్ డ్రై సోయింగ్’ విధానం ద్వారా సాగు చేయడం వల్ల పెట్టుబడి ఖర్చులు గణనీయంగా తగ్గుతున్నాయని రైతులు హరికృష్ణ, దేవి వివరించారు. అలాగే, అర్ధచంద్రాకార గుంతల విధానం ద్వారా నేల సారవంతం పెరిగి, మంచి దిగుబడులు వస్తున్నాయని మహిళా రైతులు నందిని, ప్రమీలమ్మ తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలు తీరు, ఆధునిక సాగు పద్ధతుల ప్రభావంపై సీఎం ఆరా తీశారు. రైతుల అభిప్రాయాలను తెలుసుకుంటూ, వ్యవసాయంలో సాంకేతికత వినియోగాన్ని మరింత విస్తరించాలని సూచించారు.

Publish Date: Apr 6, 2026 10:38PM

political-news-img

ద్వైపాక్షిక చర్చలలో భారత్‌కు మరింత చమురు, సహజ వాయువు సరఫరా చేయడానికి ముందుకొచ్చిన రష్యా

2026 ప్రారంభం నాటికి, భారత్-రష్యా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యంలో సుమారు 96% వాణిజ్యం, అమెరికా డాలర్‌ను గణనీయంగా అధిగమించి, జాతీయ కరెన్సీలైన భారత రూపాయి, రష్యన్ రూబుల్ లలోనే జరుగుతోంది. చమురు ప్రవాహాలు దాదాపు రికార్డు స్థాయికి చేరడంతో, భారత్ రష్యాతో సంబంధాలను పునరుద్ధరించుకుంది * మార్చి నెలలో భారత్, రష్యా ముడి చమురు వినియోగాన్ని నెలవారీగా రెట్టింపు కంటే ఎక్కువగా పెంచుకుని రోజుకు 2.1 మిలియన్ బ్యారెళ్లకు చేర్చింది. తద్వారా గతంలో నిలిచిపోయిన బ్యారెళ్లను వేగంగా వినియోగించుకుంది. * భారత కొనుగోళ్లు రెట్టింపు అవ్వడం చూస్తే, రష్యా ముడి చమురుపై చైనా వినియోగం తగ్గిందని అనిపించవచ్చు. * మార్చి నెలలో రష్యా ముడి చమురు కొనుగోలుకు ఆత్రుత చూపిన దేశాలు భారత్, చైనా మాత్రమే కాదు. * మాస్కో ఆసియా వ్యాప్తంగా తన వినియోగదారుల సంఖ్యను నిశ్శబ్దంగా విస్తరించుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత్‌ను రష్యాకు 'రెండో ఇల్లు'గా అభివర్ణిస్తూ, ఇరు దేశాల మధ్య ఉన్న గాఢమైన, కాలపరీక్షకు నిలిచిన స్నేహాన్ని, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నొక్కి చెప్పారు. ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా తలెత్తిన చమురు సంక్షోభం, సరఫరా గొలుసు అంతరాయాల మధ్య, తమ ఇంధన సంస్థలకు భారత్‌కు చమురు, ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) సరఫరాను 'క్రమంగా పెంచే' సామర్థ్యం ఉందని, అలాగే భారత ఎరువుల అవసరాలను కూడా 'నిర్వహిస్తూ' తీర్చగలమని రష్యా హామీ ఇచ్చింది. ◆ రష్యా మొదటి ఉప ప్రధానమంత్రి డెనిస్ మాంటురోవ్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీల మధ్య జరిగిన చర్చల్లో ఇంధన సహకారం ఒక కీలక భాగంగా నిలిచింది. ◆ పర్షియన్ గల్ఫ్ మరియు గల్ఫ్ ఆఫ్ ఒమన్ మధ్య కీలకమైన కారిడార్ అయిన హోర్ముజ్ జలసంధి ద్వారా ముడి చమురు మరియు గ్యాస్ రవాణాలో అంతరాయాలు ఏర్పడిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి. ప్రపంచ చమురు మరియు ఎల్ఎన్జి ఎగుమతులలో సుమారు 20% ఈ జలసంధి ద్వారానే జరుగుతాయి. భారతదేశం తన ఇంధన అవసరాలలో గణనీయమైన భాగాన్ని మధ్యప్రాచ్యం నుండి పొందుతుంది. ◆ ఈ అంతరాయం గ్యాస్ రంగాన్ని మరింత తీవ్రంగా దెబ్బతీసింది, ఎందుకంటే భారతదేశం తన ఎల్పిజి వినియోగంలో 60% పైగా దిగుమతి చేసుకుంటుంది మరియు అందులో దాదాపు 90% హోర్ముజ్ జలసంధి ద్వారానే వస్తుంది. ◆ సంఘర్షణ ప్రారంభమైనప్పటి నుండి, సరఫరా అంతరాయాల నుండి వినియోగదారులను కాపాడటానికి ప్రభుత్వం దేశంలోని అన్ని రిఫైనరీలలో 100% పైగా ఉత్పత్తి సామర్థ్య కార్యకలాపాలను నిర్ధారించింది మరియు చమురు, గ్యాస్ వనరులను కూడా వైవిధ్యపరిచింది. ◆ మాంటురోవ్ మరియు జైశంకర్ సహ-అధ్యక్షత వహించిన భారత్-రష్యా వాణిజ్య, ఆర్థిక, శాస్త్రీయ, సాంకేతిక మరియు సాంస్కృతిక సహకార అంతర్-ప్రభుత్వ కమిషన్ ( సమావేశంలో, ఇరుపక్షాలు ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు మరియు పారిశ్రామిక సహకారాన్ని విస్తరించడంపై చర్చించాయి. ◆ ఎరువుల విషయంలో రష్యా మద్దతును కూడా మాంటురోవ్ ప్రముఖంగా ప్రస్తావించారు. 2025 చివరి నాటికి భారతదేశానికి ఎరువుల సరఫరా 40% పెరిగిందని, భారతదేశ అవసరాలను తీర్చడానికి మరిన్ని సరఫరాలు ప్రణాళిక చేయబడ్డాయని ఆయన పేర్కొన్నారు. 2025 డిసెంబర్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారతదేశాన్ని సందర్శించినప్పుడు జరిగిన 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశం యొక్క ఫలితాల అమలులో పురోగతిని కూడా ఈ చర్చలు సమీక్షించాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మరియు 2030 నాటికి వార్షిక ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు పెంచడానికి ఆ శిఖరాగ్ర సమావేశం ఒక ఐదేళ్ల రోడ్‌మ్యాప్‌ను ఆవిష్కరించింది. సంకలనం, సేకరణ: కంఠంనేని సీతారాం

Publish Date: Apr 6, 2026 10:23PM

political-news-img

ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ కోసం భారీ క్యూలైన్ ఎక్కడంటే?

నల్గొండ జిల్లా కేంద్రంలోని బొట్టుగూడలో ఉన్న కోమటిరెడ్డి ప్రతీక్ ఉన్నత పాఠశాల వద్ద ఈరోజు సోమవారం ఉదయం అరుదైన దృశ్యం కనిపించింది. ఫ్యాన్ ఇండియా సినిమా టికెట్ల కోసమే ఎగబడుతున్న జనం అనుకుంటున్నారా కాదండోయ్ తమ పిల్లలకు అడ్మిషన్ కోసం తల్లిదండ్రులు భారీ సంఖ్యలో తరలివచ్చి పాఠశాల గేటు ముందు తెల్లవారుజాము నుంచే క్యూలైన్ కట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం పెరుగుతున్నదానికి ఈ ఘటన నిదర్శనంగా నిలిచింది. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా, పోటీగా మారిన ఈ పాఠశాలపై జిల్లా ప్రజలతో పాటు ఇతర జిల్లాల తల్లిదండ్రుల నుంచి కూడా విశేష స్పందన లభిస్తోంది. ఈ పాఠశాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన స్వంత నిధులతో అభివృద్ధి చేశారు. ఆధునిక సదుపాయాలతో రూపుదిద్దుకున్న ఈ విద్యా మందిరంలో స్మార్ట్ క్లాసులు, ఏఐ ఆధారిత బోధన, డిజిటల్ ల్యాబ్స్ ఏర్పాటు చేశారు. విద్యార్థులకు పోషకాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించ డంతో పాటు విశాలమైన క్రీడా మైదానాన్ని కూడా అందుబాటులో ఉంచారు. చదువుతో పాటు క్రీడలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం ఈ పాఠశాల ప్రత్యేకతగా మారింది. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు అందిస్తున్న నాణ్యమైన బోధనతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది పడుతుందని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. ఈ పాఠశాల పేరు ప్రతిష్ఠలు పెరగడంతో నల్గొండ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు రావడం ప్రారంభమయ్యాయి. అయితే ఈ స్కూల్లో సీట్లు పరిమితంగా ఉండటంతో అడ్మిషన్ల కోసం పోటీ తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలోనే వివిధ జిల్లాల నుండి వచ్చిన తల్లిదండ్రులు ఈరోజు సోమవారం తెల్లవారుజామునుండే పాఠశాల గేటు ముందు క్యూలు కట్టారు...ప్రభుత్వ విద్యలో కొత్త దశకు నాంది పలుకుతున్న ఈ పాఠశాలపై ప్రజలు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

Publish Date: Apr 6, 2026 10:17PM

political-news-img

9 మంది పోలీసులకు ఉరిశిక్ష... మధురై కోర్టు షాకింగ్ తీర్పు

తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన సాతాంకుళం కస్టడీ డెత్ కేసులో కోర్టు సంచలనమైన తీర్పు వెలువడింది. తండ్రి–కుమారులపై జరిగిన దారుణ హింసపై విచారణ పూర్తి చేసిన మదురై కోర్టు 9 మంది తమిళనాడు పోలీసులకు మరణశిక్ష విధిస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీస్తూ పోలీసు వ్యవస్థకు గట్టి హెచ్చరికగా మారింది. 2020లో కరోనా లాక్‌డౌన్ నడుస్తున్న సమయంలో సాతాంకుళంలో మొబైల్ షాప్ నడిపినందుకు వ్యాపారి జయరాజ్ మరియు ఆయన కుమారుడు బెనిక్స్ను పోలీసులు అరెస్టు చేశారు. అనుమతించిన సమయానికి మించి దుకాణం తెరిచి ఉంచారనే ఆరోపణలతో వారిని స్టేషన్‌కు తరలించారు. అయితే పోలీసుల కస్టడీలో ఉన్న సమయంలో తండ్రి–కుమారులు తీవ్ర హింసకు గురై ప్రాణాలు కోల్పోయిన విషయం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగింది. తరువాత వారిపై నమోదైన ఆరోపణలు అసత్య మని బయటపడటం ఘటనను మరింత సంచలనంగా మార్చింది. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంఘాలు, ప్రజలు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి అప్పగించారు. సీబీఐ దర్యాప్తు అనంతరం పలువురు పోలీసులపై హత్య, కస్టడీ టార్చర్ కేసులు నమోదు చేసి కోర్టులో దీర్ఘకాల విచారణ కొనసాగింది. పూర్తిస్థాయి విచారణ అనంతరం నిందితులపై హత్య ఆరోపణలు నిరూపితమయ్యాయని కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలోనే కోర్టు 9 మంది పోలీసులకు మరణశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. న్యాయమూర్తి ముత్తుకుమార్ ఈ ఘటనను “అరుదైన కేసులలోకెల్లా అరుదైనది”గా పేర్కొన్నారు. ప్రధాన నిందితుడైన ఇన్‌స్పెక్టర్ శ్రీధర్కు రెండు శిక్షలు విధించారు. ఏడేళ్ల జైలు శిక్షతో పాటు మరణశిక్ష, 84.1 లక్షల జరిమానా విధించారు. ఇతర నిందితులందరినీ సమానంగా బాధ్యులుగా పరిగణించారు. ఈ తీర్పు దేశంలో పోలీసు దుర్వినియోగం, మానవ హక్కుల పరిరక్షణపై మరోసారి పెద్ద చర్చకు తెరలేపింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిపుణులు కూడా పోలీసు సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడు తున్నారు. సాతాంకుళం కేసులో వెలువడిన ఈ తీర్పు దేశ న్యాయవ్యవస్థ చరిత్రలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

Publish Date: Apr 6, 2026 10:02PM

political-news-img

అమెరికాలో భారతీయ ట్రక్కు డ్రైవర్లకు బిగ్ షాక్

అమెరికాలో స్థిరపడి, ట్రక్కు డ్రైవింగ్‌ను వృత్తిగా ఎంచుకున్న వేలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం కోలుకోలేని షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఇండియానా రాష్ట్రంలో అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనల కారణంగా వందలాది మంది కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు రద్దు అయ్యాయి. ఏప్రిల్ 1, 2026 నుంచి ఈ కొత్త చట్టం అమల్లోకి రావడంతో, భారతీయ సంతతికి చెందిన డ్రైవర్లు, ప్రధానంగా పంజాబీ సిక్కుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.ఇండియానా బ్యూరో ఆఫ్ మోటార్ వెహికల్స్ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. సుమారు 1,790 మంది నాన్-డోమిసిల్డ్ కమర్షియల్ లైసెన్సులను రద్దు చేశారు. 'హౌస్ ఎన్‌రోల్డ్ యాక్ట్ 1200' అనే కొత్త చట్టం కింద ఈ చర్యలు తీసుకున్నారు. దీని ప్రకారం, కేవలం హెచ్-2ఏ (వ్యవసాయ కార్మికులు), హెచ్-2బి (తాత్కాలిక కార్మికులు), మరియు ఈ-2 (పెట్టుబడిదారులు) వీసా కేటగిరీలకు చెందిన వారికి మాత్రమే ఈ లైసెన్సులు పరిమితం చేశారు. గతంలో వర్క్ పర్మిట్ ఉన్న ఎవరికైనా లైసెన్సులు ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఆ నిబంధనను కఠినతరం చేశారు.ఈ పరిణామం వల్ల సుదీర్ఘకాలంగా అమెరికా రోడ్లపై భారీ వాహనాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న పంజాబీ సిక్కులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలోని రవాణా రంగంలో భారతీయుల పాత్ర కీలకం. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు సరుకు రవాణా చేసే లాంగ్-హాల్ డ్రైవర్లలో అత్యధికులు మనవారే. ఇప్పుడు లైసెన్సులు రద్దు కావడంతో వారు కేవలం సాధారణ కార్లు నడుపుకునే 'రెగ్యులర్ లైసెన్స్'కు పరిమితం కావాల్సి వస్తోంది. భద్రతా కారణాల దృష్ట్యానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా అధికారులు సమర్థించుకుంటున్నారు. గతంలో జరిగిన కొన్ని ఘోర రోడ్డు ప్రమాదాల్లో విదేశీ డ్రైవర్ల ప్రమేయం ఉండటం, వారికి సరైన ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకపోవడం వంటి అంశాలను సాకుగా చూపుతున్నారు. ఫెడరల్ మోటార్ క్యారియర్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ నిబంధనలు మార్చినట్లు తెలుస్తోంది.మరోవైపు, ఈ నిర్ణయం పట్ల డ్రైవర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికాలో ట్రక్కు డ్రైవర్ల కొరత తీవ్రంగా ఉందని, ఇలాంటి కఠిన నిబంధనల వల్ల సరఫరా గొలుసు దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం క్లెరికల్ పొరపాట్లు లేదా వీసా నిబంధనల సాకుతో ఏళ్ల తరబడి పనిచేస్తున్న వారి పొట్ట కొట్టడం సరికాదని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతానికి ఇండియానాలో మొదలైన ఈ రద్దుల పర్వం, ఇతర రాష్ట్రాలకు కూడా పాకే అవకాశం ఉండటంతో భారతీయుల్లో ఆందోళన నెలకొంది. బాధితులు కోర్టులను ఆశ్రయించేందుకు సిద్ధమవుతుండగా, ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటుందో లేదో చూడాలి. ఈ వీడియో అమెరికాలోని ట్రక్కు డ్రైవర్ల లైసెన్సుల రద్దు వెనుక ఉన్న కారణాలు మరియు దీనివల్ల అక్కడి రవాణా రంగంపై పడే ప్రభావాన్ని వివరిస్తుంది.

Publish Date: Apr 6, 2026 9:50PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img