దేవిశ్రీ 'ఎంత సక్కగా...' కొట్టాడు!
on Feb 5, 2020
'ఎంత సక్కగున్నావే... లచ్చిమి ఎంత సక్కగున్నావే' - ఈ పాట విన్నప్పుడు 'దేవిశ్రీ ఎంత సక్కగా కొట్టాడో' అని ప్రేక్షకులందరూ ప్రశంసించారు. 'రంగస్థలం' చిత్రంలో ఆ పాట ఒకటే కాదు... మిగతా పాటలు అన్నీ బాగుంటాయి. 'రంగస్థలం' మ్యూజిక్ సూపర్ సూపర్ డూపర్ హిట్. అందులో నో డౌట్. ఆ సినిమా తర్వాత దేవిశ్రీప్రసాద్ చాలా హిట్ సినిమాలు చేశాడు. వాటిలో కొన్ని హిట్ పాటలు ఉన్నాయి. అయితే... 'రంగస్థలం' రేంజ్ మ్యూజికల్ హిట్ దేవిశ్రీ నుంచి రాలేదు. పైగా, 'సరిలేరు నీకెవ్వరు' సంగీతం విషయంలో అతడు కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈసారి మాత్రం ప్రశంసలు అందుకునేలా ఉన్నాడు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. ఈరోజు సినిమా ఫస్ట్ వేవ్ విడుదల చేశారు. ప్రీ టీజర్ లాంటిది అన్నమాట. అందులో హీరో ఫేస్ చూపించలేదు. జస్ట్... ఇంతకు ముందు విడుదల చేసిన బ్యాక్ లుక్ ఉంది కదా! అదే లుక్ లో కొన్ని సెకన్ల వీడియో చూపించారు. హీరోయిన్ లుక్ చిన్నగా చూపించారు. ఏప్రిల్ 2న సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ టీజర్ మొత్తంలో హైలైట్ అయింది దేవిశ్రీ ఇచ్చిన నేపథ్య సంగీతమే. వెస్ట్రన్ మ్యూజిక్ కి వెళ్లకుండా ట్రెడిషనల్ టచ్ ఉన్న మ్యూజిక్ ఇచ్చాడు. సముద్రతీర ప్రాంతంలో జరిగే కథ కావడంతో ఆ ఫీల్ ఉండేలా చేశాడు. ఆ నేపథ్య సంగీతం విని 'ఎంత సక్కగా కొట్టాడు' అని సోషల్ మీడియాలో చాలామంది ప్రశంసిస్తున్నారు. కొందరు అయితే ఈ ఎంత సక్కగా ట్యూన్ ని మళ్ళీ కొట్టాడని కామెంట్ కూడా చేస్తున్నారనుకోండి. సాధారణంగా సుకుమార్ సినిమాలకు దేవి శ్రీ ప్రసాద్ సూపర్ హిట్ ట్యూన్లు ఇస్తాడు. సుకుమార్ నిర్మించిన 'కుమారి 21ఎఫ్' సినిమాకీ హిట్ పాటలు ఇచ్చాడు. 'ఉప్పెన' నిర్మాణంలో సుకుమార్ కూడా భాగస్వామి. సుకుమార్ శిష్యుడు సానా బుచ్చిబాబు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ సినిమాకి దేవిశ్రీ హిట్ పాటలే ఇచ్చి ఉంటాడు.
Also Read