అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. అనాథగా చిన్నారి..!
Publish Date:Jul 4, 2026
Advertisement
భార్యాభర్తల బంధం ఎంతో అపురూపమైనది. ఆ బంధంలో చిన్నచిన్న మనస్పర్థలు, గొడవలు సహజమే. అయితే ఒకరిపై మరొకరికి ప్రేమ, నమ్మకం ఉంటేనే సంసారం సాఫీగా సాగుతుంది. అదే బంధంలో అనుమానం అనే విషబీజం చొరబడితే కుటుంబాల్లో కలహాలు చెలరేగి విషాదాంతాలకు దారితీస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా హైదరాబాద్లోని ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అలాంటి విషాద ఘటన చోటుచేసుకుంది. సురేష్, జెస్సికాలకు 2015లో వివాహం జరిగింది. వీరికి ప్రస్తుతం పదేళ్ల కుమార్తె ఉంది. ఇద్దరూ ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిలకానగర్లో నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్య జెస్సికాపై సురేష్ అనుమానం పెంచుకోవడంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఆగ్రహానికి లోనైన సురేష్ భార్యపై దాడి చేసి అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య అనంతరం సురేష్ జెస్సికా సోదరికి ఫోన్ చేసి, "జెస్సికాను హత్య చేశాను" అని చెప్పి అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు, పరారీలో ఉన్న నిందితుడు సురేష్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కుటుంబ కలహాలు, భార్యపై అనుమానం ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఒకవైపు తల్లి మృతి చెందగా, మరోవైపు తండ్రి పరారీలో ఉండటంతో పదేళ్ల చిన్నారి జీవితంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి మృతదేహాన్ని చూసి ఆ చిన్నారి రోదించిన తీరు స్థానికులను కంటతడి పెట్టించింది. క్షణిక ఆవేశం, నిరాధార అనుమానం ఓ కుటుంబాన్ని శాశ్వతంగా ఛిద్రమయ్యేలా చేశాయి.
http://www.teluguone.com/news/content/uppal-murder-case-36-225062.html





