ఆహరం : మనిషి జీవించి వుండాలంటే ఆహారం చాలా అవసరం. ఆహారం నిమిత్తం ప్రకృతి ఎన్నో పదార్థాలు ప్రసాదించింది. ఆ పదార్థాలన్నీ వేళకు మితంగా భుజిస్తే మనిషి హాయిగా, రోగాలు లేకుండా, ఆరోగ్యంగా బ్రతకవచ్చు.


ఆకు కూరలు, కాయకూరలు, దుంపకూరలు, పప్పులు, తిండి గింజలు, ధనియాలు, అల్లం, పెద్ద ఉల్లి, చిన్న ఉల్లి(వెల్లుల్లి), నిమ్మ, కొబ్బరి మొదలుగా గా ఆహారపదార్థాలు మితంగా వాడాలి.


ఋతువుల ప్రకారం లభించే పండ్లు అపారం. మామిడి, నేరేడు, యాపిల్, దానిమ్మ, ఖర్బుజా, పుచ్చకాయ, జామ, అరటి, బత్తాయి, నారింజ, కమలా, పనస, రేగి, ద్రాక్ష, సీతాఫలం మొదలుగా గల పండ్లు తినవచ్చు. ఆయా పండ్ల రసాలు తాగవచ్చు. బాదంపప్పు, జీడిపప్పు, కిస్ మిస్, ఎండు ద్రాక్ష, ఆఖరోట్, వేరుసెనగ, పిస్తా, అంజీర మొదలుగా గల తిండి పదార్థాలు కూడా లభిస్తున్నాయి.

 

గోధుమ, వరి, జొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, అలచందలు, శనగలు, మొదలుగా గల తిండి గింజలు అధిక పరిమాణంలో లభిస్తున్నాయి. పాలు, వెన్న, మీగడ, నెయ్యి, లస్సీ, మజ్జిగ, పెరుగు, పాలతో తయారయ్యే పాలు రుచికరమైన పదార్థాలు నువ్వులు, వేరుశనగ, కొబ్బరి మొదలగు వాటి నుంచి వెలువడు నూనెలు, తేనే, బెల్లం, పంచదార, తాటిబెల్లం, చెరకు మొదలుగా గల తీపి పదార్థాలు ప్రకృతి మనకు ప్రసాదించినవే. వీటిని అవసరమైనంత వరకు మాత్రమే, వేళకు తీసుకుంటూ వుంటే రోగాలు దరిదాపుకు రావు. గుడ్లు, చేపలు, మాంసం తామస పదార్థాలు వీటిని తిన్నందువల్ల తామసరాజస గుణాలు అధికం అవుతాయి. అందువల్ల వాటిని తినక పోవడం మంచిది.

మద్యం, గంజాయి, బంగు, నల్లమందు, పొగాకు మొదలగునవి మత్తు లేక నిషా ఎక్కించే పదార్థాలు. వీటిని వాడకూడదు.

ఖాద్య పదార్థాలు, స్వీట్లు, ఎప్పుడు బడితే అప్పుడు లభించాయి కదా అని తెగ తినకూడదు. అలా తిన్నందువల్ల అవి జీర్ణం కాక రోగాలు పట్టుకుంటాయి.

భోజనం రెండు పూటలు మాత్రమె చేయడం మంచిది. టిఫినుకు భోజనానికి మధ్య కనీసం నాలుగు గంటల వ్యవధి అవసరం. ఉదయం పూట 9 గంటల నుంచి 11 గంటల లోపున భోజనం చేసే వాళ్ళు ఉదయం తీసుకోకూడదు. మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్య పండ్లు తినవచ్చు. పండ్ల రసంగాని, అలవాటు అయిన వాళ్ళు ఒక కప్పు, కాఫీ గాని, టీ గాని తాగవచ్చు. కాయ కష్టం చేసే వాళ్ళు తగిన పరిమాణంలో ఆహరం తీసుకోవాలి. మానసిక శ్రమ చేసే వాళ్ళు తక్కువ ఆహరం తీసుకోవాలి.

ఆహారపదార్థాల్ని తాగాలి, నీళ్ళను తినాలి, ఈట్ లిక్విడ్స్, డ్రింక్ సాలిడ్స్ అనునది అందరికీ తెలిసిన నానుడియే. మనం తినే ఆహరం లాలాజలంతో కలిసి జీర్ణ కోశంలోకి వెళ్లి జీర్ణం అవుతుంది అంటే ఆహారాన్ని నీరువలె మార్చి తినాలన్నమాట. నీళ్ళు మరియు పేయ పదార్థాలు నోట్లో పోసుకొని మెల్లమెల్లగా తింటూ వున్నట్లు తాగాలి. ఆహారం బాగా నమలడం వల్ల దంతాలు, చిగుళ్ళు గట్టి పడతాయి.

సూచనలు :

1) ప్రొద్దున మేల్కొనగానే చెంబెడు లేక గ్లాసెడు మంచి నీళ్ళు తప్పని సరిగ్గా తాగాలి.

2) మలమూత్ర విసర్జన చేయకుండా ఏమి తినకూడదు. ప్రొద్దున్నే మల విసర్జనం అలవాటు లేని వాళ్ళు అట్టి అలవాటు చేసుకోవాలి. అందుకు రెండు గ్లాసులు గోరు వెచ్చని నిరు తరగాలి.

3) భోజనం చేయునప్పుడు సాధ్యమైనంత వరకు మధ్యన నీళ్ళు తాగకూడదు.

4) యోగాభ్యాసం, వ్యాయామం చేసిన కొద్ది సేపటి దాకా ఏమి తినకూడదు. వాహ్యాళికి వెళ్లి వచ్చిన తరువాత కూడా కొద్దిసేపు ఏమి తినకూడదు.

5) నిద్రపోయే ముందు ఏమి తినకూడదు. భోజనానికి నిద్రకు మధ్య సాధ్యమైనంత వ్యవది వుండటం అవసరం.

6) ఉపవాస సమయంలో టిఫిన్ల పెరట అమితంగా తినకూడదు. జబ్బు పడినప్పుడు పత్యంగా ఆహరం తీసుకోవాలి.

7) పాసిపోయిన, మురిగిపోయిన ఆహార పదార్థాలు తినకూడదు.

8) సగం పాడైన పండ్లు, పాడైనంత వరకు తొలగించి, బాగా వున్నది కదా అని మిగతా భాగం తినకూడదు.

9) భోజనం చేయుటకు ముందు నీళ్ళతో పాదాలు, ముఖం, చేతులు తప్పక కడుక్కోవాలి. అందువల్ల టెన్షను తగ్గుతుంది. భోజనం తేలికగా జీర్ణం అవుతుంది.

10) భోజనం చేయు సమయంలో ప్రశాంతంగా వుండాలి. మధ్య మధ్య మంతనాలు చేయడం, అదే పనిగా మాట్లాడుతూ వుండటం, మధ్య మధ్యన ఫోన్లు చేస్తూ వుండటం, ఫోన్లు వచ్చినప్పుడు భోజనం చేస్తూ మాట్లాడుతూ వుండటం సరికాదు.

11) భోజనానికి ముందు దైవ ప్రార్థన తప్పక చేయాలి.

12) భోజనం చేశాక 10 నిమిషాలపాటు పచార్లు చేసి, కనీసం 5 నుంచి 10 నిమిషాల సేపు వజ్రాసనం వేయాలి.