Previous Page Next Page 
ఒప్పందం పేజి 31

       
                            ఏది నీ గమ్యం?

    "ఇది నిజమేనా? సోఫాలో నిస్తేజంగా వెనక్కి వాలిపోయి, స్థాణువులా కూర్చుండిపోయింది కృష్ణవేణి. ఇది నిజమేనా? తను కలగంటుందా?ఆమె చేతిలో ఉన్న కాగితం ఫ్యాన్ గాలికిరెపరేప లాడుతోంది. ఏమాత్రం ఆమె చేతి బిగువు సడలినా ఎగిరిపోవడానికి సిద్దంగా ఉంది.కృష్ణవేణి గాజు కళ్ళతో ఆ కాగితం వైపు చూసింది. స్వేచ్చగా ఎగిరిపోతూ లాలిత్య ఊపుతోన్న చేయిలా కనిపించింది ఆ కాగితం.ఒక్కసారిగా ఉలిక్కిపడింది. "నో....అలా జరక్కూడదు" గట్టిగా అరిచాననుకుంది. కానీ గొంతుపెగిలి ఒక్క అక్షరంకూడా బైటికి రాలేదు. జరక్కూడదేంటి.... రెక్కలోచ్చినచిన్నారి చిలక లేత రెక్కలు విదిలించి వెళ్ళిపోయింది. తానిప్పుడు పరిపూర్ణమైన స్త్రీనని గుర్తు చేస్తూ అక్షరాల అక్షింతలు చల్లుతోంది.
    ఎలా పెంచింది లాలిత్యని!.... పుట్టినప్పటి నుంచి కళ్ళల్లో పెట్టుకుని పెంచింది. నేలమీద కాలు పెడితే కందిపోతుందేమో అని అరచేతుల మీద నడిపించింది. చిన్నప్పటి నుంచి లీలావతి గర్భంలో ఉండగానే నారదుడు ప్రహ్లాదుడి కి హరినామ సంకీర్తనం నేర్పినట్లు పసిపిల్లగా ఉన్నప్పటి నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలను జోల పాటలుగా పాడింది. స్వేచ్చ, స్వాతంత్యం మీద బెడ్ టైం స్టోరీస్ చెప్పింది. స్త్రీ కేవలం వంటింటికి పరిమితం కాదని, సమాజ ప్రగతి రధానికి స్త్రీ కూడా ఒక చక్రం అనీ, ఎప్పుడూ ఆ చక్రం కుంటూ పడకుండా నేర్పింది. కానీ, కానీ.... ఇదేంటి ఇలా ఎలా జరిగింది? ఎప్పుడూ ఏ విషయంలోనూ నాన్న ఉంటె ఇలా చేసేవాడా? అనే మాట తన నోటి నుంచి రాకూడదని ఎంతో తపన పడింది. తన వ్యాపకాలతో , తన ఉద్యోగ బాధ్యతలతో తీరిక లేక లాలిత్య ని స్కూలుకి తీసుకువెళ్ళి, తీసుకు రావడానికి కారు కొని , డ్రైవర్ ని పెట్టింది. తను బస్సులో వెళుతూ లాలిత్య ని కారులో తిప్పింది. యవ్వనం లో అడుగు పెడుతోందన్న విషయం తెలిసిన దగ్గర్నించి పొంచి ఉండి సమయం చిక్కగానే కాటేసే తోడేళ్ళ గురించి పాముల గురించి నూరి పోసింది. ధైర్యం, సాహసం, పట్టుదల, కృషి ఇవే జీవితంలో ఉన్నత స్థానంలో నిలవడానికిఅవసరమయ్యే నాలుగు స్తంభాలని ఎన్నోసార్లు జీవిత పాఠాలు చెప్పింది. ఈ ధైర్యం తను నూరిపోసినందుకెనా? ఎన్నడూ ఎవరికీ, దేనికీ తలోంచోద్దు ఎవరినీ దేనికీ దేబిరించద్దు . ధీమాగా, దర్జాగా బతకాలి అని చిన్నప్పటి నుంచీ ఉగ్గుపాలతో నూరి పోసినందుకెనా "నీవు నేర్పిన విద్యయే నీరజాక్షీ" అని వెక్కిరిస్తూ వెళ్ళి పోయింది.
    ప్రేమించిన శశిని పెళ్ళి చేసుకుంటానంటే ముందు కాదన్నా తరవాత తన చేతుల మీదుగా పెళ్ళి చేసింది. "చదువాపకే తల్లీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయి, నాలాగా 'వివాహం విద్యానాశాయ' అనే నానుడి నిజం చేయకు' అని నచ్చజెప్పి కాపురానికి పంపించింది. శశికి బెంగుళూరు లో ఉద్యోగం.... సాప్ట్ వేర్... ఇంజనీరు... బియస్సీ కంప్యూటర్స్ సైన్స్ చేసిన లాలిత్య కి అతను కొంతకాలం లెక్చరర్ గా ఉన్నాడు. ఆ తరవాత అతనికి మంచి ఉద్యోగం వచ్చింది. అతని ఉద్యోగం రావడం, బియస్సీ పూర్తీ చేయడం ఒకసారి జరిగాయి.
    ఒకానొక ఉదయం "శశిని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను" అని చెప్పిన లాలిత్య వైపు నిర్ఘాంత పోయి చూసింది. ఇంకా తన చేతుల్లో బుడి, బుడి అడుగులు వేస్తున్న లాలిత్యే కనిపించి హతశురాలైంది. కనీసం "నీఅభిప్రాయం ఏంటమ్మా" అని కూడా అడక్కుండా తన నిర్ణయం చెప్పింది. ఆమెకేం చేయాలో అర్ధం కాలేదు.
    ఆ తరవాత గోపాల్ దగ్గర్నుంచి రికమెండేషన్ తెచ్చింది పెళ్ళికి అంగీకరించమని. అప్పుడు కానీ అర్ధం కాలేదు. తండ్రీ కూతుళ్ళు తనకి తెలియకుండా కలుస్తూనే ఉన్నారని , తండ్రితో అనుబంధం వదులుకోలేదని పుట్టినరోజు కానుకలు, పండగాలకి కొత్త బట్టలు చూపించి ఫ్రెండ్స్ ఇచ్చారంటే నమ్మింది.
    ఎప్పుడైతే గోపాల్ లాలిత్య పెళ్ళి విషయంలో కలగ జేసుకున్నాడో అప్పుడు తన మీద తనకే జాలేసింది. తనకి తెలియకుండా ఏదో జరిగుతోందన్న విషయం గ్రహించి అవమానంగా భావించింది. కానీ, లాలిత్య కోసం కొంత, సమాజం కోసం కొంతా తనని సంసిద్ధం చేసుకుని పెళ్ళికి అంగీకరించింది. కన్యాదానం చేయడానికి పీటల మీద ఎత్తి పరిస్థితుల్లో గోపాల్ పక్కన కూర్చోడానికి ఒప్పుకోక పోవడంతో రిజిస్ట్రార్ ఆఫీసు లో పెళ్ళి చేసి మంచి హోటల్ లో రిసెప్షన్ ఏర్పాటు చేశాడు గోపాల్.
    ఆ రిసెప్షన్ కి తానుఒక గెస్ట్ గానే వెళ్ళింది. గోపాల్, అతని అక్క చెల్లెళ్ళు కూడా కుటుంబాలతో వచ్చారు. వాళ్ళమ్మా, నాన్న చనిపోవడానికి తానే కారణం అని శాపనార్ధాలు పెట్టారు. మరి నా తల్లి తండ్రి చనిపోడానికి ఎవరు కారణం అని అడగాలనుకుంది. కానీ ఎవరితో ఏమీ మాట్లాడకుండా ఆవేశం, ఆవేదన అణచుకుని కార్యక్రమం జయప్రదంగా జరగడానికి నోరు మూసుకుంది.
    శశితో కాపురానికి లాలిత్య బెంగుళూరు వెళ్ళే రోజున తన ఆవేదనంతా వెళ్ళగక్కింది. "పెళ్ళితో ఆడది ఏం పోగొట్టుకుంటుందో , ఆ పోగొట్టుకున్నది పొందడానికి తిరిగి ఎంత మానసిక వేదన పడాలో,ఎంత సంఘర్షణ పడాలో లాలిత్య కు చెప్పింది.
    "ముందు నుంచే జాగ్రత్తగా ఉండి, నీ అస్తిత్వం కాపాడుకో" అని బోధించింది. అన్నిటికీ లాలిత్య మౌనంగా ఊకోట్టింది.
    కానీ, చిత్రంగా లాలిత్య తానంతట తానే చదువు మానేసింది. "ఎందుకమ్మా, నేను ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏం ఉంది?శశికి లక్ష దాకా వస్తోంది నెలకి" అంది. మొదట్లో కూతురు కాపురం ఎలా ఉందొ చూడడానికి వెళ్ళినపుడు.
    శశికి అదిష్టం, శశికి ఇదిష్టం , శశి అలా అన్నాడు, శశి ఇలా అన్నాడు శశి నామస్మరణ లో విసిగించేసింది. ఆరోజే కృష్ణవేణి లాలిత్యనిబాగా మందలించింది. "పెళ్ళైన కొత్తలో అలాగే ఉంటుంది. భర్తే లోకంలా.... కానీ రోజులు గడుస్తుంటే, నీ పర్సనల్ లైఫ్ గుర్తొస్తుంది. అప్పుడు అర్ధమవుతుంది.ఏం కోల్పోయావో" అంటూ స్త్రీకి ఆర్ధిక స్వాతంత్ర్యం ఎంత అవసరమో చెప్పింది. అన్నిటి కన్నా కృష్ణవేణి ఆశ్చర్యానికి గురి చేసిన విషయం శశి తల్లితండ్రులు తరచూ డిల్లీ వెళ్ళి నెలల తరబడి అక్కడే ఉండడం. వాళ్ళకి సేవ చేయడంలోనే తన జీవితం ధన్యం అయినట్టు భావిస్తూ వాళ్ళ సేవల్లో లాలిత్య సర్వం మరిచిపోవడం కృష్ణవేణికి అర్ధం కాలేదు.
    కొంతకాలం చెప్పినా లాలిత్య మరాకపోగా, "నాకిలాగే ఇష్టం మమ్మీ నన్నిలాగే ఉండనీ.... చిన్నపిల్లను కాదుగా, లెట్ మీ హావ్ మైఒన్ లైఫ్ స్టేల్ అనడంతో హతాశురాలైంది. ఆతరవాత చెప్పడం మానేసింది.
    ఇప్పుడు అదే కృష్ణవేణి , అంధ్రదేశంలో సుప్రసిద్ధ రచయిత్రిగా పేరు ప్రఖ్యాతులున్న కృష్ణవేణి, స్త్రీ స్వాతంత్ర్యం గురించి స్త్రీల హక్కుల గురించి వేదికల మీద ఉపన్యాసాలిస్తూ స్త్రీవాడిగా ,స్త్రీల హక్కుల ఉద్యామకారిణిగా కీర్తించిన కృష్ణవేణి , తనస్వేచ్చ కోసం , తన స్వాతంత్ర్యం కోసం భర్తతో సహా, ఎవర్నీ లెక్కచేయని కృష్ణవేణి,వ్యక్తిత్వం, నింపిన వికాసంతో ఎప్పడూ నిర్లక్ష్యంగా , ఠీవిగా తిరిగే కృష్ణవేణి రెక్కలు తెగిన పక్షిలా కుప్పకూలి పోయింది.
    కృష్ణవేణి కళ్ళ నుంచి నీళ్ళు చుక్కలుగా రాలిపోతూ ఆమె కట్టుకున్న చీరని తడుపుతున్నాయి.
    ఆమె కళ్ళ ముందు గడచిన జీవితం అంతా సినిమా రీలుగా తిరగడం ప్రారంభించింది.
    సుమారు పాతికేళ్ళ క్రితం కృష్ణవేణి ఎం.ఏ. తెలుగు లిటరేచర్ చదువుతున్న రోజుల్లో, క్లాస్ మెట్ గోపాల్ మంచి స్నేహితుడు. తను రాసే కవితలను, కధలను ఎప్పటికప్పుడు చదువుతూ ఆసబ్జక్టు మీద చర్చిస్తుండేవాడు. ఏదన్నా నచ్చని అంశం ఉంటె.... నిర్మొహమాటంగా విమర్శించేవాడు. అప్పటికే కృష్ణవేణి రచయిత్రి గా ఒక స్థానం సంపాదించుకుంది. మంచి స్త్రీవాద కవయిత్రిగా, కధకురాలిగా పేరుంది. కొంచెం రాసినా ఆ రాసినవి అర్ధవంతంగా ,ఒక స్థాయిలో ఉండడంతో ఆమెని దాదాపు కాలేజీలో లేక్చర్లర్లు, స్టూడెంట్స్, అభిమానించే వాళ్ళు. వాళ్ళందరిలో గోపాల్ లో కొద్దో గొప్పో సాహితీ పిపాస ఉండడంతో అతను ఒక క్లాస్ మెట్ గా కాక, మంచి స్నేహితుడు గా ఆమె జీవితంలో ప్రముఖ స్థానాన్ని ఆక్రమించాడు. సాహితీ పరంగానే కాక, సబ్జెక్టు పరమైన చర్చలతో కూడా వాళ్ళ మధ్య కాలం మంచులా కరిగిపోతుండేది. ఎం.ఏ పూర్తయింది. ఓ పక్క ఎంఫిల్ చేస్తూ చిన్నదైనా లెక్చరర్ ఉద్యోగం వెతుక్కోవాలన్నది తన భవిష్యత్తు ప్రణాళికగా చెప్పింది కృష్ణవేణి.
    ఆరోజు రిజల్ట్ వచ్చిన రోజు ఇద్దరూ చల్లని ఐస్ క్రీమ్ తింటూ ట్యాంక్ బండ్ దగ్గర కూర్చున్నారు. వేసవి కాలం వెళ్ళిపోతూ చల్లదనాన్ని సృష్టికి పంచుతున్నసమయం. వాళ్ళలాగే ఆహ్లాదకరమైన ఆ వాతావరణాన్ని ఆనందించడానికి మరికొందరు జంటలతో , పిల్లాపాపలతో, ఐస్ క్రీమ్ లు, బూరలు అమ్మ్తున్న చిన్నచిన్న వ్యాపరస్తులతో కళకళలాడుతోంది. ఆసమయంలో తన భవిష్యత్తు ప్రణాళిక గురించి గోపాల్ తో చెప్పి, "నీ ప్లాన్ ఏంటి." అనిఅడిగింది కృష్ణవేణి. "ఉద్యోగం వెతుక్కుంటాను.నాకింకా చెదివే ఓపిక, ఆసక్తి రెండూ లేవు " అన్నాడు.
    "అదేంటి గోపాల్, పిహెచ్ డి చేయందే మనకి మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయి? మంచి ప్రొఫెసర్స్ గా నిలబడాలంటే పిహెచ్ డి చేయాలి. నామాట విను.నువ్వు కూడా ఎంఫిల్ కి అప్లై చేయి" అంది.
    గోపాల్ కొన్ని క్షణాలు మౌనంగా హుస్సేన్ సాగర్లో మెల్లమెల్లగా కదుల్తున్న నీటి అలలు చూస్తూ అన్నాడు. "నువ్వు నాకు తోడుగా జీవితాంతం ఉంటానని మాటిస్తే చేస్తాను."


 Previous Page Next Page 

WRITERS
PUBLICATIONS