సజ్జలపై పరువునష్టం దావా.. వేసిందెవరంటే?
Publish Date:Aug 20, 2026
Advertisement
వైసీపీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై పరువునష్టం దావా దాఖలైంది. పాల ఉత్పత్తి సంస్థ.. సంగం డెయిరీ ఈ దావా వేసింది. టీటీడీకి నెయ్యి సరఫరా విషయంలో సజ్జల తమ సంస్థ సంగం డెయిరీపై అసత్య ఆరోపణలు చేశారంటూ 10 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేసింది. సంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గుంటూరు న్యాయస్థానంలో సంగం డెయిరీ యాజమాన్యం ఈ మేరకు పిటిషన్ దాఖలు చేసింది. వివరాలిలా ఉన్నాయి.. సంగం డెయిరీరైతుల నుంచి పాలను సేకరించకుండానే టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోందని సజ్జల రామకృష్ణారెడ్డి ఇటీవల ఆరోపణలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను సంగం డెయిరీ మేనేజ్మెంట్ ఖండించింది. తాము రాయలసీమ ప్రాంతంలోని చిత్తూరు, కడప, అనంతపురం జిల్లాల్లో వేలాది మంది పాల ఉత్పత్తిదారులైన రైతుల నుంచి నేరుగా పాలను సేకరిస్తున్నామని స్పష్టం చేసింది. నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా స్వచ్ఛమైన ఆవు నెయ్యిని మాత్రమే టీటీడీకి అందిస్తున్నట్లు పేర్కొంటూ... సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణన్ గుంటూరు కోర్టులో పరువునష్టం పిటిషన్ను దాఖలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఆధారాలు లేకుండా చేసిన ఆరోపణల వల్ల దశాబ్దాలుగా నమ్మకంతో నిర్మించుకున్న సంస్థ బ్రాండ్ ప్రతిష్ట దెబ్బతిన్నదని పిటిషన్లో పేర్కొన్నారు. అలాగే.. తిరుమల శ్రీవారి ప్రసాదాలు, నెయ్యి సరఫరాకు సంబంధించి ఇటువంటి కల్పిత కథనాలు ప్రచారం చేయడం వల్ల కోట్ల మంది భక్తుల మనోభావాలు తీవ్రంగా గాయపడ్డాయని ఆయన పేర్కొన్నారు. ఈ కేసులో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డిపైనే కాకుండా, ఆయనతో పాటు ఇదే తరహా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావుపై కూడా న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. అలాగే.. నిజా నిజాలు నిర్ధారించుకోకుండా అసత్య ప్రచారాన్ని ప్రసారం చేసిన వైసీపీ మీడియా, పలు సామాజిక మాధ్యవ వేదికలను కూడా ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా చేర్చారు. Defamation Case on Sajjala Ramakrishna Reddy, Sangam Dairy, TTD Ghee Controversy, Guntur Court, YCP Leaders
http://www.teluguone.com/news/content/defamation-case-on-sajjala-ramakrishna-reddy-36-229405.html





