కీచకులను పంచన పెట్టుకుని సమాజానికి జగన్ ఇచ్చే మెసేజ్ ఏమిటి?
Publish Date:Aug 5, 2022
Advertisement
ఏపీలో మూడేళ్లకు పైగా అధికారంలో ఉన్న వైసీపీ పార్టీలో ఇలా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం, వేధించడం గోరంట్ల మాధవ్ తోనే మొదలు కాలేదు. రాష్ట్ర ప్రజలు 2019 ఎన్నికలలో ఏకంగా వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను, 22 మంది ఎంపీలను గెలిపించి అధికారం కట్టబెట్టారు. గొప్పగా పాలన అందిస్తారని ఆదేశించారు. పాదయాత్ర సందర్భంగా జగన్ చేసిన వాగ్దానాలను విశ్వసించారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ఆరోపణలు,అప్పులు, దౌర్జన్యాతోనే ఈ మూడేళ్లు గడిపేసింది. అభివృద్ధిని అటకెక్కించేసింది. విమర్శలను సహించని, రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే కొత్త సంస్కృతికి తెరతీసింది. అన్నిటికీ మించి రాష్ట్రంలో మహిళలపై దాడులు, వేధింపులు, అత్యాచారాలు పెచ్చరిల్లాయి. అయినా సీఎం పెదవి విప్పి మాట్లాడరు. ఆయన మాట్లాడరు కనుక మంత్రలదీ మౌనముద్రే. సమస్య ఏదయినా.. సందర్భం ఏదయినా అయితే సకల శాఖల మంత్రిగా గొప్ప గుర్తింపు పొందిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, లేదంటే విజయసాయిరెడ్డి.. వీళ్లే మాట్లాడతారు. ఇక ప్రత్యర్థులపై సమయం సందర్భం లేకుండా విమర్శలు గుప్పించడానికి వైసీపీ సోషల్ మీడియా. అంతే. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్, థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వీరాజ్.. ఇప్పుడు ఎంపీ గోరంట్ల..వీరంతా మహిళల పట్ల అసభ్యంగా మాట్లాడుతూ వేధించి అడ్డంగా దొరికిపోయిన వారే. వీరేనా మహిళల పాలిట కీచకుడిగా మారిన వలంటీర్, సర్పంచ్.. ఎవరైతేనే వీరంతా వైసీపీ వారే. వీరందరినీ వెనకేసుకొస్తూ ముఖ్యమంత్రి జగన్. ఇంతటి మెజారిటీతో, అభిమానంతో అధికార అందలం ఎక్కించిన వారికి జగన్ ఇస్తున్న సందేశం ఏమిటి? వారి బాగోతాలను బైటపెట్టిన మీడియాకు పచ్చ ముద్ర వేస్తూ, విమర్శించి ఖండించిన విపక్షాలపై కేసులు బనాయిస్తూ వైసీసీ ప్రభుత్వం రాష్ట్రాన్ని జనరంజకంగా పాలిస్తోందని జగన్ తనకు తాను కితాబులిచ్చేసుకుంటే అంతా బాగున్నట్టేనా? అయినా ఒక ఎంపీ అయ్యి ఉండి ఒక మహిళతో వీడియోకాల్ లో అసభ్యంగా ప్రవర్తిస్తూ అడ్డంగా దొరికిపోయిన తరువాత కూడా ఆయనపై చర్యలు తీసుకోవడం మాని అసలా వీడియోనే మార్ఫింగ్..దానిపై విచారణ జరిపిస్తాం అంటూ నాన్చడం ఏమిటీ? ఆ వీడియో మార్ఫింగ్ చేసిన వారిపై పోలీసులకు ఎంపీ మాధవ్ ఫిర్యాదు చేశారట. పోలీసులు విచారణ చేసిన తరువాత ఒక వేళ ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే అప్పుడు మాధవ్ పై చర్య తీసుకుంటారట. ఇంతకీ ఆ వీడియోలను సర్కారు ఫోరెన్సిక్ పరీక్షకు పంపుతుందా లేదా అన్న విషయాన్నిమాత్రం ఎంపీగారిని వెనకేసుకు వస్తూ దోషిగా తేలనివ్వండి అప్పుడు చర్య తీసుకుంటామని చెప్పిన సజ్జల చెప్పలేదు. అసలు ఇంతటి దరిద్రంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంటే, వైసీపీలోని మహిళా మంత్రులు కనీసం నోరు విప్పలేదు. అయిన దానికీ కాని దానికీ విపక్షాలపై ట్వీట్లతో విరుచుకుపడే విజయసాయి కూడా ఇంత వరకూ స్పందించలేదు. ఎన్టీఆర్ చిన్న కుమార్తె ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే.. కనీస నైతికత లేకుండా కుటుంబ విషాదాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టారీతిన ఆరోపణలు చేసిన వారు ఇప్పుడు తమ సొంత పార్టీ ఎమ్మెల్యే నీచ వ్యవహారంపై ఎందుకు మౌనం వహించారు. ఇంతకూ నైతికతకు తిలోదకాలిచ్చేసి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న వారందరికీ వెన్నుదన్నుగా నిలుస్తూ జగన్ సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. అప్పల్లో, అక్రమాల్లో ఆర్థిక క్రమశిక్షణారాహిత్యంతో నేతల రోత వర్తనతో జగన్ సర్కార్ ఏపీ పరువును గంగలో కలిపేసిందంటున్న మహిళల విమర్శలకు ఏం సమాధానం చెప్పగలరు?
http://www.teluguone.com/news/content/what-is-the-message-jagan-give-to-society-by-protrcting-gorantla-madhav-39-141333.html





