సీఈసీకి తప్పిన ప్రమాదం
posted on Oct 16, 2024 4:32PM
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ తృటిలొ పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతి కూల వాతావరణంలో చిక్కుకుంది. దీంతో అప్రమత్తమైన పైలట్ హెలికాప్టర్ ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
ఈ సంఘటన ఉత్తరాఖండ్ పిథోర్ గఢ్ జిల్లాలో బుధవారం (అక్టోబర్ 16) జరిగింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ఆయన ఉత్తరాఖండ్ లోనిమున్సియారీకి వెడుతున్నారు. మార్గ మధ్యంలో పర్వత ప్రాంతాలలో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రతికూల వాతావరణంలో చిక్కుకుంది. పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి హెలికాప్టర్ ను అత్యవసరంగా దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. వాతావరణం పరిస్థితులు మెరుగుపడిన తరవాత సీఈసీ యథావిధిగా తన ప్రయాణాన్ని కొనసాగించి మున్సియారీకి వెళ్లారు.