political-news-img

కేసీఆర్, హరీష్ లకు హైకోర్టులో భారీ ఊరట

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి. హరీశ్ రావుతో పాటు మరో ఇద్దరిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. విచారణ కమిషన్ చట్టం కింద నిర్దేశించిన సరైన ప్రక్రియను ఘోష్ కమిషన్ పాటించలేదని ఈ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహియుద్దీన్‌లతో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్ రావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ ఎస్.కె. జోషి, ప్రస్తుత ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ వేర్వేరుగా రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం.. ఆ నివేదిక ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోవడానికి వీల్లేదని స్ప‌ష్టం చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు స్వాగతించారు. కమిషన్ నిబంధనలు పాటించలేదని హైకోర్టు గుర్తించిందని, కోర్టు తీర్పు తమకు లభించిన పెద్ద ఊరటగా భావిస్తున్నామనీ ఆయన పేర్కొన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా న్యాయస్థానాల్లో అంతిమంగా ధర్మం జయిస్తుందని, సత్యం నిలబడుతుందని కోర్టు తీర్పు ద్వారా మరోసారి నిరూపితమైందని పేర్కొన్న హరీష్ రావు.. ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ నడిపిన విచారణను ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టిందన్నారు. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా కమిషన్ చేసిన వ్యాఖ్యలు చెల్లవని, ఆ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోరాదని కోర్టు స్పష్టంగా పేర్కొందన్నారు.

Publish Date: Apr 22, 2026 2:05PM

political-news-img

సమస్యలు పరిష్కరిస్తాం.. సమ్మె విరమించండి.. మంత్రి పొన్నం ప్రభాకర్

సమ్మె విరమించాలని తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కార్మికులను కోరారు. మొండివైఖరితో సమ్మెకు వెళ్లడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతుందన్న ఆయన, సమస్యలకు సమ్మె పరిష్కారం కాదన్నారు. చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. నాలుగు వారాల్లోగా పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని కమిటీని ఆదేశించినట్లు పేర్కొన్నారు. కార్మికులు లేవనెత్తిన 32 అంశాలలో 29 అంశాలు తక్షణమే పరిష్కరించదగినవిగా గుర్తించామని చెప్పిన మంత్రి మిగిలిన అంశాలను కూడా పరిష్కరిస్తామనీ, వెంటనే సమ్మె విరమించి విధుల్లో చేరాలనీ ఆర్టీసీ కార్మికులను కోరారు.

Publish Date: Apr 22, 2026 1:57PM

political-news-img

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో ఉన్న నాదెండ్ల భాస్కరరావు ఆరోగ్యం విషమించి.. హైదరాబాద్ లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మరణించారు. నాదెండ్ల భాస్కరరావు తెలుగు రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. వృత్తిరీత్యా న్యాయవాది అయిన ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ రంగప్రవేశం చేశారు. 1978లో తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తదుపరి కాలంలో ఎన్.టి.రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు, ఆయన వెంట నడిచారు. ఎన్టీఆర్ కేబినెట్ లో ఆర్థిక మంత్రిగా పని చేశారు. 1984లో ఎన్టీఆర్ వైద్య చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమయంలో.. నాదెండ్ల భాస్కరరావు కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు ఒక నెల రోజుల పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. ఆ తర్వాత రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరిన భాస్కరరావు, 1989లో తెనాలి నుండి ఎమ్మెల్యేగా, 1998లో ఖమ్మం నుండి ఎంపీగా విజయం సాధించారు. ఆ తరువాత 2019లో బీజేపీలో చేరారు. గత కొంతకాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు.

Publish Date: Apr 22, 2026 1:48PM

political-news-img

ఇండియాకు వరం.. టారిఫ్ రీఫండ్

అమెరికా ప్రభుత్వం గతంలో విధించిన కఠినమైన వాణిజ్య టారిఫ్ లను అక్కడి న్యాయస్థానం రద్దు చేయడంతో.. భారత ఎగుమతిదారులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరే అవకాశంఉంది. ట్రంప్ అమల్లోకి వచ్చిన పలు సుంకాలపై కోర్టు స్టే విధించడమే కాకుండా.. వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 20 నుంచి రీఫండ్ ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. దీనివల్ల భారతదేశానికి సుమారు 12 బిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో రూ. 1 లక్ష కోట్లు లబ్ధి చేకూరుతుందన్నది అంచనా. ఈ రీఫండ్ ప్రక్రియలో ప్రధానంగా మూడు రంగాలు అత్యధికంగా లాభపడనున్నాయి. అమెరికా మార్కెట్‌కు పెద్ద ఎత్తున వస్తువులను సరఫరా చేసే భారతీయ వస్త్ర పరిశ్రమకు సుమారు 4 బిలియన్ డాలర్లు వాపసు వచ్చే అవకాశం ఉంది. అలాగే.. ఇంజనీరింగ్ వస్తువుల ఎగుమతిదారులకు మరో 4 బిలియన్ డాలర్లు, రసాయన ఉత్పత్తుల రంగానికి 2 బిలియన్ డాలర్ల మేర రీఫండ్లు అందవచ్చనని నిపుణులు చెబుతున్నారు. ఇవే కాకుండా ఇతర చిన్న తరహా ఎగుమతి రంగాలు కూడా ఈ నిర్ణయంతో లబ్ధి పొందనున్నాయి. డొనాల్డ్ ట్రంప్ తన వాణిజ్య అజెండాలో భాగంగా అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం కింద అనేక దేశాలపై అదనపు సుంకాలను విధించారు. అయితే.. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ వేలాది కంపెనీలు కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్‌లో వ్యాజ్యాలు దాఖలు చేశాయి. ఫిబ్రవరిలో హైకోర్టు ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని తేల్చడంతో.. సుమారు 127 బిలియన్ డాలర్ల మొత్తం రీఫండ్‌కు అర్హత పొందింది. ఈ చారిత్రాత్మక తీర్పు ట్రంప్ ఆర్థిక విధానాలకు పెద్ద ఎదురుదెబ్బగా చెబుతున్నారు. రీఫండ్ ప్రక్రియ ఇలా సాగుతుందియూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ ఇప్పటికే ఈ చెల్లింపుల కోసం ఆన్‌లైన్ ప్రాసెసింగ్ టూల్‌ను అందుబాటులోకి తెచ్చింది. మార్చి నాటి అంచనాల ప్రకారం.. దాదాపు 3.3 లక్షల మంది దిగుమతిదారులు ఈ రీఫండ్ల కోసం దరఖాస్తు చేసుకునే వీలుంది. ఇప్పటి వరకూ 56 వేల మందికి పైగా తమ క్లెయిమ్‌లను నమోదు చేసుకున్నారు. దరఖాస్తులు సమర్పించిన తర్వాత, అధికారులు వాటిని పరిశీలించి 60 నుంచి 90 రోజుల వ్యవధిలో నగదును విడుదల చేస్తారు. అయితే.. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఈ రీఫండ్లు నేరుగా అమెరికాలోని దిగుమతిదారులకు అందుతాయి. భారతీయ ఎగుమతిదారులు ఈ నిధులను పొందాలంటే తమ అమెరికన్ భాగస్వాములతో చర్చలు జరపాల్సి ఉంటుంది. దీనికోసం నిపుణులు మూడు రకాల మార్గాలను సూచిస్తున్నారు. వాటిలో మొదటిది.. రీఫండ్ రూపంలో వచ్చే మొత్తాన్ని ఇరు పక్షాలు పంచుకునేలా కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడం. రెండోది.. గతంలో పన్నుల భారం వల్ల పెరిగిన ధరలను, ఇప్పుడు ఆ భారం తగ్గింది కనుక సవరించడం ద్వారా ప్రయోజనం పొందడం. ఇక మూడోది.. రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్‌గా మార్చుకుని.. రాబోయే ఆర్డర్లపై రాయితీలు పొందడం. భవిష్యత్ పరిణామాలు అమెరికా నుంచి రానున్న ఈ భారీ నగదు ప్రవాహం భారతీయ కార్మిక-కేంద్రీకృత రంగాలకు ఊపిరిపోస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా టెక్స్‌టైల్ వంటి రంగాలలో లాభాల శాతం పెరగడమే కాకుండా.. అంతర్జాతీయ మార్కెట్‌లో భారత వస్తువుల ప్రాధాన్యత పెరుగుతుంది. ఉక్కు, అల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలపై విధించిన ప్రత్యేక సుంకాలు ఇంకా కొనసాగుతుండటంతో.. ఆయా రంగాల ఎగుమతిదారులు మాత్రం వేచి చూడక తప్పని పరిస్థితి నెలకొంది. రాబోయే కొద్ది నెలల్లో భారతీయ సంస్థలు ఎంత చాకచక్యంగా తమ అమెరికన్ భాగస్వాములతో వ్యవహరిస్తాయనే దానిపైనే ఈ టారిఫ్ రిఫండ్ లబ్ధి ఆధారపడి ఉంటుంది. - సీతారాం కంఠంనేని

Publish Date: Apr 22, 2026 12:35PM

political-news-img

కెనడా ఇమ్మిగ్రేషన్ సంస్కరణలు.. భారతీయులకు అక్కడ శాశ్వత నివాసం ఇక కలేనా?

కెనడా ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన కొత్త ఇమ్మిగ్రేషన్ చట్టాలు.. అక్కడి విదేశీయులకు.. ముఖ్యంగా భారతీయ విద్యార్థులు, ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కెనడా పార్లమెంటులో ఆమోదం పొందిన బిల్ C-12 ద్వారా పౌరసత్వ, నివాస నిబంధనలను ట్రూడో సర్కారు సమూలంగా మార్చేసింది. ఈ కొత్త నిబంధనల వల్ల సరైన అర్హతలు లేని వారు, నిబంధనలు ఉల్లంఘించిన వారు దేశ బహిష్కరణకు గురయ్యే ప్రమాదం ఉంది. అక్కడ నివసిస్తున్న దాదాపు 30 వేల మందికి పైగా ఇండియన్స్ ఈ చట్టం పరిధిలోకి రానున్నట్లు అంచనా. గత కొన్ని దశాబ్దాలుగా కెనడా విదేశీయులకు స్వర్గధామంగా నిలిచింది. అయితే, ఇటీవల కాలంలో పెరుగుతున్న జనాభా, గృహ నిర్మాణ రంగంలో సంక్షోభం, మౌలిక సదుపాయాలపై పడుతున్న ఒత్తిడి దృష్ట్యా కెనడా తన ఇమ్మిగ్రేషన్ విధానాన్ని కఠినతరం చేస్తోంది. తాజాగా తీసుకువచ్చిన బిల్ ప్రధానంగా కెనడా పౌరసత్వం పొందే ప్రక్రియలో పారదర్శకతను పెంచడంతో పాటు.. అనర్హులను ఏరివేసేందుకు ఉద్దేశించినదని చెబుతున్నారు. ఈ చట్టం ప్రకారం.. తప్పుడు సమాచారంతో వీసాలు పొందిన వారు, అలాగే.. గడువు ముగిసినా అక్కడే ఉంటున్న వారిపై చర్యలు తీసుకోవడానికి అవకాశాలు దఖలుపడతాయి. ఈ పరిణామం కెనడాలో స్థిరపడాలని కలలు కంటున్న లక్షలాది మంది ఇండియన్స్ పై మరీ ముఖ్యంగా పంజాబ్, హర్యానా, తెలుగు రాష్ట్రాల విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇప్పటికే స్టడీ పర్మిట్లపై ఆంక్షలు విధించిన కెనడా.. ఇప్పుడు శాశ్వత నివాస హోదా కల్పించే విషయంలో కూడా కోత విధించాలని నిర్ణయించింది. బిల్ సి 12 అమలుతో పౌరసత్వ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించడమే కాకుండా, చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలు జరిగినా వాటిని తిరస్కరించే అవకాశం ఉంది. ఇది పరోక్షంగా దేశం విడిచి వెళ్లాల్సిన పరిస్థితులకు దారితీస్తుంది. ముఖ్యంగా రాజకీయ ఆశ్రయం కోరుతూ దరఖాస్తు చేసుకున్న వారిపై ఈ చట్టం ప్రభావం తీవ్రంగా ఉంది. కెనడాకు వచ్చిన ఏడాది లోపు ఆశ్రయం కోరని పక్షంలో వారి దరఖాస్తులను తిరస్కరించే వెసులుబాటును ఈ చట్టం కల్పించింది. నిజానికి, కెనడాలో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, నిరుద్యోగ సమస్య ఈ కఠిన నిర్ణయాలకు కారణమని తెలుస్తోంది. స్థానిక కెనడియన్లలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం వలసదారుల సంఖ్యను తగ్గించాలని భావిస్తున్నది. ఈ క్రమంలోనే తాత్కాలిక నివాసితుల సంఖ్యను భారీగా తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, ఈ చట్టం పట్ల మానవ హక్కుల సంఘాలు, ఇమ్మిగ్రేషన్ న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాలుగా కెనడా ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచిన వలసదారులను అకస్మాత్తుగా వెనక్కి పంపడం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడి హోటల్ మేనేజ్‌మెంట్,అగ్రికల్చర్ రంగాల్లో భారతీయుల పాత్ర కీలకం. అయితే.. జాతీయ భద్రత మరియు ఆర్థిక స్థిరత్వం దృష్ట్యా ఈ మార్పులు తప్పవని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. భారతీయ విద్యార్థుల విషయానికి వస్తే, చాలా మంది విద్యార్థులు భారీగా అప్పులు చేసి కెనడాకు వెళ్తుంటారు. అక్కడ చదువు పూర్తి చేసిన తర్వాత శాస్వత నివాసం పొంది స్థిరపడాలనేది వారి ప్రధాన లక్ష్యం. కానీ.. మారుతున్న నిబంధనలు వారి భవితపై ఆందోళనకు కారణమౌతున్నాయి. బిల్ సి 12ను కఠినంగా అమలు చేస్తే.. వేలాది మంది భారతీయులు స్వదేశానికి తిరిగి రాక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి.

Publish Date: Apr 22, 2026 12:15PM

political-news-img

ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠం.. భద్రత, ఆర్థిక రంగాల్లో యూఏఈ ప్రక్షాళన

ఇరాన్ అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ ప్రాంతాన్ని అశాంతికి గురిచేయడమే కాకుండా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల భవిష్యత్తు వ్యూహాలను పూర్తిగా మార్చివేస్తున్నాయి. దశాబ్దాలుగా అమెరికా రక్షణ కవచంలో ఉన్న యూఏఈ.. ఇప్పుడు తన భద్రతా అవసరాలు, ఆర్థిక ప్రయోజనాలపై పునరాలోచనలో పడింది. ముఖ్యంగా ఇరాన్ యుద్ధ ప్రభావం తర్వాత.. అబుదాబి తన దౌత్య, ఆర్థిక విధానాలను మార్చుకుంటూ చైనాకు దగ్గరయ్యేలా అడుగులు వేస్తోంది. అమెరికా సైనిక స్థావరాలు యూఏఈకి రక్షణకా? భారమా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గత కొంతకాలంగా అమెరికా దళాలకు ఆతిథ్యం ఇవ్వడం వల్ల తమకు చేకూరే ప్రయోజనం కంటే పొంచి ఉన్న ముప్పే ఎక్కువగా ఉందని యూఏఈ లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం యూఏఈ గడ్డపై 3,500 మంది అమెరికా సైనికులు విధులు నిర్వహిస్తున్నారు. అయితే.. ఇరాన్ జరిపిన డ్రోన్, క్షిపణి దాడుల సమయంలో అమెరికా స్థావరాల కంటే యూఏఈ సొంత రక్షణ వ్యవస్థలే సమర్థవంతంగా పనిచేయడం విశేషం. దీంతో అల్ ధఫ్రా వంటి భారీ అమెరికా సైనిక స్థావరాలు దేశానికి ఆస్తిగా కాకుండా.. శత్రువుల దాడులను ఆకర్షించేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయన్న అభిప్రాయం వ్యూహకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇరాన్ దాడుల కారణంగా యూఏఈ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. వందలాది క్షిపణులు, డ్రోన్ల దాడి వల్ల దేశ మౌలిక సదుపాయాలు చిన్నాభిన్నమయ్యాయి. దుబాయ్, అబుదాబి స్టాక్ మార్కెట్లు భారీగా పతనమై సుమారు 120 బిలియన్ల పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. విమానయాన రంగంపై కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. దాదాపు 18 వేల విమాన సర్వీసులు రద్దు అయ్యాయి. దీంతో పాటు పారిశ్రామిక కేంద్రాలు, పెట్రోకెమికల్ యూనిట్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దురదృష్టవశాత్తూ ఈ ఘర్షణల్లో పౌరులు, సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాలు యూఏఈ ఆర్థిక సుస్థిరత ఎంతటి ప్రమాదంలో ఉందో ప్రపంచానికి చాటిచెప్పాయి. ఆర్థిక సంక్షోభం ఎదురైనప్పుడు అమెరికా నుంచి ఆశించిన స్థాయిలో కరెన్సీ స్వాప్ లైన్ మద్దతు లభించకపోవడం కూడా యూఏఈని పునరాలోచనలో పడేసింది. సాధారణంగా పటిష్ట ఆర్థిక వ్యవస్థలకే ఇటువంటి సదుపాయం కల్పించే అమెరికా ఫెడరల్ రిజర్వ్ నిబంధనల వల్ల యూఏఈకి ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ నేపథ్యంలోనే యూఏఈ డీ-డాలరైజేషన్ అంటే డాలర్ రహితీకరణ దిశగా అడుగులు వేస్తోంది. చమురు వాణిజ్యంతో పాటు అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ యువాన్ ను వాడటం ద్వారా డాలర్ ఆధిపత్యానికి స్వస్తి పలకాలని యూఏఈ యోచిస్తోంది. గల్ఫ్ దేశాల్లో మారుతున్న ఈ పరిస్థితులను చైనా తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఇరాన్, అమెరికా ఘర్షణల వల్ల ఏర్పడిన శూన్యాన్ని భర్తీ చేసేందుకు బీజింగ్ సిద్ధమైంది. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అబుదాబి యువరాజుతో జరిపిన చర్చల్లో చారిత్రాత్మక మార్పుల' గురించి ప్రస్తావించడం ఇక్కడ గమనార్హం. ఇంధన, మౌలిక సదుపాయాల కల్పనలో చైనా భాగస్వామ్యం పెరుగుతుండటం వల్ల భవిష్యత్తులో గల్ఫ్ ప్రాంతంలో అమెరికా పట్టు సడలే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్ యుద్ధం నేర్పిన పాఠాలతో యూఏఈ ఇప్పుడు తన వ్యూహాలను మార్చుకుంటోంది. కేవలం అమెరికాపైనే ఆధారపడకుండా చైనా, ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసుకోవడమే కాకుండా.. భద్రత, ఆర్థిక రంగాల డైవర్సిఫికేషన్ అత్యవసరమని భావిస్తోంది. రాబోయే రోజుల్లో యూఏఈ కేవలం ఒక ప్రాంతీయ శక్తిగా మాత్రమే కాకుండా..అంతర్జాతీయ రాజకీయాల్లో ఒక స్వతంత్ర నిర్ణయాధికార దేశంగా ఎదిగేందుకు ఈ మార్పులు దోహదం చేస్తాయి. అమెరికా సైనిక నీడ నుంచి బయటకు వచ్చి.. సొంత రక్షణ, ఆర్థిక సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడమే యూఏఈ తదుపరి లక్ష్యంగా కనిపిస్తోంది. -సీతారాం కంఠమనేని

Publish Date: Apr 22, 2026 11:31AM

MOVIE NEWS

movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img
movie-news-img