ఏపీ గవర్నర్ కు అస్వస్థత
Publish Date:Apr 25, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ శనివారం (ఏప్రిల్ 25) ఉదయం అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు తీవ్రమైన కడుపునొప్పి రావడంతో రాజ్భవన్ అధికారులు, సిబ్బంది ఆయనను చికిత్స నిమిత్తం విజయవాడ సమీపంలోని తాడేపల్లిలో ఉన్న మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. గవర్నర్ ఆసుపత్రిలో చేరారన్న వార్తతో అధికార వర్గాల్లో ఒక్కసారిగా కలకలం రేగింది. ప్రస్తుతం మణిపాల్ ఆసుపత్రిలోని అత్యవసర విభాగంలో నిపుణులైన వైద్యుల బృందం గవర్నర్కు చికిత్స అందిస్తోంది. ఆయనకు ప్రాథమికంగా పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ గత కొంతకాలంగా రాష్ట్రంలోని పలు అధికారిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే, శనివారం (ఏప్రిల్ 25) ఉదయం రాజ్భవన్లో ఉన్న సమయంలోనే ఆయనకు తీవ్ర అసౌకర్యం కలగడంతో తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుతూ పలువురు రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా ఆకాంక్షించారు. గవర్నర్ ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి యాజమాన్యం అధికారిక హెల్త్ బులెటిన్ను విడుదల చేసే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/ap-governer-ill-36-218209.html





