సిగ్గు.. సిగ్గు మూడేళ్లుగా సీఎం కాన్వాయ్ బిల్లులూ పెండింగే
Publish Date:May 12, 2022
Advertisement
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం పాలన పేరుతో జనాలకు మాయా బజార్ చూపిస్తోంది. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్టూ చూపుతూ కనికట్టు చేస్తోంది. ఉచితాల పేర కోట్లు పేదలకు పందేరం చేస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ.. చెల్లింపులన్నీ ఆపేస్తోంది. ఆఖరికి సీఎం కాన్వాయ్ కోసం పెట్టిన కార్లకు కూడా మూడేళ్లుగా పైసా చెల్లించలేదు. ఎవరూ సీఎం కాన్వాయ్ కోసం కార్లు ఇవ్వక పోవడంతో దౌర్జన్యంగా రోడ్డున పడి దొరికిన కార్లను గుంజుకుంటోంది. సీఎం కాన్వాయ్ కార్ల బకాయిలు రూ.17 కోట్లు దాటిపోయాయి. ఆ బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర రవాణా శాఖ ప్రభుత్వానికి లేఖ రాయడంతో బండారం బైటపడింది. కోట్లాది రూపాయలు అప్పులు చేస్తూ కూడా సీఎం కార్ల బకాయిలు చెల్లించక, ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించక, పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించక ప్రభుత్వం ఆ సొమ్మంతా ఏం చేస్తోందని జనం నిలదీస్తున్నారు. మూడేళ్లుగా సమస్యలు పరిష్కరించని మీరు ఇప్పుడు మా గడప కెందుకొచ్చారని గడపగడపకూ ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ నేతలను, మంత్రులను, ఎమ్మెల్యేలనూ ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. సీఎం కాన్వాయ్ బకాయిలు రూ. 17 కోట్లకు పైగా పేరుకుపోవడం ప్రభుత్వ ఆర్థిక దుస్థితికి ఇది అద్దంపడుతోందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడేళ్లుగా సీఎం కాన్వాయ్ డబ్బులు బకాయి పడటం అన్నది రాష్ట్రానికి అవమానమని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. సీఎం కాన్వాయ్ కోసం కార్లు పెట్టిన వారికి ప్రభుత్వం రూ.17 కోట్లు బకాయిపడటం సిగ్గు చేటనీ, వ్యవస్థల పతనానికి ఇది పరాకాష్ట అని పేర్కొన్నారు. జగన్ పాలనా వైఫల్యం వల్ల అధికారలు, ఉద్యోగులను తీవ్ర ఒత్తిడికి లోను చేస్తున్నదన్నారు. జగన్ వైఫల్యాలు, తప్పిదాలకు అధికారలు, ఉద్యోగులూ బలౌతున్నారన్నారు. మూడేళ్లుగా బిల్లులు చెల్లించకుంటూ సీఎం కాన్వాయ్ కు అధికారులు కార్లు ఎలా ఏర్పాటు చేయగలరని ఆయన ప్రశ్నించారు. జగన్ అసమర్థ పాలన రాష్ట్ర బ్రాండ్ ను దారుణంగా దెబ్బతీసిందన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించరు, సీఎం కాన్వాయ్ కోసం పెట్టిన కార్లకు చెల్లింపులు చేయరు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు ఎప్పుడిస్తారో చెప్పరు. పీఆర్సీ బకాయిలను రిటైర్మెంట్ తో కలిపి ఇస్తామంటారు, కరవు బత్యం బకాయిల సంగతి అతీగతీ ఉండదు.. ఇవన్నీ జగన్ అసమర్ధ పాలనకు ప్రత్యక్ష నిదర్శనాలుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సీఎం కాన్వాయ్ కార్ల చెల్లింపుల వ్యవహారం ఒక శాఖలో బిల్లుల పెండింగ్ అంశం మాత్రమే కాదనీ రాష్ట్ర ఆర్థిక నిర్వహణలో అరాచకత్వమనీ చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న అప్పుల మొత్తం ఎంత, పెండింగ్ లో ఉన్న చెల్లింపుల మొత్తం ఎంత అన్నదానిపై శ్వేత పత్రం విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోనికి వచ్చిన జగన్ కు అదే చివరి చాన్స్ కావాలని చంద్రబాబు ప్రజలకు పిలుపు నిచ్చారు.
http://www.teluguone.com/news/content/cm-canvoy-dues-more-tham-rs-17-crores-25-135803.html





