political-news-img

నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి : సీఎం చంద్రబాబు

ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫేజ్-1లో భాగంగా మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లోని నాలుగు మెడికల్ కాలేజీల పనులు వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్-2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇక 7 ప్రధాన అంశాలతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్‌మెంట్ పాలసీ 2026-31ను త్వరలో తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈ పాలసీలో మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడ్‌టెక్ ఉత్పత్తులు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద సమగ్ర వెల్నెస్ సదుపాయాలు, స్కిల్లింగ్ అభివృద్ధి, అమరావతి-వీఈఆర్ ప్రాంతాల్లో మెడిసిటీలు ఏర్పాటు వంటి అంశాలు ఉండనున్నాయి. అమరావతిలో నేచరోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని సీఎం సూచించారు. బుధవారం సచివాలయంలో సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్‌పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య, ఆర్థిక, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు, కార్మిక, మహిళా-శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి పైగా సేవలు ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్‌పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పబ్లిక్ హెల్త్ డేటాను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు అందించగా, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేసి, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేసినా, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమర్థంగా పనిచేయకపోతే ఫలితాలు రావని సీఎం పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై అవగాహన పెంపు అవసరమని, అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. సంతానోత్పత్తిలో చిట్టచివరన విశాఖ జిల్లా జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటు 2.1 నుంచి 1.5కి తగ్గిందని, అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఉండగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 1.32 నమోదైందని అధికారులు తెలిపారు. ఫెర్టిలిటీ రేటును 2.1 లక్ష్యానికి తీసుకెళ్లాలని, ప్రస్తుతం లక్ష్యానికి 6 శాతం తక్కువగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు. “తల్లికి వందనం” కార్యక్రమం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్‌లో భాగమేనని ఆయన తెలిపారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమని, మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరణను నియంత్రించాలని సూచించారు. ఉమ్మడి, పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పోషకాహారం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, సమతుల్య ఆహారం, ప్రివెంటివ్ హెల్త్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు వారి ఆరోగ్య రికార్డుల ఆధారంగా డైట్ ప్లాన్, పోషకాహారం అందించే విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Publish Date: Apr 22, 2026 5:20PM

political-news-img

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు బెయిలు రద్దు?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ హత్య కేసులో పీకల్లోతు కష్టాల్లో ఉన్న అనంతబాబు.. తాజాగా సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు. సాక్షులను భయపెట్టి, డబ్బు ఆశ చూపి తన వైపు తిప్పుకునేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడమే కాకుండా.. ఇప్పుడు ఆ ప్రయత్నం ఆయన బెయిల్ రద్దుకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ కేసు వివరాల్లోకి వెళ్తే.. గతంలో తన వద్ద డ్రైవర్‌గా పనిచేసిన సుబ్రహ్మణ్యంను హత్య చేసినట్లు అనంతబాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. అయితే ఈ నెల 24, 25 తేదీల్లో కోర్టులో నిందితులపై నేరాభియోగాల నమోదు ప్రక్రియ జరగనుంది. ఈ తరుణంలో సాక్షులు ఇచ్చే వాంగ్మూలం కేసు గమనాన్ని మార్చే అవకాశం ఉండటంతో.. వారిని ప్రలోభపెట్టేందుకు అనంతబాబు ప్రయత్నించారు. నలుగురు కీలక సాక్షులను ఒక అపార్ట్‌మెంట్‌లో బంధించి, ఒక్కొక్కరికి లక్షలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. సాక్షులను నిర్బంధించిన అనంతబాబు, వారికి ముందస్తుగా లక్ష నగదు అందజేసినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టులో తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే మరో 2 లక్షలు ఇస్తాననీ, లేకుంటే చంపేస్తానీని వారిని బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత రహస్యంగా సాగుతున్న ఈ వ్యవహారంపై పోలీసులకు ముందస్తు సమాచారం అందడంతో వారు ఆ అపార్ట్‌మెంట్‌పై దాడి చేశారు. పోలీసుల రాకను గమనించిన అనంతబాబు తన గన్‌మెన్లను, కారును అక్కడే వదిలేసి బైక్‌పై పరారయ్యారు. పోలీసుల ప్రాథమిక విచారణలో సాక్షులపై ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవమని తేలింది. ఈ మేరకు అనంతబాబుతో పాటు ఆయన అనుచరుడు, వైసీపీ బీసీ సెల్ నేత మాగంటి రాంబాబుపై కొత్తగా కేసు నమోదు చేశారు. రాంబాబును ఇప్పటికే అదుపులోకి తీసుకోగా.. పరారీలో ఉన్న అనంతబాబు కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. గతంలోనే సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తే బెయిల్ రద్దు చేస్తామని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి ఉండటంతో, ఇప్పుడు అనంతబాబు బెయిలు రద్దు కావడం, మళ్ళీ జైలుకు వెళ్లడం ఖాయమని న్యాయ నిపుణులు అంటున్నారు. ఈ కేసులో అనంతబాబు భార్య లక్ష్మీ దుర్గ పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆమెను ఇప్పటికే సుదీర్ఘంగా విచారించిన పోలీసులు, తాజా పరిణామాల నేపథ్యంలో ఆమె స్టేట్‌మెంట్‌ను కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు బాధితుడు సుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు తమకు న్యాయం చేయాలని, నిందితుడు సాక్షులను బెదిరిస్తున్నాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న అనంతబాబు ఎక్కడ ఉన్నారనే దానిపై పోలీసులు టెక్నికల్ డేటా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. సాక్షుల నిర్బంధం, లంచం ఆశ చూపడం వంటి బలమైన ఆధారాలు దొరకడంతో.. ఈసారి ఆయనకు కోర్టు నుండి ఉపశమనం లభించడం కష్టమని పరిశీలకులు అంటున్నారు.

Publish Date: Apr 22, 2026 5:10PM

political-news-img

ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజులకే జీతాలు...ఎక్కడంటే!

నేపాల్ ప్రభుత్వం తన ప్రభుత్వ ఉద్యోగుల వేతన చెల్లింపు విధానంలో సంచలనాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. దశాబ్దాలుగా పాటిస్తున్న నెలవారీ జీతాల పద్ధతిని పక్కన పెట్టి, ఇకపై పక్షం రోజుల వ్యవధిలోనే వేతనాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ కొత్త విధానం ప్రకారం, ఉద్యోగుల నెలవారీ వేతనాన్ని ప్రభుత్వం రెండు సమాన భాగాలుగా విభజిస్తుంది. ప్రతి 15 రోజులకోసారి సగం జీతాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. ఈ మార్పు తక్షణమే అమల్లోకి రానుంది. దేశ ఆర్థిక వ్యవస్థలో నగదు చలామణిని పెంచడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు ఉద్దేశమని నేపాల్ అధికారులు వెల్లడించారు. నెలాఖరు వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా, పక్షం రోజులకే నగదు చేతికి అందుతుండటం వల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. సకాలంలో నగదు ప్రజల చేతుల్లో ఉండటం వల్ల మార్కెట్లో వ్యాపార లావాదేవీలు పుంజుకుంటాయని, ఇది నేరుగా దేశ ఆర్థిక వృద్ధికి దోహదపడుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా, ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ తరహా చెల్లింపు విధానాలు ఇప్పటికే అమలులో ఉన్నాయి. నేపాల్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్థిక రంగాన్ని బలోపేతం చేసేందుకు ఇది సరైన వ్యూహమని కొందరు అంటుండగా, జీతాల విభజనతో దైనందిన ఆర్థిక ప్రణాళికల్లో మార్పులు చేసుకోవాల్సి వస్తుందని మరికొందరు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. అయితే, ఈ ప్రయోగం నేపాల్ ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నేపాల్‌లో ఈ విధానం గనుక విజయవంతమైతే, ఆర్థికంగా వెనుకబడిన ఇతర దేశాలకు ఇది ఒక దిశా నిర్దేశకంలా మారే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ పద్ధతి వల్ల ద్రవ్యోల్బణం, పొదుపు అలవాట్లు మరియు మార్కెట్ డిమాండ్‌పై ఎలాంటి ప్రభావం పడుతుందనేది చూడాలి. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వస్తున్న స్పందనను బట్టి అధికారులు భవిష్యత్తులో తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

Publish Date: Apr 22, 2026 4:50PM

political-news-img

వెండితెరకెక్కనున్న దార్శనికుడి కథ.. చంద్రబాబు బయోపిక్‌కు రంగం సిద్ధం!

ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై చెరగని ముద్ర వేసిన అగ్రనేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవితం త్వరలో వెండితెరపై ఆవిష్కృతం కానుంది. దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ఆయన ప్రయాణాన్ని బయోపిక్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు మొదలయ్యాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి ముహూర్తం కూడా ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం. తన రాజకీయ చతురతతో, దార్శనికతతో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించిన ఒక విజనరీ లీడర్ చంద్రబాబు కథను సెల్యులాయిడ్ పై చూడటం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గతంలో రాజధాని ఫైల్స్ వంటి సెన్సేషనల్ మూవీతో అమరావతి రైతుల ఆవేదనను, రాజధాని ఆవశ్యకతను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు భాను చంద్రబాబు బయోపిక్ కు దర్శకత్వం వహించనున్నాయి. చంద్రబాబు నాయుడు జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన సాగించిన పోరాటాలను కళ్లకు కట్టినట్లు చూపించేందుకు భాను సిద్ధమవుతున్నారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన తీరును ఈ చిత్రంలో ప్రధానంగా చూపించనున్నారు. చంద్రబాబు నాయుడు ప్రస్థానం దేశంలోని ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని చంద్రబాబు బయోపిక్ దర్శకుడు భాను పేర్కొన్నారు. ఆయన తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ప్రజాక్షేమం, ప్రతి ఆలోచన వెనుక భావితరాల భవిష్యత్తు ఉంటుందన్న ఆయన.. నిత్యకృషివలుడైన నాయకుడి జీవితంలో ఉండే ఉద్వేగాలు, సంఘర్షణలు, విజయాలను ఈ బయోపిక్ ద్వారా ప్రపం కళ్లకు కట్టనున్నట్లు చెప్పారు. నిఘంటువులోని ప్రతి పదానికి అర్థం ఉన్నట్లే, ఆయన వేసిన ప్రతి అడుగులో ఒక గొప్ప చరిత్ర ఉందని భాను అన్నారు. ఈ చిత్రాన్ని కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం చేయకుండా పాన్ వరల్డ్' రేంజ్ లో నిర్మించేందుకు ప్లాన్ చేస్తున్నారు. వివిధ దేశాల్లోనూ చంద్రబాబుకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని భారీ బడ్జెట్‌తో, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ముఖ్యంగా విదేశీ భాషల్లో కూడా ఈ చిత్రాన్ని అనువదించి విడుదల చేసే యోచనలో ఉన్నారు. చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయేలా ఈ మూవీని తీర్చిదిద్దాలని చిత్ర బృందం కంకణం కట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నటీనటుల ఎంపిక ప్రక్రియ సాగుతోంది. భారీ తారాగణంతో పాటు ఇండస్ట్రీలోని ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రంలో భాగస్వామ్యం కానున్నారు. చంద్రబాబు పాత్రను ఎవరు పోషిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. రాజకీయ బయోపిక్‌లు టాలీవుడ్‌లో కొత్త కాకపోయినా, చంద్రబాబు వంటి సమకాలీన రాజకీయ దిగ్గజం కథను భాను వంటి దర్శకుడు హ్యాండిల్ చేయడంతో ఈ చిత్రంపై సర్వత్రా ఆసక్తి వ్యక్తమౌతోంది. రాజధాని ఫైల్స్ చిత్రంలో అమరాతి రైతుల బాధలను కళ్లకు కట్టినట్లు ఆవిష్కరించిన దర్శకుడు భాను.. చంద్రబాబు బయోపిక్ ను మరింత ప్రతిభావంతంగా, ప్రభావమంతంగా చూపుతారన్న అంచనాలు ఉన్నాయి. చంద్రబాబు బయోపిక్ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

Publish Date: Apr 22, 2026 4:24PM

political-news-img

నాదెండ్ల భాస్కరరావు జీవిత చరిత్ర

నాదెండ్ల భాస్కరరావు 1935 జూన్ 23న పిచ్చయ్య, వెంకాయమ్మ దంపతులకు గుంటూరు జిల్లా తెనాలి డివిజన్‌లోని దోసేపూడి గ్రామంలో జన్మించారు. బాల్యం మొత్తం అక్కడే గడిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఆయన చదువులో రాణించారు. చిన్ననాటి నుంచే దేశభక్తి భావాలు కలిగిన వ్యక్తిగా ఎదిగిన భాస్కరరావుపై చదువుకునే రోజులలోనే రాజకీయాల ప్రభావం ఎక్కువగా ఉండేది. సమకాలీన రాజకీయాలు, సమాజంలోని పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉండేవారు. హైదరాబాద్‌లో బీఏ పూర్తిచేసి, అక్కడే ఈవెనింగ్ లా కాలేజీలో బి.ఎల్. (LLB) పట్టా పొందారు. అనంతరం న్యాయవాదిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. 1959లో లలితని వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. న్యాయవాదిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మంచి పేరు సంపాదించిన ఆయన, అదే సమయంలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరి, అనంతరం ఇందిరా కాంగ్రెస్‌లో ఏపీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. 1978లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1978 నుండి 1989 వరకు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. 1984 ఆగస్టు 16 నుండి సెప్టెంబర్ 16 వరకు ఒక నెలపాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా సేవలందించారు. మర్రి చెన్నారెడ్డి, టి. అంజయ్య మంత్రివర్గాల్లో కూడా పనిచేశారు. 1998లో ఖమ్మం నియోజకవర్గం నుండి 12వ లోక్‌సభకు ఎంపీగా ఎన్నికయ్యారు. 1982 మార్చి 29న నందమూరి తారక రామారావు తెలుగు దేశం పార్టీని స్థాపించగా, 1983 ఎన్నికల్లో ఆ పార్టీ ఘన విజయం సాధించింది. ఎన్టీఆర్ ప్రభుత్వంలో నాదెండ్ల ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. భాస్కరరావుకి ఇద్దరు కుమారులు నాదెండ్ల మురళీ, నాదెండ్ల మనోహర్. చిన్న కుమారుడు నాదెండ్ల మనోహర్ 2004లో తెనాలి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్‌గా, 2011 నుండి 2014 వరకు చివరి శాసనసభ స్పీకర్‌గా సేవలందించారు. తరువాత 2018లో కొణిదెల పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో చేరి, పార్టీ పీఏసీ చైర్మన్‌గా పనిచేశారు. 2024లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి జనసేన పార్టీ తరఫున గెలిచి, ప్రస్తుతం రాష్ట్ర పౌర సరఫరాలు, ఆహారం, వినియోగదారుల వ్యవహారాల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏలూరు జిల్లాకు ఇన్‌చార్జ్ మంత్రిగా ఉన్నారు.

Publish Date: Apr 22, 2026 4:22PM

political-news-img

హనీమూన్ తర్వాత కొత్త జంటలకు అర్థమయ్యే చేదు నిజాలు ఇవే!

పెళ్లి... ఎన్నో రొమాంటిక్ ఆలోచనలను గుర్తుకు తెచ్చే ఒక అందమైన పదం. బయటకు వెళ్లడం, లాంగ్ డ్రైవ్‌లకు వెళ్లడం, ఖరీదైన బహుమతులు ఇచ్చుకోవడం.. వీటితో పాటు కాస్త ఆర్థికంగా బాగున్నవారైతే.. హనీమూన్ కు కూడా వెళ్తారు. పెళ్లయిన మొదట్లో.. కొన్ని నెలలు ఎంతో అద్బులంలా.. అంతా పరిపూర్ణంగా, సంతోషంగా ఉన్నట్లు అనిపిస్తుంది. కానీ హనీమూన్ అయిపోయాక లేదా పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత.. అసలైన లైఫ్ మొదలవుతుంది. ఇక్కడే అందరూ ఊహించుకునే పెళ్లి జీవితానికి, వాస్తవానికి మధ్య చాలా తేడా ఉందని తెలుసుకుంటారు. అసలు అంగీకరించలేని ఎన్నో విషయాలు బయటపడుతుంటాయి, ఊహించుకున్న జీవితం చాలా రివర్స్ గా, డిజప్పాయింట్ గా అనిపిస్తుంది. పెళ్లి తర్వాత అర్థమయ్యే చేదు నిజాలు కొన్ని ఉన్నాయి. పెళ్ళి తర్వాత జీవితం గురించి కలలు కనే ప్రతి ఒక్కరూ, పెళ్లి తర్వాత జీవితాన్ని సినిమాటిక్ గా ఊహించుకునే ప్రతి ఒక్కరూ ఆ చేదు నిజాలను తెలుసుకోవాలి. దీని వల్ల పెళ్లి తర్వాత వారు డిజప్పాయింట్ అయ్యే పరిస్థితి ఎదురవ్వదు. ఆ చేదు నిజాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రేమ అంటే.. పెళ్లికి ముందు, పెళ్లి తర్వాత కొన్ని రోజుల పాటు ప్రేమ అంటే ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ, పొగడ్తలు చెప్పుకోవడమే అనుకుంటారు. నిజానికి చాలామందికి మొదట్లో అవే జరుగుతుంటాయి. కానీ పెళ్లైన రెండు మూడు నెలల తర్వాత సాధారణ జీవితానికి తిరిగి వచ్చినప్పుడు, ప్రేమలో సరుకులు కొనడం, కరెంటు బిల్లు కట్టడం, బాధ్యతలు పంచుకోవడం కూడా ఉంటాయని మీరు గ్రహిస్తారు. బయటకు వెళ్లి క్యాండిల్ లైట్ డిన్నర్ చేయాలని అనుకునేవారు.. పెళ్లైన కొన్ని నెలల తర్వాత.. ఈరోజు రాత్రి భోజనానికి ఏం వండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. పెళ్లి తర్వాత ప్రేమ అంటే కేవలం బెడ్ రూమ్ ముచ్చట కాదు.. అది ఇద్దరూ కలిసి బాధ్యతలు పంచుకోవడంలో కూడా ఉంటుంది. పర్పెక్ట్ లైఫ్ పార్టనర్.. పెళ్లికి ముందు కేవలం మాట్లాడుకుంటూ ఉండటం వల్ల తమకు బెస్ట్ పార్ట్నర్ లభించారని అనుకుంటారు. కానీ పెళ్ళి తర్వాత ఒకే ఇంట్లో కలిసి జీవించడం మనిషిలో నిజ స్వభావాన్ని బయటపెడుతుంది. మనిషి అలవాట్లు, మాటలు, రోజువారీ ప్రవర్తన, కొన్నిసార్లు అతిగా రియాక్ట్ అవ్వడం, కోపం చేసుకోవడం, వాగ్వాదం ఇవన్నీ పెళ్లి తర్వాత ఉంటాయి. ఇవన్నీ పర్పెక్ట్ అనే ట్యాగ్ ను చెరిపేస్తాయి. అయితే.. అందరూ ఒప్పుకోవాల్సన నిజం ఏమిటంటే.. ఎవరూ కంప్లీట్ గా పర్పెక్ట్ గా ఉండరు. ప్రతి ఒక్కరికీ బలాలు ఉంటాయి, బలహీనతలు ఉంటాయి. రెండింటినీ అంగీకరించాలి. గొడవలు.. పెళ్లి తర్వాత గొడవ పడని భార్యాభర్తలు ఎక్కడా ఉండరు. గొడవ పడని భార్యాభర్తలు ఉన్నారని అనుకోవడం కూడా చాలా పొరపాటు. విభిన్న మనస్తత్వాలు గల ఇద్దరు వ్యక్తులు కలిసి నిర్ణయాలు తీసుకోవడం మొదలు పెట్టినప్పుడు అభిప్రాయ భేదాలు రావడం సర్వసాధారణం. టీవీ రిమోట్ దగ్గర నుండి మొదలుకుని ఎన్నో విషయాలలో భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. చిన్న చిన్న విషయాలపై వాదనలు ప్రతి వైవాహిక జీవితంలో ఒక భాగమే. డబ్బు.. ప్రేమకు దాని స్థానం ఉంది, అలాగే డబ్బుకు దాని స్థానం ఉంది. పెళ్లి తర్వాత, ఇంటి బడ్జెట్‌ను రూపొందించుకోవడం, ఖర్చులను నిర్వహించుకోవడం, పొదుపు గురించి ఆలోచించడం వంటివి చాలా కీలకమవుతాయి. పెళ్లి తర్వాత దంపతులు తమ ఆర్థిక ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని గ్రహిస్తారు. కొందరు పొదుపు చేయాలనుకుంటే, మరికొందరు ఖర్చు చేయాలనుకుంటారు. మరీ ముఖ్యంగా భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనా పరులైతే.. ఇద్దరి సంపాదన మీద ఒక్కరే అధికారం చూపించడం వంటి పరిస్థితులు ఎదురైతే.. అది వారి బంధంలో పెద్ద చీలికకు దారితీయవచ్చు. కాబట్టి వివాహం తర్వాత డబ్బు గురించి మాట్లాడటం మంచిదే కానీ.. డబ్బు కోసం బంధాన్ని విచ్చిన్నం చేయకూడదు. పర్సనల్ స్పేస్.. పెళ్లికి ముందు స్నేహితులతో మాట్లాడటం నుండి, స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడం వరకు పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు. కానీ పెళ్లి తర్వాత మారిపోతుంది. ప్రతి విషయంలోనూ భాగస్వామిని కలుపుకోవాలి, వారి సౌకర్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కొన్నిసార్లు తమకోసం , స్నేహితుల కోసం సమయాన్ని కేటాయించడం కూడా ఇబ్బందిగా ఉంటుంది. పైన చెప్పుకున్న విషయాలు చాలా సాధారణమైనవి. కానీ..పెళ్లికి ముందు చాలా జంటలు ఈ విషయాలలోనే ఊహించని అంచనాలు పెట్టుకుని, పెళ్లి తర్వాత చాలా డిజప్పాయింట్ అవుతారు. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.

Publish Date: Apr 22, 2026 4:17PM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img