రాత్రంతా తల్లికి గురుబోధ జరిగి ఉంటుంది. నవ్వుకున్నాడు. అతను బయటికి వెళ్తూ రాధిక గదిలోకి తొంగి చూచాడు. ఆమె చెక్కిట చేయి చేర్చి యెటో చూస్తూ కూర్చుంది.
ఆమె వడిలో కాగితాలు ఫోటోలున్నాయి. బహుశః శ్రీనివాస్ వి అయి ఉంటాయి. శ్రీనివాస్ చచ్చిపోయాడన్న నిజం ఆమె ఎప్పుడు గ్రహిస్తుంది! గ్రహించి బ్రతుకుతుందా!
అతను మెల్లగా బయటికి నడిచాడు.
అతను బావి త్రవ్వే చోటికి వెళ్ళేసరికి అక్కడ జనం యెవ్వరూ లేరు. సగం, సగం, పనులు చేసి వదిలివేసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో యెవరికి తెలియదు.
అతను చుట్టూ చూచి వెనుతిరిగాడు.
అతను బావి త్రవ్వే చోటికి వెళ్ళేసరికి అక్కడ జనం యెవ్వరూ లేరు. సగం, సగం, పనులు చేసి వదిలివేసి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో యెవరికి తెలియదు.
అతను చుట్టూ చూచి వెనుతిరిగాడు.
ఓ కుర్రాడు పశువులను మేపుతూ ఎదురు వచ్చాడు.
"ఇక్కడ పనిచేసే వారంతా లేరా!"
అతను చెయ్యెత్తి దూరాన ఉన్న మనుష్యుల్ని చూపాడు. ఏమిటో అర్ధం కాలేదు. సిద్దార్ధకి. మరోసారి అడిగాడు. అతను చూపించినవైపు చూసి తలపంకించాడు. ఆ కుర్రాడికి మాటలు రావని అర్ధం అయింది. వడి వడిగా జనం గుమిగూడిన వైపు వెళ్ళాడు.
పెద్ద ఊరు, లేదా టౌన్ ను ఆనుకుని ఉన్న పల్లె అది. ఆ పల్లెలో ఉన్నవి పాతిక ముప్పై ఇళ్ళు ఆ ముప్పై ఇళ్ళజనము అక్కడే ఉన్నారు. అందరూ హడావుడిగా మాట్లాడుతున్నారు.
బాలరాజును చెట్టుకు కట్టారు.
రుద్రయ్య నోట్లోనుండి రక్తం కారుతుంది.
మనిషి శవంలా పడి ఉన్నాడు.
"అసలు విషయం ఏమిటి?" అడిగాడు సిద్దార్ధ.
"ఈ వెధవలు ఇద్దరూ చేతబడి చేస్తారట. వాడు మంత్రాలు నేర్చుకుంటున్నాడు. వీడు మంత్రకాడు." అక్కడున్న ఒక అబ్బాయి వెటకారం చేసాడు.
