political-news-img

జలవిహార్‌లో పేలుడు…ముగ్గురికి గాయాలు

హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం జలవిహార్ వద్ద ఉన్న నీటి సరఫరా ఆర్వో ప్లాంట్‌లో అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ప్లాంట్ పరికరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం భారీగా వినిపించడంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. పేలుడు సమయంలో ప్లాంట్ వద్ద పనిచేస్తున్న ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన అప్పుల నాయుడు, అంజిలను అత్యవసరంగా గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరో వ్యక్తి లక్ష్మణ్‌ను సోమాజిగూడలోని జాయ్ హాస్పిటల్‌కు తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఖైరతాబాద్ ఏసీపీ సంజయ్‌తో పాటు లేక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రాథమికంగా ఆర్వో ఫిల్టర్ లేదా కంప్రెషర్‌లో అధిక ఒత్తిడి (ప్రెషర్) ఏర్పడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి ప్రమాదానికి గల ఖచ్చిత కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ఘటనతో జలవిహార్ పరిసర ప్రాంతాల్లో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అధికారులు భద్రతా ప్రమాణాలను కట్టుదిట్టం చేసి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Publish Date: Apr 8, 2026 9:06PM

political-news-img

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ఉద్యోగులకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్త అందించింది. బ్యాంకులో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి ఇప్పటివరకు ప్రమాద మరణాలకు మాత్రమే వర్తించిన బీమా సౌకర్యాన్ని విస్తరించి, ఇకపై సహజ మరణాలకు కూడా వర్తింపజేస్తున్నట్లు ప్రకటించింది. యూనియన్ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ ఉన్న ఆర్టీసీ ఉద్యోగి సహజ మరణం చెందిన పక్షంలో, వారి కుటుంబ సభ్యులకు రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము అందజేయనుంది. ఈ కొత్త నిబంధన 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు బ్యాంకు వెల్లడించింది. ముఖ్యంగా, ఈ బీమా కోసం ఉద్యోగులు ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. మొత్తం ప్రీమియంను బ్యాంకే భరిస్తుంది. ఇప్పటికే అమల్లో ఉన్న రూ.1 కోటి ప్రమాద బీమా సౌకర్యం యథాతథంగా కొనసాగుతుందని అధికారులు తెలిపారు. ఇప్పుడు సహజ మరణ బీమా కూడా చేరడంతో ఉద్యోగుల సామాజిక భద్రత మరింత బలపడనుంది. సంస్థ వీసీ & ఎండీ వై. నాగిరెడ్డి సూచనల మేరకు యూనియన్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ చర్యతో సంస్థలో పనిచేస్తున్న దాదాపు 38 వేల మందికి పైగా ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భరోసా లభించనుంది. ఈ నిర్ణయాన్ని ఉద్యోగులు స్వాగతిస్తూ, తమ కుటుంబాలకు ఇది పెద్ద రక్షణగా మారుతుందని పేర్కొన్నారు.

Publish Date: Apr 8, 2026 8:57PM

political-news-img

విజ‌య్ క‌న్నా ఎక్కువ‌...ఆస్తులు గ‌ల మ‌హిళా అభ్య‌ర్ధి ఎవరంటే?

మాములుగా ద‌క్షిణాదిలో అత్యంత సంప‌న్న పొలిటీషియ‌న్ల‌లో విజ‌య్ కూడా ఒక‌రు. ఇటీవ‌ల ఆయ‌న ప్ర‌క‌టించిన ఆస్తుల వివ‌రాల‌ను బ‌ట్టీ చూస్తే.. త‌మిళ‌నాట ఆయ‌నే టాప్ అన్నారు. కానీ, క‌ట్ చేస్తే లీమా రోజే అనే ఒక మ‌హిళా అభ్య‌ర్ధిని విజ‌య్‌ని మించిపోయారు. ఇంతకీ ఈ లీమా రోజ్ ఆస్తులెన్నో చూస్తే.. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపడుతున్న వారిలో అత్యంత ధనిక అభ్యర్థి మహిళ కావడం విశేషం ఆమె పేరే- లీమా రోజ్. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డిఎంకె పార్టీ నుంచి బరిలో వున్నారు. ఆమె కుటుంబ ఆస్తి విలువ అక్షరాలా రూ.5863 కోట్లు. ఆమె వ్యక్తిగత ఆస్తి 1049 కోట్లు. విజ‌య్ ఆస్తులు ఆరు వంద‌ల కోట్ల‌క‌న్నా మించి లేవు. దీంతో ఈమె ఎన్నిక‌లు జ‌ర్కుండానే విజ‌య్ ని ఆస్తుల ప‌రంగా ఓడించేశారు. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత శాంటియాగో మార్టిన్ ఆమె భర్త. లీమా రోజ్ వయసు 58. ఇటీవలే ఆమె రాజకీయ ప్రవేశం చేశారు. అన్నాడిఎంకె పార్టీలో చేరారు. గ‌తంలో ఆమె ఇండియ జ‌న‌నాయ‌క‌న్ క‌ట్చిలో ఉండేవారు. ఆ త‌ర్వాత అన్నాడీఎంకే పార్టీకి వ‌చ్చి.. ఈ పార్టీకి భారీ విరాళం కూడా ఇచ్చారు. నామినేషన్ అఫిడవిట్ లో ఆమె పేర్కొన్న ఆస్థుల వివరాల ప్రకారం చూస్తే...19 కిలోల బంగారం, 1217 క్యారట్ల వజ్రాభరణాలు, 13 కిలోల వెండి, 33 గ్రాముల ప్లాటినం ఉన్నట్లు సమాచారం. 139.63 కోట్ల చరాస్థులు, 909.94 కోట్ల స్థిరాస్థులు ఉన్నాయి. సహజంగా డబ్బున్నోళ్లకు అప్పులు ఎలాగూ ఉంటాయి కాబట్టి ఆమెకు కూడా 8.57 కోట్ల అప్పు కూడా ఉందట. భర్త మార్టిన్ పేరిట 4100 కోట్లు పైచిలుకు ఆస్థులు వున్నాయట. ఆయన పేరిట నగలు చూస్తే...281 గ్రాములు బంగారం, 9.83 క్యారెట్ల వజ్రాలు, 21 కిలోల వెండి, 321 గ్రాములు ప్లాటినం ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. ఇంతా చేస్తే ఆమె చదివింది ఆరవ తరగతి మాత్రమే. పైగా ఆమెపై నాలుగు కేసులు కూడా వున్నాయట. లాల్గుడి ఓటర్లు ఆమెపై పెద్ద ఆశలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఓటుకు కనీసం మూడు నుంచి ఐదు వేల వరకు ఇస్తున్నదని బెట్టింగులు వేసుకుంటున్నారట. మొత్తానికి లీమా గెలుపు ఖాయం అంటున్నారు. చట్టసభలోకి అడుగు పెట్టనివ్వండి. లాల్గుడి నియోజకవర్గం ఎలా అభివృద్ధి జరుగుతుందో చూడండి.. అని లీమా రోజ్ అంటున్నారు. ఆమె ప్రచార పర్వంలో వేలాదిమంది యువతకు ఉపాధి లభించింది. చదువు లేకున్నా డబ్బు వుంది కాబట్టి ఇలాంటి వారిని గెలిపిస్తే ఆ నియోజకవర్గం బాగుపడుతుంది. ఆమె మార్టిన్ చారిటీ ఫౌండేషన్ పేరిట ఎన్నో ఏళ్లుగా సేవ కూడా చేస్తుండటం విశేషం. అదండీ లీమా రోజ్ అనే ఈ లేడీ స‌డెన్ స్టార్ క‌థ‌. క‌మామిషు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఇన్ని కోట్ల ఆస్తులుండి కూడా ఉలుకూ ప‌లుకూ లేకుండా ఉన్న ఈమె పేరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా మారుమోగుతూనే ఉంది. కార‌ణం రాజ‌కీయాల్లోకి రావ‌డం. ఎన్నిక‌ల అఫిడ‌విట్లో త‌న‌కున్న వేల కోట్ల ఆస్తుల‌ను పొందుప‌ర‌చ‌డం వ‌ల్ల‌.. ఒక్క‌సారిగా లైమ్ లైట్లోకి వ‌చ్చేశారు లీమా రోజ్.

Publish Date: Apr 8, 2026 8:42PM

political-news-img

ప్రపంచ దేశాల్లో అమెరికా జోక్యం...యుద్ధాలు, పరిణామాలు!

20వ శతాబ్దం మధ్య నుంచి 21వ శతాబ్దం వరకు ప్రపంచ రాజకీయాల్లో ఒక నిరంతర ప్రభావశక్తిగా నిలిచింది అమెరికా. దౌత్యం, రహస్య చర్యలు, ఆర్థిక ఒత్తిడి, అవసరమైనప్పుడు సైనిక శక్తి—ఇవన్నీ కలిసి అమెరికా విదేశాంగ విధానాన్ని నిర్మించాయి. అధికారికంగా ప్రజాస్వామ్య రక్షణ, కమ్యూనిజం నిరోధం, ప్రాంతీయ స్థిరత్వం వంటి కారణాలు చూపించినప్పటికీ, ఆ చర్యల వెనుక ఆర్థిక ప్రయోజనాలు, వ్యూహాత్మక ఆధిపత్యం, భౌగోళిక రాజకీయ లాభాలు కూడా కీలకంగా పనిచేశాయి. ఈ కథలో 1953 నుండి 2019 వరకు జరిగిన కీలక సంఘటనలను కాలక్రమంలో చూసుకుంటూ, ఒక దేశం ప్రపంచంపై ఎలా ప్రభావం చూపిందో పరిశీలిద్దాం. ఇరాన్‌లో మొదలైన నీడ యుద్ధం (1953) 1953లో ఇరాన్ ప్రధానమంత్రి మొహమ్మద్ మొసాద్దెఖ్ చమురు పరిశ్రమను జాతీయీకరించడంతో పాశ్చాత్య దేశాలకు గట్టి షాక్ తగిలింది. వెంటనే అమెరికా మరియు బ్రిటన్ గూఢచార సంస్థలు “ఆపరేషన్ అజాక్స్” అనే రహస్య చర్యను అమలు చేశాయి. ఫలితంగా మొసాద్దెఖ్ పదవి కోల్పోయి, షా తిరిగి అధికారంలోకి వచ్చారు. ఈ సంఘటన తక్షణ విజయం లాగా కనిపించినప్పటికీ, దీని ప్రతిఫలం దశాబ్దాల పాటు ఇరాన్‌లో అసంతృప్తి, చివరికి 1979 విప్లవంగా మారింది. గ్వాటెమాల: ఒక కంపెనీ కోసం ప్రభుత్వం పడిపోయింది (1954) గ్వాటెమాల అధ్యక్షుడు జాకోబో ఆర్బెంజ్ భూ సంస్కరణలు చేపట్టి యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి నష్టం కలిగించడంతో, అమెరికా జోక్యం మొదలైంది. CIA మద్దతుతో జరిగిన ఆపరేషన్ PBSUCCESS ఆయన ప్రభుత్వాన్ని కూల్చేసింది. దీని ఫలితం? దేశం దశాబ్దాలపాటు సైనిక పాలనలోకి జారిపోయింది. అంతర్యుద్ధం కారణంగా లక్షలాది ప్రాణాలు కోల్పోయాయి. కాంగోలో నాయకుడి అంతం (1961) పాట్రిస్ లుముంబా అనే నాయకుడు దేశ స్వావలంబన కోసం పోరాడగా, అతను అంతర్జాతీయ రాజకీయాల్లో అడ్డంకిగా మారాడు. చివరకు ఆయన హత్యకు గురయ్యారు. ఆ తర్వాత మొబూటు అనే నాయకుడు అధికారంలోకి వచ్చి, కాంగోను నిరంకుశ పాలనలోకి నెట్టాడు. వియత్నాం: ఒక నిర్ణయం, ఒక పెద్ద యుద్ధం (1963) దక్షిణ వియత్నాం అధ్యక్షుడు న్గో డిన్హ్ డియెమ్‌పై విశ్వాసం కోల్పోయిన అమెరికా, తిరుగుబాటుకు మద్దతు ఇచ్చింది. ఆయన హత్య తర్వాత దేశం మరింత అస్థిరమై, చివరకు వియత్నాం యుద్ధం అనే భారీ సంఘర్షణకు దారితీసింది. ఇండోనేషియా: రక్తపాతం మరియు కొత్త పాలన (1965) ఇండోనేషియాలో కమ్యూనిస్టు వ్యతిరేక పేరుతో జరిగిన సామూహిక హత్యలు ప్రపంచాన్ని కుదిపేశాయి. లక్షలాది మంది చనిపోయారు. ఈ నేపథ్యంలో సుహార్తో అధికారంలోకి వచ్చి, పాశ్చాత్య దేశాల మద్దతుతో తన పాలనను స్థిరపరిచాడు. చిలీ: ప్రజాస్వామ్యానికి ముగింపు (1973) సోషలిస్టు అధ్యక్షుడు సాల్వడార్ అలెండేను కూల్చేందుకు జరిగిన ప్రయత్నాలు చివరకు సైనిక తిరుగుబాటుతో ముగిశాయి. అగస్టో పినోచెట్ పాలనలో చిలీ హింస, అణచివేతకు ప్రతీకగా మారింది. నికరాగ్వా & రహస్య ఆపరేషన్లు (1980లు) శాండినిస్టా ప్రభుత్వాన్ని బలహీనపరచేందుకు అమెరికా కాంట్రా తిరుగుబాటుదారులకు రహస్యంగా సహాయం చేసింది. ఇది తరువాత “ఇరాన్-కాంట్రా స్కాండల్”గా వెలుగులోకి వచ్చింది. ఆఫ్ఘనిస్తాన్: తక్షణ విజయం, దీర్ఘకాల సమస్యలు (1980లు) సోవియట్ యూనియన్‌ను ఎదుర్కొనేందుకు ముజాహిదీన్‌కు అమెరికా మద్దతు ఇచ్చింది. కానీ అదే శక్తులు తరువాత తీవ్రవాద సంస్థలుగా మారి ప్రపంచానికి సవాలుగా మారాయి. గ్రెనడా & పనామా: వేగవంతమైన సైనిక చర్యలు (1983, 1989) గ్రెనడాలో మరియు పనామాలో అమెరికా ప్రత్యక్ష సైనిక జోక్యం ద్వారా ప్రభుత్వాలను మార్చింది. ఇవి చిన్న యుద్ధాల్లా కనిపించినప్పటికీ, అమెరికా శక్తి వినియోగానికి ఉదాహరణలుగా నిలిచాయి. ఇరాక్: తప్పుదారి పట్టిన యుద్ధం (2003) సద్దాం హుస్సేన్ వద్ద సామూహిక విధ్వంసక ఆయుధాలు ఉన్నాయనే కారణంతో జరిగిన యుద్ధం, తర్వాత అసత్యంగా తేలింది. కానీ అప్పటికే దేశం శిథిలమై, అంతర్గత హింస, తీవ్రవాదం పెరిగిపోయాయి. లిబియా: జోక్యం తర్వాత గందరగోళం (2011) పౌరులను రక్షించాలనే ఉద్దేశంతో ప్రారంభమైన జోక్యం, గడ్డాఫీ పతనంతో ముగిసింది. కానీ దేశం శాంతి వైపు కాకుండా గందరగోళంలోకి వెళ్లింది. వెనిజులా: ఆధునిక ఒత్తిడి రాజకీయాలు (2019) ప్రత్యక్ష యుద్ధం కాకుండా, ఆర్థిక ఆంక్షలు, రాజకీయ గుర్తింపుల ద్వారా అమెరికా ప్రభావం చూపింది. ఇది ఆధునిక జోక్య విధానానికి ఉదాహరణగా నిలిచింది. ముగింపు ఇరాన్ నుంచి వెనిజులా వరకు జరిగిన ఈ సంఘటనలు ఒకే ప్రశ్నను మళ్లీ మళ్లీ లేవనెత్తుతున్నాయి—ఒక దేశం భద్రత పేరుతో మరొక దేశం వ్యవహారాల్లో ఎంతవరకు జోక్యం చేసుకోవాలి?చరిత్ర చెబుతున్నది ఏమిటంటే—తక్షణ విజయాలు సాధ్యమే కానీ, దీర్ఘకాలికంగా అవి అస్థిరత, హింస, అనిశ్చితికి దారితీసే అవకాశాలు ఎక్కువ.

Publish Date: Apr 8, 2026 7:39PM

political-news-img

మాజీ మంత్రి రోజా.. రాజకీయ వైరాగ్యమేనా?

మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ నాయకురాలు ఆర్కే రోజా ఉరుములేని పిడుగులా రాజకీయాల పట్ల వైరాగ్యం ప్రదర్శించారు. రాజకీయాల వల్ల తన ఆరోగ్యం పాడైందని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాలలో ఉండటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి.. తద్వారా ఆనారోగ్యం తప్ప తనకు ఒరిగిందేమీ లేదంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో తెగ వైరల్ గా మారాయి. రాజకీయాల్లో నిరంతరం ఉండే సవాళ్లు, మానసిక ఒత్తిడి కారణంగానే తాను దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడ్డానన్న రోజా.. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తనకు బ్లడ్ ప్రషర్ సమస్య వచ్చిందనీ, ఇక రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికై, మంత్రిని అయిన తరువాత డయాబెటిస్ అటాక్ అయ్యిందనీ వివరించారు. నియోజకవర్గ సమస్యలు, పార్టీ బాధ్యతలు మరియు ప్రజల అంచనాల మధ్య వ్యక్తిగత ఆరోగ్యంపై శ్రద్ధ వహించేందుకు సమయమే చిక్కలేదన్నారు. గత ఎన్నికలలో ఓటమితో ఒత్తడి నుంచి పూర్తిగా బయటపడ్డానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆమె రాజకీయాలకు ఒకింత దూరంగా ఉంటున్నారు. అడపాదడపా తప్ప రాజకీయ వ్యాఖ్యలు చేయడం లేదు. ఈ పరిస్థితుల్లో రోజా రాజకీయాలు, తన వ్యక్తిగత ఆరోగ్యంపై చేసిన వ్యాఖ్యపై పలు రకాలుగా చర్చ జరుగుతోంది.

Publish Date: Apr 8, 2026 6:43PM

political-news-img

కష్టపడిన వారిని గుర్తించాలనేది టీడీపీ సిద్ధాంతం : మంత్రి లోకేష్

కష్టపడిన వారిని గుర్తించాలనేది పార్టీ సిద్ధాంతం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ‘మై టీడీపీ యాప్’ సమర్థ వినియోగం, పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న టాప్ 10 ఫెర్ఫార్మర్స్ తో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. మనం అందరం ఆ వ్యవస్థలో భాగం. మీ పనితీరు వల్లే ఇక్కడ వరకు రాగలిగారు. రేపు పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పక్కన కూర్చొంటారు. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను సక్రమంగా నిర్వహిస్తే పార్టీ వందేళ్లు ఉంటుంది. వ్యక్తుల కంటే పార్టీ ముఖ్యమని గుర్తించాలి. పార్టీలో సంస్కరణల కోసం నేను పోరాడుతున్నా. కార్యకర్తే అధినేత. గ్రామ పార్టీ అధ్యక్షుడు, క్లస్టర్ ఇంఛార్జ్ పొలిట్ బ్యూరో వరకు రాగలగాలి. ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎన్నికల్లో విజయం సాధించాలంటే పార్టీ సిద్ధాంతాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈ సందర్భంగా మంత్రి లోకేష్ దిశానిర్దేశం చేశారు. మనం కోరుకున్న మార్పు సాధ్యం కావాలంటే అందరం కలిసికట్టుగా పనిచేయాలి. పార్టీ భవిష్యత్ దృష్ట్యా కడప మహానాడులో తీర్మానించిన 6 శాసనాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ సిద్ధాంతాలను వివరించేందుకు 365 రోజులూ శిక్షణ తరగతులు నిర్వహిస్తాం. 2019-24 మధ్య జగన్ రెడ్డి ఎమ్మెల్యేలనే కలవలేదు. మనం కార్యకర్తలను కలుస్తున్నాం. నియోజకవర్గ పర్యటనల్లో ముందుగా కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. వారానికోరోజు పార్టీ కార్యాలయానికి వచ్చి సమస్యలు తెలుసుకుంటున్నామని లోకేష్ తెలిపారు . పార్టీ కోసం ప్రాణాలర్పించిన తోట చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కోసం చట్ట సవరణ చేశాం. మీరందరూ క్షేత్రస్థాయిలో ఉండి పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం అందరినీ మంత్రి నారా లోకేష్ ఘనంగా సత్కరించి ఎన్టీఆర్ జ్ఞాపికను బహూకరించారు. పార్టీ కార్యాలయంలో మంత్రి లోకేష్ తో ఆత్మీయ భేటీ పట్ల ‘మై టీడీపీ యాప్’ ఉత్తమ కార్యకర్తలు ధన్యవాదాలు తెలిపారు. తాము జీవితాంతం మర్చిపోలేమని ఆనందం వ్యక్తం చేశారు.

Publish Date: Apr 8, 2026 6:35PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img