2034 వరకు నేనే ముఖ్యమంత్రి.. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..!
Publish Date:Jul 30, 2026
Advertisement
తెలంగాణలో విద్యా వ్యవస్థ, నిరుద్యోగం, ఉద్యోగ నైపుణ్యాలు (స్కిల్స్) అంశాలపై ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్లోని ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రాంగణంలోని దాశరథి ఆడిటోరియంలో నిర్వహించిన ఫిన్లాండ్–జర్మనీ ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ప్రతినిధుల ఇంటరాక్షన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారాయి. ఉన్నత విద్య పూర్తిచేస్తున్న విద్యార్థుల్లో ఆచరణాత్మక జ్ఞానం, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు ఆశించిన స్థాయిలో లేవని ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. సమాజంలో డిగ్రీలపై మోజు పెరుగుతోందని, కానీ మారుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ప్రాక్టికల్ స్కిల్స్ నేర్చుకోవడంలో చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితిని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రతి సంవత్సరం సుమారు లక్షా 10 వేల మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారని, అయితే వారిలో చాలామందికి ఒక ఉద్యోగ దరఖాస్తు (జాబ్ అప్లికేషన్) కూడా సరిగా నింపడం రాదని అన్నారు. కేవలం సర్టిఫికేట్ ఉండటం సరిపోదని, పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోతే ఆ చదువు ఆశించిన ఫలితాన్ని ఇవ్వదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, విద్యాసంస్థల బాధ్యతను కూడా సీఎం గుర్తు చేశారు. "మీ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఒక తెల్ల కాగితం ఇచ్చి జాబ్ అప్లికేషన్ రాయమని చెప్పండి. అప్పుడు వారి నిజమైన నైపుణ్యం ఏంటో తెలుస్తుంది" అని వ్యాఖ్యానించారు. నైపుణ్యాలు లేకుండా కేవలం సర్టిఫికేట్లకే పరిమితమయ్యే విద్యా విధానాన్ని "క్రిమినల్ వేస్ట్"గా అభివర్ణించారు. ఇంజనీరింగ్ చదివామని చిన్న ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడరని, అదే సమయంలో సరైన నైపుణ్యాలు లేక మంచి ఉద్యోగాలు కూడా పొందలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల తల్లిదండ్రుల పరిస్థితిని కూడా సీఎం ప్రస్తావించారు. "ప్రతి నియోజకవర్గంలో ప్రజాప్రతినిధుల వద్దకు తల్లిదండ్రులు వచ్చి తమ పిల్లలు ఇంజనీరింగ్ పూర్తి చేశారని, ఉద్యోగం కల్పించాలని కోరుతుంటారు. పిల్లల చేతిలో సర్టిఫికేట్ చూసి వారు ఆనందపడతారు. కానీ ఆ సర్టిఫికేట్కు తగిన నైపుణ్యం వారి పిల్లలకు ఉందా లేదా అనేది చాలామందికి తెలియదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యాశాఖ బాధ్యతలపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. "మంచిగా పని చేసినందుకు నేను విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేయాలా? అర్జెంటుగా విద్యాశాఖ మంత్రిని నియమించాలని కొందరు అడుగుతున్నారు. నేను ఇంత కమిట్మెంట్తో పని చేసినందుకు విద్యాశాఖ నుంచి తప్పుకోవాలా? టీచర్లకు ఎలాంటి వివాదం లేకుండా ప్రమోషన్లు ఇచ్చినందుకు తప్పుకోవాలా?" అని ప్రశ్నించారు. అలాగే, "విద్యాశాఖ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి రోజూ విమర్శలు ఎదుర్కొంటున్నాను. ఆ విమర్శలు నాకు పడకుండా ఉండాలంటే ఉపాధ్యాయులే సహకరించాలి. లేదంటే ఈ శాఖను మరెవరికైనా అప్పగించమంటే అప్పగిస్తాను" అని అన్నారు. , "తెలంగాణలో ఇద్దరే మేధావులు ఉన్నారు. ఒకరు జైపాల్ రెడ్డి, మరొకరు కే. కేశవరావు" అని వ్యాఖ్యానించారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, తల్లిదండ్రులు, రాజకీయ వర్గాల మధ్య ఈ అంశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకువచ్చి, థియరీతో పాటు ప్రాక్టికల్ ట్రైనింగ్, ఇండస్ట్రీ ఆధారిత నైపుణ్యాల అభివృద్ధిపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2034 వరకు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఆ లోపు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి పూర్తి బాధ్యత వహిస్తానని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 55 రోజుల్లో 11 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. ఇలాంటి నియామకాలు గతంలో ఎప్పుడైనా జరిగాయా అని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం ఉపాధ్యాయులదేనని, అందుకే వారి సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. CM Revanth Reddy, Telangana Education Reforms, Telangana Teacher Recruitment, MCRHRD Meeting, Teacher Union Problems, Telangana Chief Ministe, Finland–Germany Exposure Program
http://www.teluguone.com/news/content/-cm-revanth-reddy-36-227567.html





