ఈ రకమైన శాడిజంలోని వైవిధ్యాలను ముందు ముందు ఇంకా నిశితంగా చెప్పగలుగుతానేమో.
ఇద్దరి పెదాలమీదా చిన్న చిరునవ్వులు ఉదయించాయి.
"మనం మళ్ళీ కలుసుకుంటామనుకుంటాను" అన్నాడు.
"నేను అలాగే అనుకుంటున్నాను."
"ఈవేళ జరిగింది మర్చిపొండి."
"....... గుడ్ నైట్"
తాళం తీసి లోపల కడుగుపెట్టి, లైటు వేసే దాకా ఉండి తర్వాత కారును ముందుకు దూకించాడు.
10
నా పరిస్థితి అయోమయంగానే వుంది. దగ్గరున్న డబ్బు అయిపోవస్తోంది.
అద్దెకు తీసుకున్న ఆ రెండు గదుల చిన్న ఇంట్లో కాపరం. ఇరుగుపొరుగుల చూపులతో పోరాటం....
ఎక్కువగా పుస్తకాలు చదువుతూ కాలం గడుపుతున్నాను.
కేవలం కాలక్షేపానికి పనికొచ్చేవే తప్ప.... కొంతమంది నిరాడంబరతతో, కొంతమంది అతి తెలివితో, అర్థంలేని అసహజత్వాలతో, రాసినవే తప్ప, మంత్ర ముగ్ధులని చేసి కట్టిపడేసే పుస్తకాలేవి? జీవితాలను చిత్రించాలంటే డాక్యుమెంటరీలాగా, ఏ రంగులూ లేకుండా రాయనవసరం లేదు. కథాబలం, గొప్ప శిల్ప నైపుణ్యం, అయినా నీడలా వెంటాడే సహజత్వం....
వీటన్నిటి సమ్మేళనంతో సాహిత్యం ఓ మధుర గీతంలా వుండాలి.
అన్వేషిస్తున్నాను.
జీవితం ఓ మహా ప్రవాహంలా, ఝరీ వేగంతో ఎన్నో వికృతాలను తనలో ఇముడ్చుకుని ప్రవహిస్తూన్నట్లే, సాహిత్యం కూడా అసహ్యమైన అపస్వరాలతో వరద లొచ్చినప్పుడు సముద్రానికో, నదికో ఉండే వేగంతో ప్రవహిస్తోంది.
ఇప్పుడు సాహిత్యం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నానని అనుకుంటున్నారా?
నాలో మొదట్నుంచీ ఆ అభిరుచి ఉంది. దీన్ని గురించి ఇది వరకే ఎక్కడో చెప్పాననుకుంటున్నాను. మనిషంటే రకరకాల అభిరుచుల, అపశృతుల సమ్మేళనం. అభిరుచి అనేది ఒకదానిమీదే వుండాలని లేదు. పరిపక్వత సాధించాలి అంటే, దానికి అనేక అంశాలు కలసి రావాలి.
పది పన్నెండేళ్ళ వయసులోనే ఎన్నో పుస్తకాలు చదివేశాను.
బెంగాలీ వాళ్ళను పొగుడుతూంటే "దేశ భాషలందు తెలుగులెస్స" అంటూ భుజాలెగురేసే మనవాళ్ళలో కొంతమందికి కోపం రావచ్చు.
కాని మన జీనియస్ జీవితపు పొరల్ని చీల్చుకుని లోలోపలకు చొచ్చుకుపోవటం లేదే. కొంతవరకూ ఎదిగి చతికిలబడి పోతోందే.
ఒంటరిగా నా గదిలో కూర్చుని శరత్ బాబు 'చరిత్రహీనులు' చేతుల్లో ఉంచుకుని చదువుతోంటే గంటలకు గంటలు దొర్లిపోయేవి. సావిత్రి కిరణ్మయి. ఏమి పాత్రలవి!
సావిత్రి ఎలా వుంటుందో ఊహించుకోలేక పోయేదాన్ని. ఆ రూపానికి తెలిసీ తెలీని మనస్తత్వంతో ఓ స్పష్టత నిచ్చి అగౌరవ పర్చటంకంటే అస్పష్టంగా ఉంచుకోవటంలోనే వింత అనుభూతి పొందేదాన్ని.
సావిత్రిలాంటి స్నేహితురాలుంటే....
ఈ భావం తియ్యటి కల. ఓ బాధాపూరిత ఆశ.
కిరణ్మయి ఎంతో ఎత్తున నిలబడి వున్నట్లు అందేది కాదు. అదో తేజస్సు. గొప్ప కాంతిపుంజం. సంఘమూ, పరిస్థితులూ అంటగట్టటానికి ప్రయత్నించిన మాలిన్యం ఆ వెలుగు ముద్దని తాకనన్నా తాకలేవు.
మాలిన్యం ఎవర్ని ఆక్రమిస్తుంది?
సామాన్యుల్ని? అల్ప జీవుల్ని.
మనిషి ఓ స్థాయికి ఎదిగిపోయాక.... ఈ చిన్న చిన్న కళంకాలు, ఆ గొప్పతనం ముందు వెల వెలపోతాయి.
ఏడ్చేస్తున్నాను.
సావిత్రి, కిరణ్మయి.... ఆ విషాదంలోని అద్భుతం మనస్సుని తొలిచేస్తూండగా తనివితీరా ఏడ్చేస్తున్నాను.
ప్రేమ, శృంగారం, సాధించానన్న తృప్తి, అన్వేషణ, పొందు, సంతోషం, ఫిలాసఫీ.... ఇవన్నీ విషాదంలోంచి విడివిడిగా రాలిపడిన తుషార బిందువులే.
పుస్తకాలు చదవడంతో బాటు.... నవలలు అనకుండా పుస్తకాలు అని ఎందుకంటున్నానంటే నవలలుతో బాటు కథలు, వ్యాసాలు, కవిత్వం ఇవి కూడా మధ్య మధ్య చదువుతూ వుండేదాన్ని.
కవిత్వం గురించి చెప్పాలంటే.... నాకు రెండు రకాలుగా కనిపించేది. ఒకటి.... నిజానికి దూరంగా ఎక్కడో పరిభ్రమించటం. రెండు నిజాన్ని వెకిలిగా చూపించటం. ఈ రెండు ధోరణులూ నాకు మ్రింగుడు పడలేదు. వాస్తవికత అంటే ఇంకో వర్గంమీద విరుచుకుపడటం వికృత పదజాలం ఉపయోగించటం.... వీళ్ళు దేన్నో మిస్ అయిపోతున్నారేమోననిపించింది.
ఒకరోజు అనుకోకుండా ఓ నవల చదవటం తటస్థించింది. రచయిత మదన్ మోహన్. చదువుతూంటే నా ఒళ్ళంతా గగుర్పొడిచినట్లయింది. అంత బాగా రాశాడు.
సెంటిమెంట్ అనేదానికి జీవితంలో చాలా ప్రాధాన్యత వుంది. ఇతరుల సెంటిమెంట్ ని హేళన చేసేవారే, తమ సొంత విషయానికొచ్చేసరికి దానికి లొంగిపోవడం చాలా సందర్భాలలో చూశాను. వీటిని గురించి వివరంగా తర్వాత అవసరమొచ్చినపుడు చెబుతాను.
బహుశా దేవదాసు చదివినప్పుడు అంతగా విలవిల్లాడిపోయి వుంటాను. విప్రదాస్ చదివినప్పుడు అంతగా కదిలిపోయి వుంటాను. మళ్ళీ ఇన్నాళ్ళుగా.... మరో ఆణిముత్యం దొరికిందా? అదీ మన భాషలో.
మదన్ మోహన్. అంతకు పూర్వమెప్పుడూ అతని పేరు విన్నట్లు లేదు. సాహిత్యరంగంలో ఓ ధృవతార వెలిగిందా? ఆ నవల రెండు మూడుసార్లు చదివేశాను. ఆ రచయితను చూడాలనిపించింది. వొద్దు. అతనెలా వుంటాడో. ఒక వ్యక్తి గురించి ఆలోచన రాగానే అతని రూపం మనోనేత్రం ముందు మెదుల్తుంది. నిజంగా ఆ వ్యక్తిని చూసినప్పుడు రూపమలా లేకపోతే ఆశాభంగం కలుగుతుంది.
