గంజాయి అమ్ముతున్న ఐటీ ఎంప్లాయ్.. జాబ్ చేస్తూనే స్మగ్లింగ్..
Publish Date:Apr 1, 2022
Advertisement
ఆమె పేరు కొండపనేని మాన్సీ. ఐటీ జాబ్ చేస్తోంది. నెల నెల దండిగానే జీతం వస్తోంది. భర్త కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయే. అతనికీ పెద్ద జీతమే. ఇలా భార్యభర్తలు మంచి జాబులు చేస్తూ.. బాగానే సంపాదిస్తున్నారు. అయినా, కక్కుర్తి పనులు మాత్రం వదలలేదు. ఉద్యోగం, జీతం సరిపోనట్టు.. గంజాయి బిజినెస్ స్టార్ట్ చేశారు ఆ మొగుడూపెళ్లాలు. కట్ చేస్తే.. ఇప్పుడు హైదరాబాద్ పోలీసులకు చిక్కి ఊచలు లెక్కపెడుతున్నారు. ఇక గంజాయి అంటే వెంటనే వినిపించే పేరు అరకు. ఈ కేసులోనూ వాళ్లు అరకు నుంచే గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్లో అమ్ముతున్నట్టు పోలీసులు తేల్చారు. కొందరు సహా ఉద్యోగులకు, బీటెక్ స్టూడెంట్స్కి గంజాయి సేల్ చేస్తున్నారు. పోలీసులు చాకచక్యంగా పట్టుకోవడంతో ఆ దంపతుల గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. యువకులు, ఐటీ నిపుణుల్లో చాలామందికి గంజాయి అలవాటు ఉందని గుర్తించారు ఆ దంపతులు. ఆ డిమాండ్ను సొమ్ము చేసుకొనేందుకు అరకు నుంచి సరకు తీసుకొచ్చి మల్కాజిగిరి, నాచారం, మేడ్చల్, పంజాగుట్ట, బంజారాహిల్స్ ప్రాంతాల్లో విక్రయిస్తున్న ఐటీ ఉద్యోగిని కొండపనేని మాన్సీని కొంపల్లిలో అరెస్ట్ చేశారు. నాచారంలో ఉంటూ ఓ ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తున్న మాన్సీ.. భర్త మదన్ మనేకర్తో కలిసి రెండేళ్లుగా గంజాయి విక్రయిస్తోంది. మార్చి 12న ఈ దంపతులు మరో ఇద్దరు యువకులతో కలిసి గంజాయి అమ్ముతుండగా బోయిన్పల్లి పోలీసులు పట్టుకునేందుకు వెళ్లారు. 1.2 కిలోల గంజాయితో యువకులిద్దరూ చిక్కగా.. ఆ దంపతులు మాత్రం పారిపోయారు. పట్టుబడిన యువకులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మాన్సీ-మదన్ల కోసం అప్పటి నుంచీ గాలిస్తున్నారు. తాజాగా, కొంపల్లి దగ్గర మాన్సీని పట్టుకున్నారు. మాన్సీ పూర్వీకులు ఏపీకి చెందిన వారే అయినా.. ఆ తర్వాత వారు నాగ్పుర్లో సెటిల్ అయ్యారు. భోపాల్లో ఇంజినీరింగ్ పూర్తి చేసిన ఆమె ఉద్యోగం చేసేందుకు హైదరాబాద్ వచ్చింది. భర్తతో కలిసి మూడేళ్లుగా నాచారంలో ఉంటోంది. రెండేళ్లుగా గంజాయి బిజినెస్ చేస్తోందని పోలీసులు తెలిపారు.
http://www.teluguone.com/news/content/it-couple-arrested-in-ganja-case-25-133791.html





