నేడు కలెక్షన్ కింగ్ పుట్టినరోజు
on Mar 19, 2014
ఆయన పేరు వింటే క్రమశిక్షణ, నిజాయితీ, ముక్కుసూటితనం గుర్తుకొస్తాయి. నటుడిగా, నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు డాక్టర్ పద్మశ్రీ కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. నేడు ఆయన పుట్టినరోజు.
ఆంధ్ర ప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో మొదుగులపాలెంలో 19 మార్చి 1952లో మోహన్ బాబు జన్మించారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు. ఆయనకు ముగ్గురు తమ్ముళ్లు రంగనాధ్ చౌదరీ, రామచంద్ర చౌదరీ, క్రిష్ణ మరియు ఒక సోదరి విజయ ఉన్నారు. 1975లో దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు దర్శకత్వంలో వచ్చిన "స్వర్గం నరకం" చిత్రం ద్వారా ఈయన తెలుగు తెరకు పరిచమయ్యారు. ఈ సినిమాతోనే మంచు భక్తవత్సలం నాయుడు అనే పేరును మోహన్ బాబుగా మార్చడం జరిగింది. దాసరి నారాయణ రావు శిష్యుడిగా ఆయన గుర్తింపు పొందారు.
ఆ తర్వాత ఆయన అనేక హిట్ చిత్రాల్లో కామెడి విలన్, విలన్, హీరో పాత్రలలో నటించి ప్రజల మన్ననలు పొందారు. ఆ తర్వాత 1981లో తన కూతురు పేరు మీద "శ్రీలక్ష్మీ ప్రసన్న పిక్చర్స్" అనే నిర్మాణ సంస్థను స్థాపించి, నిర్మాతగా "అల్లుడు గారు", "అసెంబ్లీ రౌడీ", "రౌడీగారి పెళ్ళాం", "మేజర్ చంద్రకాంత్", పెదరాయుడు" వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను నిర్మించారు.
ప్రతిఒక్కరు జన్మిస్తారు. కానీ ఆ జన్మను కొంతమందే చరితార్ధం చేస్తారు. ఎంత డబ్బు, పలుకుబడితో బ్రతికామనేదాని కంటే ఎంత మంచి పేరు, నీతీ,నిజాయితీలతో బ్రతికామన్నదే ముఖ్యం. రెండవ కోవకే వస్తారు మోహన్ బాబు. కామెడి విలన్, విలన్, హీరో, నిర్మాత... ఇలా దాదాపు 525 చిత్రాల వరకు నటించారు.
ప్రజలకు తనవంతుగా సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో 1992లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ను స్థాపించారు. దీనిలో అంతర్జాతీయ పాఠశాల, డిగ్రీ కళాశాల, ఇంజినీరింగ్ కళాశాల, ఫార్మసీ కళాశాల మరియు నర్సింగ్ కళాశాలలు ఉన్నాయి.
తెలుగు సినిమా ఇండస్ట్రీ అగ్రజులు, తెలుగువారందరూ కూడా ప్రేమగా అన్న అని పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారకరామారావు గారితో మోహన్ బాబుకు మంచి సంబంధం ఉంది. మోహన్ బాబు ఎప్పుడుకూడా సోదర భావంతో అన్నగారు అని ఎన్టీఆర్ ను స్మరించుకుంటూనే ఉంటారు. ఎన్టీఆర్ స్పూర్తితోనే ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించి 1995లో రాజ్య సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా కూడా పదవిని అలంకరించారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా పని చేశారు. ఈయన భారత రాష్ట్రపతి చేతులమీదుగా 2007లో ప్రఖ్యాత భారత జాతీయ పురష్కారం పద్మశ్రీని అందుకున్నారు.
సినిమా రంగంలో ఒక నటుడిగా తన సత్తా ఏంటో నిరూపించుకోవడమే కాకుండా ఒక కుటుంబ పెద్దగా కూడా అంతే క్రమశిక్షణ, నీతీ, నిజాయితీలతో మంచి పేరు సంపాదించుకున్నారు. మోహన్ బాబుకు ఇద్దరు కుమారులు మనోజ్ కుమార్, విష్ణువర్ధన్...ఒక కుమార్తె లక్ష్మీ ప్రసన్న. ఈ ముగ్గురు కూడా సినిమా రంగంలో తమ ప్రతిభను చాటుతూ మోహన్ బాబు పేరు, మంచితనాన్ని కాపాడుతూ మంచి పేరు సంపాదించుకుంటున్నారు.
మోహన్ బాబు, విష్ణు, మనోజ్ లు కలిసి నటించిన "పాండవులు పాండవులు తుమ్మెదా" చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకులకు ఓ మంచి హాస్యభరితమైన చిత్రాన్ని అందించారు. ప్రస్తుతం మోహన్ బాబు "రౌడీ" అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా త్వరలో విడుదల కానుంది. మోహన్ బాబు ఇలాగే నవ్వుతూ, అందరిని నవ్విస్తూ, తన సినిమాలతో అభిమానులను అలరించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
మరోసారి నట ప్రపూర్ణ, కలెక్షన్ కింగ్, డైలాగ్ కింగ్ డాక్టర్ పద్మశ్రీ మోహన్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది తెలుగువన