Top Stories

political-news-img

వర్షాలకు ముందు ఈ పనులు చేస్తే మొక్కలు బాగా వేగంగా పెరుగుతాయి!

ఎండలు భగభగ మండుతూ ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిన తర్వాత రుతుపవనాలు వస్తాయి. ఈ రుతుపవనాలు ప్రజలకు ఎంతో ఊరట ఇస్తాయి. చాలా ఎండల తర్వాత వర్షం కురవడం, వాతావరణం చల్లబడటం అనేది కేవలం మనుషులకే కాదు.. జంతువులకు, వృక్షాలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. మొక్కలను పెంచుకోవడం అంటే ఎంతో ఇష్టమున్నవారికి మాత్రం వర్షాలు కురవడం అనేది ఎంతో సంతోషాన్ని తెచ్చిపెడుతుంది. అయితే వర్షాకాలం కొన్ని సవాళ్లను కూడా వెంట తెస్తుంది. వర్షాలు రాగానే కొన్ని తోటలు పచ్చగా, అందంగా కనిపిస్తాయి. మరికొన్ని కలుపు మొక్కలు, కీటకాలు, కుండీలలో నీరు నిలవడం వంటి సమస్యలను తెచ్చిపెడతాయి. ఈ వర్షాకాలంలో తోటలోని మొక్కలకు ఎలాంటి వ్యాధులు రాకూడదన్నా.. మొక్కలు పచ్చగా, ఏపుగా పెరగాలన్నా వర్షాలు ప్రారంభమయ్యే ముందు కొన్ని పనులు చేయాలి. ఎంతో సులభమైన, ముఖ్యమైన ఆ పనులు ఏంటో తెలుసుకుంటే.. డ్రైనేజీ రంధ్రాలు.. వర్షాకాలంలో మొక్కలు చనిపోవడానికి చాలా ఎక్కువగా ఎదురయ్యే సాధారణ కారణం నీరు. మొక్కలకు నీరు బాగా పోసినా లేదా వర్షాల కారణంగా కుండీలలో నీరు ఎక్కువగా నిలిచినా మొక్కలు చనిపోతాయి. కుండీ అడుగున ఉన్న రంధ్రం మట్టితో లేదా గులకరాళ్లతో మూసుకుపోతే, వర్షపు నీరు బయటకు పోదు. దీనివల్ల వేర్లు నీటిలో మునిగి ఉండి కుళ్లిపోతాయి. అందువల్ల, వర్షాలు రాకముందే, అదనపు నీరు వెంటనే బయటకు పోయేలా అన్ని కుండీలలోని డ్రైనేజీ రంధ్రాలను పుల్ల లేదా స్క్రూడ్రైవర్‌తో శుభ్రం చేయాలి. కలుపు మొక్కలు.. గాలిలో , నేలలో తేమ పెరిగేకొద్దీ కుండీలలో , పూల మడులలో అనవసరమైన కలుపు మొక్కలు వేగంగా పెరుగుతాయి. ఈ కలుపు మొక్కలు చూడటానికి అందవిహీనంగా ఉండటమే కాకుండా, నేల నుండి అవసరమైన పోషకాలను గ్రహించి, ప్రధాన మొక్కలను బలహీనపరుస్తాయి. వర్షాలు ప్రారంభమయ్యే ముందు, తోట అంతటా లేదా కుండీలలో కలుపును పూర్తిగా తీసివేసి, అన్ని కలుపు మొక్కలను వేళ్లతో సహా పెకిలించాలి. ప్రూనింగ్.. ప్రూనింగ్ అంటే కత్తిరింపు. కొత్త మొక్కల పెరుగుదలకు వర్షాకాలం ఉత్తమ సమయంగా పరిగణించబడుతుంది . అందువల్ల, వర్షాలు ప్రారంభమయ్యే ముందు మొక్కలను తేలికగా కత్తిరించాలి. చనిపోయిన, కుళ్ళిన లేదా వ్యాధి సోకిన కొమ్మలను తొలగించాలి. కత్తిరించడం వల్ల మొక్కలో గాలి, సూర్యరశ్మి ప్రసరణ మెరుగుపడుతుంది. వర్షం పడిన వెంటనే మొక్కకు ఎన్నో కొత్త, నిగనిగలాడే ఆకులు చిగురిస్తాయి. సపోర్ట్.. వర్షాకాలంలో బలమైన గాలులు, తుఫానులు సర్వసాధారణం. మనీ ప్లాంట్, తిప్పతీగ లేదా తమలపాకు వంటి తీగలు, బరువైన మొక్కలు బలమైన గాలుల వల్ల లేదా నీటి బరువు వల్ల విరిగి పడిపోవచ్చు. దీనిని నివారించడానికి, వర్షాకాలం రాకముందే తీగలు , పొడవైన మొక్కలన్నింటికీ వెదురు కర్రలు, పుల్లలు లేదా తాళ్లతో తగినంత ఆధారాన్ని అందించాలి, తద్వారా అవి బలమైన తుఫానుల సమయంలో కూడా సురక్షితంగా నిలబడతాయి. కంపోస్ట్, కొత్త మట్టి.. తరచుగా కురిసే వర్షాల వల్ల కుండీలలోని పై మట్టి, దానిలోని పోషకాలు కొట్టుకుపోతాయి. వర్షాలు పడటానికి ముందే మట్టిని సిద్ధం చేసుకోవడం ముఖ్యం. కుండీలలో కొంత తాజా మట్టిని, మంచి సేంద్రియ ఎరువును కలపాలి. వర్షపు నీరు పడినప్పుడు, ఈ ఎరువు నేరుగా వేర్లకు చేరి, మొక్కలు రెట్టింపు వేగంతో పెరిగే శక్తిని ఇస్తుంది. కొన్ని గార్డెనింగ్ టిప్స్.. తేమతో కూడిన వాతావరణం కీటకాలు, శిలీంధ్రాలు , చీమల పెరుగుదలకు అనువైనది. వర్షాకాలంలో, మొక్కలపై మీలీబగ్స్ , శిలీంధ్రాల దాడి బాగా పెరుగుతుంది. దీనిని నివారించడానికి, ప్రతి 15 రోజులకు ఒకసారి మొక్కలపై వేప నూనెను పిచికారీ చేయాలి, లేదా కొద్దిగా శిలీంధ్రనాశక పొడిని శుభ్రమైన నీటిలో కలపి పిచికారీ చేయాలి. ఈ ముందుజాగ్రత్త చర్యలు మొక్కలను వ్యాధుల నుండి కాపాడుతాయి. *రూపశ్రీ.

Publish Date: Jun 16, 2026 12:53PM

political-news-img

జాగ్రత్త.. ఎసిడిటీ కోసం వాడే ఈ మందులు.. కిడ్నీ,  లివర్ కు హాని చేస్తాయ్!

ఎసిడిటీ నేటి కాలంలో చాలా మందిలో కామన్ గా మారిన సమస్య. చిన్న వయసు వారి నుండి పెద్దల వరకు అందరికీ గ్యాస్, ఎసిడిటీ పెద్ద సమస్యగా మారుతోంది. మసాలా పదార్థాలు ఎక్కువగా తినడం, రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, జీవనశైలిలో మార్పులు.. మొదలైనవన్నీ గ్యాస్, ఎసిడిటీ సమస్యకు దారితీస్తాయి. గుండెల్లో మంట, ఎసిడిటీ లేదా అజీర్ణం వంటి సమస్యలను ఎదుర్కొన్నప్పుడు తరచుగా దగ్గరలోని మెడికల్ స్టోర్ నుండి గ్యాస్ మాత్రలను కొనుగోలు చేసి వాడుతుంటారు. ఈ మందులు తక్షణ ఉపశమనాన్ని అందిస్తాయి, కానీ దీర్ఘకాలంలో, అవి ప్రాణాంతకమైన ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయని వైద్యులు చెబుతున్నారు. దీని గురించి మరింత వివరంగా తెలుసుకుంటే.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్ల వల్ల మూత్రపిండాలకు కలిగే ప్రమాదాలు వైద్య నివేదికలలో, నిపుణుల బృందం ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ (PPIs) అనే ఔషధాల సమూహాన్ని ఆరోగ్యానికి అత్యంత హానికరం అని వర్ణించింది. ఈ మందులను దీర్ఘకాలం ఉపయోగించడం వల్ల మూత్రపిండాల వైఫల్యం ప్రమాదం గణనీయంగా పెరుగుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు.. ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్లు అనేక పేర్లతో అమ్ముడవుతాయి . ప్రపంచవ్యాప్తంగా చాలా సాధారణంగా సూచించబడే మందులలో ఇవి కూడా ఉన్నాయి. కొన్ని పరిశోధనలలో ఇతర అసిడిటీ మందులు (హిస్టమైన్-2 రిసెప్టర్ యాంటాగోనిస్టుల వంటివి) తీసుకునే వారితో పోలిస్తే, PPIS మందులు తీసుకునే వారికి మూత్రపిండాల వ్యాధి వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉందని తేలింది. PPIS తీసుకుంటున్న రోగులకు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి వచ్చే అవకాశం 28.4 రెట్లు ఎక్కువగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అదేవిధంగా, తీవ్రమైన మూత్రపిండాల గాయం ప్రమాదం 4.2 రెట్లు ఎక్కువగా , ఫైనల్ స్టేజ్ మూత్రపిండాల వ్యాధి ప్రమాదం 35.5 రెట్లు ఎక్కువగా ఉంటుందట. PPIS తీసుకునే వ్యక్తులలో ఎలక్ట్రోలైట్ల (సోడియం, పొటాషియం మరియు మెగ్నీషియం వంటివి) అసమతుల్యత ఉండే అవకాశం ఎక్కువగా ఉందని అధ్యయనాల్లో తేలింది. లివర్ ప్రమాదం కూడా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, చాలా మంది రోగులకు PPIలు కీలకమైన మందులు కావచ్చని, PPIలు ఎలుకలు , మానవులలో దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ప్రమాదాన్ని కూడా పెంచవచ్చని సూచించింది. సాధారణంగా మందుల ప్రయోగాలు ఎలుకల మీదనే జరుగుతాయి. రానిటిడిన్.. రానిటిడిన్‌తో ఉన్న అతిపెద్ద ప్రమాదం ఏమిటంటే.., దానిని నిల్వ చేసినప్పుడు, దానిలో N-నైట్రోసోడైమిథైలమైన్ (NDMA) అనే రసాయనం ఏర్పడటం ప్రారంభమవుతుంది. ఇది అత్యంత విషపూరితమైనదని , క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి. చాలా దేశాలు దీని వాడకాన్ని నిషేధించినప్పటికీ, భారతదేశంలో ఇది ఇప్పటికీ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడుకలో ఉంది. కాబట్టి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలకు ఊరికే మెడికల్ స్టోర్ నుండి మందులు తెచ్చుకుని వాడకుండా ఆరోగ్యాన్నిజాగ్రత్తగా కాపాడుకోవాలి. *రూపశ్రీ.

Publish Date: Jun 16, 2026 12:49PM

political-news-img

బీహార్ మంత్రికి సుప్రీం షాక్!

బీహార్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న దీపక్ ప్రకాష్ కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ లేదా శాసనమండలిలో సభ్యుడు కానప్పటికీ ఆయనను మళ్లీ మంత్రిగా నియమించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు మంత్రి దీపక్ ప్రకాష్‌తో పాటు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అసలు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కాని ఒక వ్యక్తి సుదీర్ఘ కాలం పాటు మంత్రి పదవిలో ఎలా కొనసాగుతారనే ప్రాథమిక రాజ్యాంగ ప్రశ్నను ఈ కేసు లేవనెత్తింది. సామాజిక కార్యకర్త రాకేష్ కుమార్ సింగ్ దాఖలు చేసిన ఈ పిటిషన్, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) పరిధిని మరోసారి చర్చకు తెచ్చింది. ఈ వివాదం వివరాలిలా ఉన్నాయి. గత ఏడాది నవంబర్ 20, 2025న అప్పటి బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన కేబినెట్‌లో దీపక్ ప్రకాష్‌ను పంచాయతీరాజ్ మంత్రిగా నియమించారు. ఆ సమయానికి ఆయన చట్టసభల్లో సభ్యుడు కాదు. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఎలాంటి సభ్యత్వం లేని వ్యక్తి అయినా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు, కానీ ఆరు నెలల లోపు అంటే ఈ ఏడాది మే 20 నాటికి అసెంబ్లీ లేదా మంండలికి ఎన్నిక కావాలి. అయితే, ఈ ఆరు నెలల గడువు ముగియడానికి ముందే బీహార్ రాజకీయాల్లో ఊహించని మార్పులు జరిగాయి. ఏప్రిల్ 15న నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాత మంత్రివర్గం రద్దయింది. ఆ సమయంలో దీపక్ ప్రకాష్ కూడా తన మంత్రి పదవిని కోల్పోయారు. ఆ తర్వాత దాదాపు 22 రోజుల విరామం అనంతరం బీహార్‌లో సమ్రాట్ చౌదరి నేతృత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే, పాత కేబినెట్‌లో ఉన్న దీపక్ ప్రకాష్‌ను మళ్లీ అదే పంచాయతీరాజ్ మంత్రిగా కొత్త ప్రభుత్వంలోకి తీసుకున్నారు. రాజ్యాంగ నియమాల ప్రకారం ఆయనకు లభించిన మొదటి ఆరు నెలల మినహాయింపు గడువు మే 20తో ముగిసిపోయింది. కొత్త ప్రభుత్వం ఏర్పడింది కదా అని, చట్టసభ సభ్యత్వం లేని వ్యక్తికి మళ్లీ కొత్తగా మరో ఆరు నెలల సమయం లభిస్తుందా అనే అంశంపైనే ఇప్పుడు న్యాయపోరాటం నడుస్తోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 164(4) స్పష్టమైన మార్గదర్శకాలను అందిస్తోంది. దీని ప్రకారం చట్టసభ సభ్యుడు కాని వ్యక్తి వరుసగా ఆరు నెలల పాటు మాత్రమే మంత్రిగా కొనసాగేందుకు వీలుంటుంది. ఆ నిర్ణీత గడువులోగా అతను తప్పనిసరిగా రాష్ట్ర శాసనసభ లేదా శాసనమండలి సభ్యత్వాన్ని సాధించాలి. ఈ మినహాయింపు అనేది ఒక వ్యక్తికి జీవితంలో ఒక్కసారి మాత్రమే లభిస్తుందనీ.. కేవలం ముఖ్యమంత్రి మారినంత మాత్రాన లేదా కొత్త ప్రభుత్వం ఏర్పాటైనంత మాత్రాన ఈ రాజ్యాంగ నిబంధనను తుంగలో తొక్కి, ఆరు నెలల గడువును పునరుద్ధరించడం కుదరదని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఒకవేళ ఇలాంటి నియామకాలను అనుమతిస్తే, ప్రజాస్వామ్య సూత్రాలకు విఘాతం కలుగుతుందని పిటిషనర్ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు కూడా ఈ వాదనలతో ప్రాథమికంగా ఏకీభవిస్తూ, రెండోసారి ఇలాంటి అవకాశం ఉండదని స్పష్టం చేస్తూ నోటీసులు ఇవ్వడం గమనార్హం. ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు భవిష్యత్తులో దేశవ్యాప్తంగా ఇలాంటి రాజకీయ నియామకాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

Publish Date: Jun 16, 2026 12:44PM

political-news-img

ఫిఫా వరల్డ్‌కప్: అమెరికా గడ్డపై ఇరాన్ సంచలనం.. కివీస్‌తో మ్యాచ్ డ్రా!

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్రీడా సమరం ఫిఫా వరల్డ్‌కప్ (FIFA World Cup) వేదికపై ఒక ఉత్కంఠభరితమైన పోరు సాగింది. అమెరికా వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ఇరాన్, న్యూజిలాండ్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మైదానంలో ఆటగాళ్ల మధ్య జరిగిన ఈ పోరాటం కేవలం ఒక సాకర్ మ్యాచ్ లాగా మాత్రమే కాకుండా, రాజకీయ ఉద్రిక్తతల నడుమ సాగిన ఒక హై-డ్రామా మ్యాచ్‌గా క్రీడా లోకంలో నిలిచిపోయింది. ఎన్నో సవాళ్లు, ఆందోళనల మధ్య అమెరికా గడ్డపై అడుగుపెట్టిన ఇరాన్ జట్టు, మైదానంలో అద్భుతమైన ఆటతీరుతో అందరినీ ఆశ్చర్యపరిచింది. చివరి నిమిషం వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్ చివరకు 2-2 గోల్స్ తేడాతో ఉద్వేగభరితమైన డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌లో రెండు సార్లు ఇరాన్ జట్టు ఓటమి అంచుల్లోకి వెళ్లినప్పటికీ, ఒత్తిడిని అధిగమించి అద్భుతంగా పుంజుకోవడం విశేషం. న్యూజిలాండ్ జట్టు తరపున స్టార్ ప్లేయర్ ఎలిజా జస్ట్ (Elijah Just) ఒంటరి పోరాటం చేశాడు. మ్యాచ్ ప్రారంభమైన కొద్దిసేపటికే, అంటే కేవలం 7వ నిమిషంలోనే ఎలిజా జస్ట్ ఒక సూపర్‌ గోల్ చేసి న్యూజిలాండ్‌కు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఆరంభపు షాక్ నుంచి ఇరాన్ వెంటనే తేరుకుంది. మైదానంలో పట్టువదలకుండా పోరాడుతూ మ్యాచ్ 32వ నిమిషంలో ఇరాన్ ఆటగాళ్లు తొలి గోల్ కొట్టి స్కోరును 1-1తో సమం చేశారు. దీంతో మొదటి సగం ముగిసేసరికి ఇరు జట్లు సమానమైన పట్టు సాధించాయి. రెండో సగంలో ఆట మరింత వేడెక్కింది. న్యూజిలాండ్ జట్టు ఇరాన్ రక్షణ శ్రేణిని చేధించడానికి తీవ్రంగా ప్రయత్నించింది. ఈ క్రమంలోనే మ్యాచ్ 54వ నిమిషంలో ఎలిజా జస్ట్ మరోసారి మెరుపులాంటి గోల్‌తో మెరిశాడు. తన జట్టుకు 2-1 ఆధిక్యాన్ని అందిస్తూ మ్యాచ్‌ను న్యూజిలాండ్ వైపు తిప్పాడు. రెండు సార్లు వెనుకబడినప్పటికీ ఇరాన్ ఆటగాళ్లు మానసికంగా కుంగిపోలేదు. వారు మరింత దూకుడుగా కౌంటర్ ఎటాక్ (counter-attack) ప్రారంభించారు. న్యూజిలాండ్ సంబరాల్లో మునిగి తేలుతున్న తరుణంలో, సరిగ్గా 10 నిమిషాల వ్యవధిలోనే, అంటే మ్యాచ్ 64వ నిమిషంలో ఇరాన్ జట్టు రెండో గోల్ సాధించింది. ఈ అద్భుత గోల్‌తో స్కోరు మళ్లీ 2-2తో సమమైంది. ఆ తర్వాత ఇరు జట్లు గోల్స్ కోసం శ్రమించినప్పటికీ ఫలితం దక్కలేదు. వాస్తవానికి ఈ మ్యాచ్ వెనుక పెద్ద రాజకీయ నేపథ్యమే ఉంది. అమెరికాతో తీవ్రమైన రాజకీయ వైరం ఉన్న ఇరాన్, మొదట్లో ఈ టోర్నమెంట్‌లో భాగంగా అమెరికాలో ఆడేందుకు ఎంతమాత్రం ఇష్టపడలేదు. తమ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను అమెరికా నుంచి వేరే దేశానికి మార్చాలని ఫిఫా (FIFA) యాజమాన్యాన్ని గట్టిగా డిమాండ్ చేసింది. అయితే ఇరాన్ చేసిన ఈ అభ్యర్థనను ఫిఫా పూర్తిగా తిరస్కరించింది. దాంతో ఇరాన్ జట్టు వినూత్న వ్యూహాన్ని అనుసరించింది. తమ అధికారిక శిక్షణ కేంద్రాన్ని అమెరికాలోని అరిజోనా నుంచి మార్చి, మెక్సికోలోని టిజునా (Tijuana) నగరంలో ఏర్పాటు చేసుకుని ప్రాక్టీస్ చేసింది. ఇలాంటి ఎన్నో రాజకీయ ఒత్తిళ్లు, మైదానం వెలుపలి వివాదాల మధ్య బరిలోకి దిగిన ఇరాన్ జట్టు, కివీస్ బలమైన ఆటతీరును సమర్థవంతంగా అడ్డుకుని 2-2తో మ్యాచ్‌ను డ్రా చేసుకోవడం ఒక గొప్ప విజయంగానే భావించవచ్చు. ఇరాన్ ప్రదర్శన ఫుట్‌బాల్ అభిమానుల మనసులను గెలుచుకుంది. ఇదే వరల్డ్‌కప్ గ్రూప్-జి (Group G) లో జరిగిన మరో ఆసక్తికరమైన మ్యాచ్‌లో బెల్జియం, ఈజిప్ట్ జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్ కూడా చివరి వరకు హోరాహోరీగా సాగి 1-1 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. మొత్తానికి ఈ ఫిఫా వరల్డ్‌కప్ తొలి రోజే ఊహించని మలుపులు, ఉత్కంఠభరితమైన ఫలితాలతో సాకర్ ప్రియులకు అసలైన మజాను అందించింది.

Publish Date: Jun 16, 2026 12:38PM

political-news-img

హారిజన్ రీక్లెయిమ్ ఐపీఓ ధూమ్: చివరి రోజున ఇన్వెస్టర్ల భారీ పోటీ!

స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే ఇన్వెస్టర్లకు ప్రస్తుతం ఐపీఓల పండుగ నడుస్తోంది. ముఖ్యంగా స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజ్ అంటే ఎస్ఎంఈ విభాగంలో వచ్చే కంపెనీలు ఊహించని రీతిలో లాభాలను కురిపిస్తుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై తెగ ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా మార్కెట్లోకి వచ్చిన హారిజన్ రీక్లెయిమ్ లిమిటెడ్ ఐపీఓ దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ సంపాదించుకుంది. టైర్ల వ్యర్థాల రీసైక్లింగ్ అనే ఒక వినూత్నమైన ఆలోచనను వ్యవస్థాపకుడు మోహిత్ బజాజ్ కోట్లాది రూపాయల వ్యాపార సామ్రాజ్యంగా మార్చడం విశేషం. పర్యావరణానికి ఎంతో మేలు చేసేలా 'సర్క్యులర్ ఎకానమీ' విధానంపై దృష్టి సారించిన ఈ సంస్థ, నాణ్యమైన రీక్లెయిమ్డ్ రబ్బరును ఉత్పత్తి చేస్తూ మార్కెట్లో దూసుకుపోతోంది. నేడు అంటే జూన్ 16తో ఈ ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ ముగియనుండటంతో గడువు ముగిసేలోపు షేర్లను ఎలాగైనా దక్కించుకోవాలని రిటైల్ ఇన్వెస్టర్లు తీవ్రంగా పోటీ పడుతున్నారు. రూర్కీ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ సంస్థ వృద్ధి రేటు ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఏడాదికి ఏకంగా 14,100 మెట్రిక్ టన్నుల (MTPA) ఉత్పత్తి సామర్థ్యం గల భారీ ప్లాంట్ ఈ కంపెనీకి సొంతం. మార్కెట్లో వేస్ట్‌గా పడి ఉండే పాత టైర్లను అద్భుతంగా రీసైకిల్ చేస్తూ వివిధ పారిశ్రామిక రంగాలకు అవసరమైన కీలకమైన ముడి పదార్థాలను ఈ కంపెనీ సరఫరా చేస్తోంది. ఇది ఒకవైపు పర్యావరణ కాలుష్యాన్ని భారీగా తగ్గించడమే కాకుండా, మరోవైపు వివిధ వస్తువుల తయారీదారులకు చాలా తక్కువ ధరకే నాణ్యమైన ప్రత్యామ్నాయాలను అందుబాటులోకి తెస్తోంది. అంతేకాదు, వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు హరిద్వార్‌లో సరికొత్త ఫ్యాక్టరీని నిర్మించాలనే బలమైన ప్లాన్ కూడా ఈ కంపెనీకి ఉంది. గ్రీన్ ఎనర్జీ మరియు పర్యావరణ హితమైన రంగాలలో దీర్ఘకాలిక లాభాలు ఆశించే ఇన్వెస్టర్లను ఈ వ్యూహాత్మక వృద్ధి ప్రణాళికలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. ఇక ఈ ఐపీఓకు సంబంధించిన ధర, కనీస పెట్టుబడి వివరాల్లోకి వెళ్తే.. కంపెనీ తన ప్రైస్ బ్యాండ్‌ను ప్రతి షేరుకు 98 రూపాయల నుండి 103 రూపాయలుగా నిర్ణయించింది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఎంఈ ఐపీఓ కావడంతో దీని లాట్ సైజును 1,200 షేర్లుగా ఫిక్స్ చేశారు. అంటే ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం 1,23,600 రూపాయల భారీ పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ ఐపీఓ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ తన పాత అప్పులను పూర్తిగా తీర్చడానికి, అలాగే రోజువారీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించనుంది. మొదటి రోజు నుంచే సబ్‌స్క్రిప్షన్ నంబర్లు విపరీతంగా ఉండటంతో, అలాట్‌మెంట్ ప్రక్రియలో ఇన్వెస్టర్ల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం షేర్లు దక్కించుకున్న లక్కీ ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాల్లో జూన్ 18 నాటికి షేర్లు నేరుగా క్రేడిట్ అవుతాయి. ఆ తర్వాత జూన్ 19న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ యొక్క ఎస్ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై అంటే ఎన్ఎస్ఈ ఎస్ఎంఈపై ఈ షేర్లు ఘనంగా లిస్ట్ కానున్నాయి. మార్కెట్లో సబ్‌స్క్రిప్షన్ ట్రెండ్ చాలా బలంగా ఉన్నప్పటికీ, ఎస్ఎంఈ స్టాక్స్‌లో కొంత లిక్విడిటీ రిస్క్ ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ విభాగంలో ధరల హెచ్చుతగ్గులు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి లిస్టింగ్ రోజు వచ్చే బంపర్ లాభాలతో పాటు ఇందులోని రిస్క్ ఫ్యాక్టర్లను కూడా ఇన్వెస్టర్లు బేరీజు వేసుకోవడం మంచిది. ఒక చిన్న రీసైక్లింగ్ యూనిట్ స్థాయి నుంచి స్టాక్ మార్కెట్ ఐపీఓ వరకు ఎదిగిన మోహిత్ బజాజ్ సక్సెస్ స్టోరీ ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తినిస్తోంది. పర్యావరణ హితమైన వ్యాపార నమూనాలు కూడా భారీ సంపదను సృష్టించగలవని ఈ ఐపీఓ నిరూపించింది.

Publish Date: Jun 16, 2026 12:35PM

political-news-img

స్మార్ట్‌వాచ్‌లో QR Code: బెంగళూరు ఆటో డ్రైవర్ మామూలోడు కాదుగా!

భారతదేశంలో డిజిటల్ విప్లవం ఏ స్థాయిలో దూసుకుపోతోందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వీధి చివర ఉండే బడ్డీ కొట్టు దగ్గర నుంచి మెట్రో నగరాల్లోని పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ప్రతిచోటా యూపీఐ పేమెంట్స్ సర్వసాధారణం అయిపోయాయి. సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడానికి దుకాణాల ముందో లేదా ఆటోల వెనుక భాగంలోనో ఉన్న బోర్డులను వెతుకుతాం. కానీ టెక్ సిటీగా పేరొందిన బెంగళూరులో మాత్రం ఒక ఆటో డ్రైవర్ టెక్నాలజీని వాడటంలో నెక్ట్స్ లెవెల్ ఐడియాను ఉపయోగించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆన్‌లైన్ పేమెంట్ కోసం కస్టమర్ క్యూఆర్ కోడ్ అడగగానే.. అతను ఏకంగా తన చేతికున్న స్మార్ట్‌వాచ్‌లోనే క్యూఆర్ కోడ్ చూపించి షాకిచ్చాడు. ఈ క్రేజీ ఘటనకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఎక్స్ వేదికగా విపరీతంగా వైరల్ అవుతోంది. అసలు వివరాల్లోకి వెళితే.. హేమంత్ అనే ప్రయాణికుడు బెంగళూరులోని ఇందిరానగర్ ప్రాంతం నుండి కోరమంగళ వరకు ఆటోలో ప్రయాణించాడు. గమ్యస్థానానికి చేరుకున్న తర్వాత, ఆటో డ్రైవర్‌కు డబ్బులు చెల్లించడానికి "అన్నా.. క్యూఆర్ కోడ్ ఎక్కడుంది?" అని అడిగాడు. సాధారణంగా అయితే ఆటోల వెనుక సీటు భాగంలోనో లేదా స్టీరింగ్ పక్కనో యూపీఐ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అంటించి ఉంటుంది. కానీ, ఈ డ్రైవర్ మాత్రం చాలా స్టైలిష్‌గా తల తిప్పి, తన మణికట్టును పైకెత్తి.. చేతికి ఉన్న స్మార్ట్‌వాచ్ స్క్రీన్‌పై సేవ్ చేసి ఉన్న క్యూఆర్ కోడ్‌ను చూపించాడు. ఈ ఊహించని సరికొత్త టెక్ హాక్‌ను చూసి అవాక్కవడం హేమంత్ వంతయింది. డిజిటల్ ఇండియా సాధించిన ప్రగతికి ఇదొక అద్భుతమైన ఉదాహరణగా భావించిన హేమంత్, వెంటనే ఆ ఫోటోను తీసి ట్విట్టర్‌లో షేర్ చేశాడు. "ఈరోజు ఇందిరానగర్ నుండి కోరమంగళకు ఆటోలో వెళ్లాను. పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ అడిగితే.. ఆటో బ్రో తన మణికట్టు పైకెత్తాడు, అందులో క్యూఆర్ కోడ్ ఉంది" అంటూ క్యాప్షన్ జోడించి పోస్ట్ చేశాడు. ఈ ఆసక్తికరమైన పోస్ట్‌కు సోషల్ మీడియాలో కొన్ని గంటల్లోనే లక్షలాది వ్యూస్, వేల సంఖ్యలో లైకులు వచ్చాయి. ఈ వినూత్న ప్రయత్నాన్ని చూసిన నెటిజన్లు దీనిని పక్కా "పీక్ బెంగళూరు మూమెంట్" అని అభివర్ణిస్తున్నారు. నిరంతరం టెక్నాలజీ మరియు స్టార్టప్ సంస్కృతితో ముడిపడి ఉండే బెంగళూరు నగరంలో ఇలాంటి వింతలు మరియు ఆవిష్కరణలు సహజమేనని కొందరు కామెంట్లు పెడుతున్నారు. ఒక యూజర్ దీనిపై సరదాగా స్పందిస్తూ.. "కోరమంగళ, ఇందిరానగర్ ఏరియాల్లో తిరిగే ఆటో డ్రైవర్లు అక్కడి సాఫ్ట్‌వేర్ మరియు ఐటీ ఉద్యోగుల కంటే ఎక్కువే సంపాదిస్తున్నట్టున్నారు, అందుకే ఈ రేంజ్ అప్‌డేట్స్ వాడుతున్నారు" అని ఫన్నీగా రాసుకొచ్చాడు. మరొక నెటిజన్ అయితే దీనిపై ఎంతో లోతుగా ఆలోచించి.. "రెండు చేతులతో నిరంతరం స్టీరింగ్ పట్టుకుని పని చేసే ఆటో డ్రైవర్లకే పెద్ద పెద్ద ఐటీ కంపెనీల సీఈఓల కంటే స్మార్ట్‌వాచ్ ఫీచర్లను ఈ విధంగా వాడే అర్హత ఎక్కువగా ఉంది" అని ప్రశంసల వర్షం కురిపించాడు. భారతదేశంలో సాధారణ ప్రజలు సైతం ఆధునిక సంకేతికతను ఎంత అద్భుతంగా, సులభంగా అందిపుచ్చుకుంటున్నారో చెప్పడానికి ఈ ఘటనే ఒక చక్కటి నిదర్శనమని టెక్ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు సాంకేతిక పరిజ్ఞానం అంటే కేవలం చదువుకున్న వారికి, నగరాలకే పరిమితం అనుకునే రోజులు ఉండేవి. కానీ, మారిన డిజిటల్ ఇండియా రూపురేఖల వల్ల నేడు చిన్న చిన్న వ్యాపారులు, సాధారణ కార్మికులు కూడా అత్యంత క్లిష్టమైన డిజిటల్ నెట్‌వర్క్‌లను చాలా సులభంగా వాడుకుంటున్నారు. స్మార్ట్‌వాచ్ గ్యాలరీలో క్యూఆర్ కోడ్ ఇమేజ్‌ను సేవ్ చేసుకుని వాడటం అనేది సాంకేతికంగా చాలా చిన్న ట్రిక్ అయినప్పటికీ, నిత్య జీవితంలో ఎదురయ్యే అవసరాన్ని బట్టి సామాన్యులు చేసే ఇలాంటి చిన్న చిన్న ఆవిష్కరణలే భారతదేశాన్ని డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టాయి. ఈ స్మార్ట్ ఐడియా వల్ల ఆటో డ్రైవర్లకు చిల్లర సమస్యలు తప్పడమే కాకుండా, డ్రైవింగ్ సీట్లో కూర్చుని పదే పదే వెనక్కి తిరిగి బోర్డులు చూపించే లేదా వెతికే శ్రమ కూడా పూర్తిగా తప్పింది. ఏదేమైనా, టెక్నాలజీని వాడుకోవడంలో తాను ఏ ఐటీ ప్రొఫెషనల్‌కూ తీసిపోనని నిరూపించిన ఈ బెంగళూరు ఆటో డ్రైవర్ ఆలోచనకు ఇంటర్నెట్ ప్రపంచం ఫిదా అవుతోంది.

Publish Date: Jun 16, 2026 12:32PM

MOVIE NEWS