జగన్ చేతిలో జనం ఫూల్స్!
Publish Date:Apr 1, 2022
Advertisement
నిజమే.. టీడీపీ నేత నారా లోకేష్ అన్నట్టు.. ఏపీ సీఎం జగన్ రెడ్డి జనాన్ని ఏప్రిల్ ఫూల్స్ ని చేశారు. 2019 ఎన్నికలకు ముందు తమకు అసత్య హామీలు ఇచ్చిన జగన్ రెడ్డి ఇప్పుడు తమ చెవిలో పూలు పెట్టారని వాపోతున్నారు ఏపీ జనం. ఏప్రిల్ 1 నుంచి ఏపీలో విద్యుత్ చార్జీలను జగన్ సర్కార్ పెంచేసింది. టోల్ గేట్ చార్జీలు పెరిగాయి. వాటితోపాటు మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా ఏపీతో పాటుగా దేశ వ్యాప్తంగా ఔషధాలు, గ్యాస్ ధరలు పెరిగిపోయాయి. మరో పక్కన పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకూ పెంచేస్తూ.. చము సంస్థలు సామాన్యులకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. ఈ భారాలన్నీ ఎలా భరించేదిరో దేవుడో.. అంటూ ఏపీ ప్రజలు లబోదిబోమంటున్నారు. నిజమే.. గత ఎన్నికలకు ముందు అధికారమే పరమావధిగా జనం చుట్టూ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన జగన్ రెడ్డి.. తమ పార్టీ అధికారంలోకి వస్తే.. తాను సీఎం అయితే.. ఏపీలో పెరిగిపోతున్న విద్యుత్ చార్జీలు తగ్గిస్తానంటూ గొప్పగా హామీ ఇచ్చారు. మద్యనిషేధం పూర్తిగా అమలు చేస్తానంటూ ఆడపడుచుల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టారు. ఉమ్మడి రాష్ట్ర విభజనతో అన్ని విధాలా అన్యాయమైపోయిన ఏపీకి ప్రత్యేక హోదా సాధించేస్తానంటూ అరచేతిలో స్వర్గం చూపించారు. తాను సీఎం అయితే.. సన్న బియ్యం పంపిణీ చేస్తానంటూ పాదయాత్ర సందర్భంగా పలువురి నెత్తిన చెయ్యి పెట్టి మరీ భరోసా ఇచ్చారు. అయితే.. అప్పటి హామీలన్నింటినీ జగన్ రెడ్డి తీరా సీఎం అయ్యాక తుంగలో తొక్కేశారని, రాష్ట్రాన్ని అన్ని విధాలా కుదేల్ చేశారనే విమర్శలు విపక్షాల నుంచి తరచుగా వినిపిస్తూనే ఉన్నాయి. గృహ వినియోగదారులు, గృహేతర, హెచ్ టీ వినియోగదారులపై ఏపీ సర్కార్ విద్యుత్ చార్జీలు పెంచేసి, తమ గుండెల్లో గునపం దించిందని జనం గగ్గోలు పెడుతున్నారు. జగన్ రెడ్డి సర్కార్ పెంచిన విద్యుత్ చార్జీల కారణంగా రాష్ట్ర జనాభాపై వేల కోట్ల మేర అదనపు భారం పడుతోంది. వాస్తవం ఏంటంటే విద్యుత్ చార్జీలు ఎంతగా పెంచేసినప్పటికీ ఏపీలో విద్యుత్ సరఫరా మాత్రం సరిగా లేదు. ప్రతి రోజూ రాత్రీ, పగలు తేడా లేకుండా గంటలకు గంటల తరబడి విద్యుత్ కోతల్ని అమలు చేసి జనాన్ని ఇబ్బందుల పాలు చేస్తోందంటున్నారు. ఒక విధంగా ఏపీని అంధకారాంధ్రప్రదేశ్ గా జగన్ రెడ్డి సర్కార్ మార్చేసిందంటున్నా నారా లేకేష్ విమర్శలో నిజం ఉందని చెబుతున్నారు రాష్ట్ర ప్రజలు. మరో పక్కన సేఫ్టీ సెస్, టోల్ చార్జీల పేరుతో ఏపీఎస్ ఆర్టీసీ మార్చి 18 నుంచే ప్రయాణికులపై అదనపు భారం వేసింది. ‘కల్లు తాగినోడే కట్టాలి తాటిచెట్టు పన్ను’ అన్నట్లు భారీగా పెరిగిన డీజిల్ చార్జీల భారాన్ని ప్రయాణికులపైనే వేయాలని ఆర్టీసీ కసరత్తు చేస్తోందంటున్నారు. అసలే ఏపీలో రోడ్ల దుస్థితి చూస్తే ‘ఏమున్నది గర్వకారణం’ అన్నట్లుంది. ఏపీలో ఎక్కడైనా ఒక్క అంగుళం మేర డాంబర్ రోడ్డు కనిపిస్తే ఒట్టు అంటున్నారు ఎక్కడికక్కడ స్థానికులు. విపక్షాల నుంచి, జనం నుంచి విమర్శలు వెల్లువలా వచ్చి ముంచెత్తడంతో ఏదో చేశాంలే అన్న చందంగా అక్కడో గుంత, ఇక్కడో గుంత పూడ్చి ‘శెభాష్’ అని జగన్ రెడ్డి సర్కార్ తన జబ్బలు తానే చరుచుకుంటోందని జనమంతా దుమ్మెత్తిపోస్తున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తానంటూ గత ఎన్నికల ముందు ఊదరగొట్టిన జగన్ రెడ్డి తీరా అధికారం చేతికి వచ్చాక పూర్తి మెజారిటీతో నెగ్గిన కేంద్ర ప్రభుత్వానికి తమ అవసరం లేదు కనుక హోదా సాధించడం కుదరదు అంటూ చేతులు ఎత్తేశారు. ఆంధ్రులకు ఆత్మగౌరవ రాజధానినే లేకుండా చేసిన ఘనత వైసీపీ సర్కార్ కే చెందుతుందంటున్నారు. చంద్రబాబు మీద కోపంతో ఏపీకి రాజధాని నగరమే లేకుండా చేయడంపై జనం నిప్పులు చెరుగుతున్నారు. పైపెచ్చు మూడు రాజధానుల నెపంతో మూడు ముక్కలాట మొదలెట్టి, మొండిగా వ్యవహరిస్తూ జనాన్ని వెర్రిబాగులోళ్లను చేస్తున్నారంటున్నారు. బూతుల మంత్రి చేతికి పౌరసరఫరాలశాఖను అప్పగించి, సన్నబియ్యం మాటే లేకుండా చేసిన జగన్ జనాన్ని ఫూల్స్ ని చేశారంటున్నారు. ఇక మద్యం పూర్తి నిషేధం హామీకి వచ్చేసరికి.. జగన్ రెడ్డి తానే ఇచ్చిన మాటకు మడమ తిప్పేశారని, మడమ కూడా తనకు అనుకూలంగా తిప్పేశారనే విమర్శలు జనం నుంచి వస్తున్నాయి. ఎన్నికల ముందు ‘పూర్తి మద్య నిషేధం’ అన్న జగన్ తీరా అధికారంలోకి వచ్చాక అంచెలంచెలుగా నిషేధం అని మాట మార్చిన వైనాన్ని జనం రోజూ చెప్పుకుంటున్నారు. ఆ తర్వాత రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి వైసీపీ సర్కార్ నిధుల కోసం నానా మార్గాలు అన్వేషించింది. అందులో భాగంగానే మద్యం ధరలు ప్రియుల నషాళానికి అంటేలా పెంచేశారు. మద్యం ధరలు పెంచేందుకు జగన్ రెడ్డి చెప్పిన సాకు కూడా అతికినట్టు లేదంటారు విశ్లేషకులు. మద్యం ధరలు పెంచేస్తే.. మద్యం తాగేవారికి గూబ గుయ్ అంటుందని, దాంతో వారు మద్యం మానేస్తారంటూ ఓ పస లేని అంశాన్ని తెరమీదకు తెచ్చారంటారు. మద్యానికి అలవాటు పడిన ఏ ఒక్కరూ రేటు ఎంతైనా కొని సేవిస్తున్నారు. డబ్బులు లేవంటే నాటుసారా, కల్తీసారా, లేదా వైట్నర్ లాంటి విష ద్రావణాలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇక్కడే ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ఏపీలో మద్యం బ్రాండ్లు గతంలో కొన్ని దశాబ్దాలుగా ఏనాడూ కనీ వినీ ఎరుగనివి కుప్పలు తెప్పలుగా వచ్చిపడ్డాయి. అలా వచ్చిన ప్రజల ప్రాణాలు తీసేస్తున్న మద్యం ఉత్పత్తి చేసే సంస్థలు వైసీపీ నేతల చేతుల్లోనే ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తన వారికి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టేందుకే జగన్ రెడ్డి ఇలా భారీగా మద్యం ధరల పెంచారనే ఆరోపణలు వస్తుండడం గమనార్హం. అక్కడితో ఆగని జగన్ రెడ్డి సర్కార్ ఏపీ ప్రజల్ని ఏయే మార్గాల్లో ముక్కు పిండి మరీ డబ్బులు వసూలు చేయవచ్చో అని ఆలోచించి చెత్తపన్ను వేసిందంటున్నారు. ఇంటి పన్నును ఇబ్బడిముబ్బడిగా పెంచేసిందని వాపోతున్నారు. ఇలా ఎన్నికల ముందు జగన్ ఇచ్చిన హామీలన్నీ తుంగలో తొక్కారని, ఒక్కొక్కటిగా ధరలు పెంచేస్తున్నారని ఏపీ ప్రజలు, విపక్ష నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు.
http://www.teluguone.com/news/content/ap-people-fools-in-jagan-hands-25-133798.html





