జగన్ దేవరపల్లి పర్యటనలో వినిపించని, కనిపించని రప్పారప్పా.. కారణమేంటంటే?
Publish Date:Aug 6, 2026
Advertisement
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పర్యటనల్లో రచ్చ చేసే రప్పా రప్పా నినాదాలు, ఆయన బుధవారం చేపట్టిన దేవరపల్లి పర్యటనలో పత్తా లేకుండా పోయింది. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి పరిధిలో పొగాకు రైతులకు మద్దతుగా జగన్ చేపట్టిన ర్యాలీలో రప్పా రప్పా నినాదం, ప్లకార్టులు, ఫ్లెక్సీలు కలికానిక్కూడా కనిపించలేదు. పుష్ప సినిమాలో పాపులర్ అయిన ఈ రప్పారప్పా డేలాగ్ ను వైసీపీ పార్టీ సొంతం చేసుకుని జగన్ పర్యటనల్లో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు రప్పారప్పా పోస్టర్లు, ఫ్లెక్సీలతో చెలరేగిపోయేవారు. అలాంటిది దేవరపల్లి ర్యాలీ సందర్భంగా రప్పా రప్పా డైలాగ్ వినిపించకపోవడం, కనిపించకపోవడం ఒకింత విస్మయపనిచింది. హింసను ప్రోత్సహించే, ప్రజాశాంతికి భంగం కలిగించే నినాదాలు, బ్యానర్లపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తుండటం వల్లే వైసీసీయులు వెనక్కు తగ్గి రప్పారప్పా రచ్చకు దూరంగా ఉన్నారని పరిశీలకులు చెబుతున్నారు. గతంలో జగన్ పర్యటనల సందర్భంగా ఇలాంటి నినాదాలు, బ్యానర్లను ప్రదర్శించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంతో వైసీపీ కార్యకర్తలు రప్పారప్పా నినాదాలు చేయడానికి జంకి ఉండొచ్చంటున్నారు. కేసులు నమోదు చేసినట్లు సమాచారం. గతంలో జగన్ పాల్గొన్న పలు పర్యటనల్లో 2029లో అధికారంలోకి వచ్చాక రప్పా రప్పా.. అంటూ విపక్ష నాయకులను ఉద్దేశించి హెచ్చరికలు చేసే రీతిలో ప్లకార్డులు, పోస్టర్లు దర్శనమిచ్చేవి. దేవరపల్లి సభలో మాత్రం అటువంటి పోస్టర్లు, నినాదాలు కనిపించలేదు. వినిపించలేదు. పోలీసు అధికారులు జగన్ దేవరపల్లి పర్యటన సందర్భంగా ఎలాంటి ఉద్రేకపూరిత కరపత్రాలు, ప్లకార్డులు తీసుకురాకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేశారు. రప్పా రప్పా వంటి నినాదాలు, ప్లకార్డులు ప్రదర్శిస్తే చర్యలు తీసుకుంటామని విస్పష్ట హెచ్చరికలు జారీ చేశారు. దీంతో వైసీపీ శ్రేణులు అనివార్యంగా తమ శైలిని మార్చుకోవలసి వచ్చిందనీ. ఆ కారణంగానే రప్పా రప్పా నినాదాలు జగన్ దేవరపల్లి పర్యటనలో వినిపించలేదనీ, రప్పారప్పా పోస్టర్లు, ప్లకార్డులు కూడా మాయమయ్యాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. Jagan Devarapalli Tour, Rappa Rappa Slogan AP Politics, AP Police Action, Flexi Cases, AP Politics, Telugu One
http://www.teluguone.com/news/content/jagan-devarapalli-tour-36-228150.html





