జీవితాన్ని సముద్రంతో పోల్చారు. సాగరంలో ఆల్చిప్పలు మొదలు రత్నాల వరకూ, చేపలు మొదలు తిమింగలాల వరకూ ఎన్నో నిక్షిప్తమై ఉంటాయి. సముద్రం నిరంతరం కల్లోలంగానే ఉంటుంది. అలాగే జీవితం కూడా ఎప్పుడూ అలజడిగా, అల్లకల్లోలంగా ఉంటుంది. అనునిత్యం ఏవో సమస్యలు, చికాకులు ఎదురౌతుంటాయి. ఈ విసుగులు, ఆందోళనల నుండి బయటపడేందుకు మానసిక ప్రశాంతత కావాలి. శక్తిసామర్ధ్యాలు కావాలి. ఆ రెండూ ప్రసాదించేది సాయిబాబా. అవును, సమర్ధ సద్గురువు షిర్డీ సాయిబాబా మానవజన్మను ఎలా సార్ధకం చేసుకోవాలో ప్రబోధించాడు. చింతలు, చికాకులు తీర్చి జీవన సంద్రాన్ని క్షేమంగా, సురక్షితంగా గమ్యానికి చేర్చే శక్తి స్వరూపం షిర్డీ సాయిబాబా.
సాయిబాబా మనలో ఒకనిగా జీవించి, ఎన్నో జీవనసత్యాలను ప్రబోధించాడు. ముందుగా తాను ఆచరించి చూపాడు. షిర్డీ బాబా ఎలాంటి మాయలూ, మంత్రాల జోలికి పోలేదు. మహిమలు చూపి ప్రజలను పక్కదారి పట్టించలేదు. బాధ్యతలు విస్మరించి సన్యసించమనలేదు. ఆఖరికి ఉపవాసాలు మొదలైన ఆచారాలను కూడా వ్యతిరేకించి, భక్తి భావం ఒక్కటే ముఖ్యం అని చెప్పాడు.
సాయిబాబా ఆచరించడానికి అవకాశం లేని అంశాలను ఆచరించమని చెప్పలేదు. మనకు ఏది శ్రేయస్సు చేకూరుస్తుందో అదే చేయమన్నాడు. నీతిగా, నిజాయితీగా నడచుకోమన్నాడు. ఎవరికీ అపకారం తలపెట్టవద్దు అన్నాడు. తోటివారికి చేతనైన సాయం చేయమన్నాడు.
దైనందిన కార్యక్రమాలు సక్రమంగా నేరవేర్చుకుంటూనే దైవచింతన కోసం కొంత సమయాన్ని వెచ్చించమన్నాడు.మోహాలు, కోరికలు తగ్గించుకుని సాయి నామాన్ని జపించమన్నాడు. సదా సాయి స్మరణతో కాలక్షేపం చేయడం వల్ల క్రమక్రమంగా కోరికలు, బంధాల నుండి బయటపడతారని, ఆధ్యాత్మిక చింతన అలవడుతుందని చెప్పాడు. కఠోర పూజలు, యజ్ఞాలు, తపస్సులు, దీక్షలు అందరికీ సాధ్యం కాదు. కానీ, సాయిబాబా చెప్పిన విధానం మహా సులభమైనది. సాయి నామస్మరణతో చిత్తాన్ని స్వాధీనంలోకి తెచుకోవడం అందరికీ సులువైనది. తన రూపాన్ని మనసులో నిలుపుకుని మోక్ష సాధనకై ప్రయత్నించమన్నాడు.
మనసు చాలా చంచలమైనది. నిరంతరం ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. ఒక్క క్షణం కూడా మనసు స్థిరంగా ఉండదు. అందుకే ఈ చపలచిత్తాన్ని గుర్రంతో పోల్చారు. దానికి కళ్ళెం వేయమన్నారు. ఆధ్యాత్మిక గురువులందరూ అదే మాట చెప్తున్నారు. సాయిబాబా ఈ అంశాన్ని మరింత స్పష్టంగా చెప్పాడు. వీలైనంత ఎక్కువ సమయాన్ని దైవ చింతనకు కేటాయిస్తే ఇతర ప్రలోభాలు తగ్గుతాయని చెప్పాడు. లేనిపోని మోహాలు, ఆవేశాలు నియంత్రింప బడతాయని, ప్రశాంతత చేకూరుతుందని చెప్పాడు.
సాయిబాబా అనవసర విషయాల జోలికి పోవద్దు, అధిక ప్రసంగాలు చేయొద్దు అన్నాడు. మనసును ప్రలోభపెట్టే విషయాల వైపు దృష్టి మళ్లిస్తే ఇక ఆ అంశాల గురించిన ఆలోచనలే సాగుతాయి. అదే, మంచిని ప్రబోధించే తరహా ఆలోచనలు అయితే మరింత ఔన్నత్యం సాధించే వీలు చేకూరుతుంది. ''సత్సంగం'' జరుపుకోవడంలో ఉద్దేశ్యం ఇదే. నిరంతరం సదాలోచనలు చేస్తూ, సజ్జనులతో కాలక్షేపం చేయడం వల్ల మనసులో దురాలోచనలూ, దురుద్దేశాలు తలెత్తవు.
సాయిబాబా నామస్మరణ అహంకారాన్ని అణచివేస్తుంది. ఈర్ష్యాసూయలను నశింపచేస్తుంది. క్రమశిక్షణ అలవరుస్తుంది. మన బాధ్యతలు సక్రమంగా నెరవేర్చేందుకు దోహదపడుతుంది. సాయిబాబా, భక్తిశ్రద్దలతో ప్రార్థించమని, తనను మనసులో నిలుపుకోమని చెప్పాడు. జపాలు, తపాలు, పూజలూ, మంత్రాలూ అవసరం లేదని, సదా తనను తలచుకుంటే చాలని చెప్పాడు. పూజలు, దండకాల కంటే మాలిన్యంలేని మనసే ప్రధానం అని నొక్కి చెప్పాడు.
సాయిబాబాకు ఆడంబరాలు, ఆర్భాటాలతో పని లేదు. నిండైన మనసు చాలు. అందుకే వీలైనప్పుడల్లా సాయిబాబా నామాన్ని స్మరించుకుందాం. ప్రశాంతత చేజిక్కించుకుందాం.
|