అనుష్క టీమ్కి చుక్కలు చూపించిన నటుడు
on Feb 11, 2020
ఊరు కాని ఊరులో... దేశం కాని దేశంలో... అనుష్క 'నిశ్శబ్దం' టీమ్కి ఓ నటుడు చుక్కలు చూపించాడు. ఓ మాట మాత్రమైనా చెప్పకుండా సెట్ నుండి గాయబ్ అయ్యాడు. అతడి ఫోనులు పని చేయవు. అతడెక్కడ ఉన్నాడో అతడి మేనేజర్కీ తెలియదు. చివరకు, ఒక ప్రయివేట్ డిటెక్టివ్ దగ్గరకు వెళ్లి, అతడికో పాతిక లక్షలు సమర్పించుకుని ఆ నటుడు ఎక్కడున్నాడో తెలుసుకున్నారట. ఇంతకీ, అనుష్క టీమ్ని అంత ఇబ్బంది పెట్టిన నటుడి పేరు ఏంటంటే... మైఖేల్ మ్యాడసన్. అసలు వివరాల్లోకి వెళితే...
అనుష్క ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ ఫిల్మ్ 'నిశ్శబ్దం'. తెలుగుతో పాటు తమిళ్, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో క్రాస్ ఓవర్ సినిమాగా తెరక్కించారు. ఐదు భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అందుకని హాలీవుడ్ నటుడు మైఖేల్ మ్యాడసన్ ను తీసుకున్నారు. అమెరికాలో అతడు, ఇతర నటీనటులపై షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఉన్నట్టుండి ఒక రోజు మైఖేల్ గాయబ్ అయ్యాడట. ఎక్కడికి వెళ్లాడో అతడి మేనేజర్ కి తెలియకపోవడంతో 'నిశ్శబ్దం' యూనిట్ తలలు పట్టుకుంది. యూనిట్ సభ్యుల వీసాలు గడువు తీరేలోపు షూటింగ్ చేయాలి. పైగా, రిటర్న్ టికెట్స్ ముందే బుక్ చేశారట. అవి క్యాన్సిల్ చేసినా, మళ్లీ వీసాలు తీసుకుని అమెరికా వెళ్లాలన్నా బోల్డంత ఖర్చు. చివరకు, ప్రయివేట్ డిటెక్టివ్ తో వెతికిస్తే కెనడాలో ఒక హోటల్ లో ఉన్నాడని తెలిసిందట. అక్కడ కూడా మూడు రోజులు హోటల్ రూమ్ డోర్స్ లాక్ చేసుకుని కూర్చున్నాడట. ఎలాగోలా అతడిని బతిమాలో, ఏదో చేసో షూటింగ్ పూర్తి చేశారట. అదీ సంగతి. ఈ సినిమా ఏప్రిల్ 2న విడుదల కానుంది.
Also Read