
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్ట్ చేసిన 'పుష్ప' మూవీ 2021లో దేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. ఆ మూవీలో కూలివాడి నుంచి ఎర్రచందనం స్మగ్లర్గా మారే పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటనకు అమితమైన ప్రశంసలు లభించాయి. 'తగ్గేదేలే' అని అతడు చెప్పే ఊతపదం చాలా పాపులర్ అయ్యింది అయితే 'పుష్ప' సినిమాపై తాజాగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఉపన్యాసకులు గరికపాటి నరసింహారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆ సినిమాలో దర్శకుడు చూపించిన అంశాలను ఆయన తూర్పారబట్టారు. ఒక స్మగ్లర్ను హీరోగా చేశారనీ, అలాంటి వాళ్లు హీరోలైతే సమాజం చెడిపోకుండా ఉంటుందా? అని ప్రశ్నించారు. ఒక స్మగ్లర్ చెప్పిన 'తగ్గేదేలే' అనే మాట ఇవాళ ఉపనిషత్తు సూక్తి అయిపోయిందని వ్యంగ్యంగా అన్నారు. Also read: 'ఊ అంటావా' పాట కోసం కంటి ఆపరేషన్ వాయిదా!
"పుష్ప సినిమాలో హీరో ఒక స్మగ్లర్. స్మగ్లింగ్ చేసేవాళ్లను మీరో హీరోని చేశారు. ఏవన్నా అంటే చివరలో ఐదు నిమిషాలు మేం మంచి చూపిస్తాం, లేకపోతే పుష్ప 2, మూడోది ఇంకోటి తీస్తాం అంటారు. నువ్వు అవి తీసేలోగా ఇక్కడ సమాజం చెడిపోవాలా? నాకర్థం కాదు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, నువ్వు రెండు, మూడు తీసేలోగా సమాజం చెడిపోవాలా? ఇప్పటివరకూ స్మగ్లింగ్ గొప్పతనం ఏమైనా చెడిపోయిందా.. ఈ సినిమా కారణంగా! ఆ భావన రాలేదాండీ. పైగా స్మగ్లింగ్ చేసేవాడు తగ్గేదేలే అంటాడా? అదొక పెద్ద ఉపనిషత్తు సూక్తి అయిపోయింది ఇవాళ." అని ఆయన చెప్పుకొచ్చారు. Also read: బాప్రే.. "ఊ అంటావా" సాంగ్ కోసం సమంతకు రూ. 5 కోట్లు ఇచ్చారా?
ఇప్పుడు ఓ కుర్రాడు కూడా ఎవడ్నో ఒకడ్ని గూబమీద కొట్టి తగ్గేదేలే అంటాడనీ, దీనికి ఎవరు కారణమనీ ఆయన ప్రశ్నించారు. "నాకు కోపమే వస్తుంది. ఎందుకు రాదు? జరిగింది చెడు అయినప్పుడు కోపమే వస్తుంది. ఆ హీరోని కానీ, డైరెక్టర్ని కానీ నాకు సమాధానం చెప్పమనండి." అని ఆయన డిమాండ్ చేశారు.






