రాయలసీమను ప్రపంచ హార్టికల్చర్ హబ్ చేస్తాం : సీఎం చంద్రబాబు

Publish Date:Apr 6, 2026

Advertisement

 

జలమే సంపద... దాన్ని ఎంత పొదుపుగా వినియోగించుకుంటే అంత సంపదను సృష్టించవచ్చని సీఎం చంద్రబాబు తెలిపారు. ‘జలధార’తో రాష్ట్రంలోని ప్రతీ ఎకరాకు సాగునీరు అందించేలా జలహారతి కార్యాచరణ చేపడదామని పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా, యాడికిలో ‘జలధార..నీటి భద్రత-సాగు నీటి సంఘాల బాధ్యత’ అనే కార్యక్రమంలో పాల్గొని 100 రోజుల యాక్షన్ ప్లాన్‌ను ముఖ్యమంత్రి విడుదల చేశారు. అనంతరం నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో రూపొందించిన యాప్‌ను చంద్రబాబు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ....నీరు మనందరికీ సర్వస్వమని, నీటిని సంరక్షించుకోడానికే వంద రోజుల యాక్షన్ ప్లాన్ చేపట్టామని ముఖ్యమంత్రి అన్నారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా నీటి భద్రత కోసమే పనిచేస్తున్నాం. పరిగెత్తే నీటిని నిలబెట్టాలి, నిలబడిన నీటిని నిల్వ చేయాలి..నిలబడిన నీటిని జలాశయంలో చేసేందుకు ప్రయత్నించాలి. నీటి సంరక్షణకు ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు, తుంపర సేద్యం, సూక్ష్మసేద్యం లాంటి అనేక ప్రయత్నాలు చేసి ముందుకు వెళ్లాం. పంట కుంటలు, కాలువలు, చెరువుల్లో మట్టి తీసి పొలాలకు వేశాం. ఎన్టీఆర్ జలసిరి ద్వారా ట్రెంచ్‌లు, నీరు చెట్టు, నీరు-మీరు, నీరు-ప్రగతి లాంటి అనేక కార్యక్రమాలు చేపట్టాం. నీటి భద్రతా కార్యక్రమంలో రైతులు, సాగునీటి సంఘాల లాంటి భాగస్వాములతో ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నామని పేర్కొన్నారు.

అనంతపురం లాంటి ప్రాంతాల్లో కొన్ని ఏళ్లపాటు నీరే లేదు. నష్ట పోతున్న రైతులను ఆదుకోడానికి ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చింది కూడా టీడీపీనే. అనంతపురం జిల్లాలో నీటిని సద్వినియోగం చేసుకోవాలని డ్రిప్ ఇరిగేషన్ కార్యక్రమం తీసుకువచ్చాం. 90 శాతం మేర సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను ఇచ్చింది కూడా గతంలో మేమే. మైక్రో ఇరిగేషన్‌పై గతంలో ఇచ్చిన నివేదికే ప్రామాణికంగా మారి దేశంలో అంతా వినియోగించే పరిస్థితి వచ్చింది. ప్రస్తుతం మైక్రో ఇరిగేషన్‌లో రూ.1,031 కోట్లు వ్యయం చేస్తూ దేశంలో నెంబర్ వన్‌గా ఉన్నాం. డ్రిప్ ఇరిగేషన్ వల్లే రాయలసీమ హార్టికల్చర్ హబ్‌గా మారింది. హార్చికల్చర్‌లో దేశంలో అగ్రస్థానంలో ఉన్నాం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

పూర్వోదయతో సీమ అభివృద్ధి

రాయలసీమ అభివృద్ధికి ఒక ప్లాన్ ప్రకారం ముందుకెళ్తున్నామని, కేంద్రం ప్రవేశపెట్టిన పూర్వోదయ పథకం ద్వారా రూ.30 వేల కోట్లు వస్తాయన్నారు.  ‘పెట్టుబడులు ద్వారా మరో రూ.70 వేల కోట్ల రాబట్టి అభివృద్ధి చేస్తాం. గడిచిన 21 నెలల్లో నీటి భద్రతా పరంగా చాలా మార్పులు వచ్చాయి. చెరువులు పెద్ద ఎత్తున నింపగలిగాం. జల సంరక్షణా చర్యల కారణంగా భూగర్భ జలాలను 1.92 మీటర్ల మేర అదనంగా పెంచగలిగాం. గత ఏడాది వేసవి ముందు 8, వేసవి తర్వాత 3 మీటర్లుగా భూగర్భజలాలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో గతంలో 13 మీటర్ల మేర ఉంటే ఇప్పుడు 11 మీటర్లకే భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చాయి. 

చేపట్టిన భూసంరక్షణ చర్యల కారణంగా 2.2 మీటర్ల మేర జలాలు పెరగటం సంతోషం కలిగిస్తోంది. అన్నమయ్య జిల్లాల్లో దీనిని ఓ ప్రజాఉద్యమంగా చేపట్టి విజయం సాధించారు. ఈ ఉద్యమంలో ప్రజలందరికీ నేను తోడుగా ఉంటాను. జిల్లాలో 5.7 టీఎంసీల నీళ్లు అందుబాటులోకి వచ్చాయి. 20 వేలకుపైగా ఎండిన బోర్లలో నీరు అందుబాటులోకి వచ్చింది. ఒక్క జిల్లాలో రూ.96  కోట్ల మేర విద్యుత్ ఆదా అయ్యింది. భూగర్భజలాలు పెరగటం మూలంగా హరిత ప్రాంతం పెరిగింది. ఇవన్నీ సానుకూలమైన అంశాలు’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

రబీ, ఖరీఫ్‌కు సమృద్ధిగా నీరు

వర్షాకాలం కంటే ముందు 6 మీటర్ల లోతున, ఆ తర్వాత 3 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలాలు అందుబాటులో ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి అన్నారు. తద్వారా రాష్ట్రంలో నీటి ఎద్దడి లేకుండా చేయవచ్చని అన్నారు. ‘‘రిజర్వాయర్లలో నీళ్లు నిండుగా ఉంటే ఎప్పటికప్పుడు మనం వినియోగించుకునే అవకాశం ఉంటుంది. శ్రీశైలం నీటిని వేర్వేరు చోట్ల ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేసి నీరు తెచ్చుకుంటున్నాం. రాష్ట్రంలోనూ, రాయలసీమలోనూ ప్రతీ ఎకరాకూ నీరు ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా ఒక్క ఖరీఫ్‌కు 547 టీఎంసీలు, రబీకి 343 టీఎంసీలు, పరిశ్రమలకు 28, తాగునీటికి 158 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. మొత్తంగా 1300 టీఎంసీల వరకూ నీటి అవసరం ఉంటుంది. 

ఈ ఏడాదిలో 74 టీఎంసీల నీరు అనంతపురం వరకూ తీసుకువచ్చాం. హంద్రీనీవా ద్వారా చిట్టచివరి భూములకు కూడా నీరు తీసుకెళ్లాం. పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు తీసుకువచ్చి రబీకి, ఖరీఫ్‌కు ఇచ్చే నీటిని ఆదా చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు తరలించాం. భూమినే జలాశయంగా మార్చుకుని వినియోగించు కోవటం ద్వారా మెరుగైన నీటి నిర్వహణ చేపట్టవచ్చు. రబీ, ఖరీఫ్ పంటలు పూర్తి అయ్యాక కూడా ప్రస్తుతం మన రిజర్వాయర్లలో 65 శాతం నీటి నిల్వ ఉంది. 

దేశంలోనే అతితక్కువ వర్షపాతం పడే అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం చూపిన చొరవ కారణంగా ఎక్కువ పండ్ల తోటలతో సంపన్నమైన ప్రాంతంగా మారిందని అన్నారు. గత పాలకులు విద్యుత్ ఛార్జీలు పెంచారని, రూ.1.24 లక్షల కోట్ల మేర అప్పులు చేశారని అన్నారు. కూటమి వచ్చాక గత ప్రభుత్వం పెంచిన సుమారుగా రూ.4,400 కోట్ల భారాన్ని కూడా ప్రజలపై వేయకుండా ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. అలాగే తొలిసారి విద్యుత్ ఛార్జీల ట్రూ డౌన్ చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. 

పిచ్చి ముదిరి మావిగన్ మాటలు

గత పాలకులు రాష్ట్ర ప్రజలకు అడ్రస్ లేకుండా చేశారని, ఇప్పుడు మీ రాజధాని ఏదంటే అమరావతి అని గర్వంగా చెప్పే రోజు వచ్చిందని సీఎం వ్యాఖ్యానించారు. ‘గతంలో మూడు ముక్కలాట ఆడారు. ఇక మనకు ఒక్కటే రాజధాని నగరం. పార్లమెంటులో 50 పార్టీలు ఉంటే అందులో వైసీపీ మినహా 49 పార్టీలు అమరావతికి మద్దతు పలికారు. ఒక్క దిక్కుమాలిన వైసీపీ మాత్రమే రాష్ట్రానికి ద్రోహం చేసింది. పిచ్చి ముదిరి మావిగన్ అంటూ కొత్తపేరు తీసుకొచ్చారు. అమరావతి అని పలకడానికి కూడా ఇష్టం లేని వ్యక్తులు మావిగన్ అంటున్నారు. 

బాబాయిని చంపి నా చేతిలో కత్తి పెట్టిన వాళ్లు ఎలాంటి రాజకీయమైనా చేస్తారు. అమరావతి పనులు వేగంగా జరుగుతుంటే.. చూసి సహించలేక ఫ్రస్టేషన్‌తో అవినీతి జరిగిందని అంటున్నారు. 2047 నాటికి ఏపీని అగ్రస్థానంలోకి తీసుకెళ్లే బాధ్యత తీసుకున్నాం. దీనికి ప్రణాళికలు కూడా సిద్ధం చేశాం. ఉత్తరాంధ్ర నుంచి పశ్చిమ గోదావరి వరకూ విశాఖ, ప్రకాశం- నెల్లూరు వరకూ అమరావతి, తిరుపతి కేంద్రంగా రాయలసీమ ప్రాంతాల్లో అభివృద్ధి రీజియన్లుగా తయారవుతాయి’ అని ఆశాభావం వ్యక్తం చేశారు. 

పెట్టుబడులు వస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు

గత పాలకులు రాష్ట్రంపై పగపట్టారని, రాష్ట్రానికి పెట్టుబడులు, యువతకు ఉద్యోగాలు వస్తుంటే ఓర్వలేకపోతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ప్రతీ జిల్లాను అభివృద్ధి చేస్తున్నాం. ఆడబిడ్డల జోలికి వస్తే వారికి అదే చివరి రోజు అవుతుంది. ప్రజల ఆస్తులను కాపాడే బాధ్యత ప్రభుత్వనిదే. దేవాలయాలపై దాడులు చేసి తిరిగి ఎదురు దాడి చేస్తున్నారు. తిరుమలలో శ్రీవారి ప్రసాదం నాణ్యతను దెబ్బతీశారు. కల్తీ నెయ్యితో ఘోర అపచారం చేశారు. రాష్ట్రంపై విద్వేషం చూపించే వారికి సహకరిస్తే పౌరులందరికీ నష్టం కలుగుతుంది. 

పెట్టుబడులు తీసుకువస్తుంటే వారిని బెదిరిస్తున్నారు. ఇలాంటి వారిని దూరం పెట్టాలి. కరెంటు, నీరు లాంటి దీర్ఘకాలిక సమస్యలను క్రమంగా పరిష్కరించుకుందాం. అందరికీ సమర్ధవంతమైన, జవాబుదారీ పాలన ఇవ్వాలన్నదే మా లక్ష్యం. రాష్ట్రమే నా కుటుంబం. అందరికీ న్యాయం చేసే బాధ్యత మాది. ఆర్ధిక కష్టాలు ఉన్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల ద్వారా చేయూత అందిస్తున్నాం. పెట్టుబడులు వస్తే.. ఆదాయం వస్తుంది అప్పుడే సంక్షేమం చేయగలం. సుపరిపాలనకు ప్రజలంతా సహకరించాలని’ చంద్రబాబు విజ్ఞప్తి చేస్తున్నాను.

ప్రజల ముందే ప్రజంటేషన్

అనంతపురం జిల్లా, తాడిపత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గ ప్రోగ్రెస్ రిపోర్ట్‌ను యాడికి జలధార సభలో ముఖ్యమంత్రి చదవి వినిపించారు. వివిధ శాఖల పనితీరు నివేదికలను ప్రజల ముందు ప్రజెంట్ చేశారు. సరిగ్గా పనితీరు కనబరచని వివిధ శాఖలకు చెందిన అధికారులను వేదికపైకి పిలిపించి వివరణ అడిగారు. పనితీరును మెరుగు పర్చుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. అధికారులకు పూర్తిగా సహకరిస్తామని... అధికారులు, ఉద్యోగులు కూడా రాష్ట్రాభివృద్ధికి సహకరించాలని కోరారు. భూవివాదాలనేవి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. 

ట్రాక్టర్లల్లో ఇసుక తీసుకెళ్తున్నప్పుడు ఎవరైనా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారా..? అని ప్రజలనే నేరుగా సభలో సీఎం అడగ్గా... ఎవ్వరూ అడ్డుకోవడం లేదని ప్రజలు బదులిచ్చారు.  దీనికి సీఎం స్పందిస్తూ...ఆదాయం తగ్గినా పర్వాలేదనుకుని ఉచిత ఇసుక విధానం అమలు చేస్తున్నామన్నారు. బాగా పని చేసిన అధికారును అభినందించాలంటూ ప్రజలతోనే సభలో చప్పట్లు కొట్టించారు. ఉద్యోగుల పనితీరు ఆధారంగా సూపర్ అచీవర్స్.. అచీవర్స్.. పెర్ఫార్మర్స్.. లెర్నర్స్ గా విభజిస్తున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు. కొందరు అధికారులు గైర్హాజరు కావడంతో...ఇకపై తాను వచ్చే ప్రతీ సభకు జిల్లా అధికార యంత్రాంగం మొత్తం హాజరవ్వాలని ఆదేశించారు. 

జై అమరావతి అంటూ నినాదాలు

ముఖ్యమంత్రి చంద్రబాబు జలధార కార్యక్రమంలో ప్రజావేదిక సభకు వచ్చేముందు ప్రజలు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. రాజధాని అమరావతికి పార్లమెంట్ చట్టబద్దత కల్పించడంపై హర్షం వ్యక్తం చేశారు. స్వయంగా అమరావతి లోగో పట్టుకుని సభకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. యాడికిలో సీఎం హెలిక్యాప్టర్ దిగాక అమరావతి బ్యాడ్జిని అందించారు. సభలో రాజధానికి చట్టబద్దతపై హర్షం వ్యక్తం చేస్తూ ప్లకార్డులు, జెండాలు ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైసీపీ అని వ్యాఖ్యానించారు. 

వైసీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అంటూ ఘాటుగా విమర్శించారు. రాష్ట్రం మీద పగ పట్టినట్టు వైసీపీ వ్యవహరిస్తోందన్నారు. ఫ్యాక్షనిస్టులు, ముఠా నాయకుల కంటే ఘోరంగా రాష్ట్రాభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటోందని దుయ్యబట్టారు. సభ అనంతరం పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత ఆమోదానికి గుర్తుగా సీఎంకు అమరావతి జ్ఞాపికను జేసీ పవన్ రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, స్థానిక ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి, ఎంపీలు, జిల్లా ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు తన ప్రసంగానికి ముందు ప్రజావేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. నీటి సంరక్షణకు అనంతపురం జిల్లా, నియోజకవర్గంలో చేపట్టిన చర్యలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వివరించారు. 100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సంబంధించిన వివరాలను ఫొటో ఎగ్జిబిషనులో అధికారులు ప్రదర్శించారు. డ్వాక్రా, స్థానిక మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల స్టాల్‌ను, గ్రానైట్, డొలమైట్, సున్నపురాయి గనులకు సంబంధించిన స్టాల్ ను సందర్శించారు. హార్టికల్చర్ ఉత్పత్తులను కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు.

By
en-us Political News

  
జీవనోపాధి కోసం ఊరు వదిలి వచ్చిన ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఒక నిర్లక్ష్యపు తమాషా ప్రాణాంతకంగా మారింది
కర్ణాటక రాజకీయాల్లో ఒక మాజీ శాసనసభ్యుడి వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
పంజాబ్ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో మరో అవినీతి తిమింగలం ఏసీబీ వలలో చిక్కింది.
మొయినాబాద్ ఫామ్‌హౌస్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
శబరిమలలో మహిళల ప్రవేశానికి సంబంధించిన వివాదంపై సుప్రీంకోర్టులో జరుగుతున్న విచారణలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీపై మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
అసెంబ్లీకి అతి సమీపంలో ఉన్న ఆల్ ఇండియా రేడియో కార్యాలయానికి తొలుత బాంబు బెదరింపు వచ్చింది. దీనిపై ఆల్ ఇండియా రేడియో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపోలీసులు ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను బయటకు పంపించారు.
హైదరాబాద్ నగరంలో కల్తీ దందాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
రాజధాని ప్రాంతమైన అమరావతిలో క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు మూడు ప్రతిష్ఠాత్మక సంస్థలకు ఈ ఎస్ఐపీబీ సమావేశంలో మంజూరు చేయడం ఈ అయ్యాయి. ఈ అనుమతులతో అమరావతి కేవలం పరిపాలనా కేంద్రంగానే కాకుండా టెక్నాలజీ హబ్‌గా కూడా ఎదుగుతుంది.
హైదరాబాద్ బేగంపేటలో ఉన్న 145 సంవత్సరాల ప్రాచీన వారసత్వ కట్టడం చిరాన్ ఫోర్ట్ క్లబ్ చుట్టూ వివాదం రాజుకుంది.
తాడేపల్లిలోని ఆమె నివాసంతో పాటు విజయవాడ, గుంటూరు జిల్లాల్లోని ఇతర అనుమానిత ప్రాంతాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలలో ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఆమె పేరిట ఉన్న స్థిరాస్తులు, బ్యాంకు ఖాతాలు, బంగారు ఆభరణాలకు సంబంధించిన రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.