"చెప్తాను నాన్నా.... ఓసారి చెల్లాయి తో, ఆయనతో కూడా మాట్లాడి చెప్తాను" అంది.
నెల దాటినా ఇద్దరి దగ్గర్నించి ఎలాంటి సమాధానం లేదు. మరో ఇరవై మూడు వేలు తగ్గాయి.
మళ్ళీ ఫోన్ చేశాడు. "సారీ నాన్నా , చాలా బిజీగా వున్నాను. ఆయనతో మాట్లాడలేదు" అంది పెద్దమ్మాయి.
'అక్క నాతొ ఈ విషయం డిస్కస్ చేయలేదు నాన్నా.... నేను మాట్లాడి చెప్తాలే" అంది చిన్నమ్మాయి.
మరో నెల గడిచింది. బ్యాంక్ బ్యాలెన్స్ చిక్కిపోతోంది. ఆనంద్ లో ఆందోళన మొదలైంది. ఉండబట్టలేక భార్యతో తన ఆందోళన వ్యక్తం చేశాడు.
"వాళ్ళు ఆడపిల్లలండి" అంది జానకి.
"అయితే"అన్నాడు.
"పెళ్ళయ్యాక ఆడపిల్లలు మన పిల్లలు కాదు. వాళ్ళ మీద మనకేమీ హక్కులుండవు. మనకి ఏం చేయాలన్న వాళ్ళ భర్తల అనుమతి కావాలి' అంది.
"కానీ, వాళ్ళు ఆధునిక యువతులు జానకీ" అన్నాడు.
"అమ్మాయిలూ ఆధునికులు అయినా సంప్రదాయాలు, ఆచారాలు ఆధునికం కాదు కదా."
విస్తుబోయాడు ఆనంద్.... 'అంతేనా?" జానకి అన్నట్టే జరిగింది.
"మేము కూడా ఇక్కడ ఇల్లు కోనాలనుకుంటున్నాం నాన్నా.... మేమూ లోన్ తీసుకోవాలిగా.... పైగా మా అత్తగారు వాళ్ళు వాళ్ళ ఇల్లు రీమోడల్ చేయాలను కుంటున్నారు. వాళ్ళకి డబ్బు పంపాలి. ఇన్ని ఖర్చులుంటే కష్టం నాన్నా... చూద్దాం లే మెల్లిగా నేను చెల్లాయి మా వాళ్ళకి తెలియకుండా అంతో, ఇంతో పంపిస్తాం. ఈలోగా నువ్వు కడుతూ వుండు" అంది పెద్దమ్మాయి.
"నిన్ననే మేము కూడా అగ్రిమెంట్ సైన్ చేశాం నాన్నా. బోలెడంత అప్పు, దాదాపు మూడు కోట్లు మన ఇండియన్ కరెన్సీ లో. అయన ఇప్పటికే వాళ్ళ పేరెంట్స్ కి కారు కొన్నారు. అపార్ట్ మెంట్ కొన్నారు. ఇంకా నీకు పంపించడం అంటే కష్టం . అయన కూడా ఒప్పుకోరు" అంది.
స్థాణువై పోయాడు. అవమానంతో దహించుకు పోయాడు. వాళ్ళ భర్తలు వాళ్ళ తల్లిదండ్రులకి ఇల్లు కొనచ్చు. కార్లు కొనచ్చు. కానీ వీళ్ళు మాత్రం తనకి డబ్బు పంపడానికి భర్తల అనుమతి కావాలా? వాళ్ళు ఒప్పుకోరా? ఏంటి ఈ దౌర్భాగ్యం ! తనేం పాపం చేశాడు?
అదే అన్నాడు భార్యతో "ఇదేంటి జానకీ మగపిల్లల తల్లితండ్రులు కొడుకుల దగ్గర హక్కుగా అన్నీ పొందచ్చా? మనకి ఆ హక్కు లేదా? ఇదేం న్యాయం?"
"న్యాయాన్యాయాల సంగతి నాకు తెలియదు కానీ, ఇదే ,లోకరీతి... ఆడపిల్లలు పెళ్ళయ్యేవరకే మన పిల్లలు..పెళ్ళయ్యా క వాళ్ళ సంసారం, వాళ్ళ జీవితం అంతా వేరు.... వాళ్ళు పరాధీనలు...." అంది జానకి.
"అదేంటి జానకీ వాళ్ళు కూడా వాళ్ళ భర్తలతో సమానంగా లక్షలు సంపాదిస్తున్నారు. మనం వాళ్ళని అప్పు చేసి, అన్నీ కోల్పోయి మరీ చదివించాం.... ఇవాళ మనం వాళ్ళకి పరాయి వాళ్ళమా? అందుకా నేను వాళ్ళని అంత కష్టపడి ఉన్నతస్థితికి తీసుకొచ్చింది."
ఓదార్పుగా అతడిని దగ్గరకు తీసుకోవడం తప్ప జానకి ఏమీ చేయలేకపోయింది.
ఇంతేనా, ఇదేనా జీవితం ...తట్టుకోలేని మనోవేదన, భరించలేని ఆర్ధిక సమస్యలు, ఆనంద్ యుద్ద ప్రాతిపదికన ఉద్యోగ ప్రయత్నాలు చేశాడు.
నెలకి ఇరవై వేల జీతంతో ఒక ప్రవేటు కంపెనీ లో అకౌంటెంట్ గా ఉద్యోగం దొరికింది కానీ చాలా దూరం వెళ్ళాలి. అయినా తప్పదు.
ఒద్దానాలనుకుంది జానకీ కానీ, కళ్ళముందు అప్పులు కనిపిస్తుంటే ఎలా అనగలదు.
ఏడు నెలలైంది. మనోవేదన, వయసు అనుమతించని శారీరక శ్రమ , ఆనంద్ ఆరోగ్యంలో మార్పోస్తోంది. రోజు, రోజుకీ నీరసిస్తున్నాడు. మధ్య మధ్య ఆగని దగ్గు, నడుం నొప్పి.
అతని పరిస్థితి చూస్తుంటే జానక్కి కన్నీళ్ళగలేదు. బలవంతంగా దుఃఖం అణుచుకుని "నడుం కి ఏదన్నా బామ్ రాయనా" అంది మృదువుగా.
అయన "ప్చ్" అంటూ పక్కకి తిరిగాడు.
"రండి కుర్చీలో ఎందుకు? లోపల పడుకుందురు గాని" అంది.
"ఓపిక లేదు జానకీ.... కాసేపు ఇలాగే వుండనీ . ఒకేసారి డిన్నర్ అయ్యాక లోపలికి వస్తాను" అన్నాడు.
జానకి లోపలికి వెళ్ళి చపాతీ లకి పిండి తడిపింది. ఫ్రిజ్ లో తరిగి వుంచిన ఆకుకూర తీసి కూర పోపెసింది. రాగి జావ కాచింది. మధ్య మధ్య భగవంతుడా నా భర్తని కాపాడు అని వేడుకుంటూ వంట పూర్తీ చేసింది.
సమయం ఎనిమిదిన్నర . ఆనంద్ ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడో అతని దగ్గరకు వచ్చేసరికి గాడ నిద్రలో వున్నాడు.
లేపాలనిపించలేదు. ఈయనకి తిండి కన్నా విశ్రాంతి ముఖ్యం అనుకుంది. కానీ, తిరిగి తెల్లవారి ఆఫీసు కి వెళ్ళాలి కాబట్టి తిండి కూడా ముఖ్యమే అనుకుంది.
అంతలో జానకి అన్నగారు నారాయణ లోపలికిరావడంతో "రా అన్నయ్యా" అంటూ ఆహ్వానించింది.
అక్కడికి కొంచెం దూరంలో అతని ఇల్లు. వారానికి రెండుసార్లు వచ్చి ఆప్యాయంగా పలకరించి మంచీ, చెడూ మాట్లాడి వెళ్తుంటాడు.
"ఏమ్మా వేళగాని వేళ పడుకున్నాడెంటి బావ" అడిగాడు.
"ఆఫీసు నుంచి అలసిపోయి వచ్చారు .... పడుకున్నారు" అంది జానకి.
"ఏం ఆఫీసో.... ఇంతకాలం చేసింది చాల్లేదా? ఎందుకమ్మా ఈ వయసులో కృష్ణా రామా అంటూ కాలక్షేపం చేయక."
అదోలా నవ్వింది జానకి.... "నువ్వలా నవ్వకు నాకు ఒళ్ళు మండుతుంది. ఎమైందిట వాళ్ళకి ఎందుకు డబ్బు పంపడం లేదు. అడగందే అమ్మయినా పెట్టదు. అడిగి వసూలు చేయండి."
"వాళ్ళ కుండే సమస్యలు వాళ్ళ కున్నాయి. పోనీలే అన్నయ్యా " అంది జానకి.
"ఏం సమస్యలమ్మా వాళ్ళకి?ఇల్లు కొనుక్కోడమేగా....వాళ్ళ అప్పులు కొట్లలో వుంటాయి. దాని ముందు మీ అప్పెంత ? తిప్పి తిప్పి కొడితే ఏడాది పాటు చెరో ఐదొందల డాలర్లు పంపిస్తే ఎంతలో తీరుతుంది?"
'అంత ఎక్కడి నుంచి తెస్తారన్నయ్యా ఆడపిల్లలు."
"ఏంటమ్మా ఆడపిల్లలు.... ఆడపిల్లలని చదువులు చెప్పించకుండా వదిలేశావా? నీ రెండో అల్లుడు తల్లిదండ్రులకి ఇన్నోవా కారు కొనిచ్చాడు. ఆ మధ్య భువనగిరి దగ్గర ఐదొందల గజాల స్థలం కొన్నారు. ఆయనా రిటైర్ అయ్యాడు. మీ అయన కన్నా చిన్న ఉద్యోగమే. ఇవన్నీ ఎలా వస్త్గున్నాయి వాళ్ళకి?"
"అవన్నీ మనం అడగగలమా అన్నయ్యా. మన సంస్కృతీ , సంప్రదాయాలు ఆడపిల్లల సొమ్ము తినకూడదనిగా చెబుతున్నాయి."
"గాడిదగుడ్డేం కాదు. ఏం ఆడపిల్లలని వాళ్ళని సరిగా పెంచలేదా? ఏం లోటు చేశారు? ఈరోజుల్లో అదా,మగా తెదాలెం లేవు. హక్కులు ఇద్దరికీ వున్నపుడు, బాధ్యతలు కూడా ఇద్దరూ పంచుకోవాలి. అయినా కొడుకైనా, కూతుళ్ళయినా మీకు వున్నది వాళ్ళే. మీ కష్టసుఖాలు వాళ్ళు గాక ఎవరు చూస్తారు? అంతా మీ చేతకానితనంలే. ఫోన్ నెంబర్ ఇవ్వుజడిస్తానిద్దరినీ . ఏం ఈ ఇల్లు మీరు కరిగించుకుని తింటారా?కట్టుకు పోతారా? మీ తదనంతరం వాళ్ళకేగా దక్కేది. ఆ జ్ఞానం వాళ్ళ కన్నా వుండాలి. వాళ్ళ భర్తలకన్నావుండాలి"ఆవేశంగా అంటున్న నారాయణ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నెమ్మదిగా అంది జానకి.
"పోనీ అన్నయ్యా.... వదిలేయ్.... రేపు శనివారం తీరుబడిగా వుంటారు గా అప్పుడు నేను మట్లాడతాలే ఆయనసలె మనోవ్యాధితో వున్నారు ప్లీజ్" రెండు చేతులూ జోడించిన చెల్లెలి వైపు బాధగా చూశాడు నారాయణ.
"సరేలే వెళ్లొస్తాను మరి" అంటూ లేవబోతున్న నారాయణ ఆనంద్ ఆవలిస్తూ లేవడంతో తిరిగి కూర్చున్నాడు.
"ఎంతసేపైంది నారాయణ వచ్చి'అడిగాడు.
"పది నిముషాలేలే! ఏంటి ఎటూ గాని వేళ పడుకున్నారు?' అడిగాడు నారాయణ.
"బాగా అలసిపోయాను. చాలాసేపు పడుకున్నానా జానకీ" అడిగాడు.
"లేదులెండి. లేచి మొహం కడుక్కోండి కాస్త అలసట తీరుతుంది" అంది జానకి.
"వెళ్తున్నా" అంటూ లేచిన నారాయణతో "భోం చేసి వేళ్ళన్నయ్యా" అంది.
"లేదులేమ్మా మీ వదిన వంటచేసి వుంటుంది గా తినకపోతే గొడవ చేసేస్తుంది. వస్తాను మరి. వస్తాను బావగారూ " అంటూ నారాయణ వెళ్ళిపోయాడు.
జానకి నిట్టూర్చింది. ఆడపిల్లలకి పుట్టింటి మీద ఎప్పటికీ సర్వాధికారా లుంటాయి. కానీ పుట్టింటి వారిపట్ల బాధ్యత లుండవు . ఆడపిల్లల సంపాదన పుట్టింటివాళ్ళ ఆశించకూడదు. ఇది న్యాయమేనా అన్న ఆలోచన కూడా ఆడపిల్ల తల్లిదండ్రులకి రాకూడదు.
మరో పది రోజులు గడిచాయి. ఆనంద్ ఆరోజు ఆఫీసు నుంచి నూట నాలుగు డిగ్రీల టెంపరేచర్ తో వచ్చాడు. జానకి ఆందోళనకి అంతులేకుండా పోయింది.
వడలిపోయి వచ్చిన భర్త వంటిమీద చేయ్యేసరికి అప్పుడే అట్లు వేసిన పెనంలా మండిపోతోంది.
గబగబా నారయణ కి ఫోన్ చేసి డాక్టర్ ని తీసుకురమ్మని ఆనంద్ ని పడుకోబెట్టి తడిగుడ్డతో ఒళ్ళు తుడిచింది.
నారాయణ డాక్టర్ ని తీసుకొచ్చాడు. వైరల్ ఫీవర్ అని ఇంజక్షన్ చేసి మందులు రాసిచ్చాడు డాక్టర్.
నారాయణ మందులు, గ్లూకోజ్ వగైరా తీసుకొచ్చి ఇచ్చి ఆనంద్ పరిస్థితి కి కళ్ళంబడి నీళ్ళు తిరుగుతుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు.
మూడు రోజులు దాటినా జ్వరం తగ్గలేదు. జానకి నిద్రాహారాలు మాని చూసుకుంటోంది భర్తని. నారాయణ రోజూ రెండు పూటలా వచ్చి చూసి వెళ్తున్నాడు.
నాలుగోరోజు ఆనంద్ మూసిన కన్ను తెరవలేదు. అప్పటివరకూ గంభీరంగా వున్న జానకి గట్లు తెగిన గోదావరి అయింది.
