Top Stories

పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత

ఢిల్లీలోని  పాకిస్తాన్  హైకమిషన్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేల సంఖ్యలో జనం ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆ దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ కార్యాలయం లోనికి వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. బారికేడ్స్ అడ్డుపెట్టి జనాలను నిలువరించారు. విషయమేంటంటే.. పెహల్గాం ఉగ్రదాడిలో 27 మంది మరణించిన ఘటనపై దేశం యావత్తూ శోకసంద్రంలో మునిగి ఉన్న సమయంలో పాక్ హైకమిషన్ కార్యాలయం కేక్ ఆర్డర్ చేసి సంబరాలు జరుపుకోవడానికి సిద్ధమైందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  ఓ వైపు ఉగ్రదాడి మృతుల అంత్యక్రియలు జరుగుతున్న వేళ.. ఓ వ్యక్తి కేక్ తీసుకుని పాకిస్థాన్ హైకమిషన్ కార్యాలయంలోకి వెడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడి యోలో ఓ వ్యక్తి చేతిలో కేక్ తో పాక్ హైకమిషన్ కార్యాలయంలోకి వడివడిగా నడుచుకువెడుతున్నాడు. అక్కడ ఉన్న మీడియా అతనిని ప్రశ్నిస్తోంది. అయితే మీడియా ప్రతినిథులకు సమాధానం ఇవ్వకుండా ఆ కేక్ ను డెలివరీ చేయడానికి వచ్చిన వ్యక్తి వెళ్లిపోవడం మరిన్ని అనుమానాలకు తావిచ్చింది. ఈ వీడియోపై నెటిజనులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  పెహల్గాం ఉగ్రవాదిలో మరణించిన వారి కోసం యావత్ దేశం కన్నీరు పెడుతుంటే, శోక సంద్రంలో మునిగిపోయి ఉంటే.. పాకిస్థాన్ సంబరాలు చేసుకుంటోందంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. అదీ భారత గడ్డ మీద పాక్ హైకమిషన్ కార్యాలయం ఈ సంబరాలకు వేదిక కావడం ఆ దేశం తెంపరి తనానికి, పైశాచికత్వానికి నిలువెత్తు నిదర్శనమంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాక్ హైకమిషన్ లో సంబరాలు అంటూ వార్త   వేగంగా వ్యాపించింది. భారత్ విషాద సాగరంలో మునిగి ఉన్న సమయంలో అదే గడ్డ మీద పాకిస్థాన్ సంబరాలా అంటూ జనం ఆగ్రహంతో ఊగిపోయారు. ఎవరికి వారు స్వచ్ఛందంగా భారత్ హైకమిషన్ వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు.  అదలా ఉంటే.. పెహల్గాం ఉగ్రదాడి తరువాత కూడా పాకిస్థాన్ తన కవ్వింపు చర్యలను కొనసాగిస్తోంది.   సింధు నదీ జలాల్లో ప్రతి నీటిబొట్టూ పాకిస్థాన్ కే చెందుతుందంటూ ఆ దేశ మంత్రి అవాయిస్ లెఘారీ పేర్కొన్నారు. ఇండస్ వాటర్ ట్రయిటీ నుంచి భారత్  ఏకపక్షంగా వైదలగడాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనడమే కాకుండా, భారత్ నిర్ణయాన్ని రాజకీయంగా, న్యాపరంగా ఎదుర్కొంటామనీ, భారత్ కు గట్టి గుణపాఠం చెబుతామని సవాల్ విసిరారు. అంతర్జాతీయ సంస్థలకు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదలగజాలదనీ, భారత్ కు ఆ హక్కు లేదనీ పేర్కొన్నారు.  ఇలా ఉంటే.. పాక్ ఆక్రమిత కాశ్మీర్  నుంచి భారత్ లో చొరబడి విధ్వంసం సృష్టించడానికి ఉగ్రవాదులు భారీ ప్రణాళిక రచించినట్లు భద్రతా బలగాలు చెప్పాయి. పీకోకేలో ఇందు కోసం ఉగ్రవాదులు  42 లాంచ్ ప్యాడ్లను సిద్ధం చేశాయని గుర్తించినట్లు భద్రతాబలగాలు వెల్లడించాయి. దాదాపు 130 మంది టెర్రరిస్టులు భారత్ లో చొరబడేందుకు తమ బాస్ ల ఆదేశాల కోసం ఎదురు చేస్తున్నారని పేర్కొన్నాయి.   
పాక్ హైకమిషన్ లోకి కేక్.. సంబరాల కోసమే అంటూ జనాగ్రహం.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత Publish Date: Apr 24, 2025 4:24PM

ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి

కర్రెగుట్టల్లో యుద్ధ వాతావరణం భీకర కాల్పులు.. వేల సంఖ్యలో మావోయిస్టులు..  వాయుసేన సహకారంతో భద్రతా దళాల కూంబింగ్ ఛత్తీస్‌గఢ్‌లో  ఈ ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు.  ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లా ధర్మ తాళ్లగూడెంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురు కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. నక్సల్స్ ముక్త ఆపరేషన్ లో భాగంగా ఛత్తీస్ గఢ్ లోని నక్సల్ ప్రభావిత ప్రాంతాలలో గత కొంత కాలంగా భద్రతా దళాలు పెద్ద ఎత్తున గాలింపు కూంబింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలు ఎన్ కౌంటర్లలో వందల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. కాల్పులు విరమించి శాంతి చర్చలకు రావాలని మావోయిస్టులకు కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇలా ఉండగా   చత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌ సరిహద్దులోని ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లోని కర్రె గుటల్లో రెండ్రోజులుగా పెద్ద సంఖ్యలో భద్రతా దళాలు మోహరించి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి. అక్కడ దాదాపు 3000 మంది మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఈ గాలింపు జరుగుతోంది. దీంతో ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు అలముకున్నాయి.  వేల సంఖ్యలో భద్రత దళాలు కర్రెగుట్టలను చుట్టు ముట్టాయి. వాయుసేన కూడా ఈ కూంబింగ్ లో భాగస్వామి అయ్యిందంటేనే పరిస్థితి తీవ్రతను అర్ధం చేసుకోవచ్చునని చెబుతున్నారు. ఈ ఆపరేషన్ తో  నక్సల్స్ ముక్త భారత్ దిశగా పడుతున్న అడుగులు ముగింపు దశకు వచ్చినట్లే అవుతుందని కూడా అంటున్నారు.  కూబింగ్ నిలిపివేయాలి, శాంతి చర్చ లకు పిలవాలి అంటూ మావోయిస్టులు   రాసిన లేఖను  కేంద్రం పట్టించుకున్న దాఖలాలు కనిపిం చడం లేదు.   వచ్చే ఏడాది మార్చినాటికి నక్సల్స్ ముక్త భారత్ ను చూడాలన్న లక్ష్యంతో  కేంద్రం అడుగులు వేస్తున్నది. అందుకే కనీవినీ ఎరుగని రీతిలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో వేల సంఖ్యలో భద్రతా దళాలను రంగంలోకి దింపింది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్, సీఆర్ పీఎఫ్, సైన్యం సంయుక్త ఆపరేషన్ కింద ఆపరేషన్ కగార్ సాగుతోంది.  ఇప్పుడు మావోయిస్టు పార్టీకి షెల్టర్ జోన్‌గా మారిన కర్రెగుట్టల్లో వేల సంఖ్యలో భద్రతా దళాలు మోహరించాయి.   తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల సరిహద్దులో దట్టమైన అటవీ ప్రాంతంతోపాటు ఎత్తయిన గుట్టలతో సుమారు 53 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న కర్రెగుట్టలను మావోయిస్టులు అత్యంత సేప్టీ జోన్ గా భావిస్తుంటారు. ఆ కారణంగానే అందుకే ఛత్తీస్ గఢ్ లో తమ ఆనుపానులన్నీ భద్రతా దళాలు తెలుసుకుని దాడులు చేస్తుండటంతో మావోయిస్టులు కర్రెగుట్టల్లో తలదాచుకున్నారు. ఇలా ఇక్కడ మకాం వేసిన వారిలో  పార్టీ అగ్రనేతలు కూడా ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.  దీంతో ఆ ప్రాంతంలో వేల సంఖ్యలో జవాన్లను మొహరింపజేసి కూంబిగ్ నిర్వహిస్తున్నారు. కర్రెగుట్టలకు దారితీసే అన్ని మార్గాలనూ దాదాపుగా చుట్టుముట్టేశారు.  మావోయిస్టుల ఆచూకీ కోసం కర్రెగుట్టలను వాయిసేన విమానాలు జల్లెడపడుతున్నాయి.  కర్రెగుట్టల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఇప్పటికే కర్రెగుట్టల్లో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయని అంటున్నారు. కర్రెగుట్టలను భద్రతా బలగాలు మోహరించిన నేపథ్యంలో హరగోపాల్ వంటి పౌరహక్కుల సంఘం నేతలు రంగంలోకి దిగి.. శాంతి చర్చల కోసం మావోలు లేఖ రాసిన తరువాత కూడా ఈ తీరులో ఏరివేత కార్యక్రమం కొనసాగించడాన్ని తప్పుపడుతున్నారు. వెంటనే కూంబింగ్ నిలిపివేసి శాంతి చర్చలకు మావోయిస్టులను పిలవాలని కోరుతున్నారు. 
ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్.. ముగ్గురు మావోలు మృతి Publish Date: Apr 24, 2025 3:11PM

కొత్త క‌శ్మీరం.. క‌న్నీటి గాథ‌!

క‌శ్మీర్ లోయ విధ్వంసంలో ఒక్కొక్క‌రిదీ ఒక్కో విషాద గాథ‌ హార్స్ రైడ‌ర్ సాహ‌స‌గాథ‌.. క‌లిమాతో త‌ప్పించుకున్న ఓ ప్రొఫెస‌ర్ తెలివైన క‌థ‌ హానీ మూన్ కి వ‌చ్చి శ‌వ‌పేటిక‌లో వెళ్లిన న‌వ వ‌రుడు బోరున విల‌పించిన న‌వ వ‌ధువు దీన ప్రేమ గాథ‌.. తొలిసారి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేసిన క‌శ్మీరీలు సీఎం నుంచి కామ‌న్ మేన్ వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే వెత‌.. క‌త‌! గ‌త కొన్నేళ్ల నుంచి కొత్త క‌శ్మీరం ఆవిష్క‌రిస్తున్న వేళ‌.. ఎన్న‌డూ లేని విధంగా ప‌ర్యాట‌కులు సంద‌డి చేస్తున్న స‌మ‌యాన‌.. కాశ్మీరం నిజంగానే ఒక భూత‌ల స్వ‌ర్గ‌మా అనిపించింది. క‌శ్మీర్ భార‌త్ లో భాగం అయితే మ‌న‌కు ఇంత‌టి భాగ్యం ల‌భిస్తుందా? అన్న కోణంలో స్థానిక క‌శ్మీరీలు కూడా ఎంతో ఆనందంగా ఉన్న  సంద‌ర్భం కూడా ఇదే.  అయితే గ‌త మూడున్నర దశాబ్దాలలో ఎన్నడూ లేని విధంగా 26 మంది ప‌ర్యాట‌కుల‌ను హ‌త‌మార్చి.. పాక్ ఉగ్ర‌వాదులు ఇక్క‌డి వారికి మ‌న‌శ్శాంతి లేకుండా చేశారు. సామాన్యుల నుంచి సీఎం వ‌ర‌కూ అంద‌రిదీ ఒక‌టే మాట‌. ఇది అమానుషం. ప్ర‌పంచ మాన‌వాళిపై జ‌రిపిన న‌మ్మ‌క ద్రోహం. ఇదొక అస‌హ్య‌క‌ర‌మైన చర్య‌. ఈ దాడికి తెగ‌బ‌డింది జంతువులు. వార‌ు అస‌లు మ‌నుషులు కాదు. త‌మ రాష్ట్రానికి ఆహ్లాదం వెతుక్కుని వ‌చ్చిన వారు తిరిగి వెళ్లేట‌పుడు ఆనందంగా వెళ్ల‌కుండా విషాద‌ంగా వెళ్ల‌డం.. త‌మ‌ను తీవ్రంగా  బాధిస్తోంద‌ని బాధ ప‌డ్డారు సీఎం ఒమ‌ర్ అబ్ధుల్లా. మ‌రి కొంద‌రు ప‌ర్యాట‌కులు శ‌వ‌పేటిక‌ల్లో వెళ్ల‌డాన్ని తామైతే అస‌లు జీర్ణించుకోలేక పోతున్నామ‌నీ ఆ దృశ్యాలు త‌మ‌ను క‌ల‌చి వేస్తున్నాయ‌ని అన్నారు సీఎం అబ్దుల్లా. ఇక క‌శ్మీరీలైతే.. తాము స్వ‌చ్ఛందంగా హోట‌ళ్లు, షాపులు మూసి వేసి.. నిర‌స‌న వ్య‌క్తం చేశారు. ఇది త‌మ ప్రాంతానికే మాయ‌ని మ‌చ్చ‌లాంటి ఘ‌ట‌న‌గా వీరు భావిస్తున్నారు. త‌మ గుండెల‌పై ఈ దాడి గున‌పం దించింద‌నీ,  ఒక్క‌సారిగా పాత కాశ్మీర్ త‌మ క‌ళ్ల‌కు క‌ట్టింద‌నీ. ఇన్నాళ్ల పాటు తాము చూసింది క‌ల‌. ఇదే క‌ఠిక వాస్త‌వం. మా పాత క‌శ్మీర్ ని మ‌ళ్లీ మాకు వ‌ద్ద‌న్నా మా ఉగ్ర మూక‌లు  బ‌హుక‌రించ‌డం మాకుసుతరామూ ఇష్టం లేద‌ని వారు ఘోషిస్తున్నారు. 15రోజుల పాటు ప‌ర్యాట‌కుల‌కు వ‌స‌తి సౌక‌ర్యాల‌తో స‌హా అన్ని ఉచితంగా ఇస్తామ‌నీ.. సైనికుల‌కు అవ‌స‌ర‌మైన స‌హాయ స‌హ‌కారాల‌ను కూడా అందిస్తామ‌ని క‌శ్మీరీలు అంటున్నారు. ఇది ప‌ర్యాట‌కం డ‌బ్బు ద‌స్కానికి సంబంధించిన వ్య‌వ‌హారం కాదు. మాన‌వ‌త్వానికి చెందిన అంశం కాబ‌ట్టి.. బాధిత కుటుంబాల‌కు త‌మ ప్ర‌గాఢ సాను భూతిని వ్య‌క్తం చేశారు. త‌మ‌లో ఒక‌డైన హార్స్ రైడ‌ర్ అదిల్ షా త‌మ క‌శ్మీరీల త‌ర‌ఫున ఉగ్ర‌వాదులతో పోరాడి వీర మ‌ర‌ణం పొంద‌డం త‌మ‌ను క‌ల‌చి వేసింద‌నీ, ప‌ర్యాట‌కుల ప‌ట్ల మా ప్రేమ ఎలాంటిదో అదిల్ షా మ‌ర‌ణం రూపంలో  తెలియ చేసిన‌ట్టుగా స్థానిక క‌శ్మీరీలు చెబుతున్నారు. మేం మీకోసం ప్రాణం పెడ‌తామ‌న‌డానికి ఇంత‌క‌న్నా నిద‌ర్శ‌నం మ‌రేదీ లేద‌ని అంటున్నారు వారు. ఇక న‌వ జంట విన‌య్- హిమాన్షుది..  అత్యంత విషాదక‌ర‌మైన‌ ఘ‌ట‌న‌.  వీరి పెళ్ల‌య్యింది ఏప్రిల్ 16, ఆమె భ‌ర్త విగ‌త జీవిగా మారింది ఏప్రిల్ 22న‌. ప‌ట్టుమ‌ని వారం కూడా నిల‌వ‌ని వివాహ బంధం వీరిది. ఆమె అత‌డి శ‌వ‌పేటిక ద‌గ్గ‌ర ఏడ్చిన ఏడుపు.. ఎంత హృద‌య విదార‌కంగా నిలిచిందంటే.. ప్ర‌పంచ‌మంతా ఆమెతో క‌ల‌సి ఏడ్చేంత‌. అంత‌గా ఆమె త‌న భ‌ర్త శ‌వ‌పేటిక‌ను వ‌ద‌ల్లేక వ‌దులుతూ.. చివ‌రిగా జై హింద్ అంటూ ఆమె చూపిన దేశ భ‌క్తి న‌భూతో.. ఆ స‌మ‌యంలో వారికి తెలీదు త‌మ‌పై ఒక ఉగ్ర‌దాడి జ‌రుగుతుంద‌ని. విన‌య్ అయితే హిమాన్షుతో క‌ల‌సి ఎంతో ఉల్లాసంగా  గ‌డుపుతున్నాడు. ఇద్ద‌రూ క‌ల‌సి ఆడి  పాడారు. అత‌డైతే తాను చ‌నిపోయే స‌మ‌యానికి భేల్ పూరీ తింటున్నాడు. ఇంత‌లో ఆమె మొహంపై ర‌క్తం చిందింది. చూస్తే ఒక ఉగ్ర‌వాది త‌న భ‌ర్త‌ను కాల్చి చంపిన దృశ్యం చూసి విల‌విల‌లాడిపోయిందా న‌వ వ‌ధువు.  ఇక క‌లిమా చ‌ద‌వ‌డం వ‌ల్ల బ‌తికిపోయిన దంపతుల‌ది మ‌రో ర‌క‌మైన గ్రేట్ ఎస్కేప్ స్టోరీ. ఒక చెట్టు కింద బెంగాలీ ప్రొఫెస‌ర్ భ‌ట్టాచార్య ప‌డుకుని ఉన్నారు. ఆయ‌న కుటుంబం కూడా అక్క‌డే ఉంది. తాను నిద్రిస్తుండ‌గా.. క‌లిమా చ‌దువుతున్న చ‌ప్పుడు. లేచి చూశాడు. ఏం చేస్తున్నావ్ అంటూ ఒక ఉగ్ర‌వాది అత‌డ్ని హిందీలో అడిగాడు. అంతే అత‌డు త‌న‌కు తెలిసిన క‌లీమా బిగ్గ‌ర‌గా చ‌ద‌వ‌డం మొద‌లు పెట్టాడు. ప‌క్క‌నే ఉన్నత‌న్ని కాల్చి   అక్క‌డి నుంచి వెళ్లిపోయాడా ఉగ్ర‌వాది. దీంతో బ‌తుకు జీవుడా అంటూ అక్క‌డ నుంచి పారిపోయింది భ‌ట్టాచార్య కుటుంబం. ప‌హెల్గాంకి 5 కిలోమీట‌ర్ల దూరంలో స‌ముద్ర మ‌ట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉండే బైస‌ర‌న్ ప‌చ్చిక‌బ‌య‌ళ్లు.. ఎంతో ఆహ్లార‌క‌రంగా ఉంటాయి.. ఇక్క‌డికి న‌డ‌క లేదా గుర్ర‌పు స్వారీ ద్వారా మాత్ర‌మే వెళ్లగలం. అందులో భాగంగా ఇక్క‌డ హార్స్ రైడ‌ర్లు చాలా మంది త‌మ జీవ‌నోపాధిని వెతుక్కుంటూ ఉంటారు. అలా ప‌ర్యాట‌కుల‌ను బైస‌ర‌న్ కు త‌న గుర్రం మీద ఎక్కించుకుని నాలుగు డ‌బ్బులు సంపాదిస్తుంటాడు అదిల్ షా. అత‌డ‌లా వ‌స్తుండ‌గానే ఈ దాడి జ‌రిగింది. అత‌డైతే ఎంతో వీరోచితంగా ఉగ్ర‌వాది నుంచి తుపాకీ లాక్కో బోతూ.. వారి కాల్పుల్లో చ‌నిపోయాడు. ఇప్పుడ‌త‌డి భార్యా పిల్ల‌లు, త‌ల్లిదండ్రులు అనాథ‌ల‌య్యారు. వీరు త‌మ కుమారుడి మ‌ర‌ణ వార్త విని భోరున విల‌పిస్తున్నారు. ఇక ఈ ప్రాంతాన్నే ఉగ్ర‌వాదులు ఎంపిక చేసుకోడానికి గ‌ల కార‌ణం ఇక్క‌డ ప‌ర్యాట‌కులు అధికంగా వస్తుండటమే.. వీలైనంత ఎక్కువ  మందిని మట్టుపెట్టవచ్చన్న అంచనాలతోనే  ఉగ్ర ముఠా ఈ ప్రాంతాన్ని ఎంచుకుంది. ఈ దాడికి తామే కార‌కుల‌మంటూ ల‌ష్క‌రే తోయిబా రెసిస్టెన్స్ గ్రూప్ బాధ్య‌త తీస్కుంది.  ప్ర‌ధాని మోడీ అయితే రెండు రోజుల సౌదీ ప‌ర్య‌ట‌నను అర్ధంతరంగా ముగించుకుని హుటాహుటిన  భార‌త్ చేశారు. హోం మంత్రి అమిత్ షా సీఎం, లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ తో భేటీ అయ్యి ప‌రిస్థితి స‌మీక్షించారు. బాధితుల‌తో మాట్లాడారు. ఇక ఢిల్లీలో అత్య‌వ‌స‌ర భ‌ద్ర‌తా సమావేశం ఏర్పాటు చేశారు. ఇక‌పై పాక్ తో మ‌రోలా ఉంటుంద‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. ఊహించ‌లేనంత గ‌ట్టి దెబ్బ తీస్తామ‌న్నారు రాజ్ నాథ్ సింగ్. ఇక‌పై ఏ ర‌క‌మైన దౌత్య సంబంధాలు కూడా పాక్ తో ఉండ‌వ‌ని తెగేసి చెప్పారు. ఆ ముగ్గురు ముష్క‌రులు పాకిస్తానీలే కాబ‌ట్టి.. 1960 నాటి సింధు జ‌లాల ఒప్పందం అమ‌లు  నిలిపి వేశారు. ఇక్క‌డి పాక్ దౌత్య వేత్త‌ల‌ను మీ దేశం దయచేయండని హుకుం జారీ చేశారు.  భార‌త్ లో ఉంటున్న  పాకిస్తానీలు గానీ, ప‌ర్యాట‌కులు గానీ వారం లోగా భార‌త్ వీడాల‌ని సూచించారు. పాక్ లోని భార‌త దౌత్య అధికారుల హోదాల‌న్నిటినీ ర‌ద్దు చేసి.. వారిని తిరిగి వ‌చ్చేయాల‌న్న ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడంద‌రి చూపల్లా ఒక్క‌టే.. ఉగ్ర‌దాడికి భార‌త స‌మాధానం ఏ స్థాయిలో ఉంటుందా? అని మాత్ర‌మే!
కొత్త క‌శ్మీరం..  క‌న్నీటి గాథ‌! Publish Date: Apr 24, 2025 2:34PM

మంచుకొండల్లో మారణహోమం.. హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడితో.. భారత్ మొత్తం రగిలిపోతోంది. హిందూ టూరిస్టులే లక్ష్యంగా తీవ్రవాదులు జరిపిన కాల్పులతో..  దేశం ఏ క్షణమైనా పేలేందుకు సిద్ధంగా ఉన్న అగ్నిపర్వతంలా మారింది. టెర్రరిస్టులు కేవలం హిందువులనే ఎంపిక చేసుకొని మరీ దాడి చేయడానికి కారణమేంటి? హిందువులను చంపడం వల్ల.. వారు సాధించేదేమిటి? పహల్గాం ఉగ్రదాడి వెనకున్న అసలు కోణమేంటి? అన్నది పెద్ద డిబేట్‌గా మారింది. ఉగ్రవాదానికి మతం లేదంటారు.  మరి.. కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దాడి ఏమిటి?  హిందువులని లక్ష్యంగా చేసుకొని.. వందలాది మంది టూరిస్టుల్లో హిందువులను మాత్రమే సెలక్ట్ చేసుకొని మరీ కాల్పులు జరపడాన్ని ఎలా చూడాలి?  మతాన్ని నిర్ధారించి చంపేవాడి మనస్తత్వం ఏమిటో ఇప్పటికైనా అర్థమవుతోందా?  పహల్గాంలో టెర్రరిస్ట్ అటాక్ తర్వాత తలెత్తుతున్న ప్రశ్నలివే. ఉగ్రవాదానికి మతం లేదని వాదించే వాళ్లందరికీ.. మంచుకొండల్లో జరిగిన ఈ మారణహోమమే బిగ్ ఎగ్జాంపుల్. ఉగ్రవాదులకే కాదు.. ఉగ్రవాదానికి కూడా మతం ఉందని రుజువు చేసిన తీవ్రమైన దాడి ఇది. పహల్గాం ఉగ్రదాడిలో మతం మాత్రమే ఉంది. ఉగ్రవాద సంస్థలన్నీ.. హిందూ మతాన్ని ద్వేషిస్తాయని, ఉగ్రవాదులంతా హిందూ సమాజానికి వ్యతిరేకంగానే పనిచేస్తారనే విషయం.. పహల్గాం ఉగ్రదాడితో  తేలిపోయింది. హిందువులే లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడితో.. కశ్మీర్ సరిహద్దుల్లోకి చొరబడే ఉగ్రవాదుల లక్ష్యమేమిటో స్పష్టంగా తెలిసింది. మన దేశంలో మతం పేరిట మంటలు రేపడమే టెర్రరిస్టుల ఏకైక లక్ష్యమని అర్థమవుతోంది. అందుకోసమే.. పహల్గాంలో హిందూ టూరిస్టులను ఎంచుకొని మరీ చంపేశారనే వాదనలు బలపడుతున్నాయ్. అల్‌ఖైదా, ఐసిస్, లష్కరే తోయిబా, ఇప్పుడు టీఆర్ఎఫ్. ఇలా.. ఉగ్రవాద సంస్థలు, జిహాదీ గ్రూపులన్నీ.. తమ హింసాత్మక చర్యలను మతపరమైన భావజాలం, హిందూ మతంపై నిలువెల్లా ద్వేషంతోనే నడిపిస్తున్నాయ్. ఈ టెర్రరిస్ట్ సంస్థల ఉగ్రవాద కార్యకలాపాలకు మతమే కేంద్ర బిందువు. హిందువులని లక్ష్యంగా చేసుకొని చేసిన ఈ దాడి.. పూర్తిగా మతపరమైన ద్వేషంతో చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఈ మత గుర్తింపుతోనే.. కశ్మీర్‌లో విభజన సృష్టించేందుకు ప్రయత్నించారు ఉగ్రవా దులు. ఎందుకంటే.. ఉగ్రవాదంలో మతం ఓ డ్రైవింగ్ ఫోర్స్‌లా పనిచేస్తుంది. ఆ మత భావజాలమే.. ఉగ్రవాదుల్ని తీవ్ర దాడులకు ప్రేరేపిస్తోంది. పహల్గాంలో జరిగిన దాడి కూడా ఆ కోవకు చెందినదే. ఉగ్రవాదులు.. టూరిస్టుల పేర్లు, కల్మా చదవమని ఆదేశించడం, సున్తీ గుర్తింపు ద్వారా హిందువులను ఎంపిక చేశారు. ఇది.. జిహాదీ భావజాలంతో హిందువులను.. కాఫిర్‌లుగా లక్ష్యంగా చేసినట్లు సూచిస్తోంది. ఉగ్రవాదులు.. ఉద్దేశపూర్వకంగా హిందువులను గుర్తించి మరీ దాడులు చేయడం అందరినీ షాక్‌కి గురిచేసింది. ఇది.. మతపరమైన ద్వేషంతో కూడిన హిందూ జెనోసైడ్ దాడిగా చెబుతున్నారు. కేవలం కశ్మీర్‌లో మతపరమైన ఉద్రిక్తలను రెచ్చగొట్టేందుకే.. ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌కు చెందిన ఉగ్రవాదులు హిందువులను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఆ రాష్ట్రంలో హిందూ-ముస్లిం విభజనని పెంచి.. అస్థిరతను సృష్టించేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ మారణహోమంలో ఉగ్రవాదులు మహిళలను చంపలేదు. చిన్నారుల జోలికి వెళ్లలేదు. కేవలం.. హిందూ పురుషులను లక్ష్యంగా చేసుకొని దాడి చేశారు. కర్ణాటకకు చెందిన మంజునాథ్‌ని అతని భార్య పల్లవి కళ్ల ముందే కాల్చి చంపారు ఉగ్రవాదులు. తనను కూడా కాల్చేయమని పల్లవి కోరింది. అందుకు.. మేము.. నిన్ను చంపం. ఈ భయానక ఘటన గురించి మోడీకి అని.. టెర్రరిస్ట్ ఆమెను ఆదేశించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ దాడి భారత ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడి పెంచేందుకు చేసిన ఓ ప్రయత్నంగానూ కనిపిస్తోంది. ప్రధానంగా కశ్మీర్‌లో హిందువుల సంఖ్య పెరుగుతోందనే సెంటిమెంట్‌ని రెచ్చగొట్టి.. రాజకీయంగా ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించే స్థానికుల మద్దతు పొందేందుకే.. ఉగ్రవాదులు హిందూ టూరిస్టులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసి ఉండొచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయ్. అమర్‌నాథ్ యాత్రకు కొద్ది రోజుల ముందు.. పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఈ ఉగ్రదాడి.. భారత్‌లోని లక్షలాది మంది హిందూ యాత్రికుల్లో ఆందోళన పెంచుతున్నది. హిందూ యాత్రికుల్లో భయం సృష్టించేందుకు.. ఉగ్రవాదులు ఉద్దేశపూర్వకంగా దాడికి పాల్పడి ఉండొచ్చంటున్నారు. ఈ ఉగ్రదాడిని.. పాకిస్తాన్ స్పాన్సర్ చేసిన ఉగ్రవాద చర్యగానూ ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ ఐఎస్ఐ మద్దతుతోనే.. లష్కరే తోయిబాకు చెందిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్.. ఈ ఉగ్రదాడికి పాల్పడి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
మంచుకొండల్లో మారణహోమం.. హిందువులే ఎందుకు టార్గెట్ అయ్యారు? Publish Date: Apr 24, 2025 1:52PM

పాక్ కవ్వింపులు.. దీటుగా భారత్ బదులు!

కాశ్మీర్‌ పహల్గాంలో ఉగ్రవాదుల కిరాతక దాడి అనంతరం భారత్ పాకిస్తాన్ పై కఠిన ఆంక్షలకు సిద్ధం అయ్యింది.  ప్రాథమికంగా కొన్ని చర్యలను తీసుకుంది. అందులో భాగంగా దేశ సరిహద్దులను మూసే సింది.  వివిధ పనుల నిమిత్తం ఇండియాకు వచ్చిన  పాక్ జాతీయులు మే ఒకటవ తేదీ లోగా భారత్ విడిచి వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పెహల్గాంలో పర్యాటకులు లక్ష్యంగా పాక్ ప్రేరేపిత ఉగ్రదాడి అనంతరం భారత్ కఠిన చర్యలకు ఉపక్రమించింది.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సోమవారం ఢిల్లీలో భేటీ అయిన  భద్రతా వ్యవహారాల కేబినెట్ సబ్ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఆ నిర్ణయాల మేరకు అట్టారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్ట్‌ను  మూసివేసింది. చెల్లుబాటు అయ్యే డాక్యుమెంట్లతో భారత్‌కు వచ్చిన, ఇక్కడ నివసిస్తోన్న పాకిస్తానీయులు కూడా తమ స్వదేశానికి వెళ్లిపోవాలని ఆదేశించింది. వీసా గడువును ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించేది లేదని స్పష్టం చేసింది. మే 1 తేదీ లోపలే వాళ్లంతా కూడా భారత్‌ను వదిలి పాకిస్తాన్‌కు వెళ్లి పోవాల్సి ఉంటుంది. అయితే వారు దేశం విడిచి వెళ్లాలంటే అట్టారీ -  వాఘా చెక్ పోస్టు ఒక్కటే మార్గం.  దీని ద్వారా మాత్రమే అధికారికంగా సరిహద్దు దాటాల్సి ఉంటుంది. దానిని మూసివేయడంతో  ఇప్పుడు ఇక్కడ ఉన్న పాకిస్థానీయుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గడువు దాటిన తరువాత కూడా ఇక్కడే ఉండే పాకిస్తానీయులు జైలుకు వెళ్లక తప్పదు. ఇక ఇప్పుడు వారు  అనివార్యంగా తాము తిరిగి వెళ్లడానికి కేంద్రం నుంచి ప్రత్యేక అనుమతి పొందాల్సి ఉంటుంది. వీసా ఉంది కదా అన్న ధైర్యంతో అడ్రస్ లు మార్చి దేశంలో తిరిగే అవకాశం ఇసుమంతైనా లేదు. అదే విధంగా సింధు జలాల ఒప్పందాన్ని (ఇండస్ ట్రీటీ) రద్దు చేసింది. పాకిస్థాన్ తో అన్ని రకాల సంబంధాలనూ తెంచేసింది.  భారత్‌లో ఉన్న పాకిస్తాన్ హైకమిషనర్‌కు కూడా  మే 1వ తేదీ లోగా దేశం విడిచి వెళ్లాలని ఆదేశిస్తూ సమన్లు జారీ చేసింది. సీసీఎస్‌లో తీసుకున్న నిర్ణయాలతో  ఒక అధికారిక పత్రాన్ని ఆయనకు అందజేసింది. ఇక పాకిస్తాన్‌లో కూడా కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. పెహల్గాం ఉగ్ర దాడి జరిగినప్పటి నుంచి ఆ దేశంలో  భయానక వాతావరణం నెలకొంది. భారత్ నిర్ణయాలపై ఎలా స్పందించాలన్న విషయంపై అక్కడ ప్రభుత్వం కిందా మీదా పడుతోంది.  కవ్వింపు చర్యలకు దిగుతోంది. అందులో భాగంగానే  ఉపరితలం నుంచి ఉపరితలం లక్ష్యాలను ఛేదించే క్షిపణి పరీక్షలకు నడుంబిగించింది.  కరాచీ తీర ప్రాంతంలో  రెండు రోజుల పాటు ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు భారత్ కు సమాచారాన్ని అందించింది. ఇందు కోసం తీరప్రాంతంలో నౌకాదళ సిబ్బందిని మోహరించింది. దీనిపై భారత రక్షణ మంత్రిత్వ శాఖ స్పందించింది. అక్కడి పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నామనీ, పాక్ క్షిపణి పరీక్షలపైనా నిఘా ఉంచామనీ పేర్కొంది.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సైన్యం సర్వసిద్ధంగా ఉందని పేర్కొంది.  
పాక్ కవ్వింపులు.. దీటుగా భారత్ బదులు! Publish Date: Apr 24, 2025 1:27PM

పాక్ పౌరులకు అనుమతి నో.. సింధు జలాల ఒప్పందం రద్దు!

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన  ఉగ్రదాడి అనంతరం ఇండియా కఠిన చర్యలకు ఉపక్రమించింది.  ఉగ్రదాడి వెనుక పాక్ హస్తం ఉందని నిర్ధారణ కావడంతో ఇండియా కఠిన చర్యలకు రెడీ అయ్యింది. అందులో బాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసంలో జరిగిన కేబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ   సమావేశం అనంతరం కీలక నిర్ణయాలు తీసుకుంది.  అందులో భాగంగా  సింధు నది జలాల పంపిణీకి సంబంధించిన ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. అలాగే  భారతదేశంలోకి పాకిస్థాన్ పౌరులకు అనుమతి లేదని ప్రకటించడమే కాకుండా, ఆ దేశస్థులకు ఇప్పటికే జారీ చేసిన వీసాలను రద్దు చేసినట్లు ప్రకటించింది. అలాగే ఢిల్లీలోని పాకిస్థాన్ దౌత్యకార్యాలయం సిబ్బందిని 55 నుంచి 33కు తగ్గించాలని ఆదేశించింది.   ఈ మేరకు పాక్  పాక్ కు విస్పష్ట ఆదేశాలు జారీ చేసింది. అలాగే ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశంతోనూ చర్చల ప్రశక్తే లేదని ప్రకటించింది. ఇప్పటికీ పాకిస్థాన్ తన వైఖరి మార్చుకోకుంటే ముందుముందు మరిన్ని కఠిన చర్యలకు కూడా వెనుకాడబోమబని భారత్ హెచ్చరించింది.    
పాక్ పౌరులకు అనుమతి నో.. సింధు జలాల ఒప్పందం రద్దు! Publish Date: Apr 24, 2025 12:51PM

విశాఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విడదల రజనీ నిర్బంధం?

మాజీ మంత్రి విడదల రజనీని విశాఖ విమానాశ్రయంలో నిర్బంధించినట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. వైసీపీ  హయాంలో  యడ్లపాడులోని శ్రీ లక్ష్మీ స్టోన్‌ క్రషర్స్ నిర్వాహకులను బెదిరించి రూ.2. 20 కోట్లు  వసూలు చేశారనే ఆరోపణలపై  మాజీ మంత్రి విడుదల రజని,  ఆమె మరిది గోపి, అలాగే వీరికి సహకరించిన  అధికారి  జాషూవా,  మాజీ మంత్రి  విడదల రజని పీఏ రామకృష్ణపైనా కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే.  ఇదే కేసులో విడదల రజని మరిది విడదల గోపీనాథ్ ను ఏసీబీ అధికారులు గురువారం (ఏప్రిల్ 24) ఉదయం హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించిన సంగతి తెలిసిందే.   ఈ కేసులో యాంటిసిపేటరీ బెయిలు కోసం మాజీ మంత్రి విడదల రజనీ, విడదల గోపీనాథ్ హైకోర్టును ఆశ్రయించారు. అలాగే  విజిలెన్స్ అధికారి జాఘువా సైతం హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఆ పిటిషన్లన్నీ విచారణ దశలో ఉన్న సంగతి తెలిసిందే. విడదల రజనీ యాంటి సిపేటరీ బెయిలు పిటిషన్ పై తీర్పు వాయిదా వేసిన కోర్టు, ఆమెకు అరెస్టు నుంచి మాత్రం ఎటు వంటి మినహాయింపూ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు పరారీ అయ్యే అవకాశం ఉందన్న విశ్వసనీయ సమాచారంతో ఏసీబీ అధికారులు విడదల గోపీనాథ్ ను హైదరాబాద్ లో అదుపులోనికి తీసుకున్నారు. కాగా విడదల రజనీ దేశం విడిచి వెళ్లకుండా ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రం నుంచి రజనీ విదేశాలకు వెళ్లకుండా  రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే విశాఖ విమానాశ్రయంలో విడదల రజనీని నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను అరెస్టు చేశారా? లేక అడ్డుకున్నారా అన్న విషయంలో క్లారిటీ లేదు.  
విశాఖ విమానాశ్రయంలో మాజీ మంత్రి విడదల రజనీ నిర్బంధం? Publish Date: Apr 24, 2025 12:36PM

చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా? నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే మ్యాజిక్కే..!

  మండుతున్న ఎండల కారణంగా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతోంది. ఈ సీజన్‌లో ప్రతి రెండవ వ్యక్తి చెమటతో ఇబ్బంది పడుతుండటం గమనించవచ్చు. దీని వల్ల చాలా మంది  ఇబ్బంది పడుతుంటారు. చెమట వల్ల  శరీరం దుర్వాసన రావడం ప్రారంభమవుతుంది. ఈ దుర్వాసన కారణంగా  నలుగురిలో కలవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది.  ఈ సమస్యతో ఇబ్బంది  పడేవారు  స్నానపు నీటిలో కొన్ని వస్తువులను జోడించడం ద్వారా చెమట వాసనను వదిలించుకోవచ్చు.  దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వేప ఆకులు..  చెమట వాసనతో  ఇబ్బంది పడుతుంటే, స్నానపు నీటిలో వేప ఆకులు వేసి మరిగించాలి. దీని కోసం ఒక గిన్నెలో నీరు తీసుకుని, అందులో వేప ఆకులు వేయాలి. ఇప్పుడు ఈ నీటిని మరిగించాలి. నీరు చల్లబడిన తర్వాత దానిని వడకట్టి స్నానపు నీటిలో కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించాలి. రోజ్ వాటర్.. రోజ్ వాటర్ ఉంటే చెమట వాసనను తొలగించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. దీన్ని ఉపయోగించడానికి  స్నానపు నీటిలో రెండు నుండి మూడు చెంచాల రోజ్ వాటర్ కలపాలి. ఇప్పుడు ఈ నీరు స్నానానికి ఉపయోగించవచ్చు. రోజ్ వాటర్ ని నీటిలో కలిపి ప్రతిరోజూ ఆ నీటితో స్నానం చేయాలి. దీన్ని ఉపయోగించడం ద్వారా  చెమట వాసన నుండి ఉపశమనం పొందవచ్చు. బేకింగ్ సోడా.. బేకింగ్ సోడా ప్రతి భారతీయ వంటగదిలో కనిపిస్తుంది.   చెమట దుర్వాసనను వదిలించుకోవడానికి  బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. రెండు చెంచాల బేకింగ్ సోడాను స్నానపు నీటిలో కలిపి, ఆ నీటితో స్నానం చేయాలి. ఈ నీటితో స్నానం చేసే ముందు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ బేకింగ్ సోడా అందరికీ సరిపోదు. దీని కారణంగా  అలెర్జీలను ఎదుర్కోవలసి రావచ్చు. అలోవెరా జెల్..  ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే స్నానం చేసే నీటిలో అలోవెరా జెల్ కలపాలి. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరంపై ఉన్న బ్యాక్టీరియా కూడా తొలగిపోతుంది. ఈ నీరు చర్మాన్ని చల్లబరుస్తుంది,  శరీరం తాజాగా అనిపిస్తుంది.                                    *రూపశ్రీ.
చెమట వాసనతో ఇబ్బంది పడుతున్నారా?   నీటిలో వీటిని కలిపి స్నానం చేస్తే మ్యాజిక్కే..! Publish Date: Apr 24, 2025 12:01PM

గోపీనాథ్ అరెస్టు.. ఇక మాజీ మంత్రి విడదల రజనీ వంతేనా?

వైసీపీ నాయ‌కురాలు, చిలకలూరి పేట మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జ‌నీకి భారీ షాక్ త‌గిలింది. ఆమె మ‌రిది.. విడ‌ద‌ల గోపీనాథ్ ను ఏసీబీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేశారు. విడదల గోపీనాథ్ విదేశాలకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నారన్న కచ్చితమైన సమాచారంలో ఏసీబీ పోలీసులు ఆయనను హైదరాబాద్ లో ఈ తెల్లవారు జామున అదుపులోనికి తీసుకున్నారు.  అరెస్టు అనంత‌రం.. ఆయనను హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ‌కు తరలించారు.   ఈ అరెస్టుతో ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నాయకురాలు విడదల రజనీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగుసుకుందని అంటున్నారు.  యడ్లపాడులో  క్వారీ యజమానులను బెదిరించి డబ్బు వసూలు చేశారన్న ఫిర్యాదులపై  మాజీమంత్రి విడదల రజపై ఏసీబీ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఆ కేసులో నే విడదల రజిని మరిది గోపినాథ్ ను ఏపీ పోలీసులు హైదరాబాద్‌ లో అరెస్టు చేశారు. అక్కడ నుంచి విజయవాడకు తరలించారు.   2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారన్న ఫిర్యాదుల మేరకు  ఈ ఏడాది మార్చిలో ఏసీబీ నమోదు చేసిన కేసులో విడదల రజని  ఏ1గా, ఆమె మరిది విడదల గోపీనాథ్ ఏ3గా, రజని పీఏ దొడ్డ రామకృష్ణను ఏ4గా చేర్చారు.  ఈ కేసులో తమను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ విడదల రజని, గోపీనాథ్ లు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  అదలా ఉండగానే తాజాగా విడదల రజనీ మరిది గోపీనాథ్ ను పోలీసులు అరెస్టు చేయడం సంచలనంగా మారింది.   కాగా సైబరాబాద్ మెక్క, చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి విడదల రజిని  ముందస్తు బెయిలు పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు.. ఆమెకు అరెస్టు నుంచి మినహాయింపు ఏదీ ఇవ్వలేదు.  ఇప్పుడు ఇదే కేసులో ఆమె మరిది విడదల గోపీనాథ్ ను అరెస్టు చేయడంతో  విడదల రజనిని కూడా అరెస్టు చేస్తారా? అన్న చర్చ మొదలైంది. 
గోపీనాథ్ అరెస్టు.. ఇక  మాజీ మంత్రి విడదల రజనీ వంతేనా? Publish Date: Apr 24, 2025 10:28AM

వేసవిలో గసగసాలతో ఇంత లాభమా..!

  గసగసాలు స్వీట్లలోనూ,  కొన్ని రకాల వంటలలోనూ ఉపయోగిస్తారు.  ఆవాల కంటే చిన్న తెలుపు, గోధుమ రంగులో ఉండే గసగసాలు ఖరీదు పరంగా ఎక్కువే ఉంటాయి.  కానీ ఇవి చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంటాయి. గసగసాలు వేడిని క్షణాల్లోనే తరిమివేస్తాయట.  ఆయుర్వేదం కూడా గసగసాల గురించి గొప్పగా చెప్పింది.  వేలాది సంవత్సరాల నుండే గసగసాలు ప్రజల ఆహారంలో భాగంగా ఉన్నాయి.  చరక సంహితలో దీనిని పిత్త దోషాన్ని శాంతింపజేసే మూలికగా పేర్కొన్నారు. ఇంత అద్బుతమైన గసగసాలు వేసవిలో మనకు చేకూర్చే మేలు ఏంటో తెలుసుకుంటే.. కూలింగ్ ప్రభావం.. చరక సంహితలో గసగసాల గురించి చెప్పబడింది. దీని శీతలీకరణ ప్రభావం శరీర వేడిని తగ్గిస్తుంది. వేసవిలో కడుపు చికాకు, పాదాలలో మంట,  చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడంలో ఇది ప్రభావవంతంగా పని చేస్తుంది. గసగసాల పానీయం శరీరాన్ని చల్లగా ఉంచడమే కాకుండా మనసును కూడా ప్రశాంతపరుస్తుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. "వేసవిలో పిత్తం పెరిగినప్పుడు, గసగసాల పాలు లేదా పానీయం తాగడం వల్ల తక్షణ ఉపశమనం లభిస్తుందట. శాస్త్రీయ కోణం.. శాస్త్రీయ కోణం నుండి చూస్తే, గసగసాలు పోషకాల నిధి. ప్రోటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, జింక్,  ఐరన్ వంటి పోషకాలు వీటిలో పుష్కలంగా లభిస్తాయి. గసగసాలలో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుందని, వేసవిలో వచ్చే కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. గసగసాలలో ఉండే మెగ్నీషియం మంచి నిద్రకు కారణమవుతుందని ఒక పరిశోధన చూపిస్తుంది. ఈ కారణంగానే అమ్మమ్మలు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు వేడి పాలలో గసగసాలు కలిపి పిల్లలకు ఇచ్చేవారు, తద్వారా వారు గాఢమైన,  ప్రశాంతమైన నిద్ర పొందేవారు. గసగసాలలోని ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి,  దాని యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తాయి. వేడి నుండి రక్షించడంలో గసగసాల  అద్భుత లక్షణాల గురించి మాట్లాడుకుంటే..ఇది సూపర్ కూలింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది.  గసగసాల పానీయం  లేదా పాలు తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రించబడుతుంది.  డీహైడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. గసగసాల నీరు కడుపు  pH ని సమతుల్యం చేస్తుంది. ఇది వేసవిలో ఆమ్లతత్వం,  కడుపు చికాకు నుండి ఉపశమనం ఇస్తుంది.  ఆయుర్వేదంలో గసగసాల వాడకం.. గసగసాల నూనెను ఆయుర్వేదంలో నొప్పి నివారిణిగా కూడా ఉపయోగిస్తారు.  ఇది కీళ్ల నొప్పులు,  వాపులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటుంది. గసగసాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి,  మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తాయి. గసగసాలు చర్మానికి కూడా మేలు చేస్తాయి. గసగసాలను పాలతో కలిపి రుబ్బి ముఖానికి రాసుకుంటే చర్మపు చికాకు, మొటిమలు తగ్గుతాయి. గసగసాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చర్మపు మంటను తగ్గించడంలో సహాయపడతాయి.  ఇవి వేసవిలో సూర్య కిరణాల వల్ల కలిగే చర్మ సమస్యలకు కూడా బాగా సహాయపడుతుంది.                                     *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
వేసవిలో గసగసాలతో ఇంత లాభమా..! Publish Date: Apr 24, 2025 9:30AM

కారు స్టీరింగ్ చేతులు మారుతుందా?

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) మరో మూడు రోజుల్లో ( ఏప్రిల్ 27) ఇరవై నాలుగేళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకుని రజతోత్సవ  సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. వరంగల్‌ జిల్లా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను ఘనంగా జరుపుకునేందుకు సిద్దమవుతోంది. ఒక విధంగా ఇదొక అపూర్వ సందర్భం.  అవును పాతికేళ్ళ క్రితం, 2001 ఏప్రిల్‌ 2న జలదృశ్యం (కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం) లో పురుడు పోసుకున్నటీఆర్ఎస్ ఇంత కాలం బతికి బట్టకడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ముఖ్యంగా అప్పటికే  ప్రత్యేక  తెలంగాణ నినాదంతో పుట్టి గిట్టిన పార్టీలు అనేకం ఉన్న నేపధ్యంలో టీఆర్ఎస్ కూడా అంతే  అనుకున్నవారు, అన్నవారు కూడా ఉన్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్ తో పుట్టిన టీఆర్ఎస్  విజయవంతంగా, రాష్ట్రాన్ని సాధించుకోవడమే కాకుండా.. పాతికేళ్ళ ప్రస్థానం పూర్తి చేసుకుంది. రాష్ట్రాన్ని పదేళ్ళు పాలించింది.  ప్రతిపక్ష అనుభవాన్నీ రుచి చూసింది.    నిజానికి, తెలుగు నాట  అనేక పార్టీలు మఖలో పుట్టి పుబ్బలో పోయాయి. అప్పుడే కాదు.. ఇప్పటికి కూడా, పాతికేళ్ళు బతికి బట్ట కట్టిన పార్టీలు రెండే రెండున్నాయి. 1982 లో  నందమూరి తారక రామ రావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ తర్వాత రజతోత్సవం జరుపుకుంటున్న పార్టీ, టీఆర్ఎస్ మాత్రమే బతికి బట్ట కట్టిన పార్టీగా చరిత్ర  పుటల్లో నిలిచింది.  ఈ పాతికేళ్ళలో పార్టీలో చాలా మార్పులు జరిగాయి. 2001లో ఉద్యమ పార్టీగా పుట్టిన టీఆర్ఎస్, 2014లో ఫక్తు రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత 2022లో  భారత రాష్ట్ర సమితిగా(బీఆర్ఎస్) గా  పేరు మార్చుకుని జాతీయ రాజకీయాల్లో కాలు పెట్టింది. అయితే  ఉద్యమ పార్టీ రాజకీయ పార్టీగా, ప్రాతీయ పార్టీ, జాతీయ పార్టీగా  రూపాంతరం చెందినా, అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో కూర్చున్నా  పార్టీ పగ్గాలు మాత్రం చేతులు మారలేదు. వ్యవస్థాపక అధ్యక్షుడు, కల్వకుట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) సారథ్యకలోనే ఇప్పటికీ పార్టీ నడుస్తోంది. ఆయనే పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా డ్యూయల్ రోల్ ప్లే చేస్తున్నారు. రెండు పదవుల్లో కొనసాగుతున్నారు. నిజానికి,ముందు ముందు కూడా ఆయనే కొనసాగుతారు.  అందులో అనుమానం లేదు.  అయితే పదవి ఆయనదే అయినా..  పెత్తనం అయన చేతుల్లో ఎంతవరకూ ఉంటుంది అనేది అనుమానమే అంటున్నారు. ఇప్పటికే చాలావరకు ఫార్మ్ హౌస్ కు పరిమితమైన కేసీఆర్ తిరిగి క్రియాశీల నేతగా జనంలోకి వస్తారా? ముందుండి పార్టీని నడిపిస్తారా? తెర వెనక నుంచి మార్గ ‘దర్శకత్వం’ మాత్రమే చేస్తారా? అంటే.. కేసీఆర్ క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నట్లే అన్న సంకేతాలు స్పష్టంగా వస్తున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  పార్టీ రజతోత్సవ వేడుకలను పురస్కరించుకుని, పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ వివిధ టీవీ చానల్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలను జాగ్రత్తగా గమినిస్తే..  ఏదో ఇలాంటి, ఉత్సవాల్లో దర్శనం ఇవ్వడం వరకే కేసీఆర్ పాత్ర పరిమితం కాబోతోందననే సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. నిజానికి.. కారాణాలు ఏమైనా ఇప్పటికే పార్టీలో కేసీఆర్ పాత్ర చాలా వరకూ కుదించుకు పోయింది. ఇందులో దాపరికం లేదని పార్టీ నాయకులు అంగీకరిస్తున్నారు. మరోవంక కేటీఆర్  అప్రకటిత ఉత్తరాధికారిగా సర్వం తానై చక్రం తిప్పుతున్నారనేది  కళ్ళ ముందున్న సత్యం. అదలా ఉంటే గడచిన రెండుమూడు రోజుల్లో కేటీఆర్  వేర్వేరు టీవీ చాన్నాళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో  కేసీఆర్ ఫ్యూచర్ రోల్ పై మరింత క్లారిటీ ఇచ్చారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. కానీ, పార్టీ రోజువారీ రాజకీయ కార్యకలాపాల్లో కనిపించరు. వినిపించరు. పార్టీ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనరు. తెర వెనక నుంచి మార్గ దర్శకత్వం  మాత్రమే చేస్తారు. తెరపై కనిపించే రోజువారీ రాజకీయ  కార్యకలాపాలన్నీ కేటీఆర్ చూసుకుంటారు.  అలాగే, ప్రతిపక్ష నేతగానూ కేసీఆర్  కొనసాగుతారు, కానీ, అసెంబ్లీకి మాత్రం రారని, కేటీఆర్  ఒకటి రెండు ఇంటర్వ్యూలలో స్పష్టంగానే చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రస్ మంత్రులు చేసే అవమానాలను భరించవసిన అవసరం కేసీఆర్ కు లేదని, అందుకే ఆయన, అసెంబ్లీకి రారని స్పష్టం చేశారు. అంతేకాదు.. గతంలో తమిళనాడులో జయలలిత, ఏపీలో చంద్రబాబు నాయుడు, అధికార పక్షం అవమానాలను భరించలేక సంవత్సరాల తరబడి అసెంబ్లీకి  రాలేదని, అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు కేసీఆర్  కూడా అసెంబ్లీ ముఖం చూడరని కేటీఆర్ స్పష్టం చేశారు.  సో.. ఇక గులాబే బాస్  ఎవరంటే.. తెర వెంక కేసీఆర్,  తెరపై కేటీఆర్ ఆర్  అంటున్నారు.
కారు స్టీరింగ్  చేతులు మారుతుందా? Publish Date: Apr 24, 2025 7:02AM

ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా

జమ్మూకాశ్మీర్ లోని పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు ఖండించారు. దేశ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రత, భద్రత విషయంలో  అందరూ ఏకతాటిపైకి రావాలని పిలుపునిచ్చారు.   అభివృద్ధిలో దూసుకెళ్తున్న భారతదేశాన్ని చూసి ఓర్వలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖ వాసి జె.ఎస్. చంద్రమౌళి భౌతికకాయాన్నిచంద్రబాబు నివాళులర్పించారు. చంద్రమౌళి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు విశాఖ వెళ్లిన ఆయన చంద్రమౌళి భౌతికకాయంపైపై జాతీయ జెండా కప్పారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.  జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దాడి ముందస్తు ప్రణాళిక ప్రకారమే విహారయాత్రకు వెళ్లిన వారిపై విచక్షణారహితంగా దాడులు జరిపారన్నారు. మన రాష్ట్రానికి చెందిన రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగి చంద్రమౌళి, ఐటీ ఉద్యోగి మధుసూధన్ టెర్రరిస్టుల దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు తెలుగువారి   కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.  ఉగ్రవాదులు భారత్ ను ఏం చేయలేరు.. మన దేశంలో  సమర్థనాయకత్వం, సుస్థిర ప్రభుత్వం ఉందన్నారు.  అమెరికా వైస్ ప్రెసిడెంట్ భారత పర్యటనలో ఉండటం, దేశ ప్రధాని విదేశీ పర్యటనలో ఉన్న సమయంలో జరిగిన ఈ దాడి వెనుక కుట్రకోణం ఉందని అనుమానం వ్యక్తం చేశారు.   దేశ సమగ్రత, భద్రతను దెబ్బతీయాలని చూసే వారి ఆటలు సాగవు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి.  జమ్మూ ఉగ్రదాడి నేపథ్యంలో విశాలమైన తీరప్రాంతం ఉన్న మన రాష్ట్ర భద్రత విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. పోలీస్ వ్యవస్థను సమర్ధవంతంగా నడిపిస్తాం. కేంద్రంతో సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తామని చెప్పారు. 
ఉగ్రదాడి.. ఏపీ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు ఎక్స్ గ్రేషియా Publish Date: Apr 24, 2025 6:46AM

ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ

  జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్వంలో జరిగిన భద్రతా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇకపై పాక్ పౌరులను భారత్ లోకి అడుగుపెట్టనివ్వబోమని ప్రకటించింది. ఇప్పటికే ఇక్కడ ఉన్న పాక్ పౌరులు, పర్యటకులు తక్షణమే తమ దేశానికి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. భారత్ జారీ చేసిన ప్రత్యేక వీసాలను రద్దు చేసింది.  పాక్ తో దౌత్య సంబంధాలను పూర్తిగా తెంచుకుంటున్నట్టు ప్రకటించింది. వెంటనే పాక్ హైకమీషనర్ దేశాన్ని వీడాలని సూచించింది. అటారి చెక్ పోస్టును వెంటనే మూసి వేస్తున్నట్టు తెలిపింది. ఇండస్ వాటర్ ఒప్పందాన్ని కూడా నిలిపివేస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు కేబినెట్‌ భద్రతా కమిటీ భేటీలో చర్చించిన అంశాల్ని భారత విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ మీడియాకు వెల్లడించారు.  సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని నిర్ణయించిందన్నారు. ప్రత్యేక వీసాలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు  
ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ సంచలన నిర్ణయం..ఇక వారికి నో ఎంట్రీ Publish Date: Apr 23, 2025 10:06PM

జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన ముగించుకొని కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ముఖ్యమంత్రికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. కాగా మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ సంగారెడ్డికి వెళ్లనున్నారు. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి కూతురు ఎంగేజ్మెంట్‌కు హారయ్యేందుకు ఆయన సంగారెడ్డి వెళ్తున్నట్టు సమాచారం. వారం రోజులు జపాన్ లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం.. అక్కడ పలు పారిశ్రామిక సంస్థలతో రూ.12,062 కోట్ల పెట్టుబడుల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఈనెల 25, 26న హైదరాబాద్ వేదికగా జరగనున్న 'భారత్ సమ్మిట్ ఏర్పాట్లపై రేపు మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.
జపాన్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ Publish Date: Apr 23, 2025 9:35PM

బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కేటీఆర్

    ఏప్రిల్ 27న హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన బీఆర్‌ఎస్ రజతోత్సవ బహిరంగ సభ ఏర్పాట్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరిశీలించారు. పార్టీ నేతలతో కలిసి సభాస్థలిని సందర్శించారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతు బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటివరకు సహకరించిందని, సభ ముగిసే వరకు ఇదే సహకారం అందించాలని జిల్లా యంత్రాంగాన్నికేటీఆర్ కోరారు. ఇది ప్రభుత్వ వ్యతిరేక పోరాట సభ కాదని, కేవలం పార్టీ వార్షికోత్సవాన్ని శాంతియుతంగా జరుపుకుంటున్నామని తెలిపారు. సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని కేసీఆర్ హిమాలయాల స్థాయికి తీసుకెళ్లారని, ప్రజలకు ఏ కష్టం వచ్చినా వారు గులాబీ జెండా వైపే చూస్తున్నారని, బీఆర్ఎస్ ఒక జనతా గ్యారేజ్‌లా మారిందని కేటీఆర్ అన్నారు. వరంగల్ గడ్డపై బీఆర్ఎస్ గతంలో అనేక విజయవంతమైన సభలు నిర్వహించిందని, ఇప్పుడు పార్టీ వార్షికోత్సవ సభకు కూడా ఇదే వేదిక కావడం సంతోషంగా ఉందని కేటీఆర్ పేర్కొన్నారు. సభకు లక్షలాదిగా ప్రజలు తరలివస్తారని అంచనా వేస్తున్నామని, సుమారు 40 వేల వాహనాలకు సరిపడా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. వేసవి దృష్ట్యా 10 లక్షల మంచి నీటి బాటిళ్లు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతామని, వైద్య సేవలకు గాను 100 వైద్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు
బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన కేటీఆర్ Publish Date: Apr 23, 2025 8:57PM

ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ పోలింగ్

  హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా.. సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. 81 మంది కార్పొరేటర్లలో 66 మంది కార్పొరేటర్లు, 31 మంది అఫిషియో సభ్యులలో 21 మంది ఓటు వేశారు. ఓటింగ్ లో బీఆర్ఎస్  మినహా బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ ఓటర్లు తమ ఓటు బక్కు వినియోగించుకున్నారు.  ఎంఐఎం తరఫున మీర్జా రియాజ్ ఉల్ హసన్ ఎఫెండి, బీజేపీ అభ్యర్థిగా గౌతమ్ రావు బరిలో నిలిచారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు చేపడతారు. అయితే బీఆర్ఎస్ పోలింగ్ గు దూరంగా ఉండటం, కాంగ్రెస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంతో ఫలితంపై ఉత్కకంఠ నెలకొంది. ఈ నెల 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కౌంటింగ్ జరుగనుంది. గత 22 ఏళ్లుగా హైదరాబాద్‌ లోకల్ బాడీ ఎన్నికలు ఏకగ్రీవం అవుతూ వస్తోంది. అయితే 22ఏళ్ల తర్వాత తొలిసారిగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగింది
ప్రశాంతంగా ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ  పోలింగ్ Publish Date: Apr 23, 2025 8:32PM

హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే?

  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై నమోదైన పరువు నష్టం కేసును కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణలో ఉన్న ఈ కేసును పూర్తిగా కొట్టివేయాలని ఆయన ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై  బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు తమ పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆరోపిస్తూ ఆయన నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో పరువు నష్టం దావా వేశారు. బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుందని రేవంత్ రెడ్డి ఆ సభలో అన్నారని వెంకటేశ్వర్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ప్రజాప్రతినిధుల కోర్టు, కేసు విచారణ ప్రక్రియను కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే కొందరు సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసింది. రేవంత్ రెడ్డి ప్రసంగానికి సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పింగులను కూడా బీజేపీ నేత కాసం కోర్టుకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, ప్రజాప్రతినిధుల కోర్టులో కొనసాగుతున్న విచారణను నిలిపివేయాలని, తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ  రేవంత్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. 
హైకోర్టులో సీఎం రేవంత్ రెడ్డి పిటిషన్ ఎందుకంటే? Publish Date: Apr 23, 2025 8:10PM

వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు

  నిన్న ఒంగోలులో  హత్య గురైన టీడీపీ నేత మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి భౌతికకాయానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి.. వారిని ఓదార్చి ధైర్యం చెప్పారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఒంగోలులో టీడీపీ కార్యకర్త  వీరయ్య చౌదరి మంగళవారం హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో నాగులుప్పలపాడు మండలంలోని అమ్మనబ్రోలుకు చేరుకున్న ముఖ్యమంత్రి.. వీరయ్య చౌదరి అంత్యక్రియల్లో పాల్గొననున్నారు. సీఎం చంద్రబాబు వెంట మంత్రులు అనిత, ఆనం, డోలా, ఎంపీ మాగుంట, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరం జరగడం జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. బాధ్యులను పట్టుకొని, కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేర రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు.   హత్య జరిగిన నాటి నుంచే ప్రభుత్వం అన్ని కోణాల్లో దర్యాప్తును ప్రారంభించిందని ముఖ్యమంత్రి తెలిపారు. “ఈ కేసు దర్యాప్తుకు 12 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం. సీసీటీవీ ఫుటేజ్, క్లూస్ అన్నింటినీ పరిశీలిస్తున్నామన్నారు. 53 కత్తిపోట్లు ఉన్నట్టు నివేదికల్లో ఉంది. ఇది కరుడు కట్టిన నేరగాళ్ల పన్నుగట్టిన కుట్ర,” అని చెప్పారు. ప్రజల్లో ఎవరికైనా ఈ హత్యకు సంబంధించి సమాచారం ఉంటే, టోల్ ఫ్రీ నంబర్ 9121104784 కు ఫోన్ చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు. హత్య చేసిన నేరగాళ్లు భూమిపై ఎక్కడ దాక్కున్నా వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. ఇలాంటి హత్యా రాజకీయాలు చేసే వ్యక్తులు చివరకు కాలగర్భంలో కలిసిపోతారు. నేర రాజకీయాలను తుదముట్టించే వరకు పోరాటం చేస్తాం. రాష్ట్రం నేరస్థుల అడ్డాగా మారకూడదు అని చంద్రబాబు అన్నారు.
వీరయ్య కుటుంబ సభ్యులకు చంద్రబాబు పరామర్శ..హంతకులను వదిలే ప్రసక్తే లేదు Publish Date: Apr 23, 2025 7:32PM

ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల

  తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ రిలీజ్ చేసింది. మే 22 నుంచి 29వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ప్రథమ ఇంటర్‌, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు ద్వితీయ ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య ఓ ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌ ఒకేషనల్‌ కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు సైతం ఇదే టైం టేబుల్‌ వర్తిస్తుందని స్పష్టం చేశారు. అలాగే, జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రెండు సెషన్లలో ప్రాక్టికల్‌ పరీక్షలు జరుగుతాయన్నారు. జూన్‌ 9న ప్రథమ ఇంటర్‌, 10న ద్వితీయ ఇంటర్‌ విద్యార్థులకు ఇంగ్లిష్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు ఏప్రిల్‌ 30 తుది గడువు అని పేర్కొన్నారు. కాగా నిన్ననే ఇంటర్ రిజల్ట్స్  విడుదల అయిన సంగతి తెలిసిందే
ఇంటర్ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు షెడ్యూల్‌ విడుదల Publish Date: Apr 23, 2025 7:12PM

అఘోరీకి లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం!

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన లేడీ అఘోరీకి చేవెళ్ల కోర్టు బుధవారం (ఏప్రిల్ 23) 14 రోజుల రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఘోరీ తరఫు లాయర్ చీటింగ్ కేసులో లేడీ అఘోరీకి పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీది చీటింగ్ కేసు కావడంతో.. కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో చెప్పలేమన్నారు. బెయిల్ ఎప్పుడు వస్తుందో  కూడా చెప్పలే మన్నారు. చీటింగ్ కేసు రుజువైతే అఘోరీకి పదేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అఘోరీ తరఫున వాదించిన న్యాయవాదే అహోరికి శిక్షపడే అవకాశం ఉందనడం ఆసక్తిగా మారింది.    ఇలా ఉండగా కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి పోలీసులు బుధవారం (ఏప్రిల్ 23) లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు.  అఘోరీకి పోలీసులు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అఘోరీకి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో పోలీసులు కంది సెంట్రల్ జైలుకు తరలించారు. కానీ జైలు అధికారులు లింగ నిర్ధారణ కాకుండా జైలులో ఉంచుకోలేమని తేల్చి చెప్పడంతో పోలీసులు అఘోరీని తిరిగి కోర్టుకు తీసుకువెళ్లారు. దీంతో కోర్టు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్షకు ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు అఘోరీకి లింగ నిర్ధారణ పరీక్స చేయించారు.   
అఘోరీకి  లింగ నిర్థారణ పరీక్ష.. కోర్టు ఆదేశం! Publish Date: Apr 23, 2025 5:48PM

అజ్ణానం.. అజ్ణాతం.. మళ్లీ ప్రత్యక్షం.. అనిల్ కుమార్ యాదవ్ తీరు అయోమయం!

అనీల్ కుమార్ యాదవ్.. పరిచయం అక్కర్లేని పేరు. జగన్ హయాంలో ఓళ్లూపై తెలియకుండా మాట్లాడి, తొడకొట్టి సవాళ్లు విసిరి పాపులర్ అయ్యారు. ప్రత్యర్థులపై నోరెట్టుకుని పడిపోవడమే రాజకీయం అన్నట్లుగా అప్పట్లో ఆయన వ్యవహార శైలి ఉండేది. ఆ తీరు కారణంగానే జగన్ కు దగ్గరయ్యారనీ చెబుతుంటారు. సరే అది పక్కన పెడితే వైసీపీ ఘోర పరాజయం తరువాత అనిల్ కుమార్ యాదవ్ ఎక్కడా కనిపించలేదు. వినిపించలేదు. మౌనంగా మాయమైపోయారు.   వైసీపీ అధికారంలో ఉండగా కన్నూమిన్నూ గానక ఇష్టారీతిగా  తెలుగుదేశం అధినేత చంద్రబాబు పైనోరెట్టుకు పడిపోయిన అనీల్ కుమార్ యాదవ్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. వినిపించడం లేదు. పోలింగ్ జరిగిన తరువాత ఒక సారి మీడియా ముందుకు వచ్చి పోలీసులు, అధికారులు ఏకపక్షంగా తెలుగుదేశం కూటమికి అనుకూలంగా వ్యవహరించారని ఓ ఆరోపణ చేసి ఫలితాలకు ముందే ఓటమి అంగీకరించేశారు.  ఆ తరువాత ఆయన ఇక ఎక్కడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. అయితే  పార్టీ అధికారంలో ఉండగా, తాను మంత్రిపదవి వెలగబెడుతున్న సమయంలో అనీల్ కుమార్ యాదవ్ నెల్లూరు జిల్లా లో సాగించిన దోపిడీ పర్వం అంతా ఇంతా కాదు. నెల్లూరు జిల్లాలో ఖనిజాల దోపిడీ సహా అనేక అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతే కాదు జిల్లాకు చెందిన సీనియర్ నేతలు ఆనం రామనాయారణరెడ్డి, కొటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,  మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వంటి వారు వైసీపీ తీరుతో, జగన్ విధానాలతో విభేదించి  బయటకు వచ్చి తెలుగుదేశం గూటికి చేరారు. వారిని అనీల్ కుమార్ యాదవ్  అనుచితంగా దూషించి వారి రాజకీయ జీవితం ముగిసిపోయందని చెప్పారు. ఒక వేళ వారు రాజకీయాలలో రాణిస్తే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ సవాళ్లు సైతం విసిరారు. ఇప్పుడు తన రాజకీయ జీవితమే సందిగ్ధంలో పడిన నేపథ్యంలో ముఖం చూపలేక చాటేశారు.  విపక్షంలో ఉన్న సమయంలోనే తెలుగుదేశం పార్టీ అనీల్ కుమార్ యాదవ్ అక్రమాలపై జ్యుడీషియల్ విచారణకు డిమాండ్ చేసింది. ఇప్పుడు అధకారంలోకి రాగానే విచారణకు ఆదేశించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. ఇలా ఎలా చూసినా చిక్కుల సుడిగుండంలో చిక్కుకున్న అనీల్ కుమార్ యాదవ్ ఏ కలుగులో దాక్కొన్నా బయటకు లాక్కొచ్చి చట్టం ముందు నిలబెట్టడానికి తెలుగుదేశం శ్రేణులు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తనను తాను కాపాడుకోవడం ఎలాగో తెలియక అనిల్ కుమార్ యాదవ్ అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన పార్టీ మారే అవకాశాలున్నాయంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే అధికారంలో ఉన్న సమయంలో స్థాయి మరిచి.. ఇష్టారీతిగా తెలుగుదేశం, జనసేన అధినాయకులపై అనిల్ కుమార్ చేసిన అనుచిత విమర్శలు, వ్యాఖ్యల కారణంగా ఆ రెండు పార్టీలలోనూ అవకాశం లేకపోయింది. దీంతో అనివార్యంగా ఆయన ఇటు వైసీపీకి దూరమై, అటు మరో పార్టీ అండ లేకుంటే కేసులను తట్టుకోవడం సాధ్యం కాదని భావించి గత్యంతరం లేని పరిస్థితుల్లో మళ్లీ జగన్ పంచన చేరి పబ్బం గడుపుకోవాలన్న నిర్ణయానికి వచ్చారని పరిశీలకులు అంటున్నారు. అందుకు ఉదాహరణగా నిన్న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన పార్టీ సమావేశానికి అనిల్ కుమార్ యాదవ్ హాజరు కావడాన్ని చూపుతున్నారు. మొత్తం మీద అజ్ణానం నుంచి అజ్ణాతంలోకి అక్కడ నుంచి మళ్లీ జగన్ పంచకు చేరిన అనిల్ కుమార్ ప్రస్తతం తన భవిష్యత్ ఏమిటన్న అయోమయంలో ఉన్నట్లుగా కనిపిస్తోందని అంటున్నారు. 
అజ్ణానం.. అజ్ణాతం.. మళ్లీ ప్రత్యక్షం.. అనిల్ కుమార్ యాదవ్ తీరు అయోమయం! Publish Date: Apr 23, 2025 4:56PM

జగన్ మీడియా అసత్య కథనాలపై చింతమనేని నిరసన

  జగన్ మీడియా అసత్య కథనాలపై దెందులూరు ఎమ్మెల్యే  చింతమనేని ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.  తన అనుచరులు, టీడీపీ కార్యకర్తలతో కలిసి ఏలూరు జిల్లా మీడియా కార్యాలయంలో వద్ద  నిరసన చేపట్టారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి  ఆఫీస్‌ ముందు టెంట్ వేసుకోని నిరసన వ్యక్తం చేశారు.  రక్త తర్పణం’ అంటూ బ్లూ మీడియా ప్రచురించింది.  వాస్తవాలు తెలుసుకోకుండా ఏ విధంగా రాస్తారంటూ  రిపోర్టర్‌పై చింతమనేని ఫైర్‌య్యారు. సదరు వ్యక్తి  బ్లేడుతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.   తనపై తప్పుడు వార్తలు రాసినందుకు నిలదీయడానికి మాత్రమే వచ్చానని చింతమనేని వివరణ ఇచ్చారు. వివరాలు తెలుసుకోకుండా వార్తలు రాశారని, తనకి సంబంధం లేకపోయినా తన పేరుని అందులో చేర్చారని చింతమనేని వాపోయారు. ఈ  విషయం తెలుసుకోవటాని తాను  ఆఫీస్ కి వచ్చాని ఆయన అన్నారు. అంతేకానీ తాను అక్కడ ఎలాంటి గొడవ చేయలేదని చింతమనేని క్లారీటీ ఇచ్చారు  
జగన్ మీడియా అసత్య కథనాలపై  చింతమనేని నిరసన Publish Date: Apr 23, 2025 4:43PM

30 వరకూ అనంతపురం జిల్లా జైల్లోనే బోరగడ్డ.. ఎందుకంటే?

బోరుగడ్డ అనిల్   అనంతపురం జైలులోనే ఈ నెల 30 వరకూ ఉంచాలని  మొబైల్ కోర్టు న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. అలాగే ఈ నెల 30 వరకూ బోరుగడ్డ అనిల్ ను రాజమండ్రి తరలించకుండా అనంతపురం జిల్లా జైలులోనే రిటైన్ చేయాలని ఆదేశించారు.  ఇంతకూ ఏం జరిగిందంటే.. బూరగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకు వచ్చారు. చర్చి స్థలం విషయంలో అనంతపురం మూడో పట్టణ సీఐను బెదరించిన కేసులో బోరుగడ్డ అనిల్ ను అనంతపురం తీసుకువచ్చారు. ఈ కేసు విచారించిన మొబైల్ కోర్టు న్యాయమూర్తి విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. తదుపరి విచారణకు సమయం పెద్దగా లేకపోవడంతో ఆయన తిరిగి రాజమహేంద్రవరం తరలించకుండా అనంతపురంలోనే రిటైన్ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించారు. బూరగడ్డ అనిల్   ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ లపై అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేసినలో రాజమహేందరవరం కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  అయితే 2018లో బోరుగడ్డ సీఐని బెదరించిన కేసులో అరెస్టై బెయిలు పొంది విడుదలయ్యారు. అయితే అప్పటి నుంచీ విచారణకు డుమ్మా కొట్టడంతో అనంతపుం మొబైల్ కోర్టు బోరుగడ్డ అనిల్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో బోరుగడ్డ అనిల్ ను రాజమహేంద్రవరం జైలు నుంచి పీటీ వారంట్ పై అనంతపురం తీసుకువచ్చారు.  ఈ కేసు విచారణ ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో అంతవరకూ బోరుగడ్డ అనిల్ ను అనంతపురం జిల్లా జైలులో రిటైన్ చేయాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. దీంతో బోరుగడ్డ అనిల్ అనంతపురం జిల్లా జైలుకు తరలించారు.  ఈ సందర్భంగా బోరుగడ్డ అనిల్ తనను తాను సమర్ధించుకుంటూ తాను బెయిలు కోసం ఎటువంటి దొంగ సర్టిఫికేట్లు సమర్పించలేదని చెప్పుకున్నారు.  
30 వరకూ అనంతపురం జిల్లా జైల్లోనే బోరగడ్డ.. ఎందుకంటే? Publish Date: Apr 23, 2025 4:25PM

ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన

  జమ్మూ కశ్మీర్ పహల్‌గామ్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నేతల నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ మృతులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.  ఉగ్రవాదానికి, పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ధ అమరులను స్మరిస్తూ నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా టీబీజేపీ చీఫ్  కిషన్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గం ఉగ్రదాడిని సభ్య సమాజం తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ఈ దాడి సిగ్గుమాలిన చర్యగా సమాజం చూస్తోందన్నారు.  పాకిస్తాన్ అసమర్థ నాయకత్వానికి ఈ ఘటన పరాకాష్ట అని, ప్రశాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ లో పాక్ నిప్పులు పోస్తోందని మండిపడ్డారు. భారత్ ను దెబ్బతీయాలని పాక్ చూస్తే మూల్యం చెల్లించుకున్నట్లేనన్నారు.ఉగ్రదాడి బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటామన్నారు. దోషులను విడిచిపెట్టే ప్రసక్తే లేదన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఉగ్రదాడికి వ్యతిరేకంగా నిరసనలు చేయాలని బీజేపీ శ్రేణులకు కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు. అన్ని మండలాల్లో బస్తిల్లో ప్రజలు నిరసన తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కె.లక్ష్మణ్, ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, హైదరాబాద్ సెంట్రల్ బీజేపీ అధ్యక్షుడు లంకల దీపక్‌రెడ్డి పాల్గోన్నారు.  
ఉగ్ర దాడికి వ్యతిరేకంగా ట్యాంక్‌బండ్ వద్ద బీజేపీ నేతల నిరసన Publish Date: Apr 23, 2025 4:10PM

గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు

  వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి గుంటూరు పోలీసులు కస్టడిలోకి తీసుకున్నారు. కోర్టు ఇచ్చిన కస్టడీ ఉత్తర్వులను సెంట్రల్ జైలు అధికారులకు  అందించి.. కస్టడీకి తీసుకున్నారు. రెండు రోజుల కస్టడీ కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు నుండి ప్రత్యేక వాహనంలో గోరంట్ల మాధవ్‌ను తీసుకుని ఎస్కార్ట్ సిబ్బంది గుంటూరుకు బయలుదేరి వెళ్లారు. రిమాండ్‌ ఖైదీగా ఉన్న గోరంట్లను ఇవాళ, రేపు గుంటూరు పోలీసులు కస్టడీ తీసుకున్నారు. ‘ఒక యూట్యూబ్‌ చానెల్‌ ఇంటర్వ్యూలో వైఎస్‌ భారతిపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్‌ అనే నిందితుడిని  ఇబ్రహీంపట్నంలో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడనుంచి గుంటూరుకు తరలిస్తుండగా తన అనుచరులతో పోలీస్‌ వాహనాన్ని అనుసరిస్తూ, వారి కస్టడీలో ఉన్న నిందితుడిపై మాజీ ఎంపీ మాధవ్‌ దాడి చేశారు.  పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించి, వారి విధులకు ఆటంకం కలిగించారు. దీంతో గోరంట్ల మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈనెల 10వ తేదీ నుండి గోరంట్ల మాధవ్‌తో పాటు మరో ఐదుగురు రిమాండ్‌లో ఉన్నారు. వీరందరికీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించి.. గుంటూరు పోలీసులకు అప్పగించారు. తిరిగి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి.. నగరంపాలెం పోలీసు స్టేషన్‌కు పోలీసులు తీసుకుని వెళ్లనున్నారు. రెండు రోజుల కస్టడీ అనంతరం గురువారం సాయంత్రం గుంటూరు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అక్కడి నుండి తిరిగి గురువారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు గుంటూరు పోలీసులు తరలించనున్నారు.  
గుంటూరుకు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ తరలింపు Publish Date: Apr 23, 2025 3:19PM

ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా

    జమ్మూ కశ్మీర్‌  పహల్‌గామ్ ఉగ్ర దాడి బాధితులను కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా పరామర్శించారు. తమ ఆప్తులను కోల్పోయిన వారు ఆ ఘటలను అమిత్‌షాతో పంచుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. విహారయాత్రకు వస్తే తమ వారు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారంటూ వారు రోదించారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. బాధితులను ఓదార్చలేక అమిత్‌షా సైతం మౌనంగా ఉండిపోయారు. అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడిలో మృతి చెందిన వారికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం శ్రీనగర్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు హెలికాప్టర్ లో చేరుకున్న అమిత్ షా మృతదేహాల వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. కాల్పుల ఘటన జరిగిన తీరును అమిత్ షా వారిని అడిగి తెలుసుకొన్నారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని వారికి హోం శాఖ మంత్రి  భరోసా ఇచ్చారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టుదని వారికి ఆయన స్పష్టం చేశారు.   కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని తన సౌదీ అరేబియా పర్యటనను కుదించుకొని హుటాహుటిన భారత్‌ చేరుకున్న సంగతి తెలిసిందే. అయితే, తిరుగు పయనంలో ఆయన విమానం పాక్‌ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణించి భారత్ కు చేరుకున్నారు. పాకిస్థాన్‌ నుంచి ముప్పు ఉండొచ్చన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో రూట్‌ మార్చినట్లు సమాచారం. ఢిల్లీకి చేరుకున్న ప్రధాని మోదీ ఎయిర్‌పోర్టులోనే అత్యవసర సమావేశం నిర్వహించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోవల్ లతో భేటీయై ఉగ్రదాడిపై చర్చించారు. భద్రతా చర్యలపై ఆరాతీశారు. మరోవైపు, ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ కమిటీ కూడా నేడు భేటీ కానుంది.ఈ దాడి వెనుక ఉన్న అనుమానిత ఉగ్రవాదుల ఫొటోలతో పాటు వారి స్కెచ్‌లను భద్రతా సంస్థలు విడుదల చేశాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా, అబు తల్హాగా గుర్తించారు.నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ) అనుబంధ సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్‌) సభ్యులే పహల్గామ్‌లోని బైసారన్ లో పర్యాటకులపై కాల్పులు జరిపిన‌ట్లు పేర్కొన్నాయి. కనీసం 5 నుంచి ఆరుగురు ఉగ్రవాదులు కుర్తా-పైజామాలు ధరించి, లోయ చుట్టూ ఉన్న దట్టమైన పైన్ అడవి నుంచి బైసరన్ గడ్డి మైదానానికి వచ్చి ఏకే-47 లతో కాల్పులు జరిపిన‌ట్లు నిర్ధారించాయి. పహల్గాం ఉగ్రదాడిలోని బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం. ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించింది జమ్మూ సర్కార్.
ఉగ్రదాడి బాధితులను పరామర్శించిన హోం మంత్రి అమిత్‌షా Publish Date: Apr 23, 2025 2:48PM

ఏ దేశ మేగినా ఎందు కాలిడినా..

రాహుల్ అమెరికా పర్యటన పై  దుమారం  ఏ దేశ మేగినా, ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం, అన్నారు తెలుగు కవి రాయప్రోలు సుబ్బారావు. కానీ, దేశానికి ముగ్గురు ప్రధానులను ఇచ్చిన, నెహ్రూ గాంధీల కుటుంబం నాలుగో తరం నేత రాహుల్ గాంధీ, అందుకు పూర్తి విరుద్ధంగా ఏదేశం వెళ్ళినా, భారత దేశాన్ని అవమానించడం, అవహేళన చేయడం అలవాటుగా చేసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్నారు.  ఇప్పడు దేశంలో ఆహుల్ గాంధీ అమెరిక పర్యటనలో చేసిన ఆరోపణలు  వివాదాస్పదంగా మారాయి. వివరాల లోకి వెళితే .. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు, రాహుల్ గాంధీ ఎప్పుడు ఏ దేశం వెళ్ళినా.. భారత దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం అలవాటుగా మార్చుకున్నారా? అసలు అందుకోసమే ఆయన తరచూ విదేశాల్లో పర్యటిస్తారా?  అంటే  అవునని, అనుకోవాల్సిన విధంగానే ఆయన నడక, నడత, మాటా ఉంటున్నాయని  విశ్లేషకులు అంటున్నారు. నిజానికి రాజకీయ వర్గాల్లోనే కాదు, సామాన్యు లలోనూ ఇదే  అభిప్రాయం వ్యక్తమవుతోంది.  ఇదనే కాదు.. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు సంబంధించి చాల చాలా సందేహాలున్న మాట నిజం. గతంలో ఆయన చివరకు  కాంగ్రెస్ పార్టీకి అయినా  సరైన  సమాచారం లేకుండా సాగించిన విదేశీ పర్యటనలు వివాదాస్పదం అయ్యాయి. అలాగే, రాహుల్ గాంధీ ఎప్పుడు విదేశాలకు వెళ్ళినా.. ఇక్కడ మన దేశంలో ఎక్కడో అక్కడ  నిన్నటి ‘పహల్గాం’ ఉగ్రదాడి,వంటి అవాంఛిత సంఘటనలు జరుగుతాయనే ఆరోపణలు ఉన్నాయి. నిజానికి రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలకు  పహల్గాం  ఉగ్రదాడి, వంటి సంఘటనలు సంబంధం వుందో లేదో కానీ, అనుమానాలు అయితే ఉన్నాయి.  ఇతర ఆరోపణలు  ఎలా ఉన్న.. రాహుల్ గాంధీ విదేశాల్లో చేస్తున్న, భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శల పట్ల రాజకీయ ప్రత్యర్దులే కాదు, స్వపక్షీయులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేశంలోనే కాదు, విదేశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ..  ముఖ్యంగా నెహ్రూ గాంధీ కుటుంబ అభిమాన పాత్రికేయులు, సైతం రాహుల్ గాంధీ  విదేశాల్లో భారత దేశంపై విమర్శలు చేయడం మంచిది కాదని హిత బోధ చేశారు. అంటే.. రాహుల్ ప్రవర్త దేశానికే కాదు, నెహ్రూ గాంధీ కుటుంబానికి కూడా తలవంపులు తెచ్చేలా ఉందని  అంటున్నారు.  అవును  గతంలో రాహుల్ గాంధీ ఇంగ్లాండ్ లో పర్యటించిన సందర్భంలో, బారతీయ ములాలున్న సీనియర్ జర్నలిస్ట్  ఒకరు, నెహ్రూ,ఇందిరా గాంధీలు విదేశీ గడ్డపై ఏనాడూ భారత దేశానికి వ్యతిరేకంగా ఒక్క ముక్క మాట్లాడ లేదని విలేకరుల సమావేశంలోనే గుర్తు చేశారు. ఎమర్జెన్సీ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా ప్రభుత్వం ఇందిరా గాంధీని అరెస్ట్ చేసింది. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆమె తిరిగి అధికారంలోకి వచ్చారు. ఆ సమయంలో, ఇంగ్లాండ్ లో పర్యటించిన   ఇందిరాగాంధీని పాత్రికేయులు ఆమెను  జైలు  జీవితం గురించి ప్రశ్నించారు. అయితే, ఆమె, ‘నాదేశం గురించి నేను పరాయి దేశంలో తప్పుగా మాట్లాడను. అది నా సంస్కారం కాదు  అని జవాబిచ్చిన సందర్భాన్ని గుర్తు చేసి మరీ రాహుల్ గాంధీకి, ఇది పద్దతి కాదని హిత బోధ చేశారు. అయినా  ఆయన మారలేదు.  నిజానికి  ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ  చేసిన దేశ వ్యతిరేక వ్యాఖ్యలు, విమర్శలు దేశంలో దుమారం రేపుతున్నాయి. ఈ పర్యటనలో భాగంగా భాగంగా బోస్టన్‌ లో జరిగినన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘం పై తీవ్రమైన విమర్శలు చేశారు. ఎప్పుడో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం తన బాధ్యతల నిర్వహణలో రాజీ పడిందని ఆరోపించారు. నిజానికి ఇది ఇప్పడు కొత్తగా చేసిన ఆరోపణ కాదు. గతంలోనూ. ముంబైలో ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియ సూలే, శివసేన(యుబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ తో కలిసి ఇవే ఆరోపణలు చేశారు. అదే సమయంలో కేంద్ర ఎన్నికల సంఘం వివిరణ ఇచ్చింది. నిజానికి  రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో నిజం ఉంటే కోర్టును ఆశ్రయించవచ్చని, అప్పట్లోనే మహా రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్  సవాల్ విసిరారు. అయితే, రాహుల్ గాంధీ మాత్రం కోర్టులో కేసు వేసే సాహసం చేయలేదు.  నిజానికి, రాహుల్ గాంధీ కేంద్ర ఎన్నికల సంఘాన్ని విమర్శించడం తప్పు కాదు, కానీ, విదేశాలకు వెళ్లి.. అక్కడ భారత రాజ్యాంగ వ్యవస్థలపై తీవ్ర ఆరోపణలు చేయడం తప్పు మాత్రమే కాదు నేరం కూడా అవుతుందని అంటున్నారు. అయితే.. రాహుల్ గాంధీ, దేశంలో అయినా విదేశాల్లో అయినా ఆరోపణలు చేయడమే కానీ వాటిని నిరూపించే ప్రయత్నం ఏనాడు చేయలేదు.  నిజానికి.. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్  భారత ఎన్నికల వ్యవస్థను ఎంతగానో మెచ్చుకున్నారు. గోల్డ్ స్టాండర్డ్,    సర్వోత్తమం అని అభివర్ణించారు. డోనాల్డ్ ట్రంప్ మాటల్లోనే చెప్పుకోవాలంటే,’ Indian election system is most transparent, secure and most efficient system in the world, it is time we learn from it’ అన్నారు. అయితే.. అదే అమెరికాలో, ప్రతిపక్ష నేత హోదాలో ఆ దేశంలో పర్యటిస్తున్న కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ భారత ఎన్నికల వ్యవస్థపై చాల తీవ్రమైన ఆరోపణలు చేశారు, మహారాష్ట్ర ఎన్నికల్లో ఆ రాష్ట్రంలో ఓటు వేసే వయసున్న మొత్తం వ్యక్తుల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లు పోలయ్యాయని ఆరోపించారు.  పోలింగ్ రోజు చివరి రెండు గంటల్లో 65 లక్షల మంది ఓటు వేసారని..  అది అసాధ్యమని.. గంటలు,  నిముషాల లెక్కలు చెప్పారు. ఎన్నికల సంఘం తన బాధ్యతల  నిర్వహణలో రాజీ పడిపోయిందని, అంతే కాక వ్యవస్థలోనే ఏదో లోపముందని కూడా తెలుస్తోందని అమెరికాలో ఆరోపించారు. నిజానికి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లో ఏమాత్రం నిజం లేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల  పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు 6.40 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సగటున గంటకు 58 లక్షల మంది ఓటు వేశారు. ఈ సరళి ప్రకారం చూస్తే చివరి రెండు గంటలల్లో సుమారుగా 1.16 కోట్ల మంది ఓటు వేసి ఉండాలి. కానీ ఈ  రెండు గంటల్లో, రాహుల్ గాంధీనే  65 లక్షల మంది  ఓటు హక్కు వినియోగించుకున్నారని, అంటే సగటు ఓటింగ్ సరళి కంటే చివరి రెండు గంటల్లో పోలింగ్ తగ్గిందని  ఎన్నికల సంఘం వివరణ ఇచ్చింది.   అయినా సరే.. రాహుల్ గాంధీకి ఎన్నిక సంఘం పై విశ్వాసం లేక పొతే, దేశంలో కోర్టులున్నాయి, చట్టాలున్నాయి. ఆయన నిత్యం చేతిలో పట్టుకు తిరగే రాజ్యాంగం వుంది. కానీ, ఇవేవీ కాదని అమెరికాలో భారత రాజ్యాంగ వ్యవస్థలపై విమర్శలు చేయడం ఏమిటి? ఎవరి కోసం.. బీజేపీ ఆరోపిస్తున్నట్లుగా, మన దేశానికీ వ్యతిరేకంగా. అంతర్జాతీయ స్థాయిలో కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు ఎదురుకుంటున్న అంతర్జాతీయ కుట్ర దారు జార్జ్ సోరోస్  కోసమా ?  లేక మెడకు చుట్టుకుంటున్ననేషనల్ హెరాల్డ్ ఉచ్చు నుంచి దృష్టి మరల్చేందు కోసమా ? ఎందుకు?
ఏ దేశ మేగినా ఎందు కాలిడినా.. Publish Date: Apr 23, 2025 2:47PM

ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి కేటాయించబోయే రాజ్యసభ స్థానం నుంచి.. పార్లమెంటులో అడుగుపెట్టబోయే అదృష్టవంతుడెవరో దాదాపుగా తేలిపోయిందంటున్నారు. వైసీపీ మాజీ నేత విజయసాయి రెడ్డి రాజీనా మాతో ఖాళీ అయిన ఎంపీ సీటుని.. బీజేపీకి వదిలేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారన్న ప్రచా రం జరుగుతోంది. దాంతో ఆ లక్కీ ఛాన్స్ ఎవరికి దక్కుతుందని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తరుణంలో అనూహ్యంగా తమిళనాడు బీజేపీ నేత అన్నామలై పేరు తెరమీదకు వచ్చింది. దీంతో మొత్తం లెక్కే మారిపోయిందంటున్నారు. తాజాగా ఏపీలో మరో ఉప ఎన్నికకు నోటిఫికేషన్ రిలీజైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. వైసీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే.. మోపిదేవి వెంకటరమణ, బీదమస్తాన్ రావు, ఆర్.కృష్ణయ్య వైసీపీతో పాటు తమ రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. దాంతో.. ఖాళీ అయిన 3 స్థానాల్లో టీడీపీ నుంచి బీద మస్తాన్ రావుకు మళ్లీ చాన్స్ ఇచ్చారు. మోపిదేవి స్థానాన్ని సానా సతీశ్‌తో భర్తీ చేయగా, ఆర్.కృష్ణయ్యను బీజేపీ తరఫున రాజ్యసభకు పంపారు. ఇప్పుడు.. విజయసాయిరెడ్డి రాజీనామాతో మరో ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే.. ఈ స్థానాన్ని బీజేపీకి కేటాయించారన్న ప్రచారంతో.. ఏపీ నుంచి ఎవరిని రాజ్యసభకు ఎంపిక చేస్తారనే దానిపై జోరుగా చర్చ నడుస్తోంది. ఇటు ఏపీ బీజేపీలోనూ రాజ్యసభ స్థానానికి ఎంపికయ్యే అదృష్టవంతుడు ఎవరనే దానిపై హాట్ డిబేట్ మొదలైంది. రాజ్యసభలో అడుగుపెట్టేందుకు.. ఏపీ బీజేపీ నేతలు పలువురు తహతహలాడుతున్నారట. ముఖ్యంగా.. మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌తో పాటు రాజ్యసభ మాజీ  ఎంపీ జీవీఎల్ నరసింహరావు లాంటి వారితో పాటు కొందరి పేర్లు వినపడుతున్నాయ్. కానీ.. అధిష్టానం ఆలోచన మాత్రం మరోలా ఉందనే వార్తలు వినిపిస్తున్నాయ్. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాన్ని.. ఇతర రాష్ట్రాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కాషాయ పెద్దలు భావిస్తున్నారంట. త్వరలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందనే సంకేతాలను దృష్టిలో పెట్టుకొని.. ఈ రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ఖరారు చేస్తారనే చర్చ నడుస్తోంది. కేంద్ర కేబినెట్‌లో చేరే ఇతర రాష్ట్రాల నాయకులను ఏపీ నుంచి రాజ్యసభకు పంపే అవకాశాలున్నాయని ఢిల్లీ నుంచి సిగ్నల్స్ అందుతు న్నాయట. 2014-19 మధ్యలో.. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు ఉన్నప్పుడు.. కేంద్రమంత్రి సురేశ్ ప్రభుకు ఏపీ నుంచి చాన్స్ ఇచ్చారు. ఇప్పుడు,  తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై పేరు బలంగా వినిపిస్తోంది.  వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపే చాన్స్ ఉందట. అన్నామలైని పెద్దల సభకు పంపి.. కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటే, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ- అన్నాడీఎంకే కూటమి బలం పెరుగు తుందనేది బీజేపీ నేతల అంచనా. అధ్యక్ష పదవి పూర్తయ్యాక అన్నామలైకి ఎంపీగా అవకాశం ఇస్తామని అధిష్టానం హామీ కూడా ఇచ్చిందంట.  2024 లోక్‌సభ ఎన్నికల్లో, నారా లోకేశ్ కూడా కోయంబత్తూరులో అన్నామలై తరఫున ప్రచారం చేశారు. ఆ క్రమంలో విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో.. ఆంధ్రా నుంచి అన్నామలై రాజ్యసభకు వెళ్లే అవకాశాలు ఉన్నాయంటు న్నారు.  మరోవైపు, బీజేపీలో సీనియర్ మహిళా నేత, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పేరు కూడా వినిపి స్తోందనే ప్రచారం సాగుతోంది. గత ఎన్నికల్లో ఆమె.. అమేథీలో రాహుల్ గాంధీపై పోటీ చేసి ఓడి పోయారు. స్మృతీ ఇరానీ లాంటి మహిళా నేతలను కేంద్ర కేబినెట్‌లోకి తీసుకుంటే.. పార్లమెంట్‌లో బీజేపీకి బలమైన వాయిస్ ఉంటుందనే ఆలోచన కూడా అధిష్టానం చేస్తోందట. దాంతో.. వీళ్లిద్దరిలో ఎవరో ఒకరు.. ఏపీ నుంచి రాజ్యసభ ఎంపీగా వెళతారని.. రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఏపీ  నుంచి రాజ్యసభకు అన్నామలై.. బీజేపీ తమిళ రాజకీయం Publish Date: Apr 23, 2025 2:24PM

బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్!

మొన్నటిదాకా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి ఏకగ్రీవం అయిపోతారనుకున్నారు. అక్కడ వాళ్లకున్న బలం అలాంటిది. కానీ.. ఎప్పుడైతే బీజేపీ తమ అభ్యర్థిని బరిలోకి దించిందో.. అప్పుడు ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికల్లో.. ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి మొత్తంగా 112 మంది ఓటర్లు ఉన్నారు. పార్టీల వారీగా చూసుకుంటే.. ఎంఐఎంకి ఓ ఎంపీ, ఓ ఎమ్మెల్సీ, ఏడుగురు ఎమ్మెల్యేలు ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. వారితో పాటు 40 మంది కార్పొరేటర్లు ఉన్నారు. దాంతో.. ఎంఐఎం బలం 49కి చేరింది. ఎన్నిక ఏకగ్రీవం కాకుండా బరిలో దిగిన బీజేపీకి.. నలుగురు ఎంపీలు, ఓ ఎమ్మెల్యే, ఓ ఎమ్మెల్సీ ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఉన్నారు. అలాగే.. బీజేపీలో గెలిచి పార్టీ మారిన కొందరు కార్పొరేటర్లని మినహాయిస్తే.. మరో 19 మంది కార్పొరేటర్లతో కలిపి 25 మంది ఓటర్లు ఉన్నారు. కానీ.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలంటే 57 ఓట్లు దక్కించుకోవాలి. కాబట్టి.. ఎంఐఎం అయినా, బీజేపీ అయినా.. ఇతర పార్టీల ఓటర్లపై ఆధారపడటం తప్ప మరో అవకాశం లేదు. ఎంఐఎంకు మిత్రపక్షంగా కొనసాగుతున్న అధికార కాంగ్రెస్ పార్టీలో.. ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారితో కలిపి.. ఏడుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు, మరో ఏడుగురు కార్పొరేటర్లతో కలిపి.. మొత్తం 14 మంది ఓటర్లు ఉన్నారు. పోటీలో లేని బీఆర్ఎస్ దగ్గర పార్టీ ఫిరాయించిన వారు మినహా 9 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులు, 15 మంది కార్పొరేటర్లతో కలిపి  24 మంది ఓటర్లు ఉన్నారు. అందువల్ల.. పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల ఓటర్లను కలిసి వారి ఓట్లను దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేసింది  బీజేపీ. అయితే అక్కడే బీఆర్ఎస్ ఊహించని విధంగా షాక్ ఇచ్చింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌లో పాల్గొనొద్దని.. తమ కార్పొరేటర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యులను ఆదేశిస్తూ విప్ జారీ చేసింది. బీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీలోఉన్న కార్పొరేటర్లను ఏదో రకంగా తమవైపు తిప్పుకోవాలనుకున్న బీజేపీ లెక్కలకు.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం పెద్ద దెబ్బేననే చర్చ జరుగుతోంది. మరోవైపు.. బీఆర్ఎస్ కూడా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు. ఎందుకంటే గులాబీపార్టీకి ఇప్పుడు ఎంఐఎంతో మిత్రుత్వం లేదు. బీజేపీతో తమకు అసలే పడదని బీఆర్ఎస్ నేతలు చెబుతుం టారు. ఇలాంటి పరిస్థితుల్లో.. బీఆర్ఎస్ నేతలు పోలింగ్‌లో పాల్గొంటే అటు ఎంఐఎం గెలిచినా, ఇటు బీజేపీ గెలిచినా బద్నాం అయ్యేది మాత్రం బీఆర్ఎస్సే. మజ్లిస్ పార్టీ గెలిస్తే.. ఇంకా కారు స్టీరింగ్ ఎంఐఎం చేతిలోనే ఉందని బీజేపీ ఆరోపిస్తుంది. అదే బీజేపీ గెలిస్తే కారు, కమలం ఒకటేనని కాంగ్రెస్ వాయించేస్తుంది.   అందుకే పోలింగ్‌కు దూరంగా ఉంటే.. రాజకీయంగా ఎలాంటి బాధ ఉండదనే ఆలోచ నతోనే బీఆర్ఎస్ ఈ నిర్ణయం తీసుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ఏదేమైనా.. బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయం ఎంఐఎంని సునాయాసంగా గట్టెక్కేలా చేసిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
బీఆర్ఎస్ గ్రేట్ ఎస్కేప్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు లైన్ క్లియర్! Publish Date: Apr 23, 2025 12:43PM