మీరు భేటీ అయ్యారా? లేదా?.. యనమల

ఇప్పటికే ఓటుకు నోటు కేసులో ఎప్పుడు ఏ వార్త వినిపిస్తుందో అని అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి రోజుకో వార్త వింటూనే ఉన్నాం.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి యనమల రామకృష్ణ కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి పదిరోజుల ముందే వైకాపా అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి, తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్ రావు, తెరాస నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ ముగ్గురూ భేటీ అయ్యారని బాంబు పేల్చారు.

 

ఆంధ్ర రాష్ట్రంలో తెదేపా ఎదుగుదల చూసి..తెలంగాణ ప్రభుత్వంలో కూడా తెదేపా అధికారంలోకి వస్తుందనే భయంతో ఇలాంటి కుట్రలు పన్నారని మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ ఉనికి పోయింది.. అలాగే వైకాపా ఉనికి కూడా పోతుందనే భయంతో జగన్ కేసీఆర్ తో కలిసి చంద్రబాబును దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే జగన్, హరీశ్, స్టీఫెన్ సన్ ముగ్గురు భేటీ అయి చంద్రబాబుపై కుట్ర పన్నారని.. మీరు ముగ్గురు కలిసి భేటీ అయ్యారా? లేదా? అని.. దమ్ముంటే నేనడిగే 24 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని యనమల ప్రశ్నించారు.