ఏపీలో వారానికి ఒకరోజు నో వెహికల్ డే!
Publish Date:May 14, 2026
Advertisement
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పొదుపు మంత్రం పాటించాలని, ఇంధన వినియోగం తగ్గించాలని ఇచ్చిన పిలుపుతో ఏపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం (మే 15) జరిగిన కేబినెట్ భేటీ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇంధన పొదుపులో భాగంగా వారానికి ఒక రోజు నో వెహికల్ డే పాటించాలన్న తీర్మానానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇంధన పొదుపు చర్యలపై క్యాబినెట్లో కీలక చర్చ జరిగింది. వాహనాలు కాకుండా ప్రత్యామ్నాయ రవాణాపై దృష్టిపెట్టాలని నిర్ణంయించింది. నాదేశం - నా బాధ్యత పేరుతో పొదుపుపై ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఇకపై కొన్నాళ్ల పాటు మంత్రుల విదేశీ పర్యటనలు కూడా రద్దు చేసుకోవాలని నిర్ణయించారు. జిల్లాల పర్యటనలలోనూ కాస్ట్ కటింగ్ పాటించాలని, మెజారిటీ మీటింగులను వర్చువల్గా నిర్వహించాలని, ప్రెజెన్స్ అవసరం లేని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం అమలు చేయాలని కేబినెట్ తీర్మానించింది. అలాగే, ప్రభుత్వ కార్యాలయాల్లో ఏసీల ఉష్ణోగ్రత 24 నుంచి 27 మధ్యనే ఉంచాలని నిర్ణయించింది. ప్రభుత్వ కార్యక్రమాల నిర్వహణలో ఖర్చులు తగ్గించాలని, సోలార్ ఎనర్జీనే ఎక్కువ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని క్యాబినెట్ నిర్ణయించింది. మంత్రుల నుంచి అధికారుల వరకు వాహనాల సంఖ్యను, వినియోగాన్ని తగ్గించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు మాత్రమే తమ కాన్వాయ్లు తగ్గించుకుంటే సరిపోదని.. ఇతర ప్రత్యామ్నాయాలు చూడాలని సూచించారు. ప్రభుత్వ శాఖలన్నీ పొదుపు చర్యలపై దృష్టిసారించాలన్నారు. సోలార్ ఎనర్జీని పెద్ద ఎత్తున వినియోగించుకోవాలని చెప్పారు. అయితే.. ముఖ్యంగా వారానికి ఒక రోజు నో వెహికిల్స్ డే విషయంలో ప్రజలకు తెలియజేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు రెండు రోజులు ప్రజలకు అన్ని పొదుపు చర్యలు వివరిద్దామన్నారు.
మంత్రులు కూడా సెక్రెటేరియట్కు వచ్చేటప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్టు, ఈవీ వెహికల్, సైకిల్ను వినియోగించాలని క్యాబినెట్ నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/ap-cabinet-key-decession-36-219819.html





