బన్నీ-సుక్కు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ మారడం లేదు!
on Feb 11, 2020
అల్లు అర్జున్ లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'అల.. వైకుంఠపురములో' మ్యూజికల్గా ఎంత సెన్సేషన్ సృష్టించిందో మనకు తెలుసు. ఆ సినిమాకు తమన్ కూర్చిన బాణీలు సంగీత ప్రియులను ఉర్రూతలూగించాయి. ముఖ్యంగా 'సామజవరగమన', 'రాములో రాములా' పాటలు యూట్యూబ్లో 150 మిలియన్ వ్యూస్ దాటి, ఆ ఫీట్ సాధిచిన టాలీవుడ్ సాంగ్స్గా రికార్డుల్లోకి ఎక్కాయి. ఆ మూవీ తర్వాత తమన్ క్రేజ్ ఆకాశమంత ఎత్తు ఎదిగింది. దర్శక నిర్మాతలంతా అతడ్ని తమ సినిమాకి సంగీత దర్శకుడిగా పెట్టుకోడానికి బారులు తీరుతూ వస్తున్నారు.
ఇదంతా చెప్పడం ఎందుకంటే.. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ మారబోతున్నాడంటూ సోషల్ మీడియాలో ప్రచారంలోకి రావడం. ఆ సినిమాకు తన ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ అయిన దేవి శ్రీప్రసాద్నే ఎంచుకున్నాడు సుకుమార్. 'ఆర్య' సినిమా దగ్గర్నుంచి కూడా వాళ్ల కాంబినేషన్ సూపర్ హిట్. బాక్సాఫీస్ దగ్గర సినిమా జయాపజయాల మాట ఎలా ఉన్నా, మ్యూజికల్గా ఆ సినిమా గ్యారంటీ హిట్. సుక్కు, దేవి మధ్య బంధం కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటూ వస్తోంది. అందుకే ఈ సినిమాకీ దేవినే ఎంచుకున్నాడు సుక్కు. ఇప్పటికే రెండు పాటలకు ట్యూన్స్ కట్టాడు దేవి.
ఈ పరిస్థితుల్లో దేవిని మార్చి తమన్ చేత బాణీలు కట్టించాల్సిందిగా సుక్కుపై బన్నీ ఒత్తిడి తీసుకు వస్తున్నాడనీ, మొదట సర్దిచెప్పిన సుక్కు, తర్వాత సరేనన్నాడనీ ప్రచారంలోకి వచ్చింది. అయితే ఇది కేవలం రూమర్ మాత్రమేమని సుకుమార్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. దేవిని మార్చి తమన్ను తీసుకోవాలంటూ సుక్కుని బన్నీ కోరలేదని ఆ వర్గాలు చెప్పాయి. ఇది కావాలని ఎవరో పుట్టించిన వదంతిగా అవి కొట్టివేశాయి. కొంతకాలంగా మునుపటి మ్యాజిక్ను దేవి చూపకపోతుండటం వల్లే ఈ తరహా రూమర్స్కు ఆస్కారం ఏర్పడుతుందని అనుకోవాలి. మంచి మ్యూజిక్ టేస్ట్ ఉన్న సుకుమార్ 'రంగస్థలం' కోసం దేవి నుంచి ఎలాంటి ట్యూన్స్ రాబట్టుకున్నాడో తెలిసిందేననీ, అదే తరహాలో బన్నీతో తీస్తున్న మూవీకి అలాంటి బ్లాక్బస్టర్ మ్యూజిక్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చనీ ఆ సినిమా యూనిట్ మెంబర్స్ చెబుతున్న మాట.