పీఆర్సీపై ప్రభుత్వం మరో మోసం-ఒక్కో ఉద్యోగికీ లక్షన్నర నష్టం!
Publish Date:May 12, 2022
Advertisement
జగన్ సర్కార్ ఉాద్యోగులను నిండా ముంచేసింది. పీఆర్సీ ఎరియర్స్ విషయంలో జగన్ చేసింది పచ్చి దగా అంటూ ఉద్యోగులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 11వ పీఆర్సీ బకాయిలను ఒక్కో ఉద్యోగికీ ఆ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇస్తామని జగన్ ప్రభుత్వం తేల్చి చెప్పేసింది. దీనిపై ఉద్యోగులలో ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి. నోటితో చెప్పిన మాటను తీరా ఆచరణ దగ్గరకు వచ్చే సరికి మార్చేసి ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల ఒక్కో ఉద్యోగీ దాదాపు లక్షన్నర వరకూ నష్టపోతున్నారు. వేతన సవరణలో రిక్త హస్తం చూపిన జగన్ .. వేతన బకాయి విషయంలోనూ మెండి చేయి చూపించింది. 11వ వేతన సవరణ సంఘ (పీఆర్సీ) బకాయిలకు ఎసరు పెట్టేందుకే జగన్ సర్కార్ సిద్ధపడిందన్నది పరిశీలకుల విశ్లేషణ. పీఆర్సీ బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామంటూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల పట్ల ఉద్యోగులలో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమౌతున్నాయి. ప్రస్తుత ఎరియర్స్ను ఎప్పుడో పాతికేళ్ల తరువాత చెల్లిస్తామనడం ప్రభుత్వ మోసకారి తనానికి నిదర్శనం అని వారంటున్నారు. కాగా ప్రభుత్వ తాజా ఉత్తర్వులతో ప్రభుత్వోద్యోగుల ఆర్థిక భద్రత పెను ప్రమదంలో పడిందని పరిశీలకులు చెబుతున్నారు. వాస్తవానికి 11వ పీఆర్సీ పేరుకే ఐదేళ్లనీ, అందులో మూడున్నరేళ్లు పీఆర్సీ ప్రయోజనాలు ఉద్యోగులకు అందడం లేదనీ చెబుతున్నారు. బుధవారం జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమవేశంలో పీఆర్సీ బకాయిల విషయంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆర్థిక శాఖ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవోలు విడుదల చేసే వరకూ ఉద్యోగ సంఘాలను డార్క్ లో ఉంచడమేమిటని నిలదీశారు. ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే విధంగా పీఆర్సీ అమలుకు సంబంధించిన జీవోలు ఉన్నాయని విపక్ష పార్టీలు సైతం ఆక్షేపిస్తున్నాయి. ఐఆర్ నుంచి డీఏ బకాయిలు రికవరీ చేయమని ప్రభుత్వం చెప్పనప్పటికీ ఉద్యోగులకు రావలసిన 5 డిఏ బకాయిల గురించి మాత్రం తాజా జీవోలో ప్రస్తావించలేదు. అలాగే పీఆర్సీ అరియెర్స్ ను మాత్రం ఉద్యోగి పదవీ విరమణ సమయంలో ఇస్తామని పేర్కొంది. అంటే ఉద్యోగుల డిఏ బకాయిలు కూడా పీఆర్సీ బకాయిలతో కలిపి ఉద్యోగికి రిటైర్మెంట్ సమయంలోనే ఇస్తుందన్న మాట. వాస్తవానికి జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఘనంగా ప్రకటించిన రెండు డీఏలనూ కూడా ఇప్పటి వరకూ ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రకటించిన జీవోలకే దిక్కు లేకుండా పోతే ఇప్పుడు 5 డిఏ బకాయిలను పీఆర్సీ బకాయిలతో కలిసి ఇస్తామంటే నమ్మేదెలా అని ఉద్యోగులు ప్రవ్నిస్తున్నారు. ఎక్కడికక్కడ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటికి కత్తెర వేస్తూ పోతూ ఒకదాని తరువాత ఒకటిగా అన్ని వర్గాలనూ జగన్ సర్కార్ దగా చేస్తున్నది. ఈ విషయంలో మాత్రం జగన్ మడమ తిప్పడం లేదు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ప్రజలకు అందాల్సిన ఆర్థిక లబ్ధికి కత్తెర వేసి.. ఆ సొమ్మును ఎన్నికల్లో తనకు లబ్ధి చేకూరుతుందని ఆయన భావిస్తున్న ఉచితాలకు బదలాయించేస్తున్నారు. ఈ విషయంలో ఆర్థిక సంస్థలు, కోర్టులు వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, అక్షింతలను పట్టించుకోవడం లేదు. ఎవరేమంటే మనకేంటి.. మనకేది లాభమో అదే చేద్దాం అన్న ధోరణిలో ముందుకు సాగుతున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-decieves-employees-again-25-135785.html





