Top Stories

political-news-img

శరీరాన్నే కాదు.. బంధాన్ని డిటాక్స్ చేసుకోవడం చాలా ముఖ్యం..!

ఎలాంటి సంబంధం అయినా సరే.. ప్రతి సంబంధంలో ఏదో ఒక రకమైన గొడవ, సంఘర్షణ ఉంటుంది. ఇది ముఖ్యంగా ప్రేమ సంబంధాలలో చాలా సాధారణం. మరీ ముఖ్యంగా భార్యాభర్తల బంధంలో గొడవలు కూడా చాలా ఉంటాయి. కానీ భార్యాభర్తల మధ్య కేవలం గొడవలు మాత్రమే ఎక్కువ ఉండి, ఇద్దరి మధ్య సరైన అవగాహన, పరస్పర గౌరవం వంటివి లేకపోతే.. ఆ బంధం చాలా పెళుసుగా మారిపోయే అవకాశం ఉంటుంది. గొడవలు అలకలు ఇద్దరి మద్య బంధాన్ని ఎంత బలం చేస్తాయో.. అవి ఎక్కువైతే ఇద్దరిని అవే విడదీస్తాయి కూడా. నేటికాలంలో చాలామంది తమ బంధం గురించి ఆలోచించి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. అలాంటి వారికోసం ఒక మంచి మార్గం ఉంది. అదే రిలేషన్షిప్ డిటాక్స్.. శరీరాన్ని డిటాక్స్ చేసుకోవడం కోసం చాలా మంది డిటాక్స్ డ్రింకులు తాగుతూ ఉంటారు. దీనివల్ల శరీరంలో విషపదార్థాలు బయటకు వెళ్లిపోయి శరీరం శుభ్రం అవుతుంది. అదేవిధంగా.. రిలేషన్షిప్ ను డిటాక్స్ చేసుకుంటే.. బంధంలో ఉన్న అనవసర గొడవలు, ఇబ్బందులు, అపార్థాలు అన్నీ మంత్రమేసినట్టు మాయమవుతాయి. ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. భాగస్వామిని బాధపెట్టకుండా బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. భాగస్వామితో మాట్లాడాలి.. రిలేషన్ షిప్ డిటాక్స్ చేయించుకోవాలనుకుంటే, ముందుగా భాగస్వామితో మాట్లాడాలి. ఎందుకు రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవాలని అనుకుంటున్నారో వివరించాలి.ఇద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని వివరించాలి. సమస్యలకు కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. భాగస్వామి పైవన్నీ అర్థం చేసుకుంటే.. రిలేషన్షిప్ డిటాక్స్ చేయించుకోవడం సులువు అవుతుంది. దృష్టి.. ప్రతి ఒక్కరు తమపై తాము దృష్టి పెట్టాలి. ఇది మానసిక, భావోద్వేగ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. తమపై తాము దృష్టి పెట్టినప్పుడు, తమ బలాలు, బలహీనతలను బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇవి భవిష్యత్తులో సంబంధాలు మెరుగుపరుచుకోవడంలో సహాయపడతాయి. సమయం.. నేటికాలంలో ప్రతి ఒక్కరు నిరంతరం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు. ముఖ్యంగా ఎప్పుడూ ఫోన్‌లో ఉండటం వల్ల తమకు తాము సమయం కేటాయించుకోలేకపోతారు. తమకు తాము సమయం కేటాయించుకోనప్పుడు అది చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలో కూడా ఇబ్బందులు తెచ్చిపెడుతుంది. బంధాన్ని డిటాక్స్ చేసుకోవాలంటే.. సమయం కేటాయించాలి. ఫోన్ కు దూరంగా ఉండాలి. బందం గురించి ఆలోచించాలి. అలాంటప్పుడు అలోచనలు కూడా సరిగ్గా పనిచేస్తాయి. దూరం.. రిలేషన్షిప్ డిటాక్స్ అంటే.. బంధం నుండి విడిపోవడానికి ప్రయత్నించడం కాదు.. బంధాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించడం. బంధంలో గొడవలు, అపార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు.. భాగస్వామికి కొన్నాళ్లు దూరంగా ఉండి అన్నీ ఆలోచించుకోవడం వల్ల అన్ని విషయాలు క్షుణ్ణంగా అర్థం అవుతాయి. అప్పుడు బంధాన్ని నిలబెట్టుకోవడానికి మార్గాలు కనిపిస్తాయి. బంధం ఎంత ముఖ్యమైనదో కూడా అర్థమవుతుంది. *రూపశ్రీ.

Publish Date: Jun 8, 2027 11:12AM

political-news-img

టీఎంసీలో ముదురుతున్న అంతర్గత సంక్షోభం.. మరో ఎంపీ రాజీనామా

తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం రోజురోజుకూ ముదురుతోంది. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం తరువాత పార్టీలో ఎగసిపడిన అసమ్మతి జ్వాలలు ఢిల్లీ వరకూ విస్తరించాయి. పార్టీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడి బయటకు వచ్చేస్తున్నారు. తాజాగా టీఎంసీకి చెందిన రాజ్యసభ ఎంపీ సుస్మితా దేవ్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. వారం రోజుల వ్యవధిలో టీఎంసీకి గుడ్ బై చెప్పిన రెండో రాజ్యసభ సభ్యురాలు సుస్మితాదేవ్. సుస్మితా దేవ్ తన రాజీనామా లేఖను రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆ లేఖలో కోరారు. కాగా రాజీనామా సమర్పించిన కొద్దిసేపటికే.. అస్సాం ముఖ్యమంత్రి, బీజేపీ కీలక నేత హిమంత బిశ్వ శర్మ నివాసంలో సుస్మితాదేవ్ ప్రత్యక్షమయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సుస్మితాదేవ్ త్వరలోనే కాషాయ జెండా కప్పుకోబోతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఈ భేటీపై విలేకరులు ప్రశ్నించగా.. ఇది కేవలం 'అస్సాం కనెక్షన్' మాత్రమేనని, అంతకు మించి రాజకీయ ప్రాధాన్యత లేదని ఆమె బదులిచ్చారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన సుస్మితా దేవ్.. అస్సాం కాంగ్రెస్ దిగ్గజం అల్లాడి సంత్ మోహన్ దేవ్ కుమార్తె. గతంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో అత్యంత కీలకమైన మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలిగా, సిల్చార్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎంపీగా సుదీర్ఘ సేవలు అందించారు. ఆ తర్వాత 2021లో కాంగ్రెస్‌ను వీడి మమతా బెనర్జీ సమక్షంలో టీఎంసీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పట్లో ఈమె చేరికతో ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాం, త్రిపురలలో పార్టీ బలోపేతం అవుతుందని టీఎంసీ భావించింది. కానీ, బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత మారిన సమీకరణాలతో ఆమె పార్టీ వీడక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి.

Publish Date: Jun 10, 2026 12:56PM

political-news-img

తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు

ఉభయ తెలుగు రాష్ట్రాలకూ వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది. తెలంగాణలో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాష్ట్రంలోని సంగారెడ్డి, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, కరీంనగర్, నారాయణఖేడ్, మహబూబాబాద్‌, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు కాగా.. రానున్న 24 గంటల్లోనూ ఇదే స్థాయిలో వర్షాలు కురుస్తాయనివాతావరణ శాఖ పేర్కొంది. వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, గుంటూరు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Publish Date: Jun 10, 2026 12:45PM

political-news-img

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌.. సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ సంచలన హెచ్చరిక!

మహిళల టీ20 ప్రపంచకప్‌ సమరం రసవత్తరంగా మారుతోంది. మెగా టోర్నమెంట్‌కు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఓటమి సౌతాఫ్రికా జట్టుకు ఒక పెద్ద కనువిప్పు లాంటిదని ఆ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ స్పష్టం చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్ న్యూజిలాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్‌లో ప్రొటీస్ జట్టు ఐదు వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో రాబోయే శనివారం మాంచెస్టర్ వేదికగా ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడాల్సి ఉంది. ఈ కీలక పోరుకు ముందు తమ వ్యూహాలను మరింత పదును పెట్టుకోవాలని, కేవలం నామమాత్రంగా ఆడితే సరిపోదని లారా వోల్వార్డ్ తన సహచర ఆటగాళ్లను గట్టిగా హెచ్చరించింది. ఐర్లాండ్‌పై స్వల్ప తేడాతో విజయం సాధించినప్పటికీ, ఆ తర్వాత కివీస్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా బౌలింగ్ మరియు బ్యాటింగ్ విభాగాల్లో తీవ్రంగా తడబడింది. న్యూజిలాండ్ జట్టు తమకంటే ఎంతో తెలివిగా బ్యాటింగ్ చేసి మ్యాచ్‌ను చేజిక్కించుకుందని కెప్టెన్ అంగీకరించింది. టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఇలాంటి ఓటమి ఎదురవడం ఒక రకంగా మంచిదేనని, దీనివల్ల తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం లభిస్తుందని ఆమె అభిప్రాయపడింది. ఆస్ట్రేలియా వంటి పటిష్టమైన జట్టును ఢీకొట్టాలంటే పూర్తి స్థాయి వ్యూహాత్మక ప్రణాళికలు అవసరమని, లేకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వోల్వార్డ్ కుండబద్దలు కొట్టింది. ఈ ఓటమి బాధలో ఉన్న సౌతాఫ్రికా జట్టుకు ఆల్ రౌండర్ క్లో ట్రయాన్ అద్భుతమైన ఫామ్ రూపంలో ఒక పెద్ద ఊరట లభించింది. కివీస్‌పై జరిగిన మ్యాచ్‌లో ఆమె కేవలం 26 బంతుల్లోనే 6 భారీ సిక్సర్ల సాయంతో అజేయంగా 61 పరుగులు రాబట్టింది. టోర్నీకి ముందే ట్రయాన్ ఇలా మెరుపు ఇన్నింగ్స్ ఆడటం జట్టుకు కొండంత బలాన్ని ఇస్తుందని కెప్టెన్ ప్రశంసించింది. ఆమె క్రీజులో సెట్ అయితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలేనని, ముఖ్యంగా లెగ్ స్టంప్ వెలుపల పడిన బంతులను కూడా కవర్స్ మీదుగా సిక్సర్లుగా మలచడం ఆమె ప్రత్యేకత అని కొనియాడింది. ఈ మెగా టోర్నీలో క్లో ట్రయాన్ తమ జట్టుకు ఎక్స్‌ ఫ్యాక్టర్‌గా నిలుస్తుందని వోల్వార్డ్ ధీమా వ్యక్తం చేసింది. లారా వోల్వార్డ్ సైతం తన అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో 100 మ్యాచ్‌ల మైలురాయిని అందుకోవడానికి కేవలం రెండు మ్యాచ్‌ల దూరంలో ఉండటం విశేషం. మరోవైపు, వార్మప్ మ్యాచ్‌లలో వరుసగా రెండు విజయాలు సాధించి మంచి జోష్‌లో ఉన్న న్యూజిలాండ్ జట్టు శనివారం సౌతాంప్టన్ వేదికగా 2016 ఛాంపియన్ వెస్టిండీస్‌తో తలపడడం ద్వారా తన టైటిల్ డిఫెన్స్‌ను ప్రారంభించనుంది. అయితే, ఈ జోరు చూసి తాము ఏమాత్రం అలసత్వానికి లోనుకాబోమని ఆ జట్టు తాత్కాలిక కెప్టెన్ మెలీ కెర్ హెచ్చరించింది. వెస్టిండీస్ జట్టులో ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించగల ఆటగాళ్లు ఉన్నారని, మెగా టోర్నీలో ఏ జట్టునైనా తక్కువ అంచనా వేయలేమని ఆమె పేర్కొంది. ఇరు జట్లు సున్నా పాయింట్లతోనే ప్రయాణాన్ని ప్రారంభిస్తాయి కాబట్టి, ఆ రోజు ఎవరైతే తమ బాధ్యతలను సరిగ్గా నిర్వర్తిస్తారో వారికే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని మెలీ కెర్ స్పష్టం చేసింది. మొత్తానికి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మరియు న్యూజిలాండ్ జట్ల మధ్య సాగబోయే ఈ పోరు క్రికెట్ అభిమానులకు అసలైన వినోదాన్ని పంచడం ఖాయంగా కనిపిస్తోంది.

Publish Date: Jun 10, 2026 12:45PM

political-news-img

నా ఆప్తుడు, నటసింహం బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు

హిందూపురం ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ జన్మదినం నేడు. ఈ సందర్భంగా బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా .. సినీ, రాజకీయ, సేవా రంగాలలో సరి కొత్త రికార్డులు సృష్టిస్తూ అజేయంగా ముందుకు వెళుతున్న పద్మభూషణుడు, హిందూపురం శాసనసభ్యుడు, నా ఆప్తుడు నటసింహం నందమూరి బాలకృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు. ఐదు దశాబ్దాలుగా సినీ వినీలాకాశంలో ధ్రువతారగా వెలుగొందుతూ, మాతృమూర్తి పేరుతో నెలకొల్పిన బసవతారకం ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్ చైర్మన్‌గా అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. నందమూరి బాలకృష్ణకు ఆయన అల్లుడు నారా లోకేష్, కుమార్తె నారా బ్రహ్మణి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు నారా లోకేష్ సామాజిక మాధ్యమ వేదికగా.. నిండైన తెలుగుదనం, అభిమానం, భోళాతనానికి ప్రతిరూపం బాలా మావయ్యకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అని పేర్కొన్నారు. హిందూపురం ప్రజా విజేత అయిన బాలకృష్ణ ఆయురారోగ్యాలతో వందేళ్లు వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నట్లు లోకేశ్ ఆకాంక్షించారు. ఇక ఆయన కుమార్తె నారా బ్రహ్మణి తన తండ్రిని తన సూపర్ హీరోగా అభివర్ణిస్తూ భావోద్వేగ పోస్ట్ చేశారు. తనకు అండగా, గురువుగా, గొప్ప స్ఫూర్తిగా నిలిచినందుకు ధన్యవాదాలు, మీ కుమార్తెగా పుట్టడం నా అదృష్టం అని పేర్కొన్నారు. బాలకృష్ణ జన్మదిన సందర్భంగా ఆయనకు కుటుంబ సభ్యులు, అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Publish Date: Jun 10, 2026 12:36PM

political-news-img

అధికార లాంఛనాలతో భారతీ రాజా అంత్యక్రియలు

దిగ్గజ దర్శకుడు భారతీ రాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో జరపాలని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయించింది. భారతీ రాజా మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం విజయ్.. తమిళ చిత్ర పరిశ్రమకు ఆయన అందించిన అసమాన సేవలకు, ఆయన స్థాయికి గుర్తింపుగా ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అంతకుముందు భారతీరాజా భౌతిక కాయానికి సీఎం విజయ్ ఘన నివాళులర్పించారు. చెన్నైలోని భారతీ రాజా నివాసానికి వెళ్లిన సీఎం విజయ్ ఆయన పార్థివ దేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. చలనచిత్ర రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన దార్శనికుడు భారతీరాజా అని తమిళ ఫిల్మ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ తన సంతాప సందేశంలో పేర్కొంది. అలాగే భారతీరాజా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. కాగా.. ప్రముఖ దర్శకుడు భారతీ రాజా మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన అద్భుతమైన సృజనాత్మకతతో వెండితెరపై సరికొత్త ఒరవడిని సృష్టించిన లెజెండరీ డైరెక్టర్ భారతీరాజా మరణం భారత చలనచిత్ర రంగానికి, కోట్లాది మంది అభిమానులకు తీరని లోటు అని పేర్కొన్నారు. భారతీరాజా కేవలం తమిళ సినీ పరిశ్రమకే పరిమితం కాకుండా.. తెలుగు, హిందీ, కన్నడ భాషల్లోనూ అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్న పవన్ కల్యాణ్ ఆయన దర్శకత్వంలో వచ్చిన ఆరాధన సీతాకోకచిలుక వంటి చిత్రాలు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. భారతీ రాజా కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Publish Date: Jun 10, 2026 12:34PM

MOVIE NEWS