నామినేటెడ్ పదవి కోసం వైసీపీ ఎమ్మెల్యే రూ. 5.5 కోట్ల డీల్.. జడ్పీటీసీ పేరుతో లేఖ వైరల్
Publish Date:Nov 2, 2021
Advertisement
ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ ప్రభుత్వం అవినీతి ,అక్రమాలకు కేరాఫ్ గా మారిందనే ఆరోపణలు ఉన్నాయి. జగన్ రెడ్డి పాలనలో ఏ పని జరగాలన్న అధికారులకు, స్థానిక వైసీపీ నేతలకు ఎంతో కొంత ఇస్తే కాని పని జరగదనే విమర్శలు మొదటి నుంచి వస్తున్నాయి. వైసీపీ ప్రజాప్రతినిధులు గురించి ఎంత చెప్పినా తక్కువే అంటారు. మైనింగ్, సాండ్, లిక్కర్.. ఇలా అన్ని అంశాల్లోనూ కోట్లాది రూపాయలు స్వాహా చేస్తున్నారని ఫిర్యాదులు కూడా వచ్చాయి. తాజాగా తమ పార్టీ కార్యకర్తలను కూడా పదవుల కోసం వైసీపీ ఎమ్మెల్యేలు లంచం అడగడం కలకలం రేపుతోంది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ ఓ జడ్పీటీసీ సభ్యురాలి నుంచి పూతలపట్టు వైసీపీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు రూ. 5.5 కోట్లు తీసుకున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన లేఖ చక్కర్లు కొడుతోంది. ఐరాల జడ్పీటీసీ సభ్యురాలు వి.సుచిత్ర సీఎం జగన్కు ఈ లేఖ రాసినట్టుగా ఉంది. తనకు జడ్పీ వైస్ చైర్మన్ పదవిని కానీ, లేదంటే ఆర్టీసీ చైర్మన్ అదీ కుదరకుంటే వైసీపీ కుప్పం నియోజకవర్గ బాధ్యురాలిగా అవకాశం కల్పిస్తానని చెప్పి ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తన నుంచి రూ. 5.5 కోట్లు తీసుకున్నారని సుచిత్ర ఆ లేఖలో పేర్కొన్నట్టుగా ఉంది. అయితే ఎమ్మెల్యే హామీలేవీ నెరవేరకపోవడంతో తిరిగి తన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరానని లేఖలో జడ్పీటీసీ సభ్యురాలు కోరినట్లుగా ఉంది. బెంగళూరు వస్తే ఇస్తానని చెబితే అక్కడికి వెళ్తే బెదిరించారని, అంతేకాక, తమపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడతానన్నారని వాపోయారు. డబ్బులు వెనక్కి ఇచ్చేది లేదని, దిక్కున్న చోట చెప్పుకోవాలని హెచ్చరించారని పేర్కొన్నారు. ఆయన నుంచి తమకు ప్రాణహాని ఉందని, కాబట్టి మీరే (జగన్) కాపాడాలని కోరినట్టుగా ఆ లేఖలో ఉంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ లేఖపై ఎమ్మెల్యే ఎంఎస్ బాబు స్పందించారు. అవన్నీ తప్పుడు ఆరోపణలు అని కొట్టిపడేసిన ఎమ్మెల్యే.. అంతా దేవుడే చూసుకుంటాడని అన్నారు.
http://www.teluguone.com/news/content/ycp-mla-demand-bribe-to-nominated-post-25-125742.html