ఎక్స్ ట్విట్టర్ ద్వారా ఆవేదన వ్యక్తం చేసిన బండి సంజయ్
Publish Date:May 17, 2026
Advertisement
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తన కుటుంబంపై వచ్చిన వివాదాల మధ్య సోషల్ మీడియా వేదికగా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్)లో చేసిన భావోద్వేగ పోస్టు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బండి సంజయ్ తన పోస్టులో గడిచిన వారం రోజులుగా తమ కుటుంబం అత్యంత కష్టకాలాన్ని ఎదుర్కొంటోందని తెలిపారు.బాధ, ఆందోళన, నిస్సహాయతతో కూడిన పరిస్థితులు ఎదురయ్యాయని చెప్పారు. ఈ ఘటనల ప్రభావం కుటుంబంపై తీవ్రంగా పడిందని పేర్కొన్నారు. ఈ కష్ట సమయంలో తన తల్లి గుండెపోటుకు గురయ్యారని వెల్లడిస్తూ, అది కుటుంబానికి తీవ్ర మానసిక క్షోభ కలిగించిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ప్రజలు చూపిన ప్రేమ, మద్దతు తనకు ధైర్యాన్ని ఇచ్చాయని సంజయ్ పేర్కొన్నారు.బీజేపీ కార్యకర్తలు, నాయకులు, మద్దతుదారులు, స్నేహితులు, మీడియా మరియు సోషల్ మీడియా సభ్యులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపారు. మారుమూల గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలు తమ కుటుంబానికి మానసిక బలం ఇచ్చారని చెప్పారు.తమ కుటుంబం న్యాయ వ్యవస్థ పై పూర్తి విశ్వాసం ఉంచిందని బండి సంజయ్ స్పష్టం చేశారు. “చివరికి సత్యమే గెలుస్తుంది” అని నమ్మకం వ్యక్తం చేశారు.ఈ విషయం వ్యక్తిగత కుటుంబ అంశమని పేర్కొంటూ, దీనిపై చట్టపరంగా పోరాటం కొనసా గిస్తామని తెలిపారు. భావోద్వేగాలకు లోనుకావద్దని బీజేపీ కార్యకర్తలకు సంజయ్ విజ్ఞప్తి చేశారు.తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం కృషి కొనసాగించాలని కోరారు.చివరగా, “న్యాయం ఆలస్యం కావచ్చు కానీ నిరాకరించబడదు” అంటూ తన సందేశాన్ని ముగించారు.
http://www.teluguone.com/news/content/bandi-sanjay-expressed-his-grief-through-twitter-36-220041.html





