ఐఏఎస్లు మారరా? గుణపాఠం నేర్వరా? జగన్ తీరుకు బలి కావాల్సిందేనా?
Publish Date:Apr 1, 2022
Advertisement
చాలా సింపుల్ విషయం. కోర్టు వద్దంది. పనులు ఆపేస్తే పోయేది. కానీ, తెగేదాక లాగారు. జైలు శిక్షకు గురయ్యారు. హైకోర్టును క్షమించమని వేడుకుంటే.. జైలు శిక్ష కాస్తా.. సేవా శిక్షగా మారింది. లేదంటే, ఈపాటికి ఆ ఎనిమిది మంది ఐఏఎస్ ఉన్నతాధికారులు జైల్లో ఉండేవారు. ఇదేమైన చిన్న విషయమా? హైకోర్టు అంత పెద్ద నిర్ణయం తీసుకుందంటే.. అధికారులు ఎంత ఓవరాక్షన్ చేసుంటారు? ప్రభుత్వ పరువంతా పోయిన ఘటన ఇది. ఆ ఎనిమిది మంది ఐఏఎస్లు తలెత్తుకోలేని దుస్థితి. ఆలిండియా కేడర్లో వారి గురించే చర్చ. ఐఏఎస్లు అంతగా అబాసు పాలవడానికి కారణం ఎవరు? ఇంకెవరు.. జగన్రెడ్డినే అంటున్నారు. ప్రభుత్వ మొండివైఖరే అంతమంది ఉన్నతాధికారులు శిక్షకు గురవడానికి కారణం. ఏడాది పాటు, నెలకో రోజు సంక్షేమ హాస్టళ్లలో సేవ చేయడం, అక్కడి వారికి ఒక రోజు భోజనం పెట్టడం.. సేవ రూపంలో బాగానే ఉన్నా.. శిక్ష మాత్రం పెద్ద శిక్షే. అంతపెద్ద స్థాయి ఐఏఎస్ అధికారి ఓ హాస్టల్కి వస్తే.. మామూలుగా అయితే గ్రాండ్ వెల్కమ్ లభిస్తుంది. కానీ, ఈసారి వీళ్లు వెళితే అక్కడి సిబ్బంది, విద్యార్థులు ఆ అధికారుల వైపు అదో రకంగా చూస్తారు. "ఇతనినే, ఈమెనే.. హైకోర్టు శిక్షించిందట. సేవ చేయమని పంపించిందట. తప్పదు కాబట్టి వచ్చారు. మన కోసమో, సేవ చేయాలనే ఉద్దేశమో కాదు.. చేసిన తప్పుకు ఇప్పుడిలా అనుభవిస్తున్నారు".. ఇలా రకరకాల కామెంట్లు వినిపించడం ఖాయం. ఆ అధికారులు సగర్వంగా, హుందాగా, దర్జాగా ఆ హాస్టల్స్కి వెళ్లలేరు. తలదించుకొని, అవమానభారంతో అక్కడ సేవ చేయాల్సి ఉంటుంది. ఇంతటి దారుణ పరిస్థితికి వారికి ఎందుకొచ్చింది? హైస్కూల్ ప్రాంగణాలు, ఇతర ప్రభుత్వ స్థలాల్లో గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, ఆరోగ్య కేంద్రాలు నిర్మించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. వెంటనే వాటిని తొలగించాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పే ఫైనల్ అని.. ఏళ్ల తరబడి డ్యూటీలో ఉంటున్న ఆ ఉన్నతాధికారులకు తెలీదా? తెలుసు.. అయినా, హైకోర్టు తీర్పు ఎందుకు అమలు చేయలేదు? ప్రభుత్వ స్థలాల్లో గ్రామ సచివాలయ భవనాల నిర్మాణాలను ఎందుకు తొలగించలేదు? అంటే అందుకు ప్రభుత్వ పెద్దలే కారణమని వేరే చెప్పనవసరం లేదు. అధికారులు చెప్పినా.. పాలకులు వినలేదు. పట్టించుకోలేదు. మొండిగా ముందుకెళ్లారు. పంతానికి పోయి.. కోర్టు తీర్పును ధిక్కరించారు. ఆ తప్పు చేసింది పాలకులైతే.. శిక్ష పడింది మాత్రం అధికారులకే అంటున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అంటే.. ఒకప్పుడు ప్రజల్లో గౌరవం ఉండేది. ఇప్పుడు పాలకుల చేతిలో కీలుబొమ్మలుగా మారడంతో.. రూల్స్ ఒప్పుకోకపోయినా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయడం.. తీవ్ర వివాదాస్పదమవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉందనే ఆరోపణ ఉంది. తెలంగాణలో బీహార్ బాబుల పెత్తనం ఎక్కువైందనే విమర్శ. ఏపీలో అధికార వర్గమంతా జగన్కు ఊడిగం చేస్తుందనే ఆరోపణ. పలువురు ఐఏఎస్ అధికారులు పలుమార్లు దోషులుగా ఏపీ హైకోర్టు బోనులో నిలబడుతుండటం దారుణం. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు దొందుదొందే. గతంలో ఉమ్మడి ఏపీలోనూ ఇలానే జరిగింది. వైఎస్సార్ హయాంలో ఇదే జగన్ అనధికార ఆదేశాలను అమలు చేసి.. చెప్పిన చోట సంతకాలు పెట్టి.. పలువురు ఐఏఎస్ అధికారులు పలు కేసుల్లో జగన్తో పాటే ఇరుక్కున్నారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి జైలుకెళ్లిన ఉదంతం అప్పట్లో సంచలన. ఇప్పుడు అదే శ్రీలక్ష్మి మళ్లీ హైకోర్టు శిక్షకు గురైన ఎనిమిది మంది ఐఏఎస్లో ఒకరిగా ఉండటాన్ని ఏమనుకోవాలి? కేసులు ఎదుర్కొన్నా.. జైలుకు వెళ్లి వచ్చినా.. వారిలో ఎలాంటి మార్పు వచ్చినట్టు? పాలకులు చెప్పినట్టు తలూపడం ఎంతటి చేటు తెచ్చిపెడుతుందో వారికి తెలీదా? అయినా, మారరా? అయ్యా..ఎస్లు ఇక ఇంతేనా? అనే చర్చ నడుస్తోంది.
http://www.teluguone.com/news/content/controversy-over-ap-ias-ruling-25-133796.html





