Previous Page Next Page 
కాంతి రేఖలు పేజి 87


    "మైకం వచ్చేవరకు త్రాగి, మాంసభక్షణ చేసి, స్త్ర్రీ పురుషులు కూడి సుఖించాలి"అన్నాడు.
   
    వింత పూజ!

     విచిత్రమైన భాష్యం!

    జనానికి ప్రాణభయం. అందుకే మాట్లాడలేక వెళ్ళిపోయారు  డప్పులతో , బాజాలతో మంత్రాలతో క్షుద్రశక్తులను పారద్రోలవచ్చి,  పూజర్లు భైరవోపాసకులు మద్యం. మాసం సేవించటంతో కుస్తీ పడుతున్నారు. ఊరి జనమంతా నిశ్చింతగా నిదురపోవాలనుకున్నారు.

    "ఈ దేవుడికట త్రాగితే తృప్తి కల్గుతుందట...."కొందరు ఇది అవకాశంగా తీసుకుని , కుతి తీరా త్రాగి, తందనాలు ఆడారు.

    మూడు రోజులు ఊరు ప్రశాంతంగా ఉన్నది.

    అమ్మయ్య అనుకున్నారంతా.

    "నడమంత్రం పోరలు నడమంత్రపు మాటలు అంటారుగాని, అమ్మో, చేతబడి బాణాలతి ఉంది"

    "లేకపోతే పూజ చేయగానే తగ్గుతుందా!?

    "అవును....."

    " ఏమో! దేవుడు కనిపించడు దయ్యం కనిపించదు."

     కనిపించని శక్తులకే దేవుడు ,దయ్యం అని పేరు పెట్టారు." అన్నారు కొందరు మొత్తానికి అందరూ నిశ్చితంగా ఉన్న సమయంలో సిద్దార్థ  ఉండే పేటలో తెల్లవారేసరికి అందరికి వాంతులు ,బేదులు,ఏ కొందరికో తప్ప.అందరూ సిద్దార్థే కారణం  అని తిడుతున్నారు.

    ఆస్పత్రికి వెళ్దామంటే దేవుడికి కోపం వస్తుంది కాబట్టి రామన్నారు.

    సిద్దార్థకు అయోమయంగా ఉంది.ఒక్క నిముషం అయోమయంగా కొట్టుకులాడి, వెంటనే పార్వతమ్మను, చిట్టిని,ఆస్పత్రిలో చేర్చించారు. కొందరు తాము చేరారు.

    మరి కొందరు మొండికేసారు.

    ఇది యెలా జరిగింది!

    యెంత ఆలోచించినా అర్ధం కాలేదు.

    బలవంతంగా అందరికి మందులు ఇచ్చి వచ్చేసరికి  రాత్రి పదిగంటలయింది.

    దేవత మహిమ కాదు,స్పష్టం అవుతోంది.మరింకేం అయిఉంటుంది దేనివల్ల వాంతులు, భేదులు అవుతాయి! విషాహారం, లేదా, కల్తీనీరో త్రాగాలి.అంతే.

    "అమ్మా!" సిద్దార్థ గట్టిగా కేకవేసాడు.

    "ఏమిటి బాబూ!"

    "మీరు, నేను భోజనాలప్పుడు ఒకటే  నీరు వాడామా!"

    ఆమె  క్షణం ఆలోచించింది.

    "ఒకేబావి నీళ్ళు బాబూ! ప్రొద్దున తెచ్చిన నీళ్ళు  నువ్వు  అన్నం తినగానే అయిపోయాయి, చిట్టి  మరొక బిందెడు రాత్రి తీసుకువచ్చింది."

    "యురేకా...." అంటూ హుషారుగా బయటకు పరుగెత్తాడు సిద్దార్థ.అతని ఆనందం ఇంతా, అంతా కాదు.

    "బాబూ!"

    "వస్తానమ్మా అరగంటలో వస్తాను...." వెళ్ళిపోయాడు.


                                      23


    రాత్రి యెనిమిది గంటలయింది. బావికి దూరంగా ఉన్న చెట్టు  ప్రక్కకి ఖాదర్ , సిద్దార్థ నక్కి కూర్చున్నారు. వాళ్ళకు కాస్త దూరంగా జవాన్లు కూర్చున్నారు.

    "మీ అనుమానం అనుకుంటాను మిస్టర్ సిద్దార్థ!"

    " నా అనుమానానికి ఆధారం ఉంది ఖాదర్ గారూ. మీరు ఉండండి." అన్నాడు .వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగానే ,ఒక వక్తి అడుగులో ,అడుగులో,అడుగు వేసుకుంటూ వచ్చాడు అటు, ఇటు చూసాడు.

    ఊరు నిదురబోతున్నట్టు   ఉంది.

    ఊరంతా నిశబ్దం వ్యాపించినట్టుంది.


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS