వాణిజ్య నౌకలపై అమెరికా దాడులు.. అగ్రరాజ్యంపై ఇండియా ఆగ్రహం!
Publish Date:Jun 13, 2026
Advertisement
అంతర్జాతీయ సముద్ర జలాల్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తూ.. వాణిజ్య నౌకలపై దాడులు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇండియా అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో పలావు దేశ జెండాతో ప్రయాణిస్తున్న సెట్టెబెల్లో అనే ఒక వాణిజ్య ఆయిల్ ట్యాంకర్పై అమెరికా నావికా దళం జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు మరణించిన సంగతి తెలిసిందే. ఈ దాడిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా చర్యలను అభిశంసిస్తూ.. స్పష్టమైన హెచ్చిరక జారీ చేసింది. ఈ పరిణామంపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోతో ఫోన్లో మాట్లాడి, భారతదేశం తరఫున తీవ్ర నిరసన తెలిపారు. కేవలం వాణిజ్య అవసరాల కోసం సముద్రంలో ప్రయాణించే నౌకలపై ఇలాంటి దాడులు చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదని జైశంకర్ హెచ్చరించారు. అంతర్జాతీయ జలాల్లో జరిగే ఇలాంటి దాడులు సముద్ర వాణిజ్య భద్రత, ప్రాంతీయ స్థిరత్వాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయని జైశంర్ ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమాసియా ప్రాంతంలో రోజురోజుకూ పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి అన్ని దేశాలు తక్షణమే చర్యలు చేపట్టాలని భారత్ ఈ సందర్భంగా పిలుపునిచ్చింది. ఈ ఘటనపై దౌత్యపరంగా మరింత ఒత్తిడి పెంచుతూ.. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఢిల్లీలోని అమెరికా తాత్కాలిక రాయబారి జాసన్ మీక్స్ను తమ కార్యాలయానికి పిలిపించి వివరణ కోరింది. ఇండియన్ నావికులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా దళాలు పదేపదే దాడులకు దిగడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అమెరికా చేసిన ఈ దాడి కారణంగా ముగ్గురు ఇండియన్స్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రాణాంతక ఘటనలు ఎట్టి పరిస్థితుల్లోనూ పునరావృతం కాకూడదని, అంతర్జాతీయ నియమాలను గౌరవిస్తూ పౌరుల ప్రాణ రక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని గట్టిగా చెప్పింది. మరోవైపు ఈ వివాదాస్పద దాడిని అమెరికా సైనిక విభాగమైన సెంట్రల్ కమాండ్ అంగీకరించింది. ఇరాన్ దేశంపై అంతర్జాతీయంగా విధించిన ఆర్థిక, వాణిజ్య ఆంక్షలను ఉల్లంఘిస్తూ.. సెట్టెబెల్లో' ట్యాంకర్ అక్కడి నుండి అక్రమంగా చమురును రవాణా చేయడానికి ప్రయత్నించిందని ఆరోపించింది. తమ నౌకాదళ సిబ్బంది ఆ నౌకను ఆపాలని పదేపదే జారీ చేసిన హెచ్చరికలను పూర్తిగా ధిక్కరించడంతో తాము బలప్రయోగం చేయాల్సి వచ్చిందని అమెరికా సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఏదేమైనప్పటికీ, కేవలం చమురు ఆంక్షల నెపంతో పౌర నావికుల ప్రాణాలను బలిగొనేలా అమెరికా ప్రవర్తించిన తీరుపై భారతదేశం మాత్రం ఎక్కడా తగ్గకుండా దౌత్యపరమైన పోరాటానికి సిద్ధమవుతోంది.
http://www.teluguone.com/news/content/india-angry-on-america-attacks-on-commercial-ships-36-222781.html





