భార్యా పిల్లలకు విషమిచ్చి.. భర్త ఆత్మహత్య
Publish Date:Jun 21, 2026
Advertisement
చిత్తూరు జిల్లాలో ఓ కుటుంబం మొత్తం బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన ఇది. చిత్తూరు రూరల్ మండలం బంగారెడ్డిపల్లి గ్రామంలో జరిగిన ఈ ఘటన గ్రామంలో విషాదాన్ని నింపింది. బంగారెడ్డిపల్లి గ్రామానికి చెందిన దామోదర్ అనే వ్యక్తి భార్య నిర్మల కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. ఆమె అనుభవిస్తున్న బాధను నిరంతరం గమనిస్తున్న దామోదర్ తీవ్ర మానసిక ఆవేదనకు గురయ్యాడు. భార్య అనారోగ్యంపై బెంగ పెట్టుకున్న ఆయన, తాము లేకపోతే పిల్లల భవిష్యత్తు ఏమౌతుందోననే ఆందోళనతో తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. భార్య నిర్మలకు, కన్నబిడ్డలైన 8వ తరగతి చదువుతున్న కుమారుడు దిలీప్, 6వ తరగతి చదువుతున్న కుమార్తె శ్రీవిద్యలకు ఆహారంలో విషం కలిపి ఇచ్చాడు. వారు ముగ్గురూ ప్రాణాలు విడిచినట్లు నిర్ధారించుకున్న తర్వాత, తానూ కూడా ఇంట్లోనే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు దామోదర్ రాసిన ఒక సూసైడ్ నోట్ లో తమ మరణానికి ఎవరూ బాధ్యులు కారనీ.. భార్య అనారోగ్య బాధలను భరించలేకే తాము ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నామని పేర్కొన్నాడు. అంతేకాకుండా, తాము చనిపోయిన తర్వాత తమ అంత్యక్రియల నిర్వహణ ఖర్చుల కోసం తమ ఏటీఎం కార్డుల్లో తగినంత నగదు ఉందని, ఆ డబ్బులను డ్రా చేసుకుని అంతిమ సంస్కారాలు జరిపించాలని ఆ లేఖలో ప్రత్యేకంగా అభ్యర్థించాడు.
http://www.teluguone.com/news/content/husband-kills-wife-and-children-36-223713.html





