political-news-img

వాహన సారథి షట్ డౌన్.. స్తంభించిన ఆర్టీవో సేవలు

తెలంగాణవ్యాప్తంగా రవాణా శాఖకు ఆర్టీవోకు సంబంధించిన సేవలను అందిస్తున్న వాహన్‌ సారథి సాఫ్ట్‌వేర్ సర్వర్లు అకస్మాత్తుగా మొరాయించింది. షట్ డౌన్ అయ్యింది. దీంతో రాష్ట్రంలో రవాణా సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. వాహన్ సారథి సాఫ్ట్‌వేర్ అకస్మాత్తుగా షట్‌డౌన్ అవ్వడంతో దానికి సంబంధించిన డిజిటల్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. పోర్టల్ ఓపెన్ కాకపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే.. ఈ సాంకేతిక వైఫల్యంపై క్షేత్రస్థాయి అధికారులు ఈ సమస్య పరిష్కారం మా చేతిలో లేదంటూ చేతులెత్తేయడంతో వినియోగదారులు లబోదిబో మంటున్నారు. గత కొంతకాలంగా సజావుగానే సాగుతున్న ఈ సాఫ్ట్‌వేర్ సేవలు ఒక్కసారిగా నిలిచిపోవడానికి కారణం ఏమిటన్న క్లారిటీ అయితే లేదు. సర్వర్ మెయింటెనెన్స్ లోపమా, ఉన్నతాధికారుల నిర్లక్ష్యమా అనేది స్పష్టం కావడం లేదు. సాఫ్ట్‌వేర్ లాగిన్ కాకపోవడం, డేటా ప్రాసెస్ కాకపోవడంతో రోజువారీ పనులు, అప్లికేషన్ల పరిశీలన పూర్తిగా నిలిచిపోయాయి. దీనివల్ల వివిధ పనుల నిమిత్తం పోర్టల్‌పై ఆధారపడే సాధారణ పౌరులు, సిబ్బంది తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవస్థను తిరిగి ఎప్పటికి పునరుద్ధరిస్తారనే దానిపై ఉన్నతాధికారుల నుండి ఇంత వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఐటీ నిపుణులు, టెక్నికల్ టీమ్ రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తే తప్ప వారథి మళ్లీ ట్రాక్‌లోకి వచ్చేలా కనిపించడం లేదు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఈ సాఫ్ట్‌వేర్ సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Publish Date: Jun 16, 2026 3:10PM

political-news-img

తమిళనాడు రైతులకు సీఎం విజయ్ తీపి కబురు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు భారీ ఊరటనిచ్చే ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని రైతులపై పెరుగుతున్న అప్పుల భారాన్ని తగ్గించేందుకు సహకార బ్యాంకులు, సహకార సంఘాల ద్వారా తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రుణమాఫీ పథకానికి ఆమోదం తెలిపింది.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం... అర్హులైన రైతులకు రూ.75,000 వరకు ఉన్న వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నారు. దీంతో చిన్న, సన్నకారు రైతులకు తక్షణ ఆర్థిక ఉపశమనం లభించనుంది. రైతులు తిరిగి వ్యవసాయ కార్యకలాపాలపై దృష్టి సారించేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ రుణమాఫీ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14.43 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. రుణాల భారం కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న లక్షలాది కుటుంబాలకు ఈ నిర్ణయం ఊరటనివ్వనుంది. ముఖ్యంగా సహకార రంగ సంస్థల నుంచి రుణాలు తీసుకుని పంటల సాగు చేసిన రైతులకు ఈ పథకం ప్రయోజనం చేకూరనుంది. అయితే, ఈ రుణమాఫీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వంపై రూ.5,932 కోట్లకు పైగా ఆర్థిక భారం పడనుంది. అయినప్పటికీ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం, రైతుల ఆర్థిక స్థితిని మెరుగు పరచడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడం ఈ పథకం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొంటున్నారు.రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం విజయ్ స్పష్టం చేశారు. వ్యవసాయ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక వంటిదని, రైతులు ఆర్థికంగా బలపడితేనే గ్రామీణాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తీసుకున్న రుణమాఫీ నిర్ణయం తమిళనాడు రాజకీయ, వ్యవసాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Publish Date: Jun 16, 2026 3:03PM

political-news-img

రోడ్డు బాట పట్టిన డీజీపీ.. ఎందుకంటే?

వర్షాకాలంలో వాన కష్టాలు హైదరాబాద్ వాసుల దరిదాపులకు రానీయలేదన్న ముఖ్యమంత్రి ఆదేశాలను పాటిస్తున్నారు తలంగాణ డీజీపీ సీవీ ఆనంద్. డీజీపీనీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ అంతరాయాల నివారణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం మల్కం చెరువు వద్ద అత్యవసర సమన్వయ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, హైడ్రా కమిషనర్ రంగనాథ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి తదితర ఉన్నతాధికా రులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీజీపీ సి.వి. ఆనంద్ మాట్లాడుతూ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసు శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తోందన్నారు. నీరు నిల్వ ఉండే ప్రాంతాలను ముందుగానే గుర్తించి ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఏర్పాటు చేసి ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించాలని సూచించారు.నగరంలోని లోతట్టు ప్రాంతాలు, వరద ముప్పు ఉన్న ప్రాంతాలు, ప్రధాన కూడళ్లు, రద్దీ మార్గాల్లో పోలీసు సిబ్బంది నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని డీజీపీ స్పష్టం చేశారు. భారీ వర్షాల సమయంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులు తలెత్తినా వెంటనే స్పందించేలా పోలీసు యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆదేశించారు. సమావేశంలో భాగంగా మల్కం చెరువు, ఖాజాగూడ సరస్సు, మండికుంట, గురునాథ్ చెరువు, మియాపూర్ పరిసర ప్రాంతాలు, బయోడైవర్సిటీ జంక్షన్, కొండాపూర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ప్రత్యేక ఇంజనీరింగ్ బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ బృందాలు నీటి ప్రవాహ మార్గాలు, ఆక్రమణలు, డ్రైనేజీ అనుసంధానాలు, నీటి నిల్వలకు కారణమవుతున్న అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయనున్నాయి. తక్షణ చర్యలు అవసరమైన సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారాలపై నివేదికలు సిద్ధం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. పోలీస్, ఇరిగేషన్, జీహెచ్ఎంసీ, హైడ్రా తదితర శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమనిపేర్కొన్న సీవీ ఆనంద్.. అన్ని శాఖలు సమిష్టగా పనిచేసి సమస్యాత్మక ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అలసత్వం లేదా నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజల భద్రతనే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని అధికారులకు స్పష్టం చేసిన డీజీపీ, వర్షాకాలం పూర్తయ్యే వరకు రాష్ట్రవ్యాప్తంగా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడంలో ఎటువంటి లోటు ఉండకూడదని సూచించారు. నీటి నిల్వలు, పట్టణ వరదలు, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ ప్రజల భద్రత, సౌకర్యాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు సమావేశంలో పునరుద్ఘాటించారు.

Publish Date: Jun 16, 2026 2:54PM

political-news-img

వివేకా హత్య కేసులో సీబీఐ కోర్టులో విచారణ

మాజీ మంత్రి వై. ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా కేసులో నిందితులుగా ఉన్న ఎంపీ వై. ఎస్. అవినాష్ రెడ్డి తో పాటు ఇతర నిందితులు కోర్టుకు హాజరయ్యారు. కోర్టు విచారణ అనంతరం ప్రధాన కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేసింది. ఇదే కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలని కోరుతూ వివేకా కుమార్తె వై. ఎస్. సునీత రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ ను మధ్యాహ్నానికి వాయిదా వేసింది. సునీత పిటిషన్‌కు వ్యతిరేకంగా నిందితులు దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్లపై కోర్టులో వాదనలు కొనసాగనున్నాయి. కేసు దర్యాప్తు, అదనపు విచారణ అవసరంపై ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కోర్టు తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Publish Date: Jun 16, 2026 2:43PM

political-news-img

హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2.. కేంద్రంపై రేవంత్ డైరెక్ట్ ఎటాక్ఘ!

హైదరాబాద్ నగర ప్రయాణికులకు అత్యంత కీలకమైన మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టు రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారింది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ఆలస్యం కావడం వెనుక కేంద్ర ప్రభుత్వం, కొందరు కీలక నేతల రాజకీయ కుట్రలు ఉన్నాయంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. నగర రవాణా ముఖచిత్రాన్ని మార్చేసే ఈ మెట్రో విస్తరణను కావాలనే అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. అసలింతకీ జరిగిందేంటంటే.. మెట్రో ఫేజ్ 1 టేకోవర్.. దానికి సంబంధించిన రీఫైనాన్సింగ్ నిధుల విడుదలలో జరుగుతున్న ఆలస్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. మెట్రో మొదటి దశను నిర్వహించిన ఎల్ అండ్ టీ సంస్థ భారీ నష్టాల కారణంగా ఫేజ్ 2 విస్తరణకు ముందుకు రాకపోవడంతో.. కేంద్ర ప్రభుత్వ సలహా మేరకే రాష్ట్ర ప్రభుత్వం ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను తన అధీనంలోకి తీసుకుంది. అందు కోసం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ. 1,400 కోట్ల మార్జిన్ మనీతో పాటు రూ. 84 కోట్ల ప్రాసెసింగ్ ఫీజును కూడా చెల్లించింది. ఎల్ అండ్ టీ మెట్రోకు ఉన్న రూ. 13 వేల 600 కోట్ల బ్యాంక్ రుణాలను క్లియర్ చేయడానికి ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ ఐఆర్ఎఫ్ సీ ద్వారా ఒక జపాన్ సంస్థ నుండి 4 శాతం వడ్డీకి రీఫైనాన్స్ ప్యాకేజీని రాష్ట్ర ప్రభుత్వం సాధించింది. జపాన్ సంస్థ ఇప్పటికే ఈ నిధులను ఐఆర్ఎఫ్‌సీకి బదిలీ చేసింది. ఈ నెల15 నాటికే అంటే సోమవారం నాటికే ఈ నిధులు రాష్ట్ర ప్రభుత్వానికి అందాలి.. కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి పత్రాలను సమర్పించినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఈ నిధుల బదిలీని నిలిపివేసింది. దీనిపైనే రేవంత్ కేంద్రంపై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. నిధుల నిలిపివేత వెనుక కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యక్ష ఉందని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గత నెల 20న కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌ను, 21న కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి.. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని అనుమతులు సులభంగా ఇస్తే రాష్ట్రంలో బీజేపీని మూసుకోవాల్సి వస్తుందని ఒత్తిడి తెచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. బిఆర్ఎస్ అగ్రనేతలు కేసీఆర్, కేటీఆర్‌ల సలహా తోనే కిషన్ రెడ్డి ఈ కుట్రను అమలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాకుండా.. విశాఖపట్నం వంటి నగరాల మెట్రో ప్రాజెక్టులకు సులభంగా అనుమతులు ఇస్తున్న కేంద్రం, హైదరాబాద్ విషయంలో మాత్రం ఎందుకు చేతులెత్తేస్తోందో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేంద్రానికి ఓ సవాల్ కూడా విసిరారు. కేంద్ర ప్రభుత్వం ఈ 122 కిలోమీటర్ల మెట్రో ఫేజ్ 2 విస్తరణ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండటానికి ఇష్టపడకపోతే, తక్షణమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాలనీ, కేంద్రం రూపాయి ఇవ్వకపోయినా 100 శాతం ఈక్విటీతో పూర్తి ఆర్థిక భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించి, మెట్రో విస్తరణ పనులను పూర్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. నిధుల బదిలీని ఆపడం ద్వారా సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, మేడ్చల్ వంటి కీలక ప్రాంతాల ప్రజలకు మెట్రో సౌకర్యాన్ని దూరం చేయవద్దని, కిషన్ రెడ్డి తన వైఖరిని స్పష్టం చేయాలని సీఎం డిమాండ్ చేశారు.

Publish Date: Jun 16, 2026 2:34PM

political-news-img

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 90వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజల వినతులు, సమస్యలను స్వీకరించి సంబంధిత అంశాలపై స్పందించారు. పల్నాడు జిల్లాకు అత్యంత కీలకమైన వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణ పనులను త్వరితగతిన ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని వరికపూడిశెల జలసాధన సమితి ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. బుద్ధ యోగా ఫౌండేషన్ ద్వారా మోసపోయిన 1,056 మంది యోగా ఇన్‌స్ట్రక్టర్లకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. గత మూడేళ్లుగా తాము అందించిన సేవలను గుర్తించి తగిన గుర్తింపు కల్పించడంతో పాటు, భవిష్యత్తులో కూడా ఈ సేవలను ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన గోల్డ్ లోన్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. తాము తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాల విషయంలో తూకం, వస్తువుల పరంగా తేడాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పేద గర్భిణీల ఆరోగ్య సంరక్షణ కోసం నగదు బదిలీ పథకాన్ని ప్రవేశపెట్టాలని, మహిళల భద్రత కోసం ప్రతి నియోజకవర్గంలో మహిళా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఏపీ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులు మంత్రి లోకేష్‌ను కోరారు.ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం వెంకటాద్రిపాలెం పంచాయతీ సమగ్ర అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని గ్రామానికి చెందిన ఎన్. మల్లికార్జున నాయుడు విజ్ఞప్తి చేశారు. గ్రామంలో రోడ్ల నిర్మాణంతో పాటు గండివాగుపై వంతెన నిర్మించాలని కోరారు.ప్రజల నుంచి అందిన అన్ని వినతులను పరిశీలించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు.

Publish Date: Jun 16, 2026 2:27PM

MOVIE NEWS