ఓ సీఎం సారో...నారా లోకేష్ సారో!
Publish Date:Apr 6, 2026
Advertisement
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు.. ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తుపై నీలి నీడలు- ఇదీ ప్రస్తుతం ఏపీ అంతటా ఉన్న ఇంజినీరింగ్ స్టూడెంట్స్ నోటి వెంట వినిపిస్తోన్న మాట. ఆంధ్రప్రదేశ్లో ఉన్నత విద్య చదువుతున్న వేలాది మంది ఇంజనీరింగ్ విద్యార్థుల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకమైంది. ప్రభుత్వం నుంచి అందాల్సిన- ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు సకాలంలో విడుదల కాకపోవడంతో, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నాయి. ముఖ్యంగా ఫైనల్ ఇయర్ విద్యార్థులను పరీక్షలకు అనుమతించకపోవడం, హాల్ టికెట్లు ఆపివేయడం వంటి చర్యలు వారి కెరీర్ను దెబ్బతీస్తున్నాయి. గత రెండు, మూడు అకడమిక్ ఇయర్స్ కి సంబంధించి.. ప్రభుత్వం నుంచి కాలేజీలకు అందాల్సిన కోట్లాది రూపాయల బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఆర్థిక లోటును భరించలేకపోతున్నామని చెబుతున్న యాజమాన్యాలు, ఆ భారాన్ని విద్యార్థులపైకి నెట్టేస్తున్నాయి. సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్న తరుణంలో, ఫీజు కడితేనే హాల్ టికెట్లు ఇస్తామని కాలేజీలు అంటుండటంతో ఇబ్బంది పడుతున్నారు విద్యార్ధులు. చదువు పూర్తయిన విద్యార్థులకు ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా, పెండింగ్ ఫీజులు చెల్లించాలని వేధిస్తున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటీవల బడ్జెట్ విడుదల సమయంలో ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్లు రీయింబర్స్మెంట్ కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, క్షేత్రస్థాయిలో ఇంకా రూ.7,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నట్లు విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రుల అసోసియేషన్లు-PAAP ఆరోపిస్తున్నాయి. ప్రభుత్వం ఒకవైపు చదువుకు పేదరికం అడ్డుకాకూడదు అని చెబుతూనే, మరోవైపు ఫీజుల పేరుతో విద్యార్థులు పరీక్షలకు దూరం కావడం తీవ్ర ఆందోళనకరంగా మారింది. ఇందుకు రాజాంలోని జీఎంఆర్ ఇని స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్ధుల ఉదంతమే ఉదాహరణ. ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధులను.. ఎగ్జామ్స్ రాయనివ్వకుండా అడ్డుకుంది జీఎంఆర్ ఐటీ యాజమాన్యం. తమకు ఫీజు రీఎంబర్స్ మెంట్ వస్తుందని.. తాము ఫీజులు కట్టలేమనీ.. యాజమాన్యానినికి వీరు ఎంతగానో ప్రాధేయపడ్డారు. అయినా సరే... కనికరం లేకుండా మూడు వందల మంది విద్యార్ధులను పరీక్షలు రాయకుండా అడ్డుకుంది యాజమాన్యం. యాజమాన్యం వేధింపులతో ప్రభుత్వానికి లేఖలు రాశారు విద్యార్ధులు. మంత్రి నారా లోకేష్ తమను ఆదుకోవాలని.. జీఎంఆర్ ఐటీ సిబ్బందిపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలనీ.. ట్విట్టర్, మెయిల్స్ ద్వారా ఫిర్యాదు చేస్తున్నారు. జీఎంఆర్ కఠిన నిర్ణయంతో.. తమ భవిష్యత్ దెబ్బ తింటుందని ఆవేదన చెందుతున్నారు వీరంతా. జీఎంఆర్ తాము ఖర్చు చేసే సేవాకార్యక్రమాల్లో ఇదో పెద్ద విషయమే కాదు. అలాంటిది పేద, మధ్యతరగతి విద్యార్ధులపై ఆ మాత్రం కనికరం లేకుంటే ఎలా? అని వీరు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాములుగా పరీక్షలు రాసిన తర్వాత ఫీజు చెల్లించని విద్యార్ధులకు సర్టిఫికేట్లు ఇవ్వరు. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే.. అసలు పరీక్షే రాయనివ్వక పోవడం.. అమానవీయంగా కనిపిస్తోంది. ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులందరినీ పరీక్షలకు అనుమతించేలా ఉన్నత విద్యామండలి కఠిన ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్ధులు. పెండింగ్లో ఉన్న పూర్తి నిధులను కాలపరిమితితో కూడిన షెడ్యూల్ ప్రకారం విడుదల చేయాలని కోరుతున్నారు వీరంతా. ప్రభుత్వ నిధుల కోసం విద్యార్థులను ఇబ్బంది పెడుతున్న కాలేజీలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలన్న డిమాండ్లు సైతం వెల్లువెత్తుతున్నాయి. ఒక విద్యార్థి చదువు ఆగిపోతే అది ఒక కుటుంబం ఆశలు ఆవిరైపోవడమే అంటున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, పరీక్షల సమయంలో విద్యార్థులు మానసిక ఆందోళనకు గురికాకుండా చూడాలని యావత్ విద్యార్థి లోకం కోరుకుంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు- @AndhraPradeshCMO, ఏపీ విద్యా మంత్రి నారా లోకేష్ ని @naralokesh ట్యాగ్ చేస్తూ.. సోషల్ మీడియాలో ఈ కథనాలను ట్రోల్ చేస్తూ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు ఫీజు రీఎంబర్స్ మెంట్ బాధిత విద్యార్ధులు. మరి చూడాలి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో.
http://www.teluguone.com/news/content/ap-fee-reimbursement-dues-36-216769.html





