నెల రోజుల్లో పీపీపీ మెడికల్ కాలేజీలు పట్టాలెక్కాలి : సీఎం చంద్రబాబు
ఏపీలో పీపీపీ విధానంలో నిర్మించ తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులను నెల రోజుల్లో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఫేజ్-1లో భాగంగా మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోని ప్రాంతాల్లోని నాలుగు మెడికల్ కాలేజీల పనులు వెంటనే మొదలుపెట్టాలని స్పష్టం చేశారు. అలాగే ఫేజ్-2లో అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం ప్రాంతాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని సూచించారు. ఇక 7 ప్రధాన అంశాలతో ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీ 2026-31ను త్వరలో తీసుకురావాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ఈ పాలసీలో మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, మెడ్టెక్ ఉత్పత్తులు, స్టార్టప్-ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద సమగ్ర వెల్నెస్ సదుపాయాలు, స్కిల్లింగ్ అభివృద్ధి, అమరావతి-వీఈఆర్ ప్రాంతాల్లో మెడిసిటీలు ఏర్పాటు వంటి అంశాలు ఉండనున్నాయి. అమరావతిలో నేచరోపతి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖకు లేఖ రాయాలని సీఎం సూచించారు. బుధవారం సచివాలయంలో సంజీవని ప్రాజెక్టు, పాపులేషన్ మేనేజ్మెంట్పై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైద్యారోగ్య, ఆర్థిక, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు, కార్మిక, మహిళా-శిశు సంక్షేమ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. సంజీవని ప్రాజెక్టు ద్వారా లక్ష మందికి పైగా సేవలు ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేందుకు ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజెన్ హెల్త్ స్క్రీనింగ్పై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. పబ్లిక్ హెల్త్ డేటాను సమర్థంగా వినియోగించుకోవాలని చెప్పారు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటివరకు 1.08 లక్షల మందికి వైద్య సేవలు అందించగా, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేసి, 19 వేల మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టును రాష్ట్రవ్యాప్తంగా వేగంగా అమలు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సేవలను డిజిటలైజ్ చేసినా, క్షేత్రస్థాయిలో సిబ్బంది సమర్థంగా పనిచేయకపోతే ఫలితాలు రావని సీఎం పేర్కొన్నారు. ప్రజారోగ్యంపై అవగాహన పెంపు అవసరమని, అనీమియా, డయాబెటిస్ వంటి వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని సూచించారు. సంతానోత్పత్తిలో చిట్టచివరన విశాఖ జిల్లా జనాభా నియంత్రణ నుంచి జనాభా సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేటు 2.1 నుంచి 1.5కి తగ్గిందని, అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఉండగా, అత్యల్పంగా విశాఖపట్నంలో 1.32 నమోదైందని అధికారులు తెలిపారు. ఫెర్టిలిటీ రేటును 2.1 లక్ష్యానికి తీసుకెళ్లాలని, ప్రస్తుతం లక్ష్యానికి 6 శాతం తక్కువగా ఉన్నామని సీఎం పేర్కొన్నారు. “తల్లికి వందనం” కార్యక్రమం కూడా పాపులేషన్ మేనేజ్మెంట్లో భాగమేనని ఆయన తెలిపారు. కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడం అవసరమని, మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరణను నియంత్రించాలని సూచించారు. ఉమ్మడి, పెద్ద కుటుంబాలకు ప్రోత్సాహకాలు అందించే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. పోషకాహారం లోపం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, సమతుల్య ఆహారం, ప్రివెంటివ్ హెల్త్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం అన్నారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను ప్రోత్సహించాలని సూచించారు. ఆసుపత్రులకు వచ్చే రోగులకు వారి ఆరోగ్య రికార్డుల ఆధారంగా డైట్ ప్లాన్, పోషకాహారం అందించే విధానం తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.
Publish Date: Apr 22, 2026 5:20PM