అతి త్వరలో ఢిల్లీ రాజధాని తరలిపోతుందా?
Publish Date:Feb 11, 2022
Advertisement
మరో రెండేళ్లలో దేశంలో చాలా కీలకమైన పరిణామాలు సంభవించబోతున్నాయా.. అందులో ముఖ్యంగా రాజధాని అయిన ఢిల్లీని కర్నాటకలోని ఆనెగొందికి తరలిస్తారా.. అంతేకాదు.. రెండు ప్రధాన మతాల మధ్య చిచ్చు రగిలి తీవ్రమైన భయోత్పాతాలు పెల్లుబుకతాయా.. ఇవి మాత్రమే కాదు.. ఇంకా చాలా ఉపద్రవాలు సంభవిస్తాయని ఎక్స్ ప్రెస్ స్టార్ టెల్లర్ అనే అంతర్జాతీయ మేగజైన్ ప్రచురించింది. వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలోని విషయాలు ఉటంకిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెందిన పావులూరి శ్రీనివాాసాచార్యులు అనే ప్రముఖ జ్యోతిష్య పండితుడు ఈ విషయాలు చెబుతున్నారు. వీరబ్రహ్మేంద్రస్వామి తాను కాలజ్ఞానంలో చెప్పినట్టు ఇప్పటికే వీరభోగ వసంతరాయలు వచ్చి ఉన్నారని, ఓ అజ్ఞాత ప్రదేశంలో గడుపుతున్నారని శ్రీనివాసులు చెబుతున్నారు. కాలజ్ఞానం మీద దాదాపు నాలుగు దశాబ్దాలు రీసెర్చ్ చేసిన తాను ఎక్స్ ప్రెస్ స్టార్ టెల్లర్ (ఈఎస్టీ) గతంలో కూడా ప్రిడిక్షన్స్ ఇచ్చానని, అవి కచ్చితంగా నిజమైనట్టు నిర్ధారణ కావడంతో ఈ ఫిబ్రవరి సంచికలో కూడా తన ప్రిడిక్షన్స్ కి చోటు దక్కింది అంటున్నారు. జరగబోయే ఉపద్రవాలేంటో ప్రజలకు, పాలకులకు ముందుగా తెలిసినట్టయితే కొంతమేరకైనా జాగ్రత్తలు పాటించే అవకాశం ఉంటుందని, ఆ ఉద్దేశంతోనే తన ప్రిడిక్షన్స్ ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తున్నానని, తన ఉద్దేశం ఎవరినీ భయపెట్టడం కాదని ఆయన చెప్పారు. తాజా సంచికలో పేర్కొన్న కొన్ని ముఖ్యమైన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం. 1) వీరబ్రహ్మేంద్రస్వామి చెప్పినట్టు ఇప్పటికే వీరభోగ వసంతరాయలు పుట్టారు. 1965లో ఆయన జననం జరిగింది. 13 ఏప్రిల్ 2000 సంవత్సరంలో వీరభోగ వసంతరాయలు కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అదే సంవత్సరం పెళ్లి కూడా చేసుకున్నారు. ఆ సంవత్సరం సంభవించిన కరువు కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు, వింతవింత వ్యాధుల గురించి ఓసారి గుర్తు చేసుకోవచ్చు. 2) 2024-25 సంవత్సరాల్లో భారతదేశంలో అంతర్యుద్ధం సంభవిస్తుంది. 2024 ఆగస్టులో ఢిల్లీ మీద బాంబులు పడతాయి. బహుశా అది న్యూక్లియర్ అటాక్ కావచ్చు. దీంతో క్యాపిటల్ సిటీని కర్నాటకలోని హంపి దగ్గర గల ఆనెగొందికి తరలిస్తారు. అదే సంవత్సరం నెల్లూరు పట్టణం మునిగిపోతుంది. 2024 చివర గానీ, 2025లో గానీ కాశీ విశ్వనాథుడి ఆలయం 40 రోజులపాటు మూత పడుతుంది. అలాగే శ్రీకాళహస్తి, శ్రీశైలం, కుమారస్వామి టెంపుల్స్ కూడా వారం రోజులపాటు మూసేస్తారు. 2024 లేదా ఆ తరువాత కర్నాటకలోని టెంపుల్స్ ను టెర్రరిస్టులు ధ్వంసం చేస్తారు. 3) ఇక మరో ముఖ్య విషయం.. తిరుమల శ్రీనివాసుడి విగ్రహాన్ని కందిమల్లాయపల్లెకు తరలిస్తారు. తిరుమల మీద పుట్టిన తీవ్రమైన భూకంపం కారణంగా తిరుమలకు వెళ్లే దారులన్నీ మూసేస్తారు. దీంతో శ్రీనివాసుడి విగ్రహాన్ని కందిమల్లాయపల్లె (వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం) కు తరలిస్తారు. కృష్ణా నది తీవ్రంగా ఉప్పొంగి దాని మీద ఉన్న ఆనకట్టలు, ప్రాజెక్టులు వరదల్లో కొట్టుకుపోతాయి. కనకదుర్గమ్మ ముక్కుపుడకను కృష్ణా నీళ్లు అంటుకుంటాయి. ఈ వరదలో 14 పట్టణాలు నీట మునిగి తీవ్రమైన జననష్టం సంభవిస్తుంది. భూమ్మీద పుట్టిన వరదలు, భూమిలో పుట్టిన ప్రకంపనల కారణంగా దర్గమ్మ కొండ పగులుతుంది. ఫలితంగా దుర్గమ్మ విగ్రహాన్ని కూడా కందిమల్లాయపల్లెకు తరలిస్తారు. ఫలితంగా కందిమల్లాయపల్లె మన దేశ ఆర్థిక రాజధానిగా అవతరిస్తుంది. 4) 2036 జూన్ 7, 8 తేదీల్లో బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ ఇంటి ఆవరణలో చింతచెట్టు కిందనున్న కాలజ్ఞానాన్ని వీరభోగ వసంతరాయలు తవ్వితీస్తారు. అక్కడి నుంచి ఆ కాలజ్ఞానంలో రాసింది రాసినట్టుగా జరుగుతాయి. శ్రీశైలం, యాగంటి, అలంపూర్ , బెల్లంకొండ మొదలగు దేవాలయాల్లో గతంలో దాచిన నిధులన్నీ బయటపడతాయి. 5) కృష్ణా-గోదావరి పరీవాహ ప్రాంతాల నడుమ మత కలహాలు, నీటి యుద్ధాలు సంభవిస్తాయి. కృష్ణా జలాల పంపకంలో విభేదాలు తారస్థాయికి చేరతాయి. ఈ విభేదాల కారణంగా అనుకోని దుస్సంఘటనలు జరుగుతాయి. తమిళనాడులోని రామేశ్వరంలో భయంకరమైన యుద్ధం జరుగుతుంది. బహుశా ఇది చైనా కారణంగా తలెత్తే అవకాశాలున్నాయి. పెను తుఫానులు, వరదల కారణంగా బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం తీవ్రంగా నష్టపోతాయి. జననష్టం భారీగా సంభవిస్తుంది. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వలసలు భారీగా పెరుగుతాయి. 6) 2027లో పట్టపగలే భారీ తోకచుక్క దర్శనమిస్తుంది. ఉత్తర దిశ నుంచి దక్షణాభిముఖంగా ఆ తోకచుక్క భారీ సైజులో పెరుగుతుంది. దీని కారణంగా భూ కోణంలో అనూహ్యమైన మార్పు సంభవిస్తుంది. తోకచుక్క పెరుగుతూ ఉంటే సూర్యుడు కంపిస్తున్నట్టుగా ప్రజలకు గోచరమవుతుంది. ఇది 02-08-2027 ప్లవంగ నామ సంవత్సరంలో సూర్య గ్రహణం నాడు సంభవిస్తుంది. 7) రెండు ముఖ్యమైన మతాల మధ్య చిచ్చు రేగుతుంది. 2037-38, 2038-39, 2040-41 పింగళ, కాలయుక్తి, రౌద్రి నామ సంవత్సరాల్లో విపరీత సంఖ్యలో జనం చనిపోతారు. 24-05-2039, 21-6-2039 మధ్య అద్దంకిలో భారీ భూకంపం పుడుతుంది. 8) 2040లో గంగానదిలో కాశీ వద్ద 40 రోజుల వరకు నీటి చుక్క ఉండదు. ఇక గంగానది మొత్తంలో 12 రోజుల వరకు నీళ్లుండవు. 13వ రోజు మాత్రం అనూహ్యంగా వరదలొస్తాయి. దక్షిణేశ్వరం నుంచి శ్రీలంక వరకు తూర్పుతీర ప్రాంతంలో భారీ మార్పులు సంభవిస్తాయి. దేశ భౌతిక స్వరూపమే మారిపోతుంది. బంగాళాఖాతంలో సముద్రం 80 మైళ్లు వెనక్కి వెళ్లిపోతుంది. దీంతో ఇండియా మ్యాప్ దీర్ఘ చతురస్రాకారంగా తయారవుతుంది. అంతకుముందు మునిగిపోయిన దేవాలయాలు, భారీ కట్టడాలు బయట పడతాయి. 9) 2045లో మూడో ప్రపంచ యుద్ధం సంభవిస్తుంది. ఆ యుద్ధం భారీ విషాదాన్ని మిగులుస్తుంది. ఆ యుద్ధం తరువాత ప్రతి ఏడుగురిలో ఒకరు మాత్రమే భూమ్మీద మిగులుతారు. భూమ్మీద అన్ని యుద్ధాలు 2060 వరకు సమసిపోతాయి. 2066 వరకు ప్రకృతి ఉత్పాతాలు కూడా శాంతిస్తాయి. వింధ్యపర్వతాలు, రామేశ్వరం మధ్య ఉండే భూభాగాన్ని వీరభోగ వసంతరాయలు పరిపాలిస్తాడు. శ్రైశైల మల్లన్న వింధ్య పర్వతాల మీద పూజలందుకుంటూ ఉంటాడు. 10) శ్రీశైల మల్లన్న విగ్రహం నుంచి పొగలు, మంటలు వస్తాయి. నందీశ్వరుడు రంకె వేస్తాడు. ఒక మొసలి భ్రమరాంబికాదేవి ఆలయంలో చొచ్చి 8 రోజులు మేకలాగా అరుస్తుంది. ఉదయగిరిలో సంజీవని మొక్క కనిపిస్తుంది. రామాయణకాలంలో వాలి, సుగ్రీవులు దాచిన నిధులు బయటపడతాయి. శ్రీనివాసులు ఇచ్చిన ప్రిడిక్షన్స్ లో ఇవి కొన్ని మాత్రమే. తాను ఇంకా ఆ మేగజైన్ కు చాలా అంశాలు ఇచ్చానని, అవన్నీ కాలక్రమంలో సంభవిస్తూ ఉంటాయని చెబుతున్నారు. ఒకవేళ ఏదైనా జరగకపోతే గనక అది కాలజ్ఞానంలో పొరపాటు కాదని, తన అంచనా తప్పడంగానే భావించాలని ఆయన చెబుతున్నారు. బనగానపల్లెలో 400 ఏళ్ల క్రితం దాచిన కాలజ్ఞాన పూర్తి ప్రతులు బయటపడ్డాక ఆ కాలజ్ఞానాన్నే ప్రామాణికంగా భావించాలని చెబుతున్నారు.
http://www.teluguone.com/news/content/will-capital-city-of-india-change-its-location-39-131589.html





