రాష్ట్రపతి ఎన్నిక విపక్షాల అనైక్యతే ఎన్డీఏ అసలు బలం
Publish Date:Jun 10, 2022
Advertisement
కేంద్ర ఎన్నికల సంఘం గంట కొట్టింది. రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదలైంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్ధి విజయం కూడా ఇంచుమించుగా ఖరారైంది. షెడ్యూల్ విడుదలకు చాలా ముందుగానే,ఎన్డీఏ విజయానికి అవసరమైన సంఖ్యాబలాన్ని, సొంత ఖాతాలో చేర్చుకుంది. ఎలక్టోరల్ కాలేజీ ఓట్లలో 50 శాతం గీత దాటేందుకు, ఎన్డీఎ సొంత బలానికి, కేవలం 1.2 శాతం ఓట్లు మాత్రమే అవసరమవుతాయని లెక్కలు చెపుతున్నాయి. ఆ కాస్త వ్యత్యాసాన్ని భర్తీ చేసేందుకు, ఆంధ్ర ప్రదేశ్’లో అధికారంలో ఉన్న, వైసీపీ, ఒరిస్సాలో అధికారంలో ఉన్న బీజేడీతో పాటుగా తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షం అన్నా డిఎంకే సిద్ధంగా ఉన్నాయి. ఆ మూడు పార్టీల మద్దతు పొందేందుకు, ఎన్డీఏ నాయకత్వం అంతగా శ్రమించవలసిన అవసరం కూడా లేదు. అది అందరికీ తెలిసిన విషయమే. అన్నా డిఎంకే ఎన్డీఏలో భాగస్వామ్య పార్టీ. ఇక వైసీపీ సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా, జస్ట్ వంగమంటే, వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సాష్టాంగపడి, అవసరం అనుకుంటే పొర్లు దండాలు పెట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారనేది,అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా, ప్రధాని మోడీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ముందుగానే ఢిల్లీ పిలిపించుకుని మంతనాలు జరిపారు. ఇక బిజూ జనతాదళ్’ మొదటి నుంచి కూడా రాజ్యాంగ పదవుల విషయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ/ కూటమితో కలిసినడిచే విదానాన్నే పాటిస్తోంది. ఈ మూడు పార్టీలు కాకుండా బీజేపీని కాంగ్రెస్ సహా అన్ని పార్టీలలో రహస్య మిత్రులు కూడా ఉన్నారని ఆయా పార్టీల ప్రత్యర్ధులు ఆరోపిస్తున్నారు. సో.. బీజేపీ / ఎన్డీఏ అభ్యర్ధి ఎవరైనా, వారే రేపటి రాష్ట్రపతి, అందులో సందేహం లేదని బీజేపీ నాయకులు ధీమాగా ఉన్నారు. అదలా ఉంటే విపక్షాల పరిస్థితి విచిత్రంగా (కొందరు గిట్టని వాళ్ళు ‘విషాదం’గా ఉందని అని కుడా అంటారు అనుకోండి, అది వేరే విషయం).నిజానికి, విపక్షాలు అన్నీ కలిసినా, బీజేపీ అభ్యర్ధిని ఓడించలేక పోవచ్చును కానీ, అదే జరిగితే బీజేపీకి గెలుపుపై ఇంత ధీమా ఉండేది కాదు. ఒక విధంగా చూస్తే మోడీ, అమిత్ షాలకు ముచ్చెమటలు పట్టించే అవాకాశం విపక్షాలకు వుంది. అయితే, విపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలు ఏవీ పెద్దగా జరగలేదు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత కిశోర్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కొంత ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ పరిస్థితి అయితే చెప్పనే అక్కరలేదు. అంతర్గత సమస్యలకు తోడు, ఇప్పుడు మూలిగే నక్కపై తాటి పండు పడినట్లు, నేషనల్ హెరాల్డ్ మనీ ల్యాండరింగ్ కేసు,పార్టీ అగ్ర నాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అదే విధంగా జాతీయ రాజకీయాలు, 2024 ఎన్నికల వ్యూహ రచన, ప్రత్యాన్మాయ కూటమి, జాతీయ పార్టీ ... అంటూ అనేక రాస్త్రాలలో రాజకీయ యాత్రలు చేసిన కేసీఆర్ ఎందుకనో మౌనవ్రతం నుంచి బయటకు రావడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి అనుమానమే అంటున్నారు. ఏమైనా, 2024 ఎన్నికలకు ట్రయిల్ రన్’ అనుకున్న రాష్ట్ర పతి ఎన్నికలో విపక్ష వ్యూహం బెడిసి కొట్టినట్లే కనిపిస్తోంది. అదలా ఉంటే, ఇటు అధికార కూటమి, అతి ప్రతిపక్ష కూటమి (?) అభ్యర్ధుల విషయంలో అనేక పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అధికార కూటమి తరఫున ముఖ్యంగా కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, అసోం గవర్నర్ జగ్దీశ్ ముఖి, ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ యూకీ పేర్లు వినబడుతుండగా.. ప్రతిపక్ష శిబిరం నుంచి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్లను బరిలో దించుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.అయితే, విపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా తనను బరిలో దించుతున్నట్టుగా వస్తోన్న ఊహాగానాలను ఇప్పటికే శరద్ పవార్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తున్నారు. ఎన్డీయే కూటమికి విస్పష్ట మెజార్టీ ఉన్న నేపథ్యంలో ఆ కూటమికి పోటీగా దిగే అభ్యర్థికి ఎలాంటి ఫలితం వస్తుందన్నది ముందే ఊహించుకోవచ్చని ఆయన వ్యాఖ్యానించినట్టుగా గతంలో ఎన్సీపీ వర్గాలే తెలిపాయి.గత రాష్ట్రపతి ఎన్నికల్లో దళిత సామాజిక సమీకరణాలపై ఫోకస్ పెట్టిన బీజేపే . ఈసారి రాష్ట్రపతిగా ఆదివాసీలు లేదా మహిళలకు ఛాన్స్ కల్పించే అవకాశం కూడా ఉండొచ్చన్న ఊహాగానాలు వినబడుతున్నాయి. దీంతో ఝార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము, ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయల పేర్లు తెరపైకి వస్తున్నాయి. అలాగే, గత ఎన్నికల్లోనే ద్రౌపది ముర్ము పేరు వినిపించినప్పటికీ, అనూహ్యంగా చివరకు రామ్నాథ్ కోవింద్ను ఎన్డీయే తమ అభ్యర్థిగా బరిలో దించిన విషయం తెలిసిందే. ఒకవేళ ఎస్టీ సామాజిక వర్గం నుంచి ఇవ్వాలనుకుంటే మాత్రం ద్రౌపది ముర్ముకే ఎక్కువ అవకాశాలు ఉండొచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. ఇంకోవైపు, దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టిన బీజేపీ ఈ ఎన్నికల్లో అటువైపు నుంచి ఎవరినైనా అభ్యర్థిగా ఎంపిక చేసే అవకాశాలూ లేకపోలేదన్న వాదనలూ ఉన్నాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో దక్షిణాది నుంచి ప్రస్తుతం ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళి సైలకు ఛాన్స్ ఇస్తారనే చర్చ కూడా నడుస్తోంది. తమిళిసై తమిళనాడుకు చెందినవారు కావడంతో పాటు ఓబీసీ సామాజిక వర్గానికి చెందడం ఆమెకు కలిసి రావొచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.అయితే, చివరకు ఎవరు తెరమీదకు వస్తారనే విషయంలో ఉహాగానాలు నిజం అవుతాయా? గతంలో లాగా అనూహ్య చిత్రం అవిష్కృతం అవుతుందా? తెలియాలంటే .. ఇంకొన్ని రోజుల నిరీక్షణ తప్పదు.
http://www.teluguone.com/news/content/యnda-actual-strength-is-disagreement-in-opposition-25-137391.html





