వాట్సప్లో దివ్య మెసేజ్.. రూ. 21 కోట్లు పోగొట్టుకున్న సీనియర్ సీఏ!
Publish Date:Jul 15, 2026
Advertisement
"హలో... నేను దివ్య మాట్లాడుతున్నాను" అంటూ వాట్సాప్లో వచ్చిన ఒకే ఒక్క పరిచయ సందేశం, ఒక సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ జీవితాంతం సంపాదించిన సొమ్మును నిలువునా ముంచేస్తుందని ఎవరూ ఊహించలేదు. సాధారణంగా చదువుకోని వారు లేదా ఆర్థిక విషయాలపై అవగాహన లేని వారే సైబర్ మోసాల బారిన పడతారని చాలామంది అనుకుంటారు. కానీ గ్వాలియర్కు చెందిన 70 ఏళ్ల సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ (CA) అశోక్ విజయవర్గియా విషయంలో జరిగింది చూస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే. డిసెంబర్ 2025 నుండి జూలై 2026 మధ్యకాలంలో జరిగిన ఈ నకిలీ క్రిప్టోకరెన్సీ ఇన్వెస్ట్మెంట్ స్కామ్, దేశంలోనే అత్యంత పెద్ద సైబర్ మోసాలలో ఒకటిగా నిలిచింది. కేవలం ఒకే ఒక్క నకిలీ వాట్సప్ సందేశంతో మొదలైన ఈ కథ, చివరికి రూ. 21.06 కోట్ల భారీ దోపిడీకి దారితీసింది. ఈ కథలోకి వెళ్తే, మోసగాళ్లు అమ్మాయి పేరుతో అశోక్ విజయవర్గియాకు వాట్సాప్లో పరిచయమయ్యారు. ఆపై నమ్మకం కుదిరేలా మాట్లాడి, యూఎస్డీటీ (USDT-టెథర్) క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ద్వారా భారీగా లాభాలు సంపాదించవచ్చని నమ్మించారు. ఇందులో భాగంగా ఒక నకిలీ వెబ్సైట్ లింక్ను పంపి అందులో ఇన్వెస్ట్ చేయాల్సిందిగా కోరారు. మొదట్లో దీనిపై నమ్మకం కలగని విజయవర్గియా, ప్రయోగాత్మకంగా డిసెంబర్ 25, 2025న యూపీఐ (UPI) ద్వారా నాలుగు సార్లు రూ. 10 వేల చొప్పున బదిలీ చేశారు. ఆ తర్వాత ఒక స్నేహితుడి యూపీఐ ద్వారా మరో రూ. 1 లక్ష పంపించారు. వీటికి ప్రతిఫలంగా జనవరి 7వ తేదీన ఆయన హెచ్డీఎఫ్సీ (HDFC) బ్యాంక్ ఖాతాలో తొలి రాబడిగా రూ. 1.88 లక్షలు జమ అయింది. తాను పెట్టిన పెట్టుబడికి వెంటనే భారీ లాభం రావడంతో, ఆ ట్రేడింగ్ ప్లాట్ఫామ్పై ఆయనకు పూర్తి నమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకమే ఆయన పాలిట శాపమైంది. దీనికంటే ముందే డిసెంబర్ 31 నాటికి తన యూనియన్ బ్యాంక్ ఖాతా నుండి ఆర్టీజీఎస్ (RTGS) ద్వారా రూ. 15 లక్షలు బదిలీ చేసిన ఆయన, ఆ తర్వాతి నెలల్లో మోసగాళ్లు సూచించిన వివిధ బ్యాంకు ఖాతాలకు కోట్ల రూపాయలను గుడ్డిగా బదిలీ చేస్తూ పోయారు. బాధితుడు డబ్బు జమ చేస్తున్న కొద్దీ, సదరు నకిలీ ట్రేడింగ్ పోర్టల్ ఆయన పెట్టుబడి వేగంగా పెరుగుతున్నట్లు తప్పుడు గ్రాఫ్లను చూపిస్తూ ఊరించింది. చివరికి ఆ పోర్టల్లో ఏకంగా రూ. 33.25 కోట్ల భారీ బ్యాలెన్స్ ఉన్నట్లు ప్రదర్శించింది. తన ఖాతాలో అంత డబ్బు ఉండటం చూసి నిజమేనని నమ్మిన విజయవర్గియా, ఆ మొత్తాన్ని విత్డ్రా చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు మోసగాళ్లు అసలు రంగు బయటపెట్టారు. అంత భారీ సొమ్మును విత్ డ్రా చేయాలంటే ముందుగా రూ. 10.84 కోట్ల ఆదాయపు పన్ను (Income Tax) చెల్లించాలని కేటుగాళ్లు డిమాండ్ చేశారు. ఆ తర్వాత విత్డ్రా మొత్తం ఎక్కువగా ఉన్నందున రిస్క్ మార్జిన్ కింద మరో రూ. 1 కోటి కట్టాలంటూ కొత్త వంకలతో మరింత డబ్బు లాగారు. ఈ విధంగా మొత్తం రూ. 21.06 కోట్లు పోగొట్టుకున్నాక గానీ ఆయనకు తాము మోసపోయామనే విషయం బోధపడలేదు. చివరకు ఈ వ్యవహారమంతా మోసమని గ్రహించిన బాధితుడు నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ మరియు 1930 హెల్ప్లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. gwalior ca whatsapp crypto fraud,online trading scam 21 crores.
http://www.teluguone.com/news/content/whatsapp-cyber-fraud-21-crore-scam-36-226036.html





