ఎవరా నలుగురు.. ఏమా కథ.. వేటేనా?
Publish Date:Mar 24, 2023
Advertisement
ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇంతవరకు ఓ లెక్క ..ఇకపై మరో లెక్క, అన్నట్లుగా మారి పోయాయి. గత సార్వత్రిక ఎన్నికల మొదలు ఇంతవరకు జరిగిన ఏ ఎన్నికలోనూ ఓటమి చూడలేదన్న అహంకారంతో విర్రవీగుతున్న అధికార వైసీపీకి ఎమ్మెల్సీ ఎన్నికలు దిమ్మతిరిగే షాకిచ్చాయి. నిన్నగాక మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవం అక్కడితో ఆగలేదు...అక్కడ గ్రాడ్యుయేట్స్ అధికార పార్టీకి దిమ్మతిరిగే షాక్’ ఇస్తే, ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో సొంత పార్టీ ఎమ్మెల్యేలే.. దెబ్బ మీద దెబ్బ అన్నట్లుగా మైండ్ బ్లాక్ అయ్యే మరో షాక్ ఇచ్చారు. నేను మోనార్క్ ను నా మాటే శాసనం అన్నట్లుగా తమకు తిరుగులేదని విర్ర వీగిన జగన్ రెడ్డికి సొంత పార్టీ ఏమ్మేల్యేలు ఝలక్ ఇచ్చారు. పకడ్బందీ వ్యూహంతో పావులు కదిపినా ఒకరు ఇద్దరు కాదు ఏకంగా నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు సాహసించారు. జగన్ రెడ్డి హుకుంను ధిక్కరించారు. టీడీపీ అభ్యర్ధి పంచుమర్తి అనురాధను గెలిపించారు. అయితే ఇప్పడు ఆ నలుగురు ఎమ్మెల్యేలు ఎవరు? జగన్ రెడ్డిని పరాభవానికి గురి చేసిన ఆ నలుగురు ఎమ్మెల్యేలపై జగన్ రెడ్డి స్పందన ఏమిటి? ఇక ఇప్పుడు జగన్ రెడ్డి ఏమి చేస్తారు? ఎమ్మెల్యేల ధిక్కారాన్ని దిగమింగి ఊరుకుంటారా? ఆ నలుగురిని గుర్తించి వేటు వేస్తారా? ఉప ఎన్నికలకు సాహసిస్తారా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. నిజానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం అనూహ్యం అయితే కావచ్చును కానీ కచ్చితంగా ధర్మ విజయం. ఏడు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక అభ్యర్ధి గెలవాలంటే 22 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయాలి. టీడీపీ బిఫారంపై గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే ఆ ఎమ్మెల్యేల్లో కరణం బలరాం, మద్దాళి గిరిధర్, వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్కుమార్ అధికారికంగా తెలుగు దేశం ఏమ్మేల్యేలుగా కొనసాగుతూనే వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రస్తుతం శాసనసభలో టీడీపీ వాస్తవ సంఖ్యా బలం 19కి తగ్గింది. ఆ నలుగురు ఎమ్మెల్యేలు సాంకేతికంగా తెలుగుదేశం పార్టీ సభ్యుల కిందే లెక్క. కాబట్టి వారికి కూడా టీడీపీ విప్ జారీ చేసింది. ఆ నలుగురు ఎమ్మెల్యేల నుంచి గానీ.. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేల నుంచి గానీ ముగ్గురు టీడీపీ అభ్యర్థికి ఓటు వేస్తే అనురాధ ఎమ్మెల్సీగా గెలిచే అవకాశముంటుందని భావించింది. అయితే.. చివరి వరకూ ఉత్కంఠగా సాగిన ఓట్ల లెక్కింపులో పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. ఆమెకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన ఆ నలుగురు ఎవరు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే.. ముందుగానే అత్మప్రభోధం మేరకు ఓటి వేస్తామని బహిరంగంగా ప్రకటించిన వైసీపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఓట్లు కలిపినా టీడీపీకి పడాల్సింది -21 ఓట్లు మాత్రమే. దీంతో అనూరాధ కు ఓట్లు వేసిన ఆ ద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరు? అనేది ఇంట్రస్టింగ్గా మారింది. ముందుగా తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పేర్లు వినిపించాయి. ఇదే సమయంలో.. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అలాగే ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే పేరూ ప్రముఖంగా వినిపించింది. ఈ నేపథ్యంలో.. వసంత కృష్ణప్రసాద్ బయటకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను క్రాస్ ఓటింగ్కు పాల్పడలేదని.. ఎవరు క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారో తనకు తెలుసని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటు ఉండవల్లి శ్రీదేవి కూడా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఉదయమే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కలిశానని.. తాను ఎందుకు క్రాస్ ఓటింగ్కు పాల్పడతానని ప్రశ్నించారు. తాను నిజాయతీగా రాజకీయాలు చేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో అధికార వైసీపీలో మళ్లీ కొత్త చర్చలు మొదలయ్యాయి. వీరందరూ క్రాస్ ఓటింగ్కు పాల్పడకపోతే.. ఆ పని ఎవరు చేశారనే చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో ఏడుకు.. ఏడు స్థానాలు గెలవాలని సీఎం జగన్ గట్టి పట్టుదలతో ముందుకెళ్లారు. అత్యంత పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మాక్ పోలింగ్ నిర్వహించి ఓట్లు వేస్ట్ కాకుండా జాగ్రత్త తీసుకున్నారు. ఓట్లు వేస్ట్ కాలేదు గానీ.. క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. దీనిపై జగన్ కూడా చాలా సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో క్రాస్ ఓటింగ్కు పాల్పడిన వారి పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది. అయితే.. వారిపై జగన్ ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/who-are-thouse-four-mlas-39-152855.html