రోడ్డు బాట పట్టిన డీజీపీ.. ఎందుకంటే?
వర్షాకాలంలో వాన కష్టాలు హైదరాబాద్ వాసుల దరిదాపులకు రానీయలేదన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తున్నారు తలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. డీజీపీనీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం మల్కం చెరువు వద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితర ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు.నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని డీజీపీ స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో భాగంగా మల్కం చెరువు, ఖాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాలు, బయోడైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బృందాలు నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానాలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నాయి. తక్షణ చర్యలు అవసరమైన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై నివేదికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమనిపేర్కొన్న సీవీ ఆనంద్.. అన్ని శాఖలు సమిష్టగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అలసత్వం లేదా నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజల భద్రతనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు స్పష్టం చేసిన డీజీపీ, వర్షాకాలం పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి లోటు ఉండకూడదని సూచించారు. నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రత, సౌకర్యాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు సమావేశంలో పునరుద్ఘాటించారు.
Publish Date: Jun 16, 2026 2:54PM