విజయవాడ, తిరుపతికి గ్రేటర్ హోదా
Publish Date:May 14, 2026
Advertisement
విజయవాడ, తిరుపతి నగరాలకు గ్రేటర్ హోదా కల్పించడానికి ప్రభుత్వం వడవడిగా అడుగులు వేస్తోంది. ఆ రెండు నగరాల విస్తీర్ణం పెంచేందుకు.. 10 మండలాల్లోని 138 గ్రామ పంచాయతీలను విలీనం చేసే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది. గ్రేటర్ విశాఖపట్నం పరిధిలోకి మరో 64 పంచాయతీలను విలీనం చేసే ప్రతిపాదనల్ని పరిశీలిస్తున్నది. రాష్ట్రంలో జనగణన పూర్తయ్యేలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వాస్తవానికి గ్రేటర్ నగరాల ప్రతిపాదనలపై ఇప్పటికే నిర్ణయం తీసుకోవాల్సింది.. కానీ జనగణన కారణంగా పక్కన పెట్టారు. విజయవాడ గ్రేటర్ సిటీ ప్రతిపాదనలో భాగంగా ఆరు మండలాల్లో ఉన్న 75 పంచాయతీలను కార్పొరేషన్లో విలీనం చేయాలని 2014-2019 మధ్య ప్రతిపాదనలు వచ్చాయి. కానీ గత ప్రభుత్వం ఈ ప్రతిపాదనల్ని పక్కన పెట్టింది. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ ప్రతిపాదనల్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. విజయవాడ గ్రేటర్ కార్పొరేషన్ ఏర్పాటైతే కేంద్రం నుంచి నిధులు కూడా వస్తాయి. అందుకే ఈ ప్రక్రియన వేగవంతం చేయనున్నారు. విజయవాడలోకి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న ఎన్నో గ్రామాలు, పట్టణాలు కలిసిపోయాయి. కానీ మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల హోదాలోనే ఉడటంతో అభివృద్ధికి అవకాశం లేకుండా పోయింది. అందుకే విలీన ప్రక్రియను పూర్తిచేసి విజయవాడను గ్రేటర్ కార్పొరేషన్గా మార్చాలని భావిస్తున్నారు. తిరుపతిని గ్రేటర్ కార్పొరేషన్గా ఏర్పాటు, గ్రామాల విలీనానికి సంబంధించి గత ఏడాది తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపారు. తిరుపతి రూరల్, రేణిగుంట, చంద్రగిరి మండలాల్లోని 64 గ్రామాలను గ్రేటర్ తిరుపతిలోకి విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఇప్పటికే మంగళం, అవిలాలలు తిరుపతి నగరంలో కలిసిపోయాయి. అవి పంచాయతీలుగా ఉండటంతో అభివృద్ధి పనులు నిలిపోయాయి. ప్రతిపాదించిన గ్రామాలతో పాటుగా నగరంలో కలిసిన ప్రాంతాలతో గ్రేటర్ తిరుపతి నగరపాలక సంస్థను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విలీన ప్రక్రియపై త్వరలోనే క్లారిటీ వస్తుంది అంటున్నారు. గ్రేటర్ విశాఖపట్నంలోకి 64 గ్రామాలను విలీనం చేయాలని ప్రతిపాదించారు. ఈ గ్రామాలు ఆనందపురం, పద్మనాభం, పెందుర్తి మండలాల్లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన గ్రామాల్లో 60శాతం నగరంలో కలిసిపోయాయి. అందుకే ఈ పంచాయతీలను గ్రేటర్ పరిధిలోకి తీసుకుంటే మరింత అభివృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కూడా గ్రామాల విలీనం చాలా ముఖ్యమని చెబుతున్నారు. గతంలో అనకాపల్లి, భీమిలి, గాజువాక మున్సిపాలిటీలు గ్రేటర్ విశాఖపట్నంలో విలీనమైన తర్వాతే అభివృద్ధి చెందాయని చెబుతున్నారు. మొత్తం మీద విశాఖకు తోడుగా విజయవాడ, తిరుపతి గ్రేటర్ సిటీలుగా మారబోతున్నాయి.
http://www.teluguone.com/news/content/greater-status-to-vijayawada-and-tirupathi-36-219820.html





