బాబోయ్ పెద్ద పులి.. జంగారెడ్డి గూడెం పరిసర గ్రామాల్లో భయం భయం.!
Publish Date:Aug 3, 2026
Advertisement
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న పెద్ద పులి.. పశువులపై దాడులు చేస్తూ అటు గ్రామస్థులు, ఇటు అటవీ శాఖ అధికారులను ముప్పతిప్పలు పెడుతోంది. పులిని బంధించేందుకు అటవీ శాఖ రంగంలోకి దిగినప్పటికీ ఫలితం లేకపోతోంది. మహారాష్ట్రలోని వార్ధా నుండి వచ్చిన ప్రత్యేక నిపుణుల బృందంతో పాటు సుమారు 30 మందికి పైగా అటవీ సిబ్బంది పులి కదలికలను పర్యవేక్షిస్తున్నారు. పులి సంచరిస్తున్న మార్గాల్లో సిసిటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి, బోన్లు, ఎరలు సిద్ధం చేశారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడం, ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పులి ట్రాకింగ్ కు తీవ్ర విఘాతం కలుగుతోంది. పులి సంచారంతో స్వర్ణవారిగూడెం, లక్ష్మణుడుగూడెం, కొయ్యలగూడెం, పండుగూడెం తదితర గ్రామాల ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. వర్షాకాలం ప్రారంభమై పొలం పనులు ముమ్మరంగా సాగుతున్న సమయంలో పెద్దపులి భయం వెంటాడటంతో చేలకు వెళ్లేందుకు రైతులు, కూలీలు భయపడుతున్నారు. పిల్లలను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. పులి సంచారం కారణంగా జంగారెడ్డిగూడెం డివిజన్ అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. రాత్రిపూట బయటకు రావద్దనీ, పశువులను మేత కోసం అడవికి తోలొద్దనీ హెచ్చరించారు. ప్రమాదకర ప్రాంతాల్లో అటవీ శాఖ సిబ్బంది డప్పు చాటింపు వేసి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సాధ్యమైనంత త్వరలో పెద్దపులిని పట్టుకుంటామనీ అంత వరకూ ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, అధికారులకు సహకరించాలని అటవీశాఖ కోరుతోంది. Fear grips villages around Jangareddygudem, Tiger, animals, forest dpartment,
http://www.teluguone.com/news/content/fear-grips--villages-around-jangareddygudem-36-227849.html





