పాటవింటూనే, నాకెప్పుడో పరిచయమైన గొంతుని గమనించి ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను. ఓ సుందరమైన రూపాన్ని ఊహించాను. అంతలోనే కాదని సరిపెట్టుకున్నాను. మళ్ళా అవుననిపించింది.
లైటు వేశాను. ఉన్నపళంగా ఆపాట పాడుతున్నావిడను చూడాలనుకున్నాను. సభ్యత స్ఫురణకొచ్చి ఆ ప్రయత్నం మానుకొన్నాను. పాట ఆగిపోయినా, నా మనసు లోని బొమ్మ చెరిగిపోలేదు.
ఉదయం పార్దుడ్ని కదిపి విషయం తెలుసుకుందామనుకున్నాను. స్నానం ముగించి అద్దం ముందు నించున్న వేళ పార్ధుడు సంచి వూపుకుంటూ మరో ఇద్దరి నేస్తాల్తో స్కూలుకి వెళ్ళబోతున్నాడు. గబగబా గుమ్మం దగ్గర కొచ్చేశాను. పార్దుడ్ని పిలిచేందుకు నోటిదాకా వొచ్చిన మాటని, నా గది గుమ్మం ముందున్న డాబా అమ్మాయిని చూసి దాచేసుకున్నాను. లోపలికొచ్చి కూర్చున్నాను.
ఆ క్షణంలో డాబావారి అమ్మాయి మీద కోపం చాలా వొచ్చింది. ఆవిడకి మరేం పని లేనట్టు డాబా మీద అస్తమానం ఆ విహారాలేమిటి? కళ్ళింతవి చేసుకుని నేలమీద బతుకుతూన్న మమ్మల్ని చీమల్తో పోల్చి చూడటమేమిటి? నాన్ సెన్స్.
ఆఫీసు కెళ్ళేంత వరకూ పాట పాడినావిడ కోసం ఎదురు చూసేను. ఏ పనిమీధైనా తిరుగుతూ ఆవిడ నాకుకనిపిస్తుందేమోనని కనిపించలేదు. గడిచిన కొద్దిరోజుల్లో ఆమె నాక్కనిపించే వుంటుందిగానీ, ఎప్పుడూ ఈ పాట పాడకపోవడాన నేనావిడ్ని అంత శ్రద్దగా చూసి ఉండను.
సాయంత్రం ఆఫీసునుంచి తిరిగిరాగానే తిన్నగా కిటికీ దగ్గిర కుర్చీ వేసుక్కూర్చున్నాను.
కొన్నేళ్ళ క్రితం నేనో తెలుగు సినిమా చూసేను. ఆ సినీమాలో వో పాట విని ముగ్ధుడినయ్యేను. తర్వాత అదే పాట అనేకమంది పాడుతూండగా విన్నాను గానీ అప్పుడు నే నంత ఆనందించలేదు.
నేను కాలేజీలో చేరిన కొత్తరోజుల్లో సుందరశివరావు వాళ్ళ మామిడితోటలో అదే పాటని వినడంజరిగింది. నిజం చెప్పాలంటే ఆ సినీమా చూస్తూ ఆ పాట విన్నప్పుడు గూడా నేనంతగా చలించలేదేమో పాట పూర్తయిం తర్వాత నా కనుకొలకులో నీళ్ళు నిలవడం గమనించి మా సత్యం మెల్లిగా అన్నాడు -
"ఈ మాత్రం దానికే ఏడుస్తావేంరా, ఫూల్!"
నిజానికి నేను ఫూల్ నేమో! సినీమాచూస్తూ - శ్రీరాముల వేషధారికి నమస్కారం చేసేయగల పిచ్చివాడిని, వేదిక ఎక్కి లంకేశ్వరుడి దవడ పగలగొట్టేయగల పిచ్చివాడిని.
"మా ముద్దుకృష్ణయ్య లీలలు
మంజుల మధుమురళీ లీలలు
మాకేరిసారి కల గోలలు
మాకు ఆనందవారధి వోలలు!"
ఆనాడు అనుకున్నాడు సుందరశివరావు అదృష్టవంతుడని. అపర సరస్వతీదేవి సత్యవతి మనసుని గెలుచుకున్నాడు; సత్యవతినీ, సుందరశివరావుగానీ ఆనాడే చూసేను. సత్యవతి కమ్మని కంఠం తేనెలొలకగా, ఆ మధురానుభూతిని ఈ గుండెల్లో దాచుకున్న భాగ్యం ఆనాడే కలిగింది.
మా కాలేజ్ ప్రెసిడెంట్ గిరికి సుందరశివరావు పోటీ చేసి హెచ్చు మెజారిటీలో ఎన్నికయ్యేడు. ఆ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని అతని మిత్రులందరికీ పార్టీ ఇచ్చేడు. ఆ సాయంత్రం వాళ్ళ మామిడితోటలో భారీ ఎత్తున ఏర్పాటు చేసిన ఆ పార్టీకి మా సత్యం వెంట నేనూ వెళ్ళేను.
సుందర శివరావుతో నా కేవిధమైన పరిచయమూ లేదు. వాళ్ళవర్గంలో నాకెవ్వరూ తెలీదు. సత్యం మా మేనబావ. వాడు సుందరశివరావు, సత్యవాతులు క్లాసుమేట్సు. వాళ్ళందరూ మంచి స్నేహితులు.
నేను సత్యంతో తిరగడం మూలంగా ఆనాటి పార్టీకి నేనూ వెళ్ళవలసి వచ్చింది. పైగా -నా ఓటు సుందరశివరావుకే వేశాను.
సుందరశివరావు ఏర్పాటుచేసిన పార్టీ తాలూకు పూర్తి వివరాలు సరిగ్గా జ్ఞాపకం లేవు గానీ, మనసుకి నచ్చిన ముచ్చటైన సన్నివేశాలు కొన్ని యిక్కడ ఎత్తి రాస్తాను.
పార్టీ జరుగుతున్నప్పుడు సుందరశివరావు సత్యవతిని తన సరసన నిలబెట్టుకుని ఇంగ్లీషులో ఉపన్యాసం చెప్పేడు. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నట్టు, త్వరలో వాళ్ళ పెళ్ళి జరగబోతున్నట్టూను. అప్పుడు సత్యవతి మొహంలో సిగ్గులు మొగ్గలు తొడిగింది. పెద్దకళ్ళని సగానికి మూసి, హాయిగా నవ్వింది. చాలు - ఆ నవ్వు నాకిప్పటికీ గుర్తు! ఒక మనిషికీ అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు కులాసాగా నవ్వితే- ఆ నవ్వు అలాగే వుండి తీరుతుంది.
సత్యవతి నవ్వేసి తలదించుకుంటూన్న సమయంలో నా పక్కన కూర్చున్న సత్యం 'వన్స్ మోర్ ప్లీజ్!' అన్నాడు.
సుందర శివరామయ్య అంతకు మునుపు చెప్పిన నాలుగు మాటల్నే మళ్ళా చెప్పేడు పాపం!
నాకు తెలుసు- మా సత్యం వన్స్ మోర్ అభ్యర్ధన సుందరశివరామయ్య యొక్క అమోఘమైన ఉపన్యాస శిల్పానిక్కాదు. సత్యవతి అందమైన నవ్వు నుద్దేశించి. సుందర శివరావు ఆ తర్వాత చాలా చెప్పేడు. అదే మామిడితోటలో మేమందరం మెచ్చుకునే రీతిలో ఓ సుందరమైన తాజ్ మహల్ కట్టించే ఉద్దేశముందనీ, దాన్లో వాళ్ళిద్దరే కాపురముంటారని చెప్పేడు.
అతని ఊహాగానం విని అసూయ చెందినవాడిన్నేను. ఆ 'నేను'కి ప్రేమించటం తెలీదు. అధవా ప్రేమించినా, సుందరశివరావు కట్టించబోయే తాజమహలు మాటల్లో సైతం చెప్పుకోగల తాహతు ఆరోజుల్లో లేదు. అందుచేతనే సుందర శివరావు బంగారు జీవితమ్మీద జెలసీ చెందేను.
పార్టీ ముగిసింతర్వాత కాబోయే అర్ధాంగి చేత పాట పాడించేడు.
ఇళ్ళకి వెళ్ళబోయేమున్దనుకుంటాను. అందర్తోపాటు లేచినించున్న సుందరశివరావు గబిక్కిన కూర్చున్నాడు. మామిడిచెట్టుకి నడుం ఆనించి సత్యవేపు అమాయకంగా చూసేడు. అందరం ఖంగారు పడిపోయేము. అప్పుడు తెలిసింది. అన్నీ వున్న మనిషికి, అన్నీ ఉన్నాయనే విషయం గుర్తు కొచ్చి, గుండెల్లో పోటు రావడమనేది ఒకరకమైన వ్యాధి. 'అతి'ని భరించలేని నాజూకుతనం గల మనిషి సుందరశివరావు.
సత్యవతి కొంచెం సేపతనికి ఉపచారాలాంటిదేదో చేసింది. అతని గుండెలమీద సున్నితంగా ఆమె చేతిని రాసింది. ఒక్కొక్క అందమైన చేతికి వైద్యరీత్యా విలువెంతో నాకు ఆనాడే తెలిసింది. అలాంటి ఆడపిల్ల సన్నిధిలో మరణమే కలిగినా అదీ ఒక గొప్ప అదృష్టంగానే భావించవచ్చు మరేం ఫరవాలేదు. వెధవ బ్రతుకు -నీరసంగా రసహీనంగా ఎన్నాళ్ళు బ్రతికితే మాత్రం ఏం ప్రయోజనం గనక?
